29, డిసెంబర్ 2014, సోమవారం

తెంచుకుంటే తెగదు...

తెంచుకుంటే తెగదు సుమీ బంధం
రాగమైనా ద్వేషమైనా
అది జన్మజన్మల గంధం

ఎవఱూ వద్దని పారిపోయినా
ఎదురొస్తాయొక మైలుఱాయిలో
ఛీ ఛీ పొమ్మని ఛీత్కరించినా
చిఱునవ్వులతో కౌగలిస్తాయి  || తెంచుకుంటే||

చెల్లుకు చెల్లని కసిరికొట్టినా
చేతులు చాచి అవి పిలుస్తాయి
కొత్త చెలుముల మెత్తదనాల్లో
పాత నెయ్యాలు పరిమళిస్తాయి || తెంచుకుంటే ||

అడుగుల జాడలు చెఱిపివేసినా
అట్టడుగున ముద్రలు అంతరించవు
ఆస నిరాసనుకున్నవారే
ఆసరా అవుతారొక రోజు || తెంచుకుంటే ||

మాటలు పోట్లాడే లోకమోయ్ ఇది
మనసులు మాట్లాడే లోకముంది
అక్కడే కలుద్దాము నేస్తమా !
ఇక్కడున్నవి మాటలే సుమా !  || తెంచుకుంటే ||

23, డిసెంబర్ 2014, మంగళవారం

మన దేశంలో మానవతావాదపు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ?

మేధావులు పూనుకొని తత్క్షణం ఏదో ఒకటి చేయకపోతే, ఆ భావిదృశ్యం అంధకార బంధురంగా, అగమ్యగోచరంగా దర్శనమిస్తోంది. చట్టాల కంటే, వ్యవస్థల కంటే, సంస్థల కంటే, కుల-మతాల కంటే, విజనుష్షు కంటే విడివ్యక్తే ముఖ్యమని చెప్పే మానవతావాదాన్ని వ్యవస్థలూ, సంస్థలూ, ప్రయోజన గుంపులూ నిరసనభావంతో పరికిస్తాయి. మానవతాసూత్రాల్ని వాస్తవ జీవితంలో అమలు జఱపడానికి పూనుకుంటే ఆయా గుంపుల యథార్థ వైఖరులు బహిర్గతమవుతాయి. వారిలో ప్రతి ఒక్కఱూ స్వీయ సైద్ధాంతిక కార్యావళి (ideological agenda) ఎడల తమకున్న వల్లమాలిన ఆభిముఖ్యం హేతువుగా, తమదైన మానసిక వైఖరిలోంచి మానవతావాదులకు రకరకాల బిరుదులు తగిలించే ఆస్కారం ఉందని కూడా గమనించాలి. ఎలా తిట్టించుకున్నా మానవతావాదులు చలించకూడదు. ఒకదాని ఉపయోగం తెలియనంతకాలం మనుషులు అలాగే ప్రవర్తిస్తారు. బ్రిటీషువారి కాలంలో వారు దేశమంతా టెలిగ్రాఫ్ తీగల్ని అల్లుతూంటే, వారి మీది ద్వేషభావంతో భారతీయులు, “అవి మా కుత్తుకలకు ఉరి బిగించే తీగలు” అని నిందించారు. కానీ ఆ తరువాత అవి వద్దన్నదెవఱు ? 

మనుషులకు ఏదో ఒక వెఱ్ఱిమొఱ్ఱి చిల్లఱ సమస్య మీద గొడవ పడడంలో ఉన్న ఆనందం తోటి మనుషుల్ని ప్రేమించడంలో లేకపోవడం దీనంతటికీ ఓ ప్రధాన కారణం. ఈ విషయంలో మానవుడికీ, అతని “బెస్ట్ ఫ్రెండ్” కీ మధ్య పెద్దగా వ్యత్యాసం కనిపించదు. దురదృష్టవశాత్తూ, ద్వేషమిచ్చే “కిక్కు” ప్రేమ ఏనాటికీ ఇవ్వదు.

ఇప్పుడిప్పుడే నాగరికతనీ, ఆలోచననీ కొద్దికొద్దిగా నేర్చుకుంటున్న మనలాంటి దేశంలో మానవతావాదంలాంటి సువిశాల భావజాలం పుంజుకోవాలంటే అందుకింకా ఎన్నో దశాబ్దాలు పట్టొచ్చు. ఇక్కడ మనుషులంతా తమ తమ కులాలతోనూ, మతాలతోనూ, శాఖలతోనూ పీకల్లోతు లవ్వులో పడిపోయి ఉన్నారు. కొందఱు తమ ప్రాంతాలతోనూ, ఎక్కువమంది తమ విజనుష్షు (gender) తోనూ లవ్వులో పడిపోయి ఉన్నారు. తోటి మనుషులమీద దయచూపడం మానేసి, ఎంతసేపూ తమ మీదే తాము జాలిపడిపోతూ తమ అభిమానవర్గం కోసం ప్రత్యేక చట్టాలూ, ప్రత్యేక వ్యవస్థలూ కావాలని డిమాండ్లు లేవనెత్తుతున్నారు. సమాజంలో అత్యధిక సంఖ్యాకులు డబ్బు సంపాదించుకోవడం గుఱించి తప్ప ఇంకేమీ ఆలోచించలేని పరిస్థితిలో ఉన్నారు. మన నాయకులు చాలా బాహాటంగా దీన్నంతటినీ ప్రోత్సహిస్తున్నారు.

దురదృష్టవశాత్తూ మన దేశం నిండా ఏదో ఒక విధమైన ఆధిపత్యం లేదా అదుపు కోసం అంగలారుస్తున్న (control freaks) జనాభాయే ఉంది. ఇందులో ఆడా-మగా, చిన్నా-పెద్దా, పేదా-గొప్పా, ఆ కులం-ఈ కులం, ఆ వృత్తి-ఈ వృత్తి అనే తేడా కనిపించదు. ఇక్కడ ప్రతివారికీ ఇతరుల జీవితాల మీద నియంత్రణ (control) కావాలి. మామూలు నియంత్రణ కాదు, సర్వంకషమైన నియంత్రణ కావాలి. ఉడుంపట్టు కావాలి. భల్లూకప్పట్టు కావాలి. ఎవఱి ఇష్టానికీ, స్వేచ్ఛకీ వారిని వదిలి, “మనకెందుకు పోనీ” అనుకుని మనశ్శాంతిగా బ్రతకడం ఈ దేశస్థులకు కలలో కూడా ఊహించ శక్యం కాని జీవనవిధానం. దీని వల్ల మన దేశం అన్ని రకాల హింసలకూ, ఘర్షణలకూ, అశాంతికీ చిరునామాగా మారింది. అనంతరం ఈ తరహా వ్యక్తిగత సమస్యలకు వర్గీయ (మూకుమ్మడి) పరిష్కారాలు వెతక నారంభిస్తారు.

మన దేశంలో ఆంగ్లేయుల నిష్క్రమణానంతరం సృష్టించబడ్డ అసమాన, అశాంతిమయ సమాజం యావత్తూ, మానవతావాదాన్ని విచక్షణారహితంగా త్రోసిపుచ్చడం మూలాన ఉనికిలోకి వచ్చినదే. మన చట్టాలు మానవతాసూత్రాల్ని బహిరంగంగా ఉల్లంఘించే విషయంలో ఇసుమంతైనా సిగ్గూ, సంకోచమూ, బిడియమూ ఎఱగనివి. అందుచేత ప్రస్తుత పరిస్థితులెలా ఉన్నాయంటే– నిజంగా మానవతావాదానికి నిబద్ధులైనవారు ఈ అస్తవ్యస్తానికీ, ఈ మానవతావాద వ్యతిరేకుల నిరంకుశాధిపత్యానికీ జడిసి ఆమడదూరం పారిపోయేలా!

ఎక్కువమంది సామాజిక శాస్త్రాలకీ, సాహిత్యానికీ పూర్తిగా దూరమై మెడిసిన్, సైన్స్, ఎంజినీరింగ్ మాత్రమే అభ్యసిస్తున్నారు. దాన్తో సంఘం గుఱించి ఆలోచించేవారూ, తత్త్వవేత్తలూ పూర్తిగా కఱువైపోయారు. మఱోపక్క తమ పిల్లలు ఈ విధమైన వ్యాసంగాల (careers) పరంగా విజేతలు కావాలనే దుగ్ధతో తల్లిదండ్రులు వారిని అన్నివిధాలా అస్తిగోపన (conservative) పద్ధతుల్లో పెంచుతున్నారు.  ఏదో ఒక రకంగా విజేతలు కావడమే ముఖ్యమైపోయిన మొండివాతావరణంలో మానవతావాద సూత్రాలు బుట్టదాఖలా కావడం మామూలు. పైగా ఎక్కువ శాతం కుటుంబాలు కేవలం ఈ తరంలోనే కళాశాల మొహం చూస్తున్నవాళ్ళు (first generation graduates). అందువల్ల కొత్తతరానికి తాము బ్రతుకుతున్న సమాజపు తలా తోకా ఏమీ అర్థం కాని పరిస్థితి ఉంది. గతం నుంచి ఇసుమంతైనా పాఠాలు గ్రహించలేని మహాజన బలహీనత (mass weakness) కూడా వెల్లడవుతోంది. ఇలాంటి వాతావరణం మధ్య మానవతావాదానికేమైనా భవిష్యత్తు ఉంటుందని ఎవఱూ అనుకోరు. ఎందుకంటే ఎంతో కొంత సామాజికస్పృహ ఉన్నవారికే గానీ మానవతావాద ప్రాధాన్యం అర్థం కాదు.

మనకు సాంస్కృతిక నాయకత్వం (cultural leadership) అంతా- కనీసం దాని ప్రామాణికత (authority) యావత్తూ- నిర్మూలించబడినట్లు కనిపిస్తోంది. మతనాయకులు చెప్పినా వినరు. సాహిత్యవేత్తలు చెప్పినా వినరు. శాస్త్రవేత్తలు చెప్పినా వినరు.  మనకు రాజకీయనాయకులు తప్ప వేఱే నాయకత్వం లేని పరిస్థితి తలెత్తింది. ఏం చేసినా వీరే చేయాలి. ఏం మాట్లాడినా వీరే మాట్లాడాలి. ప్రతిచోటికీ వీరే వస్తారు. ప్రజాస్వామ్యమని మనం భావిస్తున్న ప్రస్తుత వ్యవస్థలో ప్రభుత్వాధినేతలే చక్రవర్తులు. పార్టీల అధినేతలే మహారాజులు. కులసంఘాలూ, విజనుస్ (gender) సంఘాలూ సామంత రాజులు/ రాణీలు. వ్యాపార సంస్థల అధిపతులు స్థానిక జమీందార్లు. ఇదో కొత్తరకం ఫ్యూడల్ వ్యవస్థ. పూర్వకాలంలో మాదిరే ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడ్డానికి వీల్లేని పరిస్థితి.

ఈ రోజుల్లో భయపెట్టేటంత అధికారమో, కట్టుకు పోయేటంత డబ్బో ఉంటే తప్ప ఎవఱూ ఆగి,“ఏం చెబుతున్నాడబ్బా?” అని వినరు. మీడియా కూడా సాదాసీదా తత్త్వవేత్తల్ని పట్టించుకోదు. ఏదైనా ఓ పెద్దపత్రికకు సంపాదకులో, విశ్వవిద్యాలయ ఆచార్యులో, నోబెల్ బహూకృతులో అయితే కాస్త నయం. ఏతావతా మొత్తమ్మీద మళ్ళీ పాతకాలపు టగాధాలే పునరుజ్జీవితం. కనుక ఎవఱికీ ఏమీ చెప్పే పరిస్థితిలో లేము. ఎవఱితోనూ ఏదీ చెప్పుకునే పరిస్థితిలో కూడా లేము. ఏతావతా చెప్పొచ్చేదేంటంటే, ఇంతగా క్రమశిక్షణా, వినయమూ, ప్రమాణబుద్ధీ లోపించిన వాతావరణంలో మానవతావాదమైనా చెవికెక్కడం అత్యంత కష్టసాధ్యం.

మానవతావాదం నచ్చినంత మాత్రానో, లేదా అది అర్థమైనంత మాత్రానో మనం పరిపూర్ణ మానవతావాదులం కాలేము. మనం పుట్టి పెఱిగిన దేశ-కాల పరిస్థితులూ, మన నెత్తిమీద తిష్ఠవేసే నిత్య జీవిత సమస్యలూ, మన చుట్టూ ఉన్న మనుషులూ మనల్ని అలా కానివ్వరు. మానవతావాదం చాలా వఱకూ ఆచరణాత్మకమైనది. కనుక ఇదో అనంతప్రయాణం. దారిలో మళ్ళీమళ్ళీ పడిపోతూనే ఉంటాం. ఎలాగో ఓపిక తెచ్చుకుని లేచి తిరిగి ప్రయాణాన్ని సాగించాలంతే ! మానవతావాదంలో ఇంకా అదనంగా చేర్చదగ్గ అంశాలున్నాయేమో గానీ ఉన్నవాటికి మినహాయింపులైతే లేవు. ఎవఱైనా స్వీయవర్గాభిమానాలతో వాటికి వక్రభాష్యాలిచ్చి మినహాయింపులు కోరితే అది నిజమైన మానవతావాదుల లక్షణం కాదు. 

నేను మేధావిని కాను. జ్ఞానిని కాను. పండితుణ్ణి అసలే కాను. నవనాగరికుణ్ణి అంతకంటే కాను. కానీ ఈ ప్రస్తావన మీద నాకు ఏమేం తెలుసో, దాని మీద నేను ఏమేమైతే ఆలోచించానో అవే ఇక్కడ వ్రాశాను. ఏమైనా పొఱపాట్లుంటే అన్యథా భావించవద్దని మనవి.

ఈ బ్లాగుని క్రమం తప్పకుండా చూసేవారి సంఖ్య 40 - 60 మందికి మించదు. మిగతా బ్లాగులకున్నంత ప్రాచుర్యం (popularity) లేకపోయినప్పటికీ ఇది ఇకముందు కూడా కొనసాగబోతోంది. సహృదయంతో ఆదరిస్తున్న ఈ కొద్దిమంది మానవతావాద మద్దతుదార్లకీ నా మనఃపూర్వక ధన్యవాదాలు.

17, డిసెంబర్ 2014, బుధవారం

హక్కులు మానవతావాదానికి ప్రత్యామ్నాయమా ?

మానవతావాదానికి ప్రత్యామ్నాయాన్ని ఇప్పటిదాకా ఎవఱూ కనుగొనలేదు. ఈ రోజుల్లో ప్రతి సిద్ధాంతానికి సంబంధించిన వాదులూ తమ తమ వాదాలకు ప్రభుత్వ గుర్తింపు కావాలనీ, చట్టాల్లోవాటికి స్థానం ఉండాలనీ, కొండొకచో తమ సిద్ధాంతాల్నీ, సూత్రీకరణల్నే చట్టాలుగా రూపొందించాలనీ, వాటిని అందఱి నెత్తినా బలవంతంగా రుద్దాలనీ కోరుతున్నారు. గతంలో పలు ప్రభుత్వాలు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పొఱపాట్లు చేయడం మూలాన ఆ పూర్వోదాహరణల్ని బట్టి ఆ సంప్రదాయాన్నే ఇప్పుడూ కొనసాగించాలనే ప్రజా వత్తిడిని అవి ఎదుర్కుంటున్నాయి. ఆయా సిద్ధాంతవాదులు మానవాళిలో ఏయే ప్రత్యేక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయా (నోరున్న) వర్గాలకు అనుకూలంగానూ, (నోరులేని) ఇతరులకు వ్యతిరేకంగానూ అనేక చట్టాలూ, వర్గీయ హక్కులూ అమల్లోకొచ్చాయి. కులం, మతం, విజనుష్షు, ప్రాంతం, ఆర్థికవర్గం, బాంధవ్యం ఇత్యాది వింగడింపులతో ఈ వర్గాలు రకరకాలుగా ఉంటాయి. ఉన్న ప్రాతిపదికలూ, వర్గాలు సరిపోవనుకుంటే ఎవఱైనా బలవంతులు ఇంకేదో అపూర్వ ప్రాతిపదికన ఓ వినూత్న వర్గాన్ని కూడా సృష్టించవచ్చు.

ఈ రోజుల్లో ‘హక్కులు’ అనే ఈ పదం దుర్వినియోగమవుతున్నంత ఘోరంగా ఇహ ఏ పదమూ కావడం లేదు. ఇవి లేనప్పుడు కూడా మానవజాతి ఉంది, లక్షణంగా మనగలిగింది కూడానని జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది, కనుక ఇవి లేకపోతే మనమేదో అయిపోతామనడం సరికాదు. మనమందఱమూ మనుగడ సాగిస్తున్నది హక్కులుండడం వల్ల కాదు. మనకు కొన్ని హక్కులున్నాయని తెలుసుకుని మనం పుట్టలేదు. పుట్టిపెఱిగాకే అలాంటివి ఉన్నాయని తెలుసుకున్నాం. మనం వాస్తవంగా మనుగడ సాగిస్తున్నది కొన్ని ప్రత్యయాల (convictions) వల్ల ! (మనలోనూ ఇతరుల్లోనూ). ఆ ప్రత్యయాల్లో మానవత్వానికి సంబంధించినవి కూడా భాగం కావడం వల్ల ! ఆ ప్రత్యయాల్ని ఎవఱైనా దెబ్బదీస్తే, లేదా అలా దెబ్బదీస్తారనే ఆందోళనా, అభద్రతాభావమూ మనలో ఉంటే అందుకు విఱుగుడుగా హక్కులు అవసరమవుతున్నాయి. రాజ్యం గుర్తించిన ప్రత్యయాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువసంఖ్యలో అవి మనలో గూడుకట్టుకుని ఉంటాయి. ప్రతి ప్రత్యయానికీ ఒక ప్రత్యేక హక్కూ, దానికో చట్టమూ, వాటిని అమలుజఱిపే ప్రత్యేక వ్యవస్థా.

అలాగే ప్రతిరోజూ ఎవఱో ఒకఱికి ఏదో ఒక కొత్త అభద్రతాభావం పుట్టుకొస్తుంది. ప్రతి అభద్రతాభావానికీ ఓ కొత్తహక్కూ, దానికో కొత్త చట్టం. దాన్ని పకడ్బందీగా అమలుపఱచడానికి మళ్ళీ ఓ కొత్త రాక్షసి (వ్యవస్థ). ఈ కథకి అంతెక్కడ? అందుకే మానవతావాదం ప్రాథమికంగా హక్కుల గుఱించి కాదని గమనించాలి. వాటికి రాజ్య ఆమోదముద్ర పడడం గుఱించి అసలే కాదు.

అంటే హక్కులు లేవని కాదు. అవి ఉండకూడదనీ కాదు. ఎందుకంటే, హక్కులంటే అవసరాలే. మఱేమీ కాదు. అవసరాలు ఉన్నంతకాలం హక్కులు కూడా ఉంటాయి, రాజ్యం గుర్తించినా గుర్తించకపోయినా! అయితే ఆ అవసరాలు అందఱివీ అయి ఉండాలి. ఎవఱో కొందఱివి మాత్రమే కాకూడదు. అవి సహజమై ఉండాలి. అంతే తప్ప తాగుడు, ఇతరుల్ని కొట్టడం, పోలీసులతో కొట్టించడం, కేసులు పెట్టడం, ఇతరుల ఆస్తుల కోసం, కష్టార్జితాల కోసం డిమాండు చేయడం,– ఇలాంటివి సహజమైన విషయాలూ కావు. అత్యవసరాలూ కావు. అందుచేత ఇవి సహజహక్కులు కూడా కావు. కాకూడదు.

హక్కుల వాడకం ఐచ్ఛికం (optional) కూడా అయి ఉండాలి. అంటే వాటిని వాడుకోవడానికీ, వాడుకోకపోవడానికీ కూడా వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి. “హక్కులంటే అవసరాలు” అన్నప్పుడు, ఆ హక్కుతో పాటు ఎవఱి అవసరాల్ని వారే తీర్చుకోవడం వారి బాధ్యత కూడా. “అంతే తప్ప నా అవ సరాన్ని నువ్వు తీర్చాలి. నా హక్కుని నువ్వు నిలబెట్టాలి. అది నీ బాధ్యత. నేను మాత్రం తేరగా తిని పడుకుంటా” నని డిమాండు చేస్తే, ఆ విధంగా చట్టాలు వ్రాస్తే అది ఇతరుల హక్కుల్ని హరించడమవుతుంది. అప్పుడు మనకు మొదటి తరగతి పౌరులూ, రెండో తరగతి పౌరులూ అని రెండు రకాల ప్రజలు తయారవుతారు. కనుక అలాంటి పరపీడన హక్కుల్నీ, పరదోపిడీ హక్కుల్ని ఎవఱికీ ఇవ్వకూడదు, కుటుంబసభ్యులకైనా సరే! కానీ మన దేశంలో మొదట్నుంచీ జఱుగుతున్నది ఇదే.

ఒకవేళ, “హక్కులకు తోడు ఇక ముందు బాధ్యతని కూడా తప్పనిసరి చేస్తామనీ, దాన్ని నెఱవేర్చకపోతే దండిస్తా”మనీ అంటే అలా అన్న మఱుక్షణం అవి కావాలని అడిగేవారెవఱూ మనకు కనిపించరు.

హక్కుల నిజస్వరూపాన్ని కూలంకషంగా అవగతం చేసుకున్నవారెవఱూ వాటికోసం పట్టుపట్టరు. రాజ్యగుర్తింపు పొందిన హక్కులు– మనుషులు తోటిమనుషులతో మానవీయంగా మెలగాల్సిన అవసరాన్ని, ఒక తర్కానికో, ఇంగితజ్ఞానానికో తలవంచాల్సిన అవసరాన్ని, ఒక ఆత్మపరిశీలన చేసుకో వాల్సిన అవసరాన్ని, లేదా ఒక చర్చలో పాల్గొనే అవసరాన్ని ఏకమొత్తంగా రద్దుచేస్తాయి. వారు పరస్పరం ఒద్దికతో ఒకఱి మీద ఒకఱు ఆధారపడి సామరస్యంగా బ్రతికే సౌమ్యవాతావరణాన్ని అవి చెఱుస్తాయి. ఉదాహరణకి, ఒక వ్యక్తి యొక్క ఆస్తిలో ఇతరులకి హక్కులు కల్పిస్తే అతను వారి ప్రేమనీ, సేవనీ పొందే హక్కుని పోగొట్టుకుంటాడు. ప్రేమ పంచకపోయినా, సేవ చేయకపోయినా చట్ట ప్రకారం అతని ఆస్తి తమకు సంక్రమించాల్సిందేనన్న భరోసాలో ఉన్నవారు, మనిషిగా అతనికి ఇవ్వాల్సిన కనీస మన్నన కూడా ఇవ్వకుండా అతన్ని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఒకఱికి ఒక ప్రాతిపదికన హక్కులు కల్పించడమంటే, ఆ ప్రాతిపదికకి చెందనివారి హక్కుల్లో ఆ మేరకు కోత విధించడమే అవుతుంది.

అప్పుడు, “వర్గీయ హక్కులన్నీ అన్యాయమేనా ?” అనే ప్రశ్న తలెత్తుతుంది. ఏ హక్కులూ స్వతహాగా అన్యాయం కావు. కానీ వాటిల్లో డబ్బువ్యవహారాలూ, చట్టాలూ, నానాగుంపులూ, ఇజాలూ,  వృత్తి నిపుణులూ (professionals) ప్రవేశించాక అవి పూర్తి అన్యాయమై కూర్చుంటాయి. ఈ ప్రక్రియని ఆపే మార్గం లేదు. మనుషుల్ని వ్యక్తులుగా కాక వర్గాలుగా చూసి జాలిపడడం చేత ఉనికిలోకొచ్చినవి వర్గీయ హక్కులు. వారి ఇబ్బందుల్ని మానవతాసూత్రాల ఉల్లంఘన వల్ల చోటుచేసుకుంటున్న పరిణామంగా కాక, వారు ఫలానా వర్గానికి చెందడం వల్లనే కలుగుతున్నాయనే భ్రాంతిలో ప్రసాదించినవి అవి. అంతే కాదు, వారి ఇబ్బందుల్ని వారి పరిస్థితుల పర్యవసానాలుగా చూడకుండా, వాటిల్లో లేని వర్గీయ సరళి (sectarian pattern)  ని అభిదర్శించడం చేతా, వారిని ఏ వర్గస్థులుగా గుర్తిస్తామో ఆ వర్గస్థులందఱికీ ఆ ఇబ్బందుల్ని మూకుమ్మడిగా ఆపాదించడం చేతా అమల్లోకి వచ్చినవి అవి.

ఇది సరికాదు. వ్యక్తుల్ని వ్యక్తులుగానే చూసి జాలిపడాలి. వ్యక్తుల్ని వ్యక్తులుగానే బాగుచెయ్యాలి. వ్యక్తుల్ని వ్యక్తులుగానే సత్కరించాలి. వ్యక్తుల్ని వ్యక్తులుగానే తప్పుపట్టాలి. వ్యక్తుల్ని వర్గాలుగా చూసి జాలిపడడం, వ్యక్తుల్లో వర్గాల్ని అభిదర్శించడం, పరిస్థితుల్ని వ్యక్తుల సృష్టిగా పొఱపడడం– ఇదంతా పూర్తి అశాస్త్రీయం. ఎందుకంటే ఒక వ్యక్తి యుగపత్తుగా అనేక వర్గాలకి చెంది ఉండొచ్చు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ననుసరించి ఒక వ్యక్తి ఒకానొక వర్గీయ గుర్తింపు ప్రకారం సంభావ్య పీడితుడు (probable oppressed) అవుతాడు. మఱో వర్గీయ గుర్తింపు ప్రకారం మళ్ళీ అతనే సంభావ్య పీడాకారుడు (probable oppressor) కూడా అవుతాడు. ఉదాహరణకి, ఒక వ్యక్తి కొన్ని చట్టాల ప్రకారం దళితుడిగా పీడితవర్గానికి చెందినవాడైతే, మళ్ళీ అదే వ్యక్తి మఱికొన్ని చట్టాల ప్రకారం భర్తగా పీడాకార వర్గానికి చెందినవాడవుతాడు. మఱి ఈ వర్గీయ గుర్తింపులకున్న తర్కబద్ధత ఏమిటి? వీటిని ప్రాతిపదికగా చేసుకొని హక్కులూ, చట్టాలూ ఏర్పఱచడం ఎంతవఱకూ సమంజసం?

హక్కులనేవి ఆదర్శభావాల ఫలితం. ఆదర్శాల్ని ఆదర్శాలుగా, ఆశింపుల్ని (expectations) ఆశింపులుగానే ఉంచాలి. అంతే తప్ప ప్రతి ఆదర్శాన్నీ, ఆశింపునీ చట్టబద్ధం చేయ బూనుకోవడం మానవత్వం కాదు. ఉదాహరణకి, వార్షిక పరీక్షల్లో డిస్టింక్షన్ రావడం ఒక ఆదర్శం, లేదా ఆశింపు. ఐతే ప్రతివారికీ డిస్టింక్షన్ వచ్చితీఱాలని నిబంధన విధిస్తే చాలామంది ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి తలెత్తుతుంది.

హక్కులకీ, రాజకీయ అధికారానికీ ప్రాథమికంగా తేడా లేదు. ఎందుకంటే రాజ్యం యొక్క ప్రత్యక్ష బలప్రయోగం ద్వారా అమలుకావడంలో రెండూ సమానమే. కానీ మానవతావాదం మానవుల మధ్య పరస్పర అవగాహననే తప్ప ఏ విషయంలోనూ బలప్రయోగాన్ని ఆమోదించదు. వర్గీయ హక్కులనేవి ఎక్కువ సందర్భాల్లో పిచ్చివాళ్ళ చేతుల్లో ఱాళ్లు. అవి దుష్టతాంత్రికులకు వశమైన మంత్రసిద్ధుల్లాంటివి. కాబట్టి ఒక రకంగా హక్కుల కన్నా రాజకీయాధికారమే ప్రశస్తతరమేమో కూడా! Power corrupts and absolute power corrupts absolutely అనే సూక్తి ఉంది. “అధికారం మనిషిని చెడగొడుతుంది. పరిపూర్ణ అధికారం పరిపూర్ణంగా చెడగొడుతుంది” అని దాని భావం. హక్కులనేవి ఇలాంటి పరిపూర్ణ అధికారం కిందికొస్తాయి. ఎందుకంటే అధికారం కావాలంటే ఎన్నికల్లో పోటీచేయాలి. ఆ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే తదుపరి ఎన్నికల్లో దించేస్తారు. హక్కులకు అలా అవసరం లేదు. ఎంతమంది ఎన్నిసార్లు తమ హక్కుల్ని దుర్వినియోగం చేసినా అవి నిరాఘాటంగా కొనసాగుతాయి. ఒకఱు ఓ ప్రాతిపదిక (category) కి చెందినవారన్న కారణం చేత దేనిమీదో హక్కు ప్రకటించుకుంటూ ఎవఱికో వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అధికారానికి కాలపరిమితి ఉందేమో గానీ హక్కులకి లేదు. ఏతావతా, రాజ్యం గుర్తించిన వర్గీయ హక్కులనేవి ఆయా వర్గాలకు తరతరాలుగా వ్రాసిచ్చిన ఎస్టేట్లలాంటివి. అధికారం కొద్దిమందినే చెడగొట్టగా ఇవి అందఱినీ వక్రమార్గం పట్టిస్తాయి.

12, డిసెంబర్ 2014, శుక్రవారం

మతాలు మానవతావాదమేనా ?

కొందఱు, మానవతావాదం కొత్తవిషయం కాదనీ, తమ మతం పెక్కు శతాబ్దాలకు పూర్వమే మానవతావాద సూత్రాల్ని బోధించిందనీ చెబుతూ, అందుకు ఉపబలకంగా తమ పవిత్రగ్రంథాల్లోంచి సుభాషితాల్నీ, ఉపాఖ్యానాల్నీ ఉదాహరిస్తారు. మతాల్లో మానవతావాదం లేకపోలేదు. కానీ అది కేవలం బీజప్రాయమైనది. ఆదిమ శైశవావస్థకి చెందినది. అంత ప్రౌఢంగా వికసించనటువంటిది. మతాల్లో దాని గుఱించి ఇచ్చిన నిర్దేశాలు టెలిగ్రాఫ్ సందేశాలలా అత్యంత సంక్షిప్తమైనవి. అవి అన్ని మతనిర్దేశాల మాదిరే యథామామూలుగా పుణ్యప్రలోభాలతో, భయపెట్టడాలతో పూర్తిగా తప్పుదారి పట్టినటువంటివి. ఉదాహరణకి, భర్తని పూజించడం, పెద్దల్ని గౌరవించడం, దానాలూ, అతిథిపూజ. వీటన్నింటిలో మానసికంగా బలవంతం చేసే ధోరణి చాలా కనిపిస్తుంది. తన పరిస్థితుల్ని బట్టి వీటిని చేయడానికీ, మానడానికీ మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడలేదు. మనిషి స్వేచ్ఛగా ఉండడమంటే చెడిపోవడంగానే భావించారు పూర్వీకులు. మనిషి నీతిమంతుడిగా ఉండాలంటే బయటి నియంత్రణ ఒకటుండాలని వారనుకున్నారు. కానీ అదే సమయంలో పొద్దస్తమానం నీతులు చెబుతూ ఇతరుల్ని అదుపులో పెట్టే పైవాళ్ళు మాత్రం ఏ రకంగా నీతిమంతులో, మఱి వారి స్వేచ్ఛ వారిని ఎందుకు పాడుచేయదో వివరించలేకపోయారు. పైపెచ్చు, కాలక్రమేణా ఒక దశలో పై నిర్దేశాల ఆధారంగా జనంలో తమను తాము సరిదిద్దుకోవడానికి ప్రాధాన్యం తగ్గిపోయి వాటి పేరుతో నచ్చని వాళ్ళని తప్పుపట్టడానికీ, నలుగుఱిలో బద్నామ్ చేయడానికీ, వెలివేయడానికే అవి ఉపయోగపడడం మొదలయింది. 

పైగా దేవుడితో మానవుడి సంబంధం మీదే మతాలన్నిటి ఊనికా (emphasis) తప్ప మనిషికీ, మనిషికీ మధ్య ఉండాల్సిన సత్సంబంధాల సమస్య వాటికంతగా ప్రసక్తం కాదు. మానవసంబంధాల గుఱించి ప్రస్తావించిన సందర్భాల్లో సైతం అవి తఱచూ పెద్దల అధికారాల్నే తప్ప ఇతరుల విషయం పట్టించుకున్న దాఖలాలు లేవు. పవిత్రగ్రంథాల్లో అన్ని నీతులూ చిన్నవాళ్ళకే చెప్పడం సర్వసాధారణంగా కనిపిస్తుంది.

మతాల్లో మానవతావాదం సర్వసమగ్రంగా చెప్పబడిందనే ఊహ మతవాదులలో నెలకొనడానికీ, ప్రత్యేకంగా తమకు మానవతావాదంతో పనిలేదని వారు అభిప్రాయపడడానికీ కారణం- ఆయా మతాల ప్రామాణిక గురువుల జీవితం అనుష్ఠానరీత్యా మానవతావాదాన్ని పోలి ఉండడం. తమ ప్రామాణిక గురువుల మానవతావాదాన్ని ప్రశంసించే మతానుయాయులు తమ జీవితాల్లోనూ, మతప్రచారంలోనూ మాత్రం వారి జీవనశైలిని పూర్తిగా అనుసరించకపోవడం గమనార్హం. ఆ గురువులు పరమపదించిన తదుపరి వీరు యథాపూర్వంగా అస్తిగోపన (conservative) పద్ధతుల్లోకి జాఱి పోతున్నారు.

బ్రహ్మీభూతులైన ఆద్యసద్గురువుల స్మారకాల్ని బట్టి జనసామాన్యం సైతం “నిష్ఠాగరిష్ఠులైన మతానుయాయులు ఖచ్చితంగా మానవతావాదులు కూడా అయ్యుంటా”రనే భావనలో ఉంటారు. అలా కాదని ఏదైనా ఒక సంఘటన ద్వారా తెలియవస్తే వారినో, వారు అనుసరిస్తున్న మతాన్నో డంబాచారం (hypocrisy) అనీ, వారు ఇంతకాలం నటించారనీ దూషించడం కనిపిస్తుంది. అలా దూషించనక్కఱలేదు. వారు నిజమైన, నిజాయితీ గల మతానుష్ఠాతలే కావచ్చు. కానీ మతాల్లో మానవతావాదం సమగ్రంగా చెప్పబడనందువల్ల వారు దాన్ని ఆచరించలేకపోతున్నారంతే! మన మత గ్రంథాలు మానవతావాదాన్ని జనసామాన్యానికి నిత్యనైమిత్తిక అనుష్ఠానంలో ఒక అవిభాజ్య అంగంగా, దానికి పూర్వార్హతగా నిర్దేశించి ఉండలేదని గమనించాలి. అందుచేత ఒకడు గొప్ప భక్తుడూ, యుగపత్తుగా గొప్ప లంచగొండి కూడా కావచ్చు. అలాగే ఒకడు గొప్ప వేదాంతి, అదే సమయంలో వ్యసనపరుడూ, వ్యభిచారీ కూడా కావచ్చు. మతదృష్ట్యా వైరుద్ధ్యమేమీ లేదు.

కాబట్టి మతానుసరణకీ, మానవతావాది కావడానికీ బాదరాయణ సంబంధమేమీ లేదు. అంటే ఒకఱు మతవాది అయినంతమాత్రాన మానవతావాది కానక్కఱలేదు. ఎందుకంటే మతావలంబనకి / మతాచరణకి మానవతావాదాన్ని ప్రాథమికార్హతగా మతగ్రంథాలు ఎక్కడా నిర్దేశించడం లేదు. ఒకవేళ ఎవఱైనా రెండూ అయ్యుంటే అది వారి వ్యక్తిగత ఎంపిక మాత్రమే. అలాగే ఒక వ్యక్తి మతావలంబీ, ఆస్తికుడూ కాకపోవచ్చు. కానీ అదే సమయంలో అతను గొప్ప మానవతావాది అయి ఉండొచ్చు. 

ఏతావతా, మతాలు ఏయే విషయాల్లో కలగజేసుకుని ఖచ్చితమైన ఆదేశ, నిర్దేశాలిచ్చాయో ఆ విషయాల్లో మన సమాజం ఇప్పటికీ గట్టిగా ఉక్కుపిడికిలి బిగించే ఉంది. ఉదాహరణకు, కామవాంఛ మనిషికి పరమశత్రువు, ఘోరదుర్లక్షణం, మహా హానికరం, నీచనికృష్టం, అసహ్యమంటూ మతాలు ఊదరగొట్టేశాయి. ఆ బోధ సమాజంలో నరనరాలా ప్రాకిపోయింది. మఱోపక్క అత్యాచారాలకి పాల్పడే కొందఱి మూలాన, ‘ఆ బోధ నిజమే’ నన్న అభిప్రాయం జనంలో దృఢపడింది. కామం కూడా అన్ని ఇతర సాధనాల్లాంటిదేననీ, దాని మంచీ-చెడూ దాన్ని ఉపయోగించుకోవడాన్ని బట్టి ఉంటాయనీ గమనించలేకపోయారు. కానీ అదే అభినివేశంతో ఏయే విషయాలనైతే మతాలు పట్టించుకోలేదో ఆ విషయాల్లో మాత్రం సమాజపు నడత చాలా హీనస్థాయిలో ఉంది. ఉదాహరణకు, లంచాలు పుచ్చుకోవద్దని మన మతం గట్టిగా శాసించలేదు కనుక దేశమంతటా లంచగొండులే తయారయ్యారు. ఎవఱికి నచ్చినా నచ్చకపోయినా మతానికి సమాజం మీదున్న పట్టు అంత బిగుతు.

గమనిస్తే– ఆయుష్య పూర్వార్ధంలో విషయాసక్త జీవితాన్ని గడిపి తదనంతర దశలో ఆధ్యాత్మిక బాట పట్టిన అనేకులు, తోటిమానవుల పట్ల ఒక రకమైన విసుగుదలతో అలా మారడం కనిపిస్తుంది. అంటే మన స్వధర్మాభిముఖ్యంలో దైవప్రేమ కంటే మానవద్వేషపు వాటాయే పెద్దదన్నమాట. 

మతావలంబులు తమ మతగ్రంథాల్లోని సుభాషితాల్ని అన్ని అంశాల మీదా, ప్రశ్నలమీదా తుది తీర్పులుగా భావిస్తారు. అవి యావన్మానవ జీవిత కార్యకలాపాల పరిధినీ చుట్టబెడతాయని వారనుకుంటారు. పవిత్రగ్రంథాలు మారడానికి అవకాశం లేదనీ, ఎందుకంటే అవి సాక్షాత్తూ భగవంతుడే ప్రసాదించినవనీ, మనుషుల్లాగా ఆయన తఱచూ మాట మార్చడనీ వారు చెబుతారు. ఇది పూర్తిగా వాస్తవం కాదని చెప్పే సాహసం చేస్తున్నందుకు మన్నించాలి. ఎందుకంటే, జాగ్రత్తగా గమనిస్తే, మతాలు ప్రతికొన్ని శతాబ్దాలకీ మారుతూనే ఉన్నాయి. మతగ్రంథాల మధ్యలో ప్రక్షిప్తాలు విఱివిగా చొఱబడుతూనే ఉన్నాయి. వాటికి వినూత్నభాష్యాలూ, సరికొత్త అనుబంధ పొత్తాలూ బయల్దేఱుతూనే ఉన్నాయి. వాటికి తోడు అంతకు ముందు లేని కొత్త మతగ్రంథాల్ని సృష్టించి అవి కూడా చాలా ప్రాచీనమని ప్రచారించడం కూడా కనిపిస్తోంది. మఱోపక్క ఒక మతంలో నిషేధించిన ఒక ఆచారాన్నో, విశ్వాసాన్నో దాని అవలంబులు కొందఱు పాటిస్తూండగా కొందఱు తీఱిక చేయడం కూడా కనిపిస్తోంది.

చారిత్రికంగా చూసినప్పుడు, భగవద్భావనా, తప్పొప్పుల విచక్షణా అత్యంత ప్రాచీనమైనప్పటికీ మానవజాతి పుడుతూనే మతమనే కవచకుండలాలతో పుట్టినది కాదని తేల్తుంది. కనుక మతగ్రంథాలన్నీ ఇటీవలివే. అవి ఉద్భవించక ముందు అవంటే ఏంటో తెలియకుండా ఈ భూమండలం మీద పుట్టిపెఱిగి నడయాడి గతించిన వేలాది మానవసమూహాల్ని ‘దైవద్రోహులు’ అనలేం. వారూ ఆయన సృష్టే. నాగరికతతో పాటే మతమూ క్రమక్రమంగా ఎదగబాఱుతూ (evolve అవుతూ) వచ్చింది. అయితే అంతమాత్రాన వాటి పవిత్రతనీ, మహిమనీ, ప్రామాణికాధికారాన్నీ మనం శంకించడం లేదని అర్థం చేసుకోవాలి. వాటి స్రష్టలైన మానవులు మనకన్నా ప్రాంశుతర శ్రేణికి చెందినవారు కావచ్చు. వారి గొప్పతనాన్ని బట్టి వాటికి భగవంతుడి ప్రేరణా, ఆశీర్వాదమూ, ఆమోదమూ, శక్తిపాతమూ లభించి ఉండవచ్చు.

“మఱెందుకని పూర్వీకులు అవి సాక్షాత్తూ దైవదత్తమేనని చెప్పారు ?” అనడిగితే, అలా చెబితే తప్ప తత్కాలీనులకి అర్థమయ్యే పరిస్థితి కాదు. వారు వినిపించుకునేవారు కారు. ఒక గొప్పవాడి గొప్పతనాన్ని మఱో గొప్పవాడే గుర్తించగలడు. నూటికి 99 మంది నిరక్షరాస్యులే అయిన సమాజాల్లో గొప్పపుస్తకాల్లోని మంచిమాటలు ఎవఱికి తెలుస్తాయి? వాటికి విలువిచ్చేదెవఱు? అసలేమీ తెలియనివాళ్ళకి ఏమని చెప్పి ఒప్పించాలి? అందుకని అలా చెప్పక తప్పింది కాదు. మతగ్రంథాలనే కాదు, ఆ రోజుల్లో పరిపాలనా, మందులూ, న్యాయస్థాన తీర్పులతో సహా ప్రతీదీ దేవుడి పేరిటే చెలామణి చేసేవారు. ఒక రకంగా సంఘమే దేవుడి పేరుతో చెలామణి అయ్యేది. నిజానికి ఈరోజు కూడా ఎక్కువమంది దేవుడి పేరుబెట్టి ఆరాధించేదీ, విధేయత చూపేదీ సంఘానికే! దాని కనుగుణంగా లేకపోతే మనిషి పాపాత్ముడి కిందో, నాస్తికుడి కిందో జమ. మతగ్రంథాల విలువైనా సంఘాని కనుగుణంగా ఉన్నంతవఱకే. ఉదాహరణకి, మనుధర్మశాస్త్రంలో మేనఱికాన్ని నిరసించారు. పట్టించుకున్నదెవఱు? సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్మే చేసుకున్నాడాయె.

భగవంతుడు తన నిర్ణయాలు మార్చుకోడనేది కూడా నిజం కాదు. అలా అయినట్లయితే మతావలంబులు అది కావాలనీ, ఇది కావాలనీ ఆయన్ని రోజూ ఎందుకు ప్రార్థిస్తున్నారు? ఆయన ఏం చేస్తే దానికి తలొగ్గి అనుభవించవచ్చు గదా? సర్వశక్తిమంతుడైనవాడు మారకుండా ఉండడం అసాధ్యం. భక్తుల ప్రార్థనల్ని బట్టి తన నిర్ణయాల్ని మార్చుకోవడం ఇష్టం లేకపోతే ఆయన క్రూరుడనాల్సి వస్తుంది. ఇష్టమున్నా మారలేకపోతే అస్వతంత్రుడనాల్సి వస్తుంది. కానీ ఆయన ఆ రెండూ కాదు. అందుచేత ఆయన తన నిర్ణయాల్ని మార్చుకుంటాడనేది నిజం. కాలాన్ని బట్టి కూడా ఆయన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఆయనే మారుతున్నప్పుడు మతగ్రంథాలూ, వాటి అవలంబులూ మారడాని కభ్యంతరమేముంది ?

8, డిసెంబర్ 2014, సోమవారం

ప్రతిచర్యకి బదులు, చర్య

ఆంగ్లంలోని Reactionary అనే విశేషణాన్ని మనమిక్కడ తెలుగులో ‘ప్రతి చర్యాళువు’ అంటున్నాం. దానికి వ్యతిరేకార్థకంగా ‘చర్యాళువు’ అంటున్నాం. కానీ ఆంగ్లంలో చర్యాళువుకు సమార్థకం లేదు. తిరోకల్పన (Back formation) పద్ధతిలో Actionary అనొచ్చును గానీ ఆ మాటకింకా నిఘంటువుల్లో స్థానం లేదు. చర్యాళుత్వం అంటే- ఇతరుల మీద కోపంతోనో, ద్వేషంతోనో, లేదా తానంటే ఏంటో వారికి నిరూ పించి చూపాలనే పట్టుదలతోనో, లేదా తానూ వారిలా అవ్వాలనో కాకుండా, తన స్వకీయమైన ఆసక్తితో, యథార్థమైన ప్రేమతో, సొంత సృజనాత్మకశక్తి-ప్రతిభలతో తన పద్ధతిలో తానో కొత్తపనిని స్వతంత్రంగా సంకల్పించి చేయడం. ఇందుకు విరుద్ధమైనది ప్రతిచర్య.

ఆధునిక కాలంలో మన మనస్సు పలు బాహ్యప్రభావ వాహినుల చేత కోలాహలంగా ముట్టడించబడుతోంది. వాటిల్లో సత్ప్రభావాలూ ఉన్నాయి. దుష్ప్రభావాలూ ఉన్నాయి. మనమూ మంచి పనులు చేయాలనే ఉత్తేజాన్ని కలిగించేవి మంచి ప్రభావాలు. ఆవేశాల్ని రగిలించేవి దుష్ప్రభావాలు. వాస్తవానికి ఈ రెండూ ప్రతిచర్యలే. ఈ రోజుల్లో తామనుకున్న ప్రతిస్పందనల్ని మన నుంచి రాబట్టడానికీ, తామనుకున్న అంశాల మీద తామనుకున్న పద్ధతిలో మనల్ని ప్రతిచర్యాళువులుగా మార్చడానికీ రక రకాల ఆధికారిక అనాధికారిక శక్తులు అహర్నిశం చాలా ప్రొఫెషనల్ పద్ధతుల్లో కృషిచేస్తున్నాయని గమనించాలి. ఈ ప్రభావాల్లో పడి మనకి ఏ భావమైనా దానంతటది కలగడం మానేసింది. ఏదో జఱగాలి. ఎవఱో ఏదో చెయ్యాలి. దాని గుఱించి ఎవఱో ఒక భావోద్వేగపూరిత శైలిలో మనకు నివేదించాలి. రచ్చ, రభస అవ్వాలి. ఓ పబ్లిక్ పంచాయితీ పెట్టాలి. అప్పుడు గానీ మనకు ఆలోచనలు రావు. ఇదీ ఈనాడు మన పరిస్థితి. కాదు, మన మేధస్సుల పరిస్థితి. ఒక రకంగా మనం భావపరమైన నపుంసకులుగా మారాం. ఎందుకంటే మనలో భావాలూ, ఆలోచనలూ పుట్టాలంటే మనల్ని ఎవఱైనా గిల్లాలని కోరుకుంటున్నాం. అంటే బాహ్యప్రేరణని అపేక్షిస్తున్నాం. ఎల్లప్పుడూ ప్రతిచర్యే తప్ప చర్య ఎఱగనివారి పరిస్థితి ఇలా కావడం ఆశ్చర్యకరం కాదు.

జాగ్రత్తగా గమనిస్తే- చదువు దగ్గర్నుంచీ, ఉద్యమాల దాకా మన బ్రతుకంతా ఇలా దేనికో ప్రతిచర్య (reaction) గా తయారైంది. మనంతట మనం ప్రేమించి, లేదా మనంతట మనకు బుఱ్ఱలో ఊహ పుట్టి చేసేదేదీ కనిపించదు. దేన్నో, ఎవఱినో చూసి మనం స్పందిస్తున్నంత కాలం మనం ప్రతిచర్యాళువులమే అవుతాం. ఏ అంశం మీదా బొత్తిగా స్పందనలే లేని బండజనంలో వాటిని కలిగించడం గొప్పవిషయమే కానీ స్వతహాగా సృజనశీల స్పందనలున్నవారు ఇలాంటి ప్రతిచర్యల మీద తమ భావోద్వేగాల్ని వృథా చేసుకోవడం మంచిది కాదు. దీనివల్ల వారు తమ సృజనశీలాన్ని కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో మానవతావిరుద్ధమైన ప్రతీప భావజాలాల (negative ideologies) వైపు ఆకృష్టులు కావడానిక్కూడా ఆస్కారం ఉంటుంది.  

(ఓ) మఱికొన్ని విచికిత్సలు

1. వివిధ సైద్ధాంతిక భావజాలాలు మానవతావాదమేనా ? 

మానవజాతిలో ఏకదేశానికి అంకితమై తమదీ మానవతావాదమేనని చెప్పుకునే ప్రయోజనగుంపులూ (interest groups), సిద్ధాంతవాదుల సంపర్కజాలాలూ (ideology networks) సమకాలీనంగా తామరతంపరగా ఉన్నాయి. ఇది తార్కికంగా పొసగదని గమనించాలి. అది స్వీయవర్గవాదమే (sectarianism) తప్ప మానవతావాదం కాదు. వారు మానవతావాద సూత్రాల్ని తమ సిద్ధాంతాల సమర్థన, వ్యాప్తి కోసం అరువు తీసుకుంటున్నారే తప్ప తమ అభిమానవర్గానికి చెందని ఇతరులపట్ల వారికి ఏ విధమైన సహానుభావమూ ఉన్నట్లు కనిపించదు. నిజానికి ఆయా సిద్ధాంతాల్లో మానవతావాద విరుద్ధమైన అంశాలెన్నో కనిపిస్తాయి. కనుక ఇది మానవతావాద స్ఫూర్తిని హైజాక్ చేయాలనే ప్రయత్నం కూడా కావచ్చు.

ప్రతి సామాజిక-ఆర్థిక-రాజకీయ సిద్ధాంతంలోనూ ప్రాఙ్ నిర్ణీత శత్రువులు (pre-determined enemies) ఉంటారు. వారిని వ్యతిరేకించే పేరుతో, ఆ ప్రక్రియలో సిద్ధాంతవాదులు తమ శత్రువుల్లాగే తయారవుతారు. లేదా ఇంకా విషమించిపోతారు. తామిదివఱకు ఏ పద్ధతులనైతే వ్యతిరేకించారో వాటినే కౌగలించుకునే స్థాయికి దిగజాఱిపోతారు. మానవతాసూత్రాల్ని అవలంబించడానికీ, దాని లక్ష్యాల్ని సాధించడానికీ అనుసరించే మార్గం కూడా మానవీయంగానే ఉండాలి. "తమదీ మానవతావాదపు పాఠాంతరమే" (a version of humanism) అని బుకాయించే సైద్ధాంతికశ్రేణులు ఈ అగ్నిపరీక్షలో తఱచుగా విఫలమవుతాయి. ఎందుకంటే వాటి కార్యకలాపాలన్నీ అసత్యాల్నీ, అతిశయోక్తుల్నీ ప్రాపుగా చేసుకుని, జనంలో ప్రతీప భావోద్వేగాల్ని (negative emotions) ఎగసన దోయడమే ధ్యేయంగా నడుస్తూంటాయి. 
 

2, డిసెంబర్ 2014, మంగళవారం

ఆత్యంతిక వాదాల (Extremist viewpoints) నుంచి దూరం పాటించడం

మనుషులు స్వతహాగా సౌందర్యారాధకులూ, సతర్కజీవులూ గనుక ఉన్న ప్రపంచంతో/ జీవితంతో సంతృప్తి చెందకపోవడం సహజం. ఇది ఇంతకన్నా మెఱుగ్గా ఉంటే బావుంటుందని అనుకోనివారు ఉండరు. తప్పులేదు. కానీ కొందఱిలో- వారి అపరిణత, ఆవేశపూరిత, భావోద్వేగ ధోరణి మూలాన ఈ ఆశంస క్వాచిత్కంగా వికటరూపాన్ని ధరిస్తుంది. ఆ మెఱుగుదల కోసం ఇతరుల్ని హింసించినా, దోచినా తప్పులేదనీ, వారందుకు తగినవారేననీ, ఎందుకంటే ఇప్పుడు తమ వంతొచ్చిందనీ, తాము కోరుకుంటున్న కొత్త ప్రపంచం కోసం ఉన్న ప్రపంచాన్నీ, దాని విలువల్నీ ధ్వంసం చేయక తప్పదనీ, అందునిమిత్తం కొన్ని హఠాన్ మార్పులూ, పెడనిర్ణయాలూ (out-of-the way decisions), అలాగే కొన్ని ‘అతి’ చర్యలు కూడా తప్పవనీ వారు భావిస్తారు. భావించడమే కాకుండా ఆ భావనల్ని ప్రచారించడం కూడా మొదలుపెడతారు. త్వరలో అదో ఆత్యంతిక సిద్ధాంతం (extremist ideology) అయి కూర్చుంటుంది. దానిచుట్టూ రాజకీయపక్షాలూ, వాటి కనుబంధంగా "ప్రజాసంఘాలూ" తయారవుతాయి. తమ భావజాలాని కనుగుణంగా ప్రజాజీవితం మీద పెద్దయెత్తున ఆకస్మిక చర్యలతో ‘అతి’ ప్రయోగాలు చేయవలసిందని వారంతా కలిసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా ఒక మాట. ఆత్యంతికవాదాలూ, తీవ్రవాదమూ ఒకటి కావు. ఏ ఆత్యంతికవాదమైనా సైద్ధాంతిక రుగ్మతలకొక ప్రారంభదశ మాత్రమే. అలాగే ఆత్యంతికవాదులు కూడా వ్యక్తిగతంగా ఒక రకం తిక్కతత్త్వాలు మాతమే. కానీ ఇలాంటి తిక్కతత్వాలు కొన్ని వేలు ఒకచోట పోగైతే అదో "వాదం"గా, భావజాలం (ideology) గా పరిణమిస్తుంది. ప్రతి ఆత్యంతిక వాదమూ అంతిమంగా ఏదో ఒక రోజున వివిక్త/ ప్రభుత్వ తీవ్రవాదానికి (private or state terrorism) కి దారితీయడం ఖాయం.

అయితే దురదృష్టవశాత్తూ, ఇటువంటి ఆత్యంతిక వాదాలు మొదట్లో విస్తారమైన ప్రజాదరణకు నోచుకునే మాట వాస్తవం. ఎందుకంటే ఆవేశపరులూ, తిరుగుబాటరులూ, తలకిందులుగా నడిచే వాళ్ళూ, ముక్కుతో తినేవాళ్ళూ మనుషుల దృష్టిని చప్పున ఆకర్షిస్తారు. వారు రుచిచూపుతామనే కొత్త దనం మీది ఆసక్తి ప్రజల తార్కిక ప్రతిభని తాత్కాలికంగా ఆచ్ఛాదించి వేస్తుంది. ప్రస్తుత జీవితంతో విసిగిపోయినవారంతా బేషరతుగా వారివెంట నడవడానికి సిద్ధపడతారు. ప్రతికొత్త సామాజిక  భావజాలమూ, చట్టమూ నవజాత శిశువుల్లాంటివి. అవి ప్రజల మనసుల్లో భవిష్యత్తుపట్ల ఉజ్జ్వలమైన చల్లని ఆశావాదపు పిల్లతెమ్మెఱల్ని వీస్తాయి. కనుక, “ఆ మార్గం విశ్వసనీయం కా”దనే దీర్ఘ దర్శులంతా అశ్లీలంగా దూషించబడతారు. అయితే మానవత్వం పక్షాన ఉండేవారెవఱూ అలాంటి ఆత్యంతిక వాదాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించరు, అవి ఎంత ప్రజాదరణ పొందనీ, ఎన్ని తాత్కాలిక విజయాల్ని సాధించనీ!


ఆత్యంతిక వాదాలన్నింటికీ కొన్ని సర్వసామాన్య లక్షణాలుంటాయి :

1. అవన్నీ ప్రాథమికంగా జనాభా మొత్తానికీ కాక, అందులో ఏదో ఒక ప్రత్యేక సమూహపు శ్రేయస్సుకు మాత్రమే అంకితమై ఉంటాయి. కానీ ఆ సమూహపు శ్రేయస్సే అందఱికీ శ్రేయస్సని ప్రచారం చేస్తూంటాయి. అసలు యావత్ ప్రపంచానికే తమ మార్గం మినహా వేఱు శరణ్యం లేదని గట్టిగా నొక్కి వక్కాణిస్తూంటాయి. లేదా యావత్ ప్రపంచమూ తమ వైపే ఆశావాదంతో చూస్తోందని చెప్పుకుంటూంటాయి.

2. మఱో పార్శ్వం నుంచి- అవి కొన్ని ఇతర సమూహాల్ని బహిరంగంగా ద్వేషిస్తూంటాయి. అన్ని లోపాలకీ, నష్టాలకీ అవే ఏకైక కారణమనీ, వాటిని ఏం చేసినా పాపం లేదనీ, వాటి కడగండ్లకి ఎవఱూ కఱగాల్సిన అవసరం లేదనీ అవి బోధిస్తాయి, కనీసం జనాంతికంగా నైనా !

3. అవి- సమాజంలో రావాలని తాము కోరుతున్న ఏ మార్పు కోసమూ ఓర్పుగా వేచి చూసేందుకు ఇష్టపడవు. రాజకీయ ఒత్తిళ్ళూ, పైరవీలూ, ప్రలోభాలూ, వెన్నుపోట్లూ, బొంతపురుగులతో చెట్టపట్టాలూ, నిరంకుశ చట్టాలూ, బెదిఱింపులూ, హింస, విధ్వంసం, పెద్దపెద్ద గుంపుల్ని సమీకరించడం ద్వారా శక్తి-అసమతూకాన్ని సృష్టించడం మొదలైన శీఘ్రతర అడ్డదారుల్నే అన్వేషిస్తాయి.

4. వాటి ప్రచారవ్యూహం సాధారణంగా- అబద్ధాలూ, వదంతులూ, వక్రభాష్యాలూ, బుఱదజల్లడం, గోరంతలు కొండంతలు చేయడం, గతజల సేతుబంధనాలూ, మహాజనుల క్రించు సహజాతాల్ని (base instincts) రెచ్చగొట్టడం, ఎప్పుడూ తమ జోలికి రానివాళ్ళ మీద మానసికంగానో, భౌతికంగానో, ఆర్థికంగానో దాడి చేయడం, ఎగతాళ్ళూ మొదలైన హీనస్థాయి పద్ధతుల్ని ఆశ్రయించుకుని ఉంటుంది.

ఒకానొక భావజాలం ఎవఱి కోసం? ఏ లక్ష్యంతో? అనేది అనవసరం. అది పైన పేర్కొన్న ఆత్యంతిక లక్షణాల్ని (extremist features) కలిగి ఉన్నట్లు గుర్తుపట్టిన వెంటనే దాన్నుంచి దూరం జఱగడం ప్రతి మానవతావాదికీ విధ్యుక్త ధర్మం. అంతే తప్ప, “వాటి మార్గం చెడ్డది కావచ్చు గానీ లక్ష్యం మంచిదే”నంటూ వాటిల్లో లేని పవిత్రతని అభిదర్శించే ప్రయత్నం పొఱపాటవుతుంది. ఎందుకంటే ఆత్యంతికవాదులు చేసే తప్పులు, తెలియక చేసేవి కావు. 

26, నవంబర్ 2014, బుధవారం

భావోద్వేగాల స్థానే పర్యాలోచనకు పెద్దపీట

భావోద్వేగాలూ (emotions), పర్యాలోచనా (relaxed thought) – రెండూ మానవత్వంలో భాగాలే. ఒకటి మఱొకటిగా అవపాతం చెంది ఘనీభవిస్తుంది. కాబట్టి మనిషికి రెండూ అవసరమే. అయితే, కొన్ని కారణాల వల్ల మానవతావాదంలో భావోద్వేగాల కన్నా పర్యాలోచనకే అగ్రాసనం. పర్యాలోచన గడియారమైతే భావోద్వేగం అందులో భాగమైన అలారంలాంటిది. గడియారం నిరంతరాయంగా నడవడం ముఖ్యం. కానీ అలారం విషయంలో మటుకూ అలా కాదు. అది నిరంతరాయంగా మోగడం జబ్బులక్షణం. జీవితం ఓ పుస్తకమనుకుంటే అందులో మనం పొందే భావోద్వేగాలు- ఆసక్తికర అనుభవాలనే పంక్తుల కింద గీచి గుర్తుపెట్టిన ఎఱ్ఱసిరా గీతలు. అవి మనకు గతాన్నీ, భావి కర్తవ్యాన్నీ గుర్తుచేస్తాయి. అదే వాటి ఉద్దిష్ట ప్రయోజనం. అది మర్చిపోయి పుస్తకం మొత్తం ఎఱ్ఱసిరా గీతలతో నింపేయడం అభిలషణీయం కాదు. అప్పుడది చాలా ఎబ్బెట్టుగా అగుపిస్తుంది. 

భావోద్వేగాల్ని భావోద్వేగాలుగానే, పర్యాలోచనని పర్యాలోచనగానే చూడాలి. అలాగే వాటిని వేఱు వేఱుగానే అనుభవించాలి. రెండూ కలిపి కలగాపులగం చేయకూడదు. అలా చేస్తే మనకు తెలియకుండానే మనం మానవతాసూత్రాల ఉల్లంఘనకు ఒడిగడతాం. కానీ ఇందుకు విరుద్ధంగా లోకంలో రెండు విషయాలు తఱచుగా కానవస్తాయి. ఒకటి- తొలుత నిర్భరమైన భావోద్వేగాలకూ, సెంటిమెంట్లకూ లోనై ఆ తరువాత వాటిని సమర్థించుకోవడం కోసం పర్యాలోచనని ఆశ్రయించడం. రెండు- పర్యాలోచన ద్వారా కొన్నిలక్ష్యాల్ని ఏర్పఱచుకుని వాటిని సాధించడం కోసం తమ యొక్కా, ఇతరుల యొక్కా భావోద్వేగాల్నీ, సెంటిమెంట్లనీ వాడుకోవడం. ఈ రెండో పని ఎక్కువగా మగవారు చేస్తారు. కానీ రెండూ తప్పే.

భావోద్వేగాలు సున్నితత్వానికి సంబంధించినవి. దాని గుఱించి స్థలాంతరంలో ఇదివఱకు విపులంగా చెప్పే ఉన్నాను గనుక ఇప్పుడు సవిస్తరంగా ఆ ప్రస్తావన గుఱించి వ్రాయను. మన సమాజంలో ఆలోచనాత్మక, ఆలోచనాప్రేరక అభివ్యక్తి (thoughtful, thought-provoking expression) కన్నా కూడా భావోద్వేగపూరిత, భావోద్వేగకారక అభివ్యక్తి (emotional/ emotive expression) కి చాలా విలువిస్తారు. తార్కికంగా మాట్లాడే నాయకులకన్నా ఆవేశంగా మాట్లాడే నాయకులు మనకు బాగా నచ్చుతారు. శాంతరసాన్ని పోషించే రచయిత కన్నా ఉద్రేచక శైలితో ఒక ఊపు ఊపేసే రచయితని మనం ఎక్కువ అభిమానిస్తాం. అదే విధంగా ఏ ప్రస్తావన మీదైనా సరే, చర్చ అనేది మనం బొత్తిగా భరించలేం, మనం ఏదీ వినలేం. వినిపించుకోలేం. సమాధానం బైటికొచ్చే దాకా ఎదురుచూడలేం. దాని బదులు ఎవఱైనా అవతలివాళ్ళ నోరు బలవంతంగా నొక్కేసి చర్చకు భరతవాక్యం పలికితే మనకు చాలా ఆనందం కలుగుతుంది. చాలా ఉపశమనంగా, హాయిగా అనిపిస్తుంది. మనల్ని ఇలా మార్చినది భావోద్వేగాలకు మనమిచ్చే అనవసర ప్రాధాన్యమే. 

ఏదైనా ఆవేశంగా చెప్పకపోతే మనవారికి ఎక్కదు. మనది ఆలోచనాప్రధానమైన బౌద్ధిక సమాజం కాకపోవడం ఇందుకో ప్రధానకారణం. ఇలా భావోద్వేగాలకు మాత్రమే స్పందించడం అలవాటై మన మెదళ్ళు సాలోచన అభివ్యక్తులకి tune అవ్వడం మానేశాయి. భావోద్వేగాలు వినోద కార్యక్రమాల్లో నూ, కళల్లోనూ, ఆధ్యాత్మికతలోనూ పనికొస్తాయి. కానీ విద్యావిజ్ఞానాలకీ, పరిశోధనకీ, సత్యాసత్య నిర్ధారణకీ, తత్త్వీకరణలకీ అవి సుతరామూ పనికిరావు. కానీ మనం భావోద్వేగాలకి వేసే స్వర్ణసింహాసనం మూలాన వినోద-విజ్ఞానాల మధ్య ఉన్న అగాధాన్ని గమనించలేనివాళ్ళమయ్యాం. మనం వినోదాన్నే విజ్ఞానం అనుకుంటున్నాం. అందుకనే తెలుగులో 30–40 టీవీ వాహినులుంటే వాటిల్లో ఒక్కటీ విద్యావిజ్ఞానాలకు సంబంధించినది కాదు. అసలు అలాంటివి మనకు అవసరమే లేదు. అవి లేనందుకు ఇక్కడెవ్వఱూ బెంగపెట్టుకోరు. మన మేధానాణ్యత అంతవఱకే. అందుకే మనవన్నీ కాలక్షేప బ్బఠాణీలే. మనుషులకు మనమిచ్చే ప్రాధాన్యం కూడా అలాగే ఉంటుంది. ఒక నోబెల్ బహూకృతుడైన శాస్త్రవేత్తో, సాహిత్యవేత్తో చనిపోతే “ప్చ్ పోయాడు” అని నాలుగైదు పంక్తుల్లో సరిపెడతాయి మన పత్రికలు. వార్తావాహినులైతే ఒకపూట స్క్రోలింగుతో సరిపెడతాయి. ఆయన అంతిమ యాత్రకైతే ఎవఱూ వెళ్ళరు. అదే ఒక స్థానిక సినీనటుడో, క్రికెట్ ఆటగాడో అనుకోండి, అప్పుడు...? ఆలోచనకీ, దాని ద్వారా మన మెదళ్ళని పెంచిన వారికీ మనమిచ్చే శాశ్వతస్థానం అది - వెనక బెంచి. 

సమాజపు విలువల వ్యవస్థ యావత్తూ ఇలా భావోద్వేగాల చుట్టూ పరిభ్రమించడం వల్ల అందఱూ తమను తాము భావోద్వేగులుగా  తీర్చిదిద్దుకుంటున్నారు. ఆడవాళ్ళేమో అది తమ సున్నితత్వం, లేదా సాధికారత అనుకుంటున్నారు. మగవాళ్ళైతే తమ పౌరుషానికి సంకేతం అనుకుంటున్నారు. సంస్థలేమో అది తమ స్పందక తత్త్వానికి (responsiveness) నిదర్శనం అనుకుంటున్నాయి. కానీ దీని వల్ల టోకుగా జఱిగే నష్టం గుఱించి ఎక్కువమందికి అవగాహన లేదు. మొదటిది- మనకు ఎల్లప్పుడూ ఏదో ఒక ఉద్రేకాన్నిచ్చే విషయం కావాల్సి వస్తోంది. ఏదీ లేకపోతే ఊరికే వసపిట్టల్లా వాగడం. ఆఖరికి నిశ్శబ్దాన్ని భరించలేని, సహించలేని గోల-గగ్గోలు మనుషులుగా మనం అవతరించాం. 

రెండోది- మన భావోద్వేగాల పిచ్చిలో మన బౌద్ధిక నాణ్యత చిన్నప్పుడే దెబ్బతినడాన పరిశోధన మఱియు అభివృద్ధి (R&D) లాంటివాటికి పనికిరాని వ్యక్తులుగా పరిణమించాం. ఎందుకంటే మన సామూహిక మనస్తత్త్వానికి వాటి పట్ల అభిరుచే ఉదయించదు. మూడోది- మనకు భావోద్వేగాలే తప్ప ఆలోచనాశక్తి లేదని గమనించి మన ఈ మనస్తత్త్వాన్ని రాజకీయపక్షాలూ, నాయకులూ చక్కగా వాడుకుంటున్నారు. మాటిమాటికీ మన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి, మనల్ని అమానుషులుగా మార్చి వారు తమ పబ్బం గడుపుకుంటున్నారు. వ్యాపార సార్థవాహాలు (corporates) సైతం ఇటీవల ఇదే తరహా ప్రచారవ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. మేధావులు దీనికి మేధాక్రీడ (mind game) అని పేరుపెట్టారు. ఆ రకంగా అర్థం పర్థం లేని వెఱ్ఱిమొఱ్ఱి సెంటిమెంట్లతోనూ, వాటి తాలూకు బాగా నలిగిన భాషాప్రయోగంతోనూ మన మేధస్సుని పనిచెయ్యకుండా చేసి మనమీద వశీకరణ శక్తిని ప్రయోగించే అవకాశాన్ని మనం ఎవఱికీ ఇవ్వకూడదు. 

భావోద్వేగాల పారవశ్యం విషయాల తాలూకు సూక్ష్మవివరాల మీద శీతకన్ను వేయిస్తుంది. సమస్యల మారుమూల కోణాలకేసి దృష్టి సారించనివ్వదు. భావోద్వేగాల్ని వ్యక్తీకరించనంత వఱకే అవి మన అదుపులో ఉండేది. ఒకసారంటూ వ్యక్తీకరించడం జఱిగాక మనమే వాటి అదుపులోకి వెళ్ళిపోతాం. తదుపరి పరిణామాలు మన చేతుల్లో లేకుండా పోతాయి.

21, నవంబర్ 2014, శుక్రవారం

మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు-2

ముందు కుటుంబాల్లో మొదలయ్యే ఈ కాలుష్యం అటుపిమ్మట సమాజాన్నంతా చుట్టబెడుతుంది. త్వరలోనే ప్రతి మానవసంబంధమూ ఒక అధికార సంబంధం (power relation) గా అవతారం తాలుస్తుంది. ఆ క్రమంలో భార్యాభర్తలూ, గురుశిష్యులూ మొదలైన అన్ని సామాజిక ద్వంద్వాల్లోనూ స్నేహధోరణి ఆవిరైపోయి, కేవలం శాసించేవారితోనూ, ఆ శాసనాలకి చచ్చినట్లు తలొగ్గి తీఱాల్సిన వారితోనూ నిండి మానవ సంబంధాలు మరామత్తుల కతీతంగా పాడైపోతాయి. పుట్టినప్పట్నుంచీ ఇలాంటి అధికార సంబంధాలే తప్ప మానవ సంబంధాలంటే ఏంటో ఎప్పుడూ రుచిచూసి ఎఱగని జనం, వారిలో ప్రతి ఒక్కఱూ ఏదో ఒక రకమైన చిన్నమెత్తు అధికారం కోసం ఒక విచిత్రమైన ఆకలితో ఆవురావురుమంటూ, తమ పరిధిలో తాము ఇతరుల మీద ధాష్టీకం చెలాయిస్తూ వికృతమైన మానసిక తృప్తినీ, వికటమైన ఆనందాన్నీ అనుభవించసాగుతారు. 

ఆ ప్రక్రియలో- మనకు అత్తలుండరు. ఆడబాసులే ఉంటారు. బాసులుండరు. యముళ్లే ఉంటారు. ఇంటి యజమానులుండరు. శాడిస్టులే ఉంటారు. మనకు వాహన చోదకులుండరు. రోడ్డుకింగులే ఉంటారు. మనకు కార్యదక్షులైన ఉద్యోగులు కాదు, చెయ్యాల్సిన పని వదిలేసి పదోన్నతుల (promotions) కోసం తపించేవాళ్లే ఉంటారు. చాలా సహజం. ఎందుకంటే ఒకప్పుడు ఎవఱో మనల్ని సబార్డినేట్ గా మన్నిస్తేనే మనలో కూడా ఎవఱికైనా సుపీరియర్లమైతే బావుంటుందనే కోరిక పొటమరిస్తుంది.

ఇలా అందఱూ కలిసి తమ తమ ఆత్మన్యూనతా భావాల (inferiority complex) కొద్దీ సృష్టించిన ఈ అమానవీయ వాతావరణం– మానవ సంబంధాలంటే అధికార సంబంధాలే తప్ప మఱేమీ కాదన్న మనోభ్రాంతిని సృష్టిస్తుంది. ఈ భ్రాంతి దృఢపడే కొద్దీ మన అధికార పిపాస మఱింతగా దుష్పూరమౌతుంది. మనుషుల మధ్య పరస్పర ప్రేమా, గౌరవమూ నశించిపోయాక పనిచేసే ప్రేరణ కూడా చచ్చిపోతుంది. దరిమిలా, వారిచేత పని చేయించడం కోసం పశువులకు మల్లే ఒక ములుగఱ్ఱతో ప్రతివారినీ, ప్రతిరోజూ పొడుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఆ పొడవడం కూడా ఒక ప్రత్యేక ఫిలాసఫీగా అవతరిస్తుంది. మళ్ళీ దానికి విశ్వవిద్యాలయాల్లో కోర్సులూ, ప్రొఫెసర్లూ, డిగ్రీలూ. దురదృష్టవశాత్తూ, మన సమాజంలో ఈ ప్రక్రియ (process) మొత్తం ఇప్పటికే పూర్తయింది.

ప్రతివారికీ అప్రయత్న మనోరుగ్మతలా పట్టుకున్న ఈ అధికారదాహాన్నీ, ఈ వెకిలితనాన్నీ వదిలించి హుందాతనంతో కూడిన మానవ సంబంధాల మాధుర్యాన్ని పునరుద్ధరించాలంటే, మనం ముందు చేయాల్సింది- కొన్ని మానవ సంబంధాలు మాత్రమే దైవసమానమనీ, పవిత్రమనీ. మిగతావి కాదనీ అలవాటు చేయబడ్డ తరతరాల తప్పుడు భావజాలాన్ని వదిలించుకోవడం. వీటి మధ్య ఉన్న అంతరాలు కేవలం సందర్భానుసారమేననీ, పక్షాంతరంలో ఇవన్నీ సమానంగా ముఖ్యమేననే ఎఱుక పెంపొందించుకోవడం. మనంతట మనం గౌరవాన్ని వాచ్యంగా డిమాండు చేయకుండా, మనల్ని గౌరవించాలనే ప్రేరణ అవతలివారిలో స్వయంభువుగా కలిగే వఱకూ వేచి చూడడానికి సిద్ధపడడం.

మనుషులు అధికారాన్ని వదులుకోను ఇష్టపడకపోవడానికి కారణం- అది తప్పితే ప్రేమించబడడానికీ, గౌరవించబడడానికీ తమలో మఱి ఏ విశిష్ట లక్షణమూ లేకపోవడమే. ప్రేమ స్వయంగా తానొక విశిష్టలక్షణం గనుక దానికి అలాంటి భయాలుండవు. అధికారానికి ప్రేమ కూడా తోడైతే ఆ ఔదార్యానికి జనం కళ్ళు చెమ్మగిల్లుతాయి. తద్విపర్యాసంగా ప్రేమ మాలిన కేవల అధికార ప్రదర్శన కటువుగా శపించబడుతుంది. ప్రేమకు అధికారం లేకపోయినా తానే అధికార నిర్విశేషమై కూటస్థం (passive) గా శాసిస్తుంది. అందుచేత మనం నేర్చుకోవాల్సింది అధికారం చెలాయించడం కాదు, ప్రేమ చూపించడమే.

ప్రతి మానవసంబంధమూ అంతిమంగా పర్యవసించేదీ, పర్యవసించాల్సినదీ స్నేహశీలంలోనే. కొన్నిసార్లు కూఱిమి కన్నా చెలిమే గొప్పదీ, ఆత్మిక దివ్యత్వానికి నేదీయాంసమూ. లౌకికతలంలో ‘నిర్మల ప్రేమ’ అని పేర్కొనేటప్పుడు జన మనఃఫలకం మీద వాస్తవంగా స్ఫురించే వక్తవ్యార్థం స్నేహమే. మనుషులు “తాము అధికుల”మనే భేషజాల్ని కట్టిపెట్టి, ముందు తేలికపాటి హృదయంతో కూడిన నిరాడంబర స్నేహాన్ని అభ్యసిస్తే వారు మొదట మంచిమనుషులు కాగలుగుతారు. ఆ తరువాత మంచితండ్రులూ అవుతారు. మంచితల్లులూ అవుతారు. మంచిగురువులూ అవుతారు. మంచి పరిపాలకులు కూడా అవుతారు. మానవ సంబంధాల్లో లేని అధికార అనాసక్తిని ఆర్థిక వ్యవస్థలోనూ, రాజకీయవ్యవస్థలోనూ ఆశించడం కేవలం నిష్ప్రయోజనం. 

మంచి ఎవఱు చెప్పినా స్వీకరించడం 

తమ సిద్ధాంతాల మీదా సంప్రదాయాల మీదా ఉన్న వెఱ్ఱి అభిమానంతో వాటిని అవలంబించని మనుషుల్ని ద్వేషించడం, మనుషుల మీది ద్వేషంతో వారి దగ్గఱి మంచిని స్వీకరించకపోవడం- ఇవి ఈనాడు మానవాళికి సోకిన జమిలి తెగుళ్ళు. చరిత్రలో బాగా వెనక్కి వెళితే, అతిప్రాచీనకాలంలో నాగరికత ఈ మార్గంలో విస్తరించలేదని తెలుస్తుంది. పనికొచ్చే జ్ఞానం ఎక్కడున్నా వారు నిరభ్యంతరంగా స్వీకరించేవారు. కనుక ప్రతి మంచివిషయానికీ కులరంగో, మతరంగో, జాతిరంగో పులుము తున్నంత కాలం, అలా పులిమి ఎగతాళి చేస్తున్నంత కాలం మనం నాగరికులం కాలేం. ఎంతో కొంత మంచి అన్నిచోట్లా ఉందని గ్రహించాలి. అందఱిలోనూ ఉంది. కాబట్టి నచ్చిన మంచిని మెచ్చుకుని, స్వీకరించి నచ్చనివాటిని వదిలిపెట్టడమే మనం చెయ్యాల్సినది.    
 

17, నవంబర్ 2014, సోమవారం

మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు - 1

మానవజీవితం అనేక సంబంధాల్ని ప్రాపుగా చేసుకొని నడుస్తుంది. వాటిల్లో తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, అక్కాచెల్లెళ్ళూ, భార్యలూ, భర్త, పిల్లలూ, బంధువులూ, మిత్రులూ, గురువులూ, శిష్యులూ, యజమానులూ, సేవకులూ ఇలా చాలా తరహాల వారుంటారు. చెప్పిన వెంటనే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఈ మానవ సంబంధాల్లో ప్రాధాన్య క్రమమంటూ (order of priority) ఏమీ లేదు. మనిషికి అన్ని సంబంధాలూ సమానంగా ముఖ్యమే.  ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మనిషిజీవితం దుఃఖభాజనం అవుతుంది. ఎవఱు లేకపోయినా మనకు గడవదు. వాటిని పోగొట్టుకుంటే తప్ప అవి ఎంత పవిత్రమైనవో మనకర్థం కాదు. ఈ ప్రాధాన్యక్రమాలు ఏర్పడే పద్ధతిలో పెద్దగా బౌద్ధిక సంక్లిష్టతేమీ లేదు. అవి వాస్తవంగా ఏర్పడుతున్నది భౌతికసామీప్యం వల్ల. ఎందుకంటే ఒక మానవసంబంధం నుంచి భౌతికంగా/ భౌగోళికంగా దూరం జఱిగినవారు అనంతర దశలో వారిని తమ జాబితాలో కట్ట కడపటి స్థానానికి దించేయడం కానవస్తుంది.

ఈ విషయంలో మతోపదేశాల నుంచి మానవతావాదం విభేదిస్తుందని చెప్పుకోవచ్చు. మన దేశంలో పౌరాణికమతం సమాజంలో అన్నిరకాల ఎగుడుదిగుళ్ళనీ పనిగట్టుకు ప్రోత్సహించినట్లే మానవ సంబంధాల్ని కూడా రకరకాల లెక్కలతో, అంచనాలతో, పోలికలతో అది ఎక్కువ-తక్కువ చేస్తూ వచ్చింది. మళ్ళీ అందులో చాలా ప్రక్షిప్తాలు చోటు చేసుకున్నాయి. ఒక చోటనేమో తల్లిని మించిన దైవం లేదని వ్రాసి ఉంటుంది. మఱో చోటనేమో గురువుని మించిన దైవం లేడని వ్రాసి ఉంటుంది. అంటే ఆయా స్థానాలకు స్వతహాగా పూజ్యత లేదని మనం అనట్లేదు. కానీ చూడబోతే, ఆయా శ్లోకాల రచయితల వ్యక్తిగత జీవితాల్లో ఏ మానవ సంబంధమైతే ప్రముఖపాత్ర పోషించి ఉంటుందో దాన్నే ఆకాశానికెత్తుతూ, “మిగతా సంబంధాలన్నీ దాని ముందు దిగదుడుపు” అన్నట్లు శ్లోకాలు వ్రాసినట్లు గోచరిస్తుంది. మళ్ళీ ఇందులో నరకాలూ, శిక్షలూ, ఉపాలంభాలూ వగైరా.

ఏతావతా, వారివారి వ్యక్తిగత అనుభవాలతో నిమిత్తం లేకుండా అందఱూ తమలాగే భావించి తీఱాలనే ఒక రకం బౌద్ధిక నిరంకుశత్వం సదరు సుభాషితాల్లో దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ఒక ప్రాథమిక జీవిత వాస్తవాన్ని వాటి రచయితలు విస్మరించినట్లు తోస్తుంది. అదేంటంటే- ఒకఱు మఱొకఱిని ప్రేమించేదీ, గౌరవించేదీ, కేవలం సంబంధీకులు కావడం మూలాన కాదు. వారి మధ్య ఉన్న పరస్పర మన్నింపుల తీరు మూలానే. శుష్కమైన వావి-వరుసలూ, వట్టిపిలుపులూ ఏమీ చెయ్యలేవు. వాటిని సార్థకం చేసేదీ, జవసత్త్వాలు సమకూర్చిపెట్టేదీ మనసున్న మనుషులు. ఎందుకంటే అందఱిలోనూ నైసర్గికంగా స్వార్థమూ, అహంకారమూ ఉంటాయి. అవి తృప్తిపడేలా ఎవఱు తమను మన్నిస్తారో వారే వారికి ప్రియతములూ, పూజనీయులూ అవుతారు. తద్భిన్నంగా తమను బాధించినవారు తల్లైనా, తండ్రైనా, గురువైనా, భర్తైనా వారిని మనుషులు గౌరవించరు. అంటే, ఎన్ని శ్లోకాలు వల్లించినా ఆచరణలో తమ అనుభూతే తమ వేదం, తమ సుభాషితం. మందులకున్నట్లే మానవ సంబంధాల క్కూడా తుది గడువులు (expiry dates) ఉంటాయి. అవి దగ్గఱపడితే, ఏ బంధమైనా తెగాల్సిందే.

కొన్ని మానవ సంబంధాల్ని మాత్రమే అతిశయోక్తులతో ఉద్ద్యోతించడం వల్ల జనం దృష్టిలో మిగతా వాటి ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకి తల్లిని గొప్పదాన్ని చేయడం కోసం తండ్రిని తగ్గించి చూపారు. భార్యని కూడా తగ్గించారు. తల్లిదండ్రుల్ని గొప్పవాళ్ళని చేయడం కోసం గురువుల్ని తగ్గించి చూపారు. వీరందఱినీ గొప్పవాళ్ళని చేయడం కోసం దేవుణ్ణి తగ్గించి చూపారు. ఈ దృక్పథమంతా తప్పుల తడక అని వేఱే చెప్పనక్కఱలేదు. ఇదంతా బహుశా అర్వాచీన కాలంలో బయల్దేఱింది. ఎందుకంటే మన దేశపు మతం ప్రధానంగా ప్రాచీన ఉపనిషద్బోధల మీద ఆధారపడినదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఉపనిషత్తుల్లో ప్రతి జీవినీ, శక్తినీ బ్రహ్మస్వరూపంగానే అభివర్ణించారు. ఏదో ఒక ప్రత్యేక మానవ సంబంధంలోనే దివ్యత్వం పుంజీభూతమైందనే అభిప్రాయం ఋషులకున్నట్లు తత్త్వశాస్త్రాధారం లేదు. పరబ్రహ్మ కంటే భిన్నంగా పురుషులంతా దేవుళ్ళని గానీ, లేదా స్త్రీలంతా దేవతలని గానీ ప్రాచీనులు భావించినట్లు అనిపించదు. వారు సృష్టిలో ప్రతిదాన్నీ భగవత్స్వరూపంగానే చూసినట్లు కనిపిస్తుంది.

లౌకిక జీవనతలంలో, కేవలం “ఒక సన్నిహిత మానవ సంబంధం” అన్న కారణాన, ఏ ప్రత్యేకతా లేని, ఆత్మజ్ఞానం మాలిన మామూలు మనుషుల్ని దేవుళ్ళుగా భావించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మానవ సంబంధాలు దైవసమానం అనడం చేత ఆ స్థానాల్ని అధిష్ఠించినవారిని చాలా అధికారమూ, తజ్జనితమైన మదమూ ఆవహిస్తాయి. ప్రేమా, వాత్సల్యమూ తొణికిసలాడాల్సిన చోట అధికార సంబంధాలు (power relations) ఊపిరి పోసుకుంటాయి. వ్యక్తుల మధ్య ఆ అధికారం తాలూకు రాజకీయాలూ, అలాంటి ప్రవర్తనా మొదలవుతాయి. పరస్పర పిలుపులు కూడా మారిపోతాయి. తమ లోపాలు బయటపడని విధంగా వ్యవహరిస్తే తప్ప తమనెవఱూ గౌరవించరనీ, అవతలివారి గౌరవాన్ని పొందితే తప్ప తాము వారిమీద పట్టు బిగించలేమనీ భావించడం మొదలుపెట్టాక మనుషులు మనసువిప్పి మాట్లాడ్డం కూడా మానేసి ప్రతీదీ గుంభనగా రహస్యంగా ఉంచడం నేర్చుకుంటారు. వారు నాలుగ్గోడల మధ్య ఒకలా, బయట ఇంకోలా, బొత్తిగా సంబంధం లేని ద్విపాత్రాభినయాలూ, త్రిపాత్రాభినయాలూ చేయడం ప్రారంభిస్తారు. తామొక ఉన్నతస్థాయి సంబంధీకులమనే భావన వల్ల తమకు ఎదురుండకూడదనే ఉద్దేశంతో మనుషులు తమ సన్నిహితుల పట్లనే చాలా అపచారాలకు ఒడిగడతారు. ఆ రకంగా మానవ సంబంధాల వాతావరణం యావత్తూ కలుషితమైపోతుంది.

12, నవంబర్ 2014, బుధవారం

శ్రమకు తగ్గ ప్రతిఫలం, మంచిచెడుల సాపేక్షత్వం (Relativity)

మనుషులు స్వయంగా చేసుకోలేని పనుల్ని ఇతరుల చేత చేయిస్తూంటారు. అప్పుడు వారు యజమానులవుతారు. ఆ ఇతరులు వారికి సేవకులో, ఉద్యోగులో అవుతారు. పరస్పర సహాయం చేసుకోవడం వల్లనే మనుషులు మనుషులయ్యారు. కనుక సేవ పేరిట గానీ, ఉద్యోగాల పేరిట గానీ ఇతరులు మనకు చేస్తున్నది వాస్తవంగా సహాయమేననీ, దానికి మనం తగువిధంగా కృతజ్ఞత చూపాలనీ అందఱూ గ్రహించే రోజు రావాలి. స్వచ్ఛంద సహాయానికీ, ఉద్యోగానికీ మధ్య భేదం మిక్కిలి సూక్ష్మమైనది. నిజానికి ఆచరణలో రెండూ ఒకటే. ఎందుకంటే ఒకఱికి ఇష్టం లేకుండా వారిచేత మనం ఏ పనీ చేయించలేం. ఆలాగే స్వచ్ఛంద  సహాయానిక్కూడా ఏదో ఒక రూపేణ పారితోషికం ముట్టజెప్పక పోతే ఆ ఋణంలోంచి విముక్తులం కాలేం. నెనరు గల నరులమనీ, పాములకన్నా ప్రాంశుతరులమనీ అనిపించుకోలేం. కనుక ఎలాగూ తప్పనిదాని విషయంలో ఇతరులకు అన్యాయం జఱక్కుండా జాగరూకత వహించాలి.

అయితే ప్రస్తుతం ఈ యజమానుడనే మాట చాలా అపార్థంలో వాడబడుతోంది, ఇటు యజమానుల్లోనూ, అటు వారి ఉద్యోగుల్లో కూడా! యజమానుడంటే ఉద్యోగి యొక్కా, అతని కుటుంబం యొక్కా యావత్తు జీవిత పరిధికీ బాధ్యత వహించాల్సినవాడన్నట్లు మాట్లాడడం కనిపిస్తోంది. అటువంటి ఆలోచనాధోరణిలో చేసిన చట్టాలు కూడా ఉన్నాయి. ఇది సరైన ఆలోచనావిధానం కాదు. యజమానుడు కూడా ఉద్యోగుల్లాంటి మనిషే. అతనేమీ సర్వశక్తిమంతుడైన భగవంతుడు కాడు. తనకు పనిచేసి పెడుతున్నంత కాలం, ఆ చేసిన పని వఱకూ మాత్రమే అతను ఉద్యోగికి తగు పారి తోషికమివ్వాలని ఆశించడం న్యాయం. అంతకు మించి అతనిమీద భారాలు మోపడం అంటే దూర భవిష్యత్తులో వ్యాపారాల్నీ, ఉద్యోగావకాశాల్నీ దెబ్బదీయడం అన్నమాట. శ్రమకీ, సంపదకీ అభేదం. ఎందుకంటే శ్రమలోంచే సంపద పుడుతోంది. సంపద అంటే రొక్కం, ఆస్తులూ, సొమ్మూ మాత్రమే కాదు. ఏ వస్తువైనా, పదార్థమైనా సంపదే. దాన్ని ఉచితంగా తీసుకోవడమంటే ఎవఱికో పరోఽక్షం గా అన్యాయం తలపెడుతున్నట్లే లెక్క. అదీ ఒక రకం దొంగతనం కిందికే వస్తుంది. మన దేశంలో ఉచితాల మోజు మెండు. అందులోనూ ప్రభుత్వ సొమ్మయితే ఇంకా విజృంభిస్తారు.

ప్రభుత్వమేమీ మన పూర్వపుణ్యాల నిధి కాదు, హక్కులా అనుభవించడానికి. అదీ ఓ వాణిజ్యబ్యాంకులాంటిదే. దానికీ కొన్ని లెక్కలున్నాయి. దానికి మాత్రం సంపద ఎక్కణ్ణుంచి వస్తుంది? ప్రజల నుంచి సేకరిస్తేనే కదా. అంటే అదీ ఒకఱి శ్రమఫలితమే. వాళ్ళు ఎవఱనేది మీకూ, నాకూ తెలియకపోవచ్చు. కానీ అసలంటూ వాళ్ళున్న మాటైతే నిజం. కాబట్టి ప్రభుత్వ సొమ్ముని తేరగా అనుభవించడమంటే మన కంటికి కనిపించని కొందఱు పన్నుల చెల్లింపుదారుల్ని దోచుకోవడమే. ఉదాహరణకి, ప్రభుత్వం దగ్గఱ ఆహార పదార్థాలు ఉచితంగా తీసుకుంటున్నామంటే రైతుల్ని దోచుకుంటున్నామన్నమాట. మనకు ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం తన అధికారబలంతో రైతుల దగ్గఱ కారుచౌకగా వాటిని కొనుగోలు చేస్తుంది. అందుకోసం ప్రత్యేక ఉత్తర్వులూ, చట్టాలూ ప్రయోగిస్తారు. అందుచేత నిజంగా మానవత్వం ఉన్నవారెవఱూ ఏదీ ఎవఱినుంచీ ఉచితంగా స్వీకరించరు. తక్కువ చెల్లించడమే తప్పంటూంటే ఏమీ చెల్లించకపోవడం ఇంకెంత తప్పో ఎవఱికి వారు యోచించుకోవాలి. 

ముందిది అర్థం చేసుకోవాలి అందఱూను. మనమేమీ ప్రకృతిలో జీవించడం లేదు. చాలా కృత్రిమమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఉచితాలనేవి ప్రకృతిబద్ధ జీవనంలోనే, అదీ, చాలా తక్కువ జనాభా గల సమాజాలకే సాధ్యం. మనలాంటివాళ్ళకి కాదు. ప్రకృతిలోంచి దేన్నయినా ఉచితంగా కోరుకోవడానికి మనం ప్రకృతికి చేస్తున్నది ఏముంది? ఉదాహరణకి, నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చెయ్యాలని డిమాండు చేసే ముందు, అసలు మనం నీటిని పట్టి నిలవ చేయడంలో ప్రభుత్వానికిస్తున్న బాసట ఏంటి ? మనం అన్నీ వాడుకుని అవతల పారేసేవాళ్ళమే తప్ప దేన్ని ఉత్పత్తి చేస్తున్నామని, “అది ఉచితంగా కావాలి, ఇది ఉచితంగా కావాలి” అని  డిమాండు చేయడానికి? మహా అయితే మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నామంతే! ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పిస్తే జనం ఆ పట్టాలు పుచ్చుకుని విదేశాలకి పారిపోతున్నారు. “అయ్యో! ఈ దేశపు సొమ్ముతో నేను చదువుకున్నాను. ఇలా పారిపోవడం నీతి కాదు” అని ఒక్కఱైనా ఆలోచిస్తున్నారా? ఉచితాల వ్యామోహాన్ని మఱిగిన దేశం ఇలాగే క్రమక్రమంగా పరమ స్వార్థపూరితంగా, పరస్పర దోపిడీ సమాజంగా, అనుత్పాదక జనాంగంగా అవతరిస్తుంది. 

మంచి-చెడుల సాపేక్షత్వం (Relativity) 

మంచి-చెడులు ఐకాంతిక, స్వయం-సంపూర్ణ విలువలు (absolute or self-contained values) అనే నమ్మకం మన సమాజంలో చాలా బలంగా, లోతుగా నాటుకుపోయి కనిపిస్తుంది. అంటే కొన్నివిషయాలు అన్నిచోట్లా, అన్నివేళలా, అందఱికీ మంచేననీ, మఱికొన్ని ఎప్పటికీ చెడేననీ నమ్మడం. నిజానికి ప్రపంచంలో అస్తిగోపన సమాజాలు పైకి వెయ్యి నమ్మకాల్ని ప్రవచిస్తున్నప్పటికీ వాటన్నింటికీ మూలమైన కేంద్ర బిందువు ఈ ఒక్క నమ్మకమే. వాటి ఛాందసాలూ, సంకుచితత్వాలూ, అమానుషత్వాలూ అన్నీ ఈ ఒక్క నమ్మకంలోంచే ప్రభవిస్తాయి. కానీ లోతుగా ఆలోచించినప్పుడు మంచీచెడులనే వాటికి స్వంత అస్తిత్వమంటూ ఏమీ లేదు. అవి ఆయా దేశ-కాల పరిస్థితులూ, వ్యక్తులూ, వారి స్థితిగతులూ, ఇష్టానిష్టాలూ, సమయ-సందర్భాల ఆధారంగా నిర్ణయించాల్సినవి. అంటే వాటి విషయంలో గొప్ప సమయస్ఫూర్తితో కూడిన తర్కం కూడా అవసరమే. అందుకు పూర్వాయత్త సూత్రా (readymade formulas) లంటూ ఏమీ లేవు. ఈ ముక్క బోధపడాలంటే కాస్త వైవిధ్య సమాచారమూ, చరిత్రపరిజ్ఞానమూ కూడా అపేక్షితమే.

మంచిచెడులనే గణితశాస్త్రంలో అస్తిగోపన సమాజాలన్నీ ఇలాంటి మొద్దబ్బాయిలే. ఎందుకంటే ప్లస్సులూ, మైనస్సులూ అనేవి వేఱువేఱుగా ఉండవనీ ఒక ప్లస్సులో వాస్తవానికి రెండు మైనస్సులు సమద్విఖండన చేసుకుంటాయనీ వారికి తెలీదు. శౌర్యోదాత్తమైన పులీ, భీరుహృదయి అయిన పిల్లీ- అలాగే విశ్వాసపాత్రమై ప్రేమభావ భాసితమైన జాగిలమూ, క్రూరమైన తోడేలూ, ఒకే జీవజాతులకి చెందిన జంతువులని వారికి తెలీదు. ఇంకా, విహాయసంలో విహరించే విహంగాలకీ, పాతాళంలో పాకే పాములకీ పూర్వీకుడు ఒకడేనని కూడా వారెఱుగరు. అదే విధంగా, ఒకే పురుషవ్యామోహం - దానిలోని స్థాయీభేదాల వల్ల ఒకామెని స్వైరిణిగానూ, మఱొకామెని సాధ్విగానూ చేయొచ్చునని వారు గుర్తించలేకపోయారు. ఐతే ఇవన్నీ ప్రాచీన మతగురువులకు తెలుసు. కానీ వారు అవి తమలోనే గుంభనగా దాచుకున్నారు తప్ప జనసామాన్యానికి చెప్పదల్చుకోలేదు.

వారు చెప్పకపోవడానికి ప్రాసంగికమైన (circumstancial) కారణాలుండొచ్చు. ముఖ్యంగా నాటి జనసామాన్యం నిరక్షరాస్యులూ, మూర్ఖులూను. లోతు గ్రహించలేనివారికి ఇదంతా చెప్పడం వల్ల ఆ రోజుల్లో చాలా ప్రమాదం ఉంది. కనుక మతగురువులు వారికి కొన్ని విధినిషేధాల్ని మాత్రమే బోధించి, “ఇలా ఉండండి. చాలు” అనేశారు. అంటే విలువల గుఱించి నిరంతర తర్కానికి దిగే అవసరం నుంచి వారు జనాన్ని తాత్కాలికంగా విమోచించారు. ఆ విధినిషేధాలు మాత్రం బాగా ఒంట బట్టేశాయి. వాటి స్ఫూర్తేమో ఆ గురువులతోనే అంతరించింది. వాటిని బోధించిన నాటికీ, అనంతర కాలఖండాలకూ మధ్య జీవనవిధానం మారకుండా ఉన్నంతకాలమూ అవి బానే పనిచేశాయి. అవే నిఖార్సైన మంచీ, నిఖార్సైన చెడు అనిపించుకున్నాయి. కానీ నాగరికత మారిపోయాక వాటి సాందర్భికత (relevance) గుఱించి ప్రశ్నలు తలెత్తసాగాయి. 

“ఆనాడు మతగురువులు చెప్పడానికి సాహసించనిది మనమీనాడు చెప్పడం అవసరమా?” అని అడిగితే, ఇప్పుడు అవసరమే. ఎందుకంటే సమకాలీనంగా చదువుసంధ్యలు ఎంత వ్యాపించినప్పటికీ మనుషుల మంచిచెడులు మాత్రం పాతవిలువల ప్రాతిపదికనే నిర్ధారించబడుతున్నాయి. ఆ పేరుతో  మన సమాజంలో పెద్దయెత్తున మూర్ఖత్వం, డంబాచారం (hypocrisy) వ్యాపించిపోయాయి. మనల్ని పరిపాలిస్తున్న రాజకీయవ్యవస్థ, మనం జీవిస్తున్న నాగరికత, నమ్ముతున్న పాత విలువలూ– ఒకదానికొకటి పొంతన లేకుండా పోయి, ఒకే రేడియోసెట్టులో యుగపత్తుగా వినవస్తున్న మూడు స్టేషన్లలా అసందర్భమై, అయోమయమై, కర్ణకఠోరమై కూర్చున్నాయి. వాటి ముద్రతో విలువల నిర్ణయాలూ (value judgments), వాటి ఆధారంగా పరహింస పెచ్చుమీఱాయి. కనుక ఈ విలువ లేవీ స్థిరమూ, శాశ్వతమూ కాదనీ, ఇవన్నీ సాపేక్షమనీ, వీటి ఆధారంగా ఎవఱి మీదా తీర్పుతీర్చి ద్వేషించాల్సిన అగత్యం లేదనీ మన జనానికి స్పష్టీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. పూర్వంలా కాకుండా, ఏతత్కాలీనులు విద్యావంతులు కనుక ఈ సాపేక్షత్వాన్ని సమీచీనంగా అర్థం చేసుకుని మారతారని ఆశించాల్సి ఉంది. 

7, నవంబర్ 2014, శుక్రవారం

వ్యవస్థల కతీతంగా మానవత్వాన్నే అవలంబించడం

మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులు కూడా అయ్యుండాలని జనం ఆశించడం తఱచూ కనిపిస్తుంది. మానవతావాదుల్లో ప్రజాస్వామ్యవాదులున్నారు. కానీ అంతమాత్రాన వారంతా అదే అనుకోవడం సరికాదు. అదే విధంగా ప్రజాస్వామ్యవాదులంతా మానవతావాదులూ కారు. ప్రజాస్వామ్యం మన ముందున్న అనేక రాజకీయ-పరిపాలనా ఎంపికల్లో ఒకటి మాత్రమే. మానవతావాదుల అంకితభావం మానవత్వం పట్లే తప్ప ఏ ప్రత్యేక రాజకీయవ్యవస్థ పట్లా కాదు. అంటే మానవతావాదం యొక్క ఆద్య మఱియు అంతిమ శ్రద్ధాస్థానం విడివ్యక్తి మాత్రమే. వ్యవస్థలు దానికి సాందర్భికం కాదు. ఎందుకంటే  రాజకీయ వ్యవస్థలు అశాశ్వతం. మానవతావాదమే శాశ్వతమూ, సార్వజనీనమూను. ఒక దేశంలో ఈ రోజు రాజఱికం అమల్లో ఉండొచ్చు. ఱేపు సోషలిజం రావచ్చు. ఎల్లుండి ప్రజా స్వామ్యం నెలకొనవచ్చు. ఏ కాలపు వ్యవస్థ ఆ కాలపు మనుషులకు సర్వోత్తమంగా, మహోన్నతంగా దర్శనమిస్తుంది. ప్రజాస్వామ్యం ఉండడమో, లేకపోవడమో ఓ సమాజపు మానవతావాద లక్షణాల్ని పట్టివ్వదు. ఎటొచ్చీ మానవతావాద సూత్రాల్ని వ్యాప్తిచేయడం మిగతా వ్యవస్థల కన్నా ప్రజాస్వామ్యంలో ఓ పిసరంత ఎక్కువ సుకరం, అది నిజమైన ప్రజాస్వామ్యమే ఐతే.

ప్రాచీన రోమకరాజ్యం (Rome) ప్రజాస్వామికమే, శ్రేయోరాజ్యమే (welfare state). అయినా, బానిసల్ని బహిరంగంగా సింహాల కాహారంగా వేస్తే కేవుచీటీలు (tickets) కొనుక్కుని మఱీ ఆ సన్నివేశాన్ని కళ్ళారా వీక్షించి వినోదించడం పట్ల అప్పటి ప్రజల మనస్సాక్షి ఇసుమంతైనా సంచలించలేదు. బానిసలు తమ కంటే వేఱైన వర్గమనే వర్గదృష్టివల్ల వారి మానవతాదుకాణం అలా మూతపడింది.మన కాలంలోనూ వర్గాలున్నాయి. మనకీ వర్గదృష్టి ఎక్కువే. వారిలా సరిపడని వర్గాల వాళ్ళని మనం సింహాలకు ఆహారంగా వేయం (బహుశా మన కాలానికవి మఱీ ఎక్కువ లేవు గనక). కానీ దాన్తో సమానమైన ఇతరేతర అపకారాలకు ఒడిగడుతూనే ఉన్నాం. కాబట్టి వ్యవస్థ ఎలా ఉన్నా, దాన్ని నడిపే వ్యక్తుల్లో మానవత్వం గనక ఉంటే, దాని దుష్ప్రభావం ప్రజల జీవితాల మీద చాలా తక్కువగా పడుతుందని మానవతావాదులు నమ్ముతారు. ప్రజాస్వామ్యమైనా మానవతా సూత్రాల్ని సాకల్యంగా అస్థిగతం చేసుకుంటేనే  ప్రజాస్వామ్యంగా నిలవగలుగుతుంది. లేకపోతే ఓ పేద్ద డ్రామా ట్రూపుగా మిగిలిపోతుంది. 

కనుక ఇతర వ్యవస్థల్లాగానే ప్రజాస్వామ్యం కూడా మానవతావాదంలోని కొన్ని అంశాల్ని అరువు తీసుకుంది. అయితే అంతమాత్రాన అది మానవతావాదానికి పర్యాయపదం గానీ, ప్రత్యామ్నాయం గానీ కాజాలదు. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజాస్వామ్యాలన్నీ మానవతావాద సూత్రాలకు విరుద్ధంగా నడుస్తున్నవే. ఎందుకంటే ఒక వ్యవస్థలో ప్రజారోగ్యానికీ, వారి ఆర్థికతకూ సంబంధం లేకుండా ఎంత పెద్దసంఖ్యలో నిషేధ చట్టాలు పోగుపడతాయో అంతగా అది ప్రజాస్వామ్యం కాకుండా పోతుంది. అంతగా అది అమానవీయమవుతుంది. 

ప్రజాస్వామ్యాలన్నీ మెజారిటీ ఆధిపత్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటివి. కానీ మానవతావాదంలో మెజారిటీ, మైనారిటీ అంటూ ఏమీ లేవు. దాని దృష్టిలో అంతా మనుషులే. ఏ ఒక్కఱినీ అనాథగా వదిలేయొద్దని అది చెబుతుంది. సర్వే జనా స్సుఖినో భవన్తు అనేది మానవతానినాదం కాగా, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ప్రజాస్వామ్య నినాదం. ఇది గౌతమబుద్ధుడి కాలం నాటి  సిద్ధాంతం. ఆ ముక్క ఆ రోజుల్లో చెప్పిన సందర్భం వేఱు. దాన్ని నేటి సామాజిక-శ్రేయోరాజ్య అంశాల కన్వయించడం ఓ పెద్ద తప్పిదం. అదీ గాక ఈ లోపల మానవజాతి పరిభావనలు (concepts) చాలా పురోగమించాయి.

ఈ బహుళజనులు (అధిక సంఖ్యాకులు) ఎవఱో ఎవఱైనా వివరిస్తే బావుణ్ణు. ఒక జిల్లాలో ఒకానొక శ్రేణిజనం బహుళజనులైతే, వారే రాష్ట్రం మొత్తమ్మీదా లెక్కవేసినప్పుడు ఊనజనులు (అల్పసంఖ్యా కులు) అవుతారు. అదే విధంగా ఒకే ప్రదేశంలో మనుషులు తమ తమ అభిప్రాయాల్ని బట్టి కొన్నిసార్లు బహుళజనులూ, మఱికొన్నిసార్లు ఊనజనులూ అవుతారు. ఒక మానవసమూహం బహుళ జనులు అనిపించుకోవడానికి అది మొత్తం జనాభాలో 51 శాతంగా ఉండాలా? 60 శాతంగా ఉండాలా? 70 శాతంగా ఉండాలా? అది ఎవఱూ ఖచ్చితంగా చెప్పలేరు. మిగతా జనంలో ఒక్కొక్క వర్గమూ 5 -10 శాతం కంటే ఎక్కువ లేరనే కారణం చేత కేవలం 30–40 శాతమే ఉన్న వర్గాలు కూడా కొన్నిసార్లు బహుజనులుగా లెక్కవేయబడుతున్నారు. ఓ చిన్న కుగ్రామంలోనో, సభలోనో 99 శాతం మంది ఒక వైపూ, మిగతా ఒక్కశాతం మందీ ఇంకో వైపూ ఉంటే ఆ 99 శాతం మంది యొక్క పైచేయి మనకు పెద్ద అభ్యంతరకరంగా గానీ, హానికరంగా గానీ అగుపించదు. కానీ ఆ సూత్రాన్నే ఇంకా బృహత్తర స్వరూపాలకు అనువర్తిస్తే శక్తి-అసమతూకం మూలాన ఘోరాలూ, అన్యాయాలూ, అణచివేతలూ జఱిగిపోతాయి. ఉదాహరణకి, ఒక దేశంలోనో, రాష్ట్రంలోనో 1% అంటే ఆ జనాభా లక్షల్లోనూ, మిలియన్లలోనూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆ ఒక్క శాతమే కోట్లల్లో ఉంటారు.

“మైనారిటీలు ఏ శంకరగిరి మాన్యాలు పట్టిపోయినా ఫర్వాలేదు. మెజారిటీ బావుంటే చాలు” ననే వారు, తమ వాహనాల ఇంధనంలో 10% కల్తీ చేసినా ఫర్వాలేదనీ, తాము తినే అన్నంలో 1% విషం కలిసినా ఫర్వాలేదనీ అనరు కదా ! అనాథగా వదిలివేయబడ్డ ఒకఱి విషాదం కాలక్రమంలో పది మందికి అంటుకుంటుంది. మైనారిటీ అంటే ఇప్పుడు అపార్థం చేసుకోబడుతున్నట్లు మహ్మదీయులో క్రైస్తవులో కాదు. మన ఆదరణకు నోచుకోవడానికి ఓ వ్యక్తి మెజారిటీకో,  మైనారిటీకో చెందనక్ఖర్లేదు. అతనూ మనలాగే ఓ మనిషీ, మనం అనుకున్న పనికి పనికొచ్చేవాడూ అయితే చాలు. మెజారిటీలే తప్ప మైనారిటీలు మనుషులు కారన్నట్లూ, వారికి హక్కులే లేవన్నట్లూ ధ్వనించే ఈ రకమైన అశాస్త్రీయ మెజారిటీవాదంతో మైనారిటీజనాన్ని నిర్లక్ష్యం చేసినా, అణగద్రొక్కినా వారు జాతిగొలుసులో అత్యంత బలహీన లంకెలు (weakest links in the chain) గా మారతారు. మనకు భావిప్రమాదం ఖచ్చితంగా అక్కణ్ణుంచే పొంచి ఉంటుంది.

కాబట్టి ప్రతిఒక్కఱి ఇష్టానిష్టాలకూ– అవి మిగతా సమాజపు అభిరుచుల నుంచీ, అభిప్రాయాల నుంచీ ఎంతగా భేదించనివ్వండి- విలువివ్వాల్సిందే. సమాజంలో ఓ మూల స్థానం కల్పించాల్సిందే. అలాగే వారివారి వ్యక్తిగత జీవనవిధాన ఎంపికల్నీ ఆమోదించాల్సిందే. మనుషుల్ని నిర్జీవ గణాంకాలు (statistics) గా, శాతాలుగా చూసే ధోరణి పోయి సజీవులైన ఆత్మలుగా, వారి జీవితాల్ని జీవితాలుగా చూసే గంభీర దృష్టికోణం మనలో పెంపొందాల్సి ఉంది. తేలిగ్గా నిర్ణయాలు తీసుకునే ఉపాయంగా మొదట్లో అమల్లోకి వచ్చిన ఈ అంకెల గారడి- ఈ మెజారిటీవాదం నేడు విశ్వరూపాన్ని ధరించి, వేస్తున్న వెఱ్ఱితలల విషయం అంతా ఆకళింపు చేసుకునే శుభదినం రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కఱూ ఏదో ఒక విధమైన మైనారిటీవర్గం కిందికే వస్తారు.
 

3, నవంబర్ 2014, సోమవారం

జనామోదితమైన క్రమానుగత మార్పులు

మార్పును ఆహ్వానించడం ఎంత ముఖ్యమో, ఆ మార్పు క్రమానుగతం (gradual) అయి ఉండడం కూడా అంతే ముఖ్యం. జనం మీద హఠాన్ మార్పుల్ని రుద్దడం అసహజమే కాక, అమానవీయం కూడా! ఈ విషయంలో ప్రకృతి బాటే మనుషులకు అనుసరణీయం. హఠాన్ మార్పులు మనుషుల జీవితాల్లో సామూహిక దుఃఖాన్ని ప్రోదిచేస్తాయి. అందుచేత మార్పులనేవి జనామోదాన్ని పడసినవి కూడా అయ్యుండాలి. ప్రజలు కోరుకోని, వారు ఇష్టపడని మార్పులు విఫలమవుతాయి. మార్పుల్ని బలప్రయోగ పూర్వకంగా పైనుంచి జనం మీద రుద్దడమే మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా జఱిగింది. ఈ పోకడ అంతరించాలి. సమాజానికి మార్పుల అవసరం నిజంగా ఉంటే వాటంతట అవే వస్తాయి. ఎవఱూ రుద్దాల్సిన పనిలేదు. సమాజమే వాటి కోసం ఆకలిగొని ఉంటుంది. ఇతరుల్ని మార్చదల్చు కున్నవారికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధామైనది భూదేవంత ఓర్పు. 
 

దేనికీ అంకితం కాకపోవడం
 

పురోగత బృహత్ సమాజాలకి ఉన్మాదులూ (fanatics) క్రూసేడర్లే తప్ప మామూలు మనుషులు అవసరం లేదు. వాటికి గౌతమబుద్ధుల కంటే హిట్లర్లతోనే ఎక్కువ అవసరం. అంకితం కావడం (అంకితభావం), విశేషిత నైపుణ్యాల (specialization/ specialized skills) పేరుతో సంస్థలూ, వ్యవస్థలూ అన్నీ, తమకి పనికొచ్చే ఏదో ఒక్క విషయం తప్ప జీవితంలో ఇహ దేని గుఱించీ ఆలోచించలేని ఏకోన్మాదుల (monomaniacs) కోసం ఆబగా స్వప్నిస్తాయి. సార్థవాహాల (companies) కేమో పని-ఉన్మాదులు (workaholics) కావాలి. విద్యాలయాలకి బోధనోన్మాదులూ, పఠనోన్మాదులూ కావాలి. ప్రభుత్వానికి దేశభక్త్యున్మాదులు కావాలి. కుటుంబాలకి సంపాదనోన్మాదులు కావాలి. వారిలోనే మఱికొందఱికి ప్రేమోన్మాదులు కావాలి. రాజకీయపక్షాలకేమో సకల సబ్బండు రకాల ఉన్మాదులూ కావాలి. ఇహపోతే కొన్నిసంస్థలకి లింగోన్మాదులూ, మఱికొన్నిటికి సిద్ధాంతోన్మాదులూ కావాలి. ఈ వాతావరణంలో వైవిధ్య అభిరుచులున్నవాడూ, ఏదో ఒక ఉన్మాదాన్ని ప్రదర్శించలేని వాడూ తప్పబుట్టినట్లే జమ. ఒకవేళ మనుషుల్లో ఉన్మాదస్థాయి తాము ఆశించినంతగా లేకపోతే దాన్ని పెంచడానికి అవసరమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టిస్తారు కూడాను.

ఈ కాలపు మనుషుల్లో మానవత్వం నశించిపోతూండడానికి specialization, అంకితభావం, ఉద్యమస్ఫూర్తి అంటూ నానా పేర్లతో చెలామణి అవుతున్న ఉన్మాదాలొక ప్రధానకారణం. తమ ఉన్మాదానికి ఉపకరించని అంశాల్ని అధికరించి ఏం చెప్పినా, విన్నా, “నాకు సంబంధం లేదు. నేను చేయగలిగిందేమీ లేదు. అది నా సబ్జెక్టు కాదు. నా డిపార్టుమెంటు కాదు” ఇదీ ధోరణి. ఇంతటితో ఆగిపోతే బావుణ్ణు. కానీ అలా జఱగదు. తమను తాము అంకితం చేసుకున్నవారు అది చాలా గొప్పదనీ, ప్రజలకి తప్పనిసరిగా మేలుచేస్తుందనీ గ్రుడ్డిగా నమ్ముతారు గనుక, దానితో ఏకీభవించనివారంతా వీరి దృష్టిలో రాక్షసులే, సర్వనాశనం చేయదగ్గవాళ్ళే. ఆ విధమైన మానసిక ధోరణిలో అవతలివారి పట్ల వీరు ఒడిగట్టని అపచారాలుండవు.

ఇలా అంకితం కావడం గుఱించి ప్రకృతిమాత అభిప్రాయమేంటి ? ఆవిడ దీన్ని ఆమోదిస్తోందా ?

ప్రకృతి ఏ వస్తువునీ ఒకే ఒక్క ప్రయోజనంతో, కేవలం దానికే అంకితం చేసి నిర్మించినట్లు కనిపించదు. ప్రపంచంలో ప్రతిదానికీ రెండుమూడు ప్రయోజనాలూ/ కర్తవ్యాలూ ఉన్నట్లు కనిపిస్తుంది. అన్నీ బహుళార్థక చేపట్టులే (muti-purpose projects). ఒకే నీరు బ్రతికిస్తుంది. పంటలు పండిస్తుంది. చల్లబఱుస్తుంది కూడా. ఒకే పురుషుడు ఒక స్త్రీని రక్షిస్తాడు, పోషిస్తాడు, సాహచర్యమిస్తాడు, సుఖపెడతాడు, సంతానాన్ని కలిగిస్తాడు. ఆ సంతానాన్ని మళ్లీ తానే పైకి తీసుకొస్తాడు. ఆ పనికొకఱూ, ఈ పనికొకఱూ అనే ఏర్పాటు లేదు. అదే విధంగా ఒకే స్త్రీ ఒక సమయంలో తల్లిలా, మఱో సమయంలో భార్యలా, వేఱే సందర్భంలో స్నేహితురాలిలా ఉంటుంది. మన శరీరాలనే తీసుకుంటే ప్రతి ఇంద్రియానికీ ఒక ఉద్యోగాన్నీ, ఒక వినోదాన్నీ కూడా ప్రకృతి ఏర్పఱచింది. కేవలం ఉద్యోగమో, వినోదమో కలిగిన ఇంద్రియం ఒక్కటీ లేదు. ఒక ఇంద్రియం చేసే ఉద్యోగం కూడా ఒకటి కాదు, రెండు-మూడున్నాయి. ముక్కుతో గాలిపీల్చుకుంటాం. వాసన కూడా చూస్తాం. నోటితో తింటాం, మాట్లాడతాం కూడా!

అంకితం కావడమనేది మన మనస్తత్త్వాల మీద సూక్ష్మంగా చూపే ప్రతీప ప్రభావం (negative impact) ఘోరమైనది. దైనందిన జీవితంలో అది పైకి కనిపించకపోవచ్చు. కానీ దాని పర్యవసానాలు మాత్రం బాధాకరంగా తేల్తాయి. ముఖ్యంగా, దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంలో అది మన తెలివితేటల్ని మబ్బుతో కప్పేస్తుంది. మనలో ఏకపార్శ్వ దృక్పథాన్ని (one-sided outlook) ని పెంపొందిస్తుంది. ఉదాహరణకి, మన దేశంలో అందఱూ కుటుంబానికి సర్వాత్మనా అంకితులు. పలువుఱికి కుటుంబం కంటే వేఱే జీవితం గానీ, ఆసక్తులు గానీ లేవు. ఫలితార్థంగా కుటుంబానికీ, దాని సభ్యులకీ సంబంధించిన ప్రతి విషయమూ ఇక్కడ హబుల్ టెలిస్కోపంత భూతద్దంలో చూడబడుతుంది. దానిగుఱించి ఇక్కడ హోరాహోరీ ప్రపంచయుద్ధాలైపోతూంటాయి. అవినీతి కూడా, గృహస్థులు తమ కుటుంబాల భవిష్యత్తు గుఱించి విపరీతంగా ఆందోళన చెందడం వల్ల జఱుగుతోంది. అందువల్ల కొన్ని విషయాల్ని “ఎలా జఱిగితే అలా జఱగనీ” అనుకునేటంత పరిపక్వత ఈ దేశస్థులకి ఎన్నాళ్ళు గడిచినా రావడం లేదు. మన అంకితభావాల్ని ఇతరులు ఉపయోగించుకుంటారు తప్ప దాని వల్ల మనకు కలగబోయే అదృశ్యనష్టాలకి ఎవఱూ పరిహారం చెల్లించరని జనం గ్రహించే రోజు రావాలి.

29, అక్టోబర్ 2014, బుధవారం

కృతజ్ఞత చూపడం, వర్తమానంలో జీవించడం, మార్పుని అంగీకరించడం

కృతజ్ఞత చూపడం

నిజానికి ఇది మానవుల్లో తఱచూ కానవచ్చే లక్షణం కాదు. ప్రయత్నపూర్వకంగా అభ్యసించవలసినదే. అయినా ఇది మానవ సంబంధాల్ని మెఱుగుపఱుస్తుంది కాబట్టి మానవతాసూత్రాల్లో భాగమైతే బావుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ చేర్చడం జఱిగింది. తాము ఇతరులకు చేసిన మేలు గుర్తున్నంతగా వారు తమకు చేసిన మేలు మానవులకు గుర్తుండదు. అదే విధంగా, ఇతరులు తమకు చేసిన కీడు గుర్తున్నంతగా వారు చేసిన మేలు గుర్తుండదు. మానవులు ఈ దౌర్బల్యాల నుంచి విముక్తులై ఇతరులు చేసిన మేలును గుర్తుంచుకోవడమూ, వారు చేసిన కీడును మర్చిపోవడమూ నేర్చుకోవాలి.

మానవ సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునేవేనని ఉపయోగవాదులు (utilitarians) అంటారు. అంటే అవన్నీ వ్యాపారమేనని అన్యాపదేశంగా చెప్పడమన్నమాట. వ్యాపారమంటే ఇచ్చిపుచ్చుకోవడమైతే ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో అవసరమే కాదు, కృతజ్ఞతాభావమూ, అవతలివాళ్ళని దోచుకోకూడదనే ఆత్మసాక్షీ ఇమిడి ఉన్నాయి. కనుక వ్యాపారానిక్కూడా మానవతావాదమే మూలం. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడమూ, పెద్దల పట్ల గౌరవం చూపడమూ, వారికి సేవచేయడంలాంటి ఆదర్శాలు కూడా మౌలికంగా కృతజ్జతాభావాన్నే ఆశ్రయించుకుని ఉన్నాయని మఱువరాదు.


వర్తమానంలో జీవించడం

దీనికీ క్షమాగుణానికీ కాస్త సంబంధం ఉంది. గమనిస్తే, మానవ సంబంధాలు విషమించడానికో ప్రధానకారణం- మనుషులు గతానుభవాల్ని  మఱవలేకపోవడం. గతం నుంచి పాఠాలు నేర్వాలి. నిజమే. మనిషి అనుభవాన్ని గడించాలి. అదీ నిజమే. కానీ గతాన్ని వర్తమానంలో ఓ అవిభాజ్య భాగంగా చేసుకోవడమూ, దాన్ని కృత్రిమంగా బ్రతికించడమూ, వర్తమానాన్ని ప్రభావితం చేసేందుకు దాన్ని అనుమతించడమూ, ఏనాడో జఱిగిపోయినది ఇప్పుడు కూడా కళ్ళెదుటే జఱుగుతున్నంత సంరంభంతో ఉద్విగ్నం కావడమూ- ఇదంతా శోభస్కరం కాదు. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఈ ధోరణి చాలా ఎక్కువ. ఏనాడో శతాబ్దాల క్రితం జఱిగిన హత్యలకీ, మానభంగాలకీ, ఆస్తుల విధ్వంసానికీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనేవారున్నారు. ఏనాటిదో వెనకబాటుకు ఇప్పుడు ఇతర వర్గాల్ని ద్వేషించేవారు ఉన్నారు. రెండు-మూడేళ్ళనాటి మానభంగానికో, వేధింపులకో ఇప్పుడు కేసులు పెట్టేవారున్నారు.

ఇలాంటి తిక్కలన్నింటికీ మన వ్యవస్థ, సంస్కృతీ ఆనందంగా మద్దతు పలుకుతాయి. పౌరులంతా ఖచ్చితంగా గతంలోనే జీవించాలనేది ఇక్కడ ఓ చట్టంలాగా అమలవుతోంది. గతాన్ని మఱవలేని వాళ్ళు గొప్ప సెంటిమెంటల్ మనుషులన్నట్లూ, ఆ సెంటిమెంట్లు ఉన్నవాళ్ళే నిఖార్సైన మానవతావాదులన్నట్లూ ప్రచారమవుతోంది. దీనికో చీకటిపార్శ్వం కూడా ఉందనీ, ఇది చాలా అమానుషాలకు ఆస్పదం కాగల ధోరణి అనీ చెప్పడానికి విచారిస్తున్నాను. ఒకప్పుడు ఐరోపాలో జఱిగిన మిలియన్లాది యూదుల ఊచకోతకు అసలుకారణం పూర్తిగా హిట్లర్ కాదు. నిజానికి అటువంటి హిట్లర్ ని ఉత్పత్తి చేసినది గతంలో జీవించే ధోరణే. గతాన్ని మర్చిపోయి చూస్తే ఐరోపా యూదులు మిగతా అందఱు యూరోపియన్లలాంటివాళ్లే. ఏ వ్యత్యాసమూ లేదు.

కానీ ఎంత వద్దన్నా జనం గతంలోనే బ్రతుకుతూంటారు.  ప్రతివారూ తమ అసలు వయసుకన్నా పదేళ్ళో, పదిహేనేళ్ళో చిన్నగా ఆలోచిస్తూంటారు. ఉదాహరణకు 60 ఏళ్ళవాడు 45-50 ఏళ్ళవాడి మూడ్ లో ఉంటాడు. 2014 లో ఉన్న మనుషులు 2000 నాటివో 1990 నాటివో ఆలోచనలు చేస్తూంటారు. దేశాలేమో 70-80 ఏళ్ళనాటి మూడ్ లో ఉంటాయి. కులాలు వందలాది ఏళ్లనాటి మూడ్ లో ఉంటాయి. మతాలేమో వేలాది ఏళ్ళనాటి మూడ్ లో ఉంటాయి. ఇది గాక  మనుషులు ఇతరుల్ని కూడా రకరకాలుగా గతంలో ఉంచేస్తారు. పాఠ్యపుస్తకాల ద్వారా గతంలో ఉంచేస్తారు. చరిత్ర ద్వారా ఉంచేస్తారు. సంస్కృతి ద్వారా ఉంచేస్తారు. చట్టాల ద్వారా ఉంచేస్తారు. సైద్ధాంతిక భావజాలాల ద్వారా ఉంచేస్తారు. ఆచారాల ద్వారా ఉంచేస్తారు. సాహిత్యం ద్వారా ఉంచేస్తారు. ఏతావతా జనం తగినంత తాజాభవించకుండా (update కాకుండా) చూడ్డమే అన్ని వ్యవస్థల పరమార్థంలా కనిపిస్తుంది.

మన దేశంలో నాలుగైదు తరాలనాటి సంఘసంస్కరణనే సంస్కరణగా అదే తుదిపలుకుగా భావించే వారున్నారు. ఆ సంస్కర్తల పేర్లే తల్చుకుంటూ, ఆ ప్రస్తావనకు సంబంధించి నాటి పుస్తకాలే చదువుకుంటూ అద్భుత రసానందాన్ని పొందేవారున్నారు. ఇహ ఆ తరువాత ఏ సంస్కరణా అవసరం లేదనీ, చెయ్యాల్సినదంతా ఆ సంస్కర్తలే చేసేశారనీ వారి అప్రకటిత అంతర్భావన. కానీ ఈ వ్యాస పరంపర చదువుతున్నవారందఱికీ తెలుస్తుంది, అది నిజం కాదని ! ఆ సంస్కర్తలు తమ సమకాలీన సమస్యలకు స్పందించారు. అందువల్ల వారు గొప్పవారయ్యారు. మనం మన కాలపు సమస్యలకు స్పందించడం లేదు. స్పందించలేకపోతున్నాం. ఆ కాలపు సంఘసమస్యల దృష్టితోనే ఈ కాలాన్ని కూడా చూడడం వల్ల ఈ కాలానికే విలక్షణమైన సమస్యల్ని గుర్తుపట్టలేకపోతున్నాం, రోజూ అనుభవిస్తూ కూడా!

ఒకవేళ  స్పందించినా ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే అన్నిరంగాలూ రాజకీయవాదుల హస్తగతమయ్యాయి. అన్ని ప్రస్తావనలూ (topics) మధ్యతరగతి మేధావుల పట్టుదప్పిపోయాయి. అన్ని వర్గాలూ రాజకీయపక్షాల ‘సెల్స్’గా, ‘మోర్చాలు’గా మారాయి. ప్రజాస్వామ్యం పేరుతో పార్టీల నిరంకుశత్వం అమల్లోకొచ్చింది. దేని గుఱించి మాట్లాడితే ఎవఱికి కోపం వస్తుందోనని నోరు మూసుకుని ఓ మూల కూర్చోవడం అలవాటు చేసుకున్నాం. అందుకే ఇప్పటికీ ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మంది మాట్లాడినా ఆ కన్యాశుల్కమే. ఆ బాల్యవివాహాలే, ఆ వితంతు పునర్వివాహాలే, ఆ సతీ సహగమనమే. మన దగ్గఱ మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేని పరిస్థితి.

గతం నుంచి పాఠాలు నేర్వడమన్నా, అనుభవాన్ని గడించడమన్నా అందులోని మంచిని స్వీకరించడమే తప్ప మఱింకేమీ కాదు. గతమూ, అనుభవాలూ ఎల్లవేళలా మనకి సత్యాన్నే ఆవిష్కరించి పెడతాయనే మూఢవిశ్వాసం నుంచి ప్రజలు ఇహనైనా బయటపడాల్సి ఉంది. అవి కొన్నిసార్లు తప్పుడు సందేశాల్ని కూడా మోసుకు రావచ్చునని మఱువరాదు. గతం నుంచి నేర్చుకుంటున్నామనే పేరుతో మనుషులు వాస్తవంగా చేసేది, ఎప్పుడో చచ్చిన పాముల్ని ఇంకా ఇంకా చంపుతూనే ఉండడం. ఇందుకసలైన కారణం, మనం నేర్చుకోవడానికి కాక రియాక్టవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం.

మనుషులు ఒక వయసొచ్చాక ఎదగడం మానేస్తారు. ఇది ఎదగలేక కాదు, ఎదగడం ఇష్టం లేక! కానీ ఎంత ఇష్టం లేకపోయినా, తమకు తెలియకుండా ఎంతో కొంత ఎదుగుతూనే ఉంటారు, చనిపోయే దాకా! తమకు తెలిసినదే చాలనుకోవడం, అదనపు పరిజ్ఞానం తమకు అవసరం లేదనుకోవడం, జీవితంలో కేవలం ఒకటి-రెండు లక్ష్యాలే పెట్టుకుని వాటికే తమ తనువుల్నీ, మనసుల్నీ అంకితం చేసుకోవడం ఎదగలేకపోవడానికి గల కారణాలు. ఇది నిరంతరాయంగా గతంలో జీవించడానికి దారితీస్తుంది.


మార్పుని అంగీకరించడం

దీనికీ వర్తమానంలో జీవించడానికీ కాస్త సంబంధం ఉంది. మార్పుని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేకపోవడం మానసికంగా గతంలో జీవించడం వల్లనే. మానవుల గతాన్ని పురస్కరించుకొని వారు ప్రస్తుతం ఉండాల్సిన పద్ధతిని నిర్దేశించడం అశాస్త్రీయం. మానవుల స్థితులూ, పరిస్థితులూ, జ్ఞానమూ, దృక్కోణమూ, శక్తిసామర్థ్యాలూ అన్నీ మారిపోయాక వారు గతంలో మాదిరే వ్యవహరించడం సాధ్యం కాదు. వారిలాగే, వారితో ఇతరులు కూడా. కనుక మానవసంబంధాల్లో వచ్చే ఈ గుణాత్మకమైన వ్యవహరణ పరిణామానికి తలవంచి బ్రతకాలి.

24, అక్టోబర్ 2014, శుక్రవారం

మానవతావాదాని కనుగుణంగా చట్టాల రూపకల్పన-2

వ్యవస్థ మీద – నష్టపోయినవారికి న్యాయం చేసే బాధ్యత ఎంతైతే ఉందో, ఏ తప్పూ చేయనివారినీ, వారి పరువుప్రతిష్ఠల్నీ కడుపులో పెట్టుకుని కాసే బాధ్యత కూడా అంతే ఉంది. కానీ వర్తమాన సమాజం ఈ రెండో బాధ్యతని గాలికొదిలేసిన వైనం గోచరిస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం - మానవతావాదమంటే ఏంటో బొత్తిగా తెలీని మనలాంటి దేశాలతో పాటు అది బాగా తెలిసిన పురోగత దేశాలతో సహా  ప్రపంచవ్యాప్తంగా ఆరోపకుల న్యాయమే (Accusors’ justice) అమల్లో ఉంది. అంటే ఆరోపించినవారి మాటల్నే పాటిగా తీసుకుని ఆరోపితుల (accused) ని అవమానించడం, బద్నాం చేయడం, వారి హక్కుల్ని హరించడం, ఏ అనుమానమొస్తే ఆ అనుమానం ప్రకారంగా కొత్తకొత్త సెక్షన్లు బనాయించి ఇఱికించడం, తప్పు చేయలేదని రుజువుచేసుకునే బాధ్యతని ఆరోపితుడి మీదే పెట్టడం, ఆరోపణల వెనక పకడ్బందీ కుట్రలుండొచ్చుననే గతానుభవ గుణపాఠాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆరోపకులు చెప్పినదల్లా నమ్మేసి, ఆ ప్రాతిపదికన విచారణ జఱపడం, ఆరోపకులకు సంపూర్ణ విశ్వసనీయత, వారికి రాజపూజ్యం- ఇవన్నీ ఈ Accusor’s justice లో భాగం.

దీన్ని పూర్వశతాబ్దాల పాలకులు కనిపెట్టగా, దాన్ని సరిదిద్దడం మానేసి, సమకాలీనులు సైతం, తమ తమ వ్యూహాల కొద్దీ యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఫలితార్థంగా Accusor’s justice కి సంబంధించిన పలు అన్యాయపు టధికరణాలతో మన చట్టాలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తి ఏకపక్ష ధోరణితో కూడిన ఈ ఆరోపకుల న్యాయం విక్రేతల విపణి (sellers’ market) కంటే ఎక్కువ ధర్మబద్ధమైనది కాదని అందఱూ గ్రహించే రోజు రావాలి.

ఇదే క్రమంలో – తమ అదుపులో ఉన్నవారి పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని కూడా మానవతావాదం అంగీకరించదు. అదుపులో లేకపోయినా అనుమానితుల్ని హింసించడం, లేదా మనసులో ఇంకేదో పెట్టుకుని కేవలం అలా హింసించడం కోసమే మనుషుల్ని ఏదో ఒక వంకతో అదుపులోకి తీసుకోవడం– ఇవి కూడా మానవతావాదానికి విరుద్ధమే. హింసకు తాళలేక ఒకడు ఓ పనిని తన మీద వేసుకుంటే అది హింసకుల విజయం కాదు. అలా హింసించి ఒప్పించడమే కరెక్టంటే మనకో వ్యవస్థ అవసరమే లేదు. ఏ దారిన పోయే దానయ్యని అందుకు అనుమతించినా అతను కూడా చెయ్యగలడు. విచారకరమైన విషయమేంటంటే తమదాకా రానంతవఱకూ అందఱూ ఈ అలవాటుని సమర్థిస్తారు. పవిత్రులమనుకునేవారు అపవిత్ర పద్ధతుల్ని  సమర్థించకూడదు. న్యాయాన్ని అమలు జఱిపే పద్ధతి కూడా న్యాయంగానే ఉండాలి.

నేఱస్థులు కూడా మనుషులేనని మానవతావాదం పేర్కొంటుంది. నేఱం ఆరోపించక ముందటి క్షణం దాకా వారు మనతో పాటు పుట్టి, మనతో పెఱిగి మన మధ్య తిరిగినవారే. అలాంటివారిని హఠాత్తుగా అస్పృశ్యుల్నీ, హక్కురహితుల్నీ చేయడం తగదు. నేఱాలకు వాటిని చేసిన వ్యక్తుల్నే పూర్తి బాధ్యులు గా చిత్రించడం కూడా సరికాదు. నిజానికి అందుకు పరోఽక్ష కారణం సమాజమే. సమాజం వ్యాప్తి చేసే తప్పుడు భావజాలమూ, అది సృష్టించే పరిస్థితులూ మనుషుల్ని నేఱాలకు పురికొల్పుతున్నాయి. ఇవి గాక చట్టాల ద్వారా కృత్రిమంగా సృష్టించబడే నేఱాలు కొన్ని ! నేఱారోపణలు లేని వ్యక్తులకుండే అన్ని పౌర, మానవ హక్కులూ ఆరోపితులకీ, నేఱస్థులకీ సైతం ఉన్నాయి, ఉండాలి.


న్యాయమనేది ఈ కాలంలో కలవారికీ, లేనివారికీ సమానంగా అందని ద్రాక్షే. ఎందుకంటే దాన్ని ప్రభుత్వమూ, రాజకీయ పక్షాలూ, వాటి అనుబంధసంస్థలూ, అనుబంధ మీడియా శాసిస్తున్న ఘోర దుర్దశలోకి వచ్చిపడ్డాం. మన చట్టాలు కొన్ని సినిమా స్క్రిప్టుల్లాంటివి. వాటిల్లో ఒక హీరో, ఒక హీరోయినూ, ఒక విలనూ, ఒక కమెడియనూ అందఱూ ముందే నిర్ణయమైపోయి ఉంటారు. కనుక ఎవఱు ఎవఱిమీద వ్యాజ్యం వేస్తే ఎవఱు గెలుస్తారో పసిపిల్లవాడు కూడా చెప్పేయగలడు. అందుకోసం మనకో వకీలు అవసరం లేదు. వీటి స్థానంలో మానవతాదృక్పథంతోనూ, సర్వజన సమదృష్టితోనూ కూడి “కక్షిదారుల్లో మేము సూచిస్తున్న ఒకఱి పక్షాన నిలబడి తీఱాల్సిందే” నంటూ పోలీసుల్నీ, న్యాయమూర్తుల్నీ ఒత్తిడిచేయని, మనస్సాక్షి కనుగుణంగా నిర్వర్తించాల్సి ఉన్న వారి స్వచ్ఛంద వృత్తిధర్మంలో జోక్యం చేసుకోని, తటస్థ -నిష్పక్షపాత-ఉదారవాద చట్టాలొస్తే బావుంటుంది.

మనకు ఈ మానవనిర్మితమైన ప్రత్యక్ష నరకాల స్థానంలో పరివర్తనాలయాలు (Reformatories) కావాలి. సంపన్న కుబేర మీడియా, ప్రయోజన గుంపులూ, కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న సమకాలీన Street justice/ Rowdy justice స్థానంలో Professional justice కావాలి. నానా రకాల రాగద్వేషాల వల్లా, ప్రలోభాల వల్లా, పక్షపాతాల వల్లా ప్రచోదితులైనవారిచ్చే తప్పుడు సాక్ష్యాల / తీర్పుల స్థానంలో వాస్తవికమైన భౌతిక రుజువుల మీద ఆధారపడ్డ Scientific justice కావాలి. 


విదేశీయుల పట్ల కూడా దయనూ, ఆదరాన్నీ ప్రదర్శించడం

నేడు విదేశీయులంటే ప్రపంచవ్యాప్తంగా నిరసనభావమూ, ద్వేషమూ ఉన్నాయి. కొన్నిసార్లు తమ ప్రాంతానికి చెందినవారు కాకపోతే స్వదేశస్థుల్ని కూడా ద్వేషిస్తున్నారు. వట్టి ద్వేషించడంతో ఆగకుండా కొండొకచో దోపిడీకి, చట్టబద్ధ/ చట్టవిరుద్ధ హింసలకీ, కించపఱపులకీ పాల్పడుతున్నారు కూడాను. దీనికి మూడు కారణాలు: 

ఒకటి– తాము తమ దేశానికి/ ప్రాంతానికి వేలాది సంవత్సరాలుగా పాతకాపులమనే విశ్వాసం. అందువల్ల తమ ప్రాంతం తమ తరతరాల పిత్రార్జితమూ, గుత్తసొత్తూ అనే అభిప్రాయం. 

రెండోది– ఇదివఱకు సాయుధంగా వలసొచ్చిన కొందఱు విదేశీయులతో తమకు కలిగిన రాజకీయానుభవాల చేదు. 

మూడోది– విదేశీయులు/ పరప్రాంతీయులు తమకంటే తెలివైనవారో, బలవంతులో కావచ్చు గనుక, వారు తమ వనరుల్నీ, అవకాశాల్నీ దొఱకబుచ్చేసుకుని తమకు లేకుండా చేస్తారేమోనన్న భయం.

సుదూర చరిత్రని గమనంలో ఉంచుకున్నప్పుడు ఏ దేశమూ ఏ మానవ సమూహపు గుత్త సొత్తూ కాదని అర్థమవుతుంది. మానవసమూహాలు ఇప్పుడున్న దేశాల్లోనే ఐదువేలేళ్ళ క్రితం లేరు. ఇంకో ఐదు వేలేళ్ళ తరువాత వీరెక్కడికి వెళ్ళబోతారో తెలీదు. ప్రతి మానవ సమూహమూ ప్రస్తుతం తనదిగా భావిస్తున్న దేశానికి/ ప్రాంతానికి బైటినుంచి వచ్చినదే. దేశాలు జాతుల గుత్తసొత్తులనే అభిప్రాయం ప్రబలిపోవడానికి కారణం, క్రీ.శ. 14–15 శతాబ్దుల నుంచి వ్యాప్తిలోకొచ్చిన జాతీయవాదం. తత్కాలీనులకి అది ప్రగతివాదం, అభ్యుదయవాదం. ఆ యుగీన జీవితాలకి అదే ఓ పెద్ద మానవతావాదం కూడా. 

ఆ మనోవైఖరికి భౌతిక కారణాలున్నాయి. ఆ రోజుల్లో గుఱ్ఱాలు తప్ప వేఱే రవాణా సౌకర్యాలెఱగరు. రాజ్యాల భౌగోళిక అధికార పరిధి ఆ విధమైన రవాణాపరిమితుల చేత సీమితమై ఉండేది. వారి నెత్తిమీద సువిశాల సామ్రాజ్యాలు కూడా లేకపోలేదు. కానీ ఆ సమ్రాట్టులెవఱూ నేరుగా కాక జిల్లాస్థాయి రాజుల ద్వారానే పరిపాలించేవారు. ఈ చిన్నచిన్నరాజ్యాల మధ్య అడపా దడపా చాలా ఘర్షణలు చెలరేగుతూండేవి. అభివర్ధిత సమాజానికి ఓ దశలో ఈ చిన్నరాజ్యాల ఆర్థిక వ్యవస్థ కాలవిరోధం (anachronism) గా కూడా పరిణమించింది. అందుకని అప్పట్లో వారు ఆలోచించారు: “ఒకే భాష, ఒకే మతమూ, సంప్రదాయాలూ గల మనమంతా ఈ విభేదాలు మర్చిపోయి, మన జిల్లాలన్నింటినీ విలీనం చేసి ఒకే ఒక పెద్దరాజ్యంగా ఏర్పడితే బావుంటుందేమో కదా?” అని! ఫలితంగా యూరప్ ఖండంలో ఒకే భాషా, సంస్కృతీ గల పెద్దపెద్ద జాతీయరాజ్యాలు చాలా ఏర్పడ్డాయి. వాటి ఆవిర్భావంతో యూరప్ ఓ పెద్ద ముందడుగు వేసినట్లయింది.  ఎందుకంటే తరువాతి కాలంలో యూరోపియన్లు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాలు స్థాపించడానికి మూలం, తొలుత తమ స్వఖండంలో జాతీయ రాజ్యాల్ని స్థాపించుకోవడమే.

జాతీయరాజ్యాల నేర్పఱచుకున్న రోజులకీ, నేటికీ మధ్య ప్రపంచం చాలా మారిపోయింది. ఈనాడు ఒక్కరోజులో సగటు మానవుడు ప్రయాణించగల దూరం 16,000 కిలోమీటర్లు. అటువంటప్పుడు 100 కిలోమీటర్ల వేగానికి ప్రతిస్పందనగా ఉప్పతిల్లిన 14 వ శతాబ్దపు జాతీయవాదం దగ్గఱే మనం మానసికంగా, బౌద్ధికంగా స్తంభించిపోవడంలోని ఔచిత్యం పునరాలోచనీయం. జాతీయవాదం కూడా అన్ని ఇతర వాదాల్లోనూ సర్వసామాన్యంగా దర్శనమిచ్చే తభావతుల కతీతం కాదు. కనుక ఇప్పుడు మన మానవప్రేమ జాతీయవాదస్థాయి నధిగమించాల్సిన అవసరముంది. నిజానికి కొంతమేఱకు అధిగమించాం కూడా. కారణమేదైనా కానివ్వండి. మనవారు లక్షలాదిగా వలసపోతూండడమే ఇందుకు నిదర్శనం. దరిమిలా నేడు జాతీయవాదం ప్రభుత్వాలకీ,  రాజకీయపక్షాలకీ పరిమితం.

మనం ఇతర దేశాలకి వలసపోవడమే కాదు, మన దేశానికి వలసొచ్చే విదేశీయుల పట్లా, పరప్రాంతీయుల పట్లా కూడా సహనంతోనూ, ఆదరంతోనూ వ్యవహరించాల్సి ఉంది. వారిని శత్రువుల్లా చూసే ధోరణి పోవాలి. సర్వస్వామ్యాలూ ప్రసాదించాలని ఎవఱూ అనరు. కనీసం వారి మానవహక్కుల నైనా హరించకుండా జాగ్రత్త వహించాలి. నానా కారణాల్ని పురస్కరించుకుని స్వదేశంలో వేధింపులకు గుఱయ్యేవారు విదేశాలకు శరణార్థులుగా వెళ్ళడం తఱచు. కానీ అలాంటివారికి ఆశ్రయమిచ్చే విషయంలో అన్ని దేశాలూ తటపటాయిస్తూంటాయి. వేధించేది చాలక ఇంటర్ పోల్ సహాయం తీసుకుని వారిని వేటాడేవారున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఒకవేళ ఎవఱైనా నిజంగానే తప్పుచేసి విదేశాలకు పారిపోతే, అది వారు తమకు తాము విధించుకున్న దేశ బహిష్కార శిక్ష. అది వారి ఖర్మ. అందుకు సంతోషించాలే తప్ప వారిని వెంటాడి మఱీ స్వదేశానికి తెచ్చే పనేముంది ?
 

20, అక్టోబర్ 2014, సోమవారం

తన ధనాన్నీ, జ్ఞానాన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులతో పంచుకోవడం

అంటే సాధ్యమైనంతవఱకూ ఇతరులకు సహాయం చేయడం. మానవజాతికి చరిత్రలో ఇప్పటిదాకా ఏదైనా మేలు జఱిగిందంటే దానిక్కారణం– కొందఱు వ్యక్తులు ప్రతిఫలాపేక్ష లేకుండా తమ సంపదనీ, జ్ఞానాన్నీ ఇతరులకు ఉచితంగా పంచిపెట్టడం వల్లనే. వట్ఠి ఉపయోగవాదాన్ని (utilitarianism) ఆశ్రయించినవారి వల్లా, ప్రతీదీ అమ్మజూపేవారి వల్లా మానవాళికి ఎన్నడూ ఏ మేలూ జఱగలేదు. ఇహ ముందూ జఱగబోవడం లేదు. నిజానికి ఈ తరువాతి రెండు తరహాల వ్యక్తులూ మొదటి తరహా వ్యక్తుల మూలాన బాగుపడ్డవాళ్ళే. మొదటితరహా వ్యక్తులు తమ జీవితాన్ని కూడా లెక్కచేయకుండా సాధించిన విషయాల్ని వీరు తరువాతి కాలంలో సొమ్ముచేసుకుంటారంతే. 

“చేపలు వండిపెట్టడం కన్నా చేపలు పట్టడం ఎలాగో నేర్పడం ఎక్కువ మేలుచేస్తుంది” అనే సూక్తి తఱచుగా వినపడుతుంది. వినడానికి ఈ వాదన చాలా బావుంటుంది. కానీ చేపలు పట్టడం నేర్పాలంటే ముందసలు అక్కడ చేపలంటూ ఉండాలి కదా. “పోనీలే” అని దయచూపి చంపకుండా కొంత కాలం పాటు వాటిని వాటి మానాన బ్రతకనిచ్చేవాళ్ళుండాలి కదా. కానీ జనం చేపపిల్లలతో సహా అన్నీ అమ్మేసుకుంటారు. 

సారాంశమేంటంటే– మానవజాతి చరిత్రలో ఏ వ్యాపారమూ వ్యాపారదృష్టితో మొదలుకాలేదు. ప్రతీదీ ముందు సన్నిహితులకు చేసిపెట్టిన ఉచిత సేవగా మొదలై తరువాతి దశల్లో వ్యాపార రూపాన్ని సంతరించుకుంది. ప్రతి వ్యాపారానికీ ముడిసరుకు ప్రకృతిసంపదే. మఱి ఆవిడకి వ్యాపారులు ఏం చెల్లిస్తున్నారు? ఏమీ లేదుగా? ప్రకృతే కాదు, జయప్రదమైన ప్రతి వ్యాపార పూనిక వెనకా ఎవఱిదో దయార్ద్ర హృదయం తప్పకుండా దాగుంటుంది.

తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము: మఱో విషయమేంటంటే- ఇతరులకు సేవా-సహాయాలందించడం కోసమో, లేదా వారికి భద్రత కల్పించడం కోసమో, లేదా వారికి హక్కులు ప్రసాదించడం కోసమో, వారిచేత మంచివాళ్ళు అనిపించుకోవడం కోసమో ఎవఱూ తమ హక్కుల్ని – వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ - కోల్పోయి, ఒళ్ళు హూనం చేసుకుని, తమను తాము రెండో తరగతి పౌరులుగా మార్చేసుకుని మఱీ బ్రతకాల్సిన అవసరం లేదు, ఆ ఇతరులు స్వయానా తమ రక్తసంబంధీకులూ, కుటుంబసభ్యులే అయినా ఇతరుల జీవితానికీ, హక్కులకూ ఉన్న విలువే మన జీవితానికీ, హక్కులకీ కూడా ఉందని మఱువరాదు. ఒకఱు ఇతరులకు ఏదైనా ఇవ్వగలగాలంటే ముందు వారి దగ్గఱ ఏదైనా ఉండాలి. ఇవ్వాలనే స్వేచ్ఛామయమైన ఉదార సంకల్పాన్ని కలిగించే వాతావరణం ఉండాలి. ముందు తాము ఔదార్యాన్ని రుచిచూస్తేనే తరువాత ఇతరులకూ దాన్ని పంచగలుగుతారు. ఔదార్యం చూపి తీఱాలని బలవంతం చేస్తే అది ఔదార్యం కాకుండా పోతుంది.

మానవత్వపు ఉదార ప్రదర్శన కొన్నిసార్లు ఇతరుల్లోని మానవత్వాన్ని తట్టి లేపడానికి బదులు, వారిలో దోపిడీ సంకల్పాల్నీ, అమానుషత్వాన్నీ పెంపొందించవచ్చు. ఒకసారి అలా అలవాటు చేశాక ఒక పక్షంవారేమో అన్నీ వదిలేసుకోవాల్సి రావడమూ, మఱో పక్షంవారేమో అన్నీ తేరగా కైవసం చేసేసుకోవడమూ మాననీయమైన సామాజిక సంప్రదాయాలుగా మారిపోతాయి. మనుషుల్లో మొదట్నుంచీ ఉన్న బలహీనత ఏంటంటే – ఒక పక్క ఉచితంగా లభ్యమవుతున్న ఇతరుల మంచితనం మీద పడి బ్రతుకుతూ మఱోపక్క అది తమ గొప్పతనమనీ, దైవదత్తమైన హక్కనీ పిడివాదానికి దిగడం. అటువంటప్పుడు తాత్కాలికంగా, లేదా పరిమితంగా మానవతావాద సూత్రాల్ని క్రియారహితం చేయడంలో తప్పులేదు. అయితే వారిని ద్వేషించకుండా వారూ కాలక్రమంలో మారతారనే ఆశాభావంతో ఎదురుచూడాలి. ఆ దిశలో మన వంతు కృషి మనం సలుపుతూనే ఉండాలి.

చట్టాలకూ, వ్యవస్థలకూ మానవతావాదాన్ని మార్గదర్శకంగా స్వీకరించి రూపొందించుకోవడం

చట్టాల్లో ఒక గణనీయశాతం, శస్త్రచికిత్స చేసి కడుపులో కత్తెర మర్చిపోవడం వంటివి. కనుక వాటితో మనుషులు మంచిగా మారతారని మానవతావాదులు విశ్వసించరు. కానీ జనాన్ని చెడగొట్టడానికైతే ఇతోఽధిక అవకాశముంది. ఉదాహరణకి, తప్పుడు ఫిర్యాదులిచ్చేవారిని శిక్షించాలనే నియమం లేకపోవడంతో కేవలం పరపీడన-స్వలాభాల నిమిత్తం ఫిర్యాదులిచ్చేవారి సంఖ్య పెఱిగిపోతోంది. అదే నిష్పత్తిలో అమాయకులు బలైపోవడం కూడా హెచ్చుతోంది. కాబట్టి నమోదు చేయడానికి ఒక ఫిర్యాదు అర్హమో, కాదో లోతుగా చర్చించి నిర్ధారించడానికి మానవతావాదులతో కూడిన ముందస్తు వడపోత మండళ్ళ (screening committees) ని ఆధికారికంగా ఏర్పఱిస్తే దురుద్దేశ పూరితమైన ఆషామాషీ కేసుల మోతను  నివారించడానికి చాలా వఱకూ అవకాశం ఉంటుంది.

సమాజాన్ని బాగుచేయకపోయినా ఫర్వాలేదు కానీ ప్రశాంతమైన యథాస్థితి (status quo) ని పాడుచేసేలా మానవతాసూత్రాలకు విరుద్ధమైన చట్టాలు చేసుకుంటూ వెళ్ళొద్దని మానవతావాదులు సలహా ఇస్తారు. చట్టాలనేవి, సంకుచితులూ, సిద్ధాంతోన్మాదులూ అయిన కొన్ని ప్రయోజనగుంపుల (interest groups) యొక్క ఇష్టానిష్టాలకో, లేదా క్షణానికో చిత్తంగా మారిపోయే పరిపాలకుల తలతిక్కలకో అనుగుణంగా కాక అంతర్జాతీయామోదం పొందిన మానవహక్కుల చార్టర్ కి అనుగుణంగా రూపొందించాలని వారు కోరతారు.

ఐతే ప్రస్తుతం అమల్లో ఉన్న మానవహక్కుల చార్టర్ అసమగ్రమని గమనించాలి. ఉదాహరణకు, అందులో మాతృభాషాహక్కులకు ఏ విధమైన రక్షణా ఇవ్వబడలేదు. అదే కాక అనేక ఇతరాంశాల్ని సైతం జోడించి మానవహక్కుల్ని పునఃక్రోడీకరించాల్సి ఉంది. ఈ విషయానికి అంతర్జాతీయ స్థాయిలో ఆమోదాన్ని సంపాదించడం వెంటనే సాధ్యపడకపోవచ్చు గనుక ప్రస్తుతానికి ప్రాంతీయస్థాయి లో మనమే దాన్ని తిరగవ్రాసుకోవడం గుఱించి యోచన చేయాలి.

సామాజిక అవసరాల్నీ, అనివార్యతల్నీ చట్టాలుగా రూపుదిద్దడం కొంతవఱకూ ఆమోదయోగ్యం. ఆదర్శాలూ, ఆశింపులూ అనివార్యం కాదు. అవి అవసరాల శ్రేణిలోకి రావు. ఓ వర్గానికి అనుకూలంగా ఓ చట్టాన్ని తేక తప్పని పరిస్థితి ఉంటే, అదే సమయంలో, ఇతర వర్గాలక్కూడా అనుకూలంగా అలాంటిదే మఱో సమాంతర చట్టాన్ని తేవాలి. ఆ విధంగా ఎవఱి మానవహక్కులకూ భంగం కలగకుండా సమతూకాన్ని పాటించాలి.

ఈ సందర్భంగా ఒక విషయం. మానవతావాదులు సమానత్వంలాంటి సిద్ధాంతాల మీద ఊనిక (emphasis) పెట్టరు. దానర్థం, వారు అసమానత్వాన్ని సమర్థిస్తారని కాదు. చరిత్రగతిలోనూ, ప్రకృతిమూలకంగానూ వచ్చిపడ్డ అసమానత్వాల సన్నిధానంలో మనం నిస్సహాయులం. మనం వాటిని సరిదిద్దలేం. అలాగే, వ్యక్తుల జీవితాల్లో వారివారి ప్రతిభా-వ్యుత్పత్తులూ, కృషి, అదృష్టం ఇత్యాదుల మూలాన ఏర్పడ్డ అసమానత్వాల్నీ మనం సరిదిద్దలేం. కానీ సమాన ప్రతిభ గల వ్యక్తులకు సమానావకాశాల్ని కల్పించడం వఱకూ చేయగలం. అదే విధంగా, మన సమష్టిచర్యలలోని తెలివితక్కువ తనం కారణంగా సరికొత్త అసమానత్వాలు సృష్టికాకుండా జాగరూకత వహించగలం. ఉదాహరణకి సమాజంలో కొన్ని వర్గాలకి మూకుమ్మడిగా చట్టపరంగా ఎక్కువ వెసులుబాట్లూ, ఎక్కువ ఆమోదయోగ్యతా (acceptability), ఎక్కువ రక్షణా ఇవ్వడం వల్ల ఆ మేఱకు వాటిలో మిగతా వర్గాలకు కోతపెట్టినట్లే అవుతుంది. అందుచేత ఇలాంటి అసమతూకం సమాజంలో తీవ్ర అసంతృప్తికీ, అశాంతికీ దారితీస్తుంది. పర్యవసానంగా చట్టరక్షిత వర్గాలకూ, అలాంటి రక్షణేదీ లేని వర్గాలకూ మధ్య శత్రుత్వమూ, పరస్పర పీడనా హెచ్చుతాయి. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంభావ్యతల్ని నివారించాలన్నా, చట్టాల రూపకల్పనలో మానవతాసూత్రాల స్ఫూర్తికి స్థానం కల్పించడం తప్పనిసరి.

15, అక్టోబర్ 2014, బుధవారం

క్షమాగుణం

ప్రపంచం సర్వానవద్యం (all perfect) గా సృష్టించబడలేదు. మనం ప్రకృతిలోని పదార్థాల్ని సంస్కరించుకొని, మార్పు చేసుకుని వాడుకుంటున్నాం. వాటి మీద నిందారోపణలు చేసి దూషించడం లేదు. మనుషులనైనా అంతే చేయాలి. మానవులూ పూర్తిసౌష్ఠవంగా సృష్టించబడలేదు. దీనికి ఎవఱూ మినహాయింపు కాదు. ఈ సత్యాన్ని మనసా-వాచా-కర్మణా అంగీకరించి, సకల సౌష్ఠవాశంసల్నీ (all expectations of perfection) పక్కన బెట్టి మనుషుల్ని ఉన్నవాళ్ళని ఉన్నట్లుగా, వారి యొక్క యావత్తు సల్లక్షణాలతోనూ, విలక్షణాలతోనూ, అవలక్షణాలతోనూ సమగ్రంగా అంగీకరించి ప్రేమించడం, మనసారా క్షమించడం నేర్చుకోవడమే మానవతావాదం. “నాకేం అవసరం?” అనడం అతార్కికం. తోటిమానవుల ప్రేమసానుభూతులు ప్రతిమనిషికీ అవసరమే. ఎంతటి బలవంతుడికైనా అవసరమే. మనమిప్పుడు ఇతరుల్ని క్షమిస్తే భవిష్యత్తులో క్షమాపణ కోరేందుకు మనకీ, మనవాళ్ళకీ అర్హత సిద్ధిస్తుంది. మనుషులు పరిస్థితుల్ని బట్టి మాత్రమే మంచిగానో, చెడుగానో ముద్రపడతారు తప్ప వాస్తవానికి వారు అదీ కాదు, ఇదీ కాదు. తమ పరిస్థితులు అనుకూలిస్తే వారూ మంచిగానే ముద్రపడతారు. ఉదాహరణకి- మన దేశంలో ఒకప్పుడు ప్రేమలో పడ్డ స్త్రీ బరితెగించినదానికిందే జమ. “ప్రేమే నేఱమౌనా?”అని విషాదగీతాలు పాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాదు.

ప్రపంచం- తప్పుచేసేవారూ, చేయనివారూ అని ఖరాఖండిగా సమవిభక్తమై లేదు. ఇతరులకు తెలిసేలా తప్పుచేసేవారూ, రహస్యంగా చేసేవారూ అని మాత్రమే విభక్తమై ఉంది. ఆ అపరాధాల తీవ్రత ఎంత? అనేది తరువాతి విషయం. తమకే అవసరమూ, అవకాశమూ, శక్తీ ఉంటే అందఱూ తప్పు చేస్తారు. కొందఱు కొన్ని విషయాల్లో చేస్తే మఱికొందఱు మఱికొన్ని విషయాల్లో చేస్తారు. ఒకఱు చేసే తప్పే ఇంకొకఱు కూడా చేయాలని ఏమీ లేదు. కొన్ని తప్పులకు శిక్షలు వ్రాసిపెట్టారు. కొన్నిటికి వ్రాయలేదు. అంతే తేడా. మినహాయింపులు ఉండొచ్చు. కాదనట్లేదు. కానీ అవి మినహాయింపులు మాత్రమే. కనుక పరిశుద్ధులెవఱూ లేని ఈ మర్త్యలోకంలో మానవులు ఒకఱినొకఱు క్షమించుకోవడమే సమంజసం.

మనం ఇతరుల్ని క్షమించలేకపోవడానికి అసలైన కారణం ఇదే, మనమేదో మహాపవిత్రులమనీ, అవతలివాడు మాత్రమే కళంకితుడనీ మనలో మనకు తెలియకుండానే నాటుకుపోయిన ప్రగాఢమైన మూఢవిశ్వాసం. వాస్తవమేంటంటే, జాగ్రత్తగా గమనించినప్పుడు నీతీ, న్యాయం అనేవి సమకాలీన సమాజంలో ఎవఱికీ అవసరం లేదు, వాటి గుఱించి మూరెడు, బారెడు ఉపన్యాసాలిచ్చేవాళ్ళతో సహా ! అందఱికీ నూటికి నూఱుశాతం కావాల్సినదీ, అంతా అహర్నిశం తాపత్రయపడిపోతున్నదీ బ్రతకడం కోసం. ఎలాగైనా సరే, బ్రతకడం కోసం. ఏం చేశైనా సరే, సమాజంలో ఓ సభ్యుడుగా, దానికి అనుగుణంగా ఒదిగిపోయి, అందఱిలోనూ తానొక విచిత్రవ్యక్తి అనిపించుకోకుండా మనగల్గడం (survival) కోసం. ఈ క్రమంలో నీతీ, న్యాయం అనేవాటిని గోడచాటుకు తీసుకెళ్ళి లోపాయికారీగా క్షమాపణలు చెబుతూ, “ఏమీ అనుకోవద్దయ్యా ధర్మదేవా! మా శక్తి ఇంతే” అని వీడుకోలు పలకడానికి ఎవఱికీ అభ్యంతరం లేదు. అంతా ఇంతే అయినప్పుడు, ఇలాంటి వాతావరణం లో ఎవఱిని క్షమించడానికైనా మనకెందుకు అభ్యంతరం ఉండాలి? మిగతావాళ్ళందఱినీ బేషరతుగా భరించడం లేదూ?

ఒక పని చెడ్డది కావచ్చు. కానీ దాన్ని చేసిన మనిషి దాన్ని చేసినంతవఱకే చెడ్డవాడు. అది చేయడం మానేసినా, లేదా అతను అందుకు క్షమాపణ చెప్పినా, లేదా తన పనికి అతను తగువిధంగా పరిహారం చెల్లించినా అతనూ మంచివాడే అవుతాడని మానవతావాదం చెబుతుంది. “అతను ఆ ఒక్క సంఘటన విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అతను ఆ సమయంలో కాస్త నిగ్రహం పాటించి ఉంటే బావుండేది” అనడం వఱకే మానవతావాదులు పరిమితమవుతారు. కనుక ఇప్పుడు సామాజికులు చేస్తున్నట్లుగా ఒక పనిని– ఒకే ఒక్క పనిని పురస్కరించుకొని మానవుడి మొత్తం స్వభావాన్నీ జడ్జ్ చేసిపారేయడం, జీవితాంతమూ అతన్ని గాయపఱచడం, అతని గుఱించి తమకు తెలీనివి మాట్లాడడం, లేనివి అంటగట్టడం, కళ్ళకి కనిపించనివి ఊహించడం- ఇదంతా పూర్తి అశాస్త్రీయం, అభ్యంతరకరం. కనుక నేఱస్థులు కూడా మానవులేననీ, వారు కూడా కాలక్రమంలో మారడానికి అవకాశముందనీ మనం మర్చిపోయేలా చేస్తూ, “కీచకుడు, రావణుడు” అంటూ పౌరాణిక విలన్ల నామాలతో వారికి లేని వ్యక్తిత్వాల్ని ఆపాదించడం. వారిని కృత్రిమంగా బూచాళ్ళుగా మార్చడం. ఆ విధమైన ఊకదంపుడుతో జనసామాన్యానికి దుర్నిగ్రహమైన భావోద్వేగాల్ని కలిగించి పిచ్చెక్కించడం. సంపన్న కుబేర మీడియా పాల్పడే ఈ రకమైన అమానవీయ కార్యకలాపాల్ని మానవతావాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరు.

ఎంత వయసొచ్చినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా. నేఱస్థులతో సహా అందఱివీ ప్రక్రియ (process) లో ఉన్న వ్యక్తిత్వాలే. పూర్ణ పురుషులంటూ ఇక్కడ ఎవఱూ లేరు. 120 ఏళ్ల ఆయుర్దాయమున్నవాడి క్కూడా జీవితం మొత్తం ఓ అభ్యసన ప్రక్రియే. అందఱమూ జీవితాంతం నేర్చుకునేవాళ్ళమే. కాబట్టి ఒక వ్యక్తి ఏదో ఒక బలహీన భావోద్వేగ క్షణంలో పట్టుతప్పి ఏదో చేస్తే, “అతను అదే” అని శాశ్వతంగా ముద్ర వేసేయడం సరికాదు. కాబట్టి సమాజంలో తొలి తప్పిదాల్ని క్షమించే వెసులుబాటు ఉండాలి. అదే విధంగా మనుషులు అంతకు ముందు సమాజానికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని క్షమించే వెసులుబాటు కూడా ఉండాలి. ఎందుకంటే క్రిమినల్ చట్టాలన్నీ సాధారణంగా మహా బలశాలుల్నీ, కిరాతకుల్నీ ఉద్దేశించి వ్రాయబడతాయి. కానీ దరిమిలా, అవి అంతకంటే చాలా తక్కువ తీవ్రత గల తప్పులకీ, ముందస్తు నేఱచరిత్రేదీ లేని అత్యంత సాధారణ బలహీన పౌరులకీ అనువర్తించబడతాయి.

ఏదైనా పొఱపాటు చేసినవారు క్షమాపణ చెప్పే సంస్కృతీ, అది చెప్పినప్పుడు అలా చెప్పినవారిని క్షమించే సంస్కారమూ పెంపొందాలి. సహృదయులైన రెండు పక్షాలవారి మధ్య చోటుచేసుకున్న  నిజాయితీతో కూడిన క్షమాపణలు వారి యొక్క దెబ్బదిన్న మానవ సంబంధాల్నీ, సంఘంలో శాంతి నీ అత్యద్భుతంగా పునరుద్ధరిస్తాయి. కానీ ఈ రోజుల్లో క్షమాపణల్ని అవతలివారిని క్షమించడానికి కాకుండా, వారు తప్పుచేశారనడానికి తిరుగులేని ఆధారంలాగా వాడుకోవడం గమనించవచ్చు. అంతేగాక మన దేశంలో క్షమాపణలకు వ్యవస్థాగతమైన విలువ లేకపోవడం మూలాన క్షమాపణ చెప్పడం కూడా ఓ పెద్దబెడద (risk) గా తయారై, ఆ సహృదయ సంస్కృతే క్రమంగా మఱుగున పడి అంతరించిపోతోంది. సౌదీ అరేబియాలో బాధితులు బాధకుల్ని క్షమిస్తే అభియోగం (case) ఉండదట. మంచి వివేకవంతమైన (sensible) ఏర్పాటు. కందకు లేని దుఱద కత్తిపీటకెందుకు ? 

క్షమాపణ చెప్పడం జనం అనుకుంటున్నంత సులభమైన పని కాదు. దానికి చాలా సంస్కారం కావాలి. అలాగే క్షమాపణ స్వీకరించడానిక్కూడా చాలా సహృదయం కావాలి. కక్షతో అహర్నిశం రగిలిపోతున్నవారికీ, కక్ష తీర్చుకునే అవకాశాలు పుష్కలంగా లభ్యమౌతున్నవారికీ, శత్రుత్వాల్ని పెంచుకోవడంలోనూ, బలప్రదర్శన చేయడంలోనూ అమందానందాన్ని అనుభవించేవారికీ, ఆత్మ న్యూనతాభావం (inferiority complex) తో పొద్దస్తమానం బాధపడేవారికీ క్షమాపణల్ని స్వీకరించేటంత హృదయగత సంస్కారం ఉండదు. కాబట్టి క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా, వారు ఎదిరి మనుషులమీద కక్ష తీర్చుకుని తీఱతారు.

క్షమాపణలతో సంతృప్తి చెందుతామని చెప్పుకునేవారు కూడా అవతలివారు తమ కాళ్ళ మీద పడాలన్నట్లు డిమాండ్లు చేస్తారు. “బేషరతు క్షమాపణలు” ఆ రకమైన ఆశింపులో ఓ భాగం. “నువ్వు నీలా ఉండకుండా మేము డిమాండ్ చేస్తున్న విధంగా మారిపోవాలి, మారినట్లు కనిపించాలి” అనడమే ఈ “బేషరతు”కు అంతరార్థం. ఒకఱు అలాగే బాహ్యంగా క్షమాపణ చెబుతారు. కానీ ఆంతరికంగా మారరు. అప్పుడేం చెయ్యాలి ? ఎవఱినైనా సరే, కాళ్ళబేరానికి తెచ్చి అవమానించడం ద్వారా, వారి అహాన్ని దెబ్బదీయడం ద్వారా మార్చలేం, వారు మారాలని మనం నిజంగా ఆకాంక్షిస్తే ! తప్పు చేసినవారు తమ తప్పును తాము తెలుసుకుని తాముగా క్షమాపణ చెబితే ఆ విలువే వేఱు.

ఏ తప్పూ చేయకపోయినా క్షమాపణ చెప్పాల్సిరావడం విచారకరమైన పరిస్థితి. ఇది పలుసందర్భాల్లో- ఒకఱి అవగాహనాస్థాయి వేఱొకఱి అవగాహనాస్థాయికంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉండడం వల్లా, ఇతరులు తనని అర్థం చేసుకోవడానికి తిరస్కరించడం వల్లా, వర్గీయ రాజకీయాల వల్లా, అనవసరమైన దుష్ప్రచారం వల్లా ఉత్పన్నం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో అవతలివారి కంటే తనకెక్కువ తెలిసిన పాపానికీ, అజ్ఞానుల పశుబలానికీ వ్యక్తి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

మనుషులు ఒక విధమైన స్వభావాన్ని కలిగి ఉండడానికి కొన్ని కారణాలుంటాయి. ఓ నేపథ్యం ఉంటుంది. ఆలోచనలూ, అనుభవాలూ, వాటినుంచి మనిషి తీసుకున్న పిండితార్థాలూ (conclusions), తత్త్వీకరణలూ (philosophizations) ఇత్యాది. అవి మారకుండా ఊరికే కాళ్ళమీద పడ్డంతమాత్రం చేత ఆ స్వభావం మారదు. తెలిసిన అనుభవాల కన్నా భిన్నమైన అనుభవాలు వాటంతట అవి కలగాలి. మార్చగల సత్తా ఉన్నది వాటికే. అందుచేత ఒక మనిషి ఎంత జ్ఞాని అయినా, అధికారవంతుడైనా క్షమాపణ చెప్పించడం ద్వారా  మఱో మనిషిని మార్చగలగడం నూటికి నూఱుశాతం అసంభవమైన విషయం. దానివల్ల తాత్కాలికంగా పని గడవొచ్చు. అంతకన్నా ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించకూడదు. కనుక బలవంతపు క్షమాపణలనేవి, ఆ చెప్పించుకునేవాళ్ళకి ఓటమే తప్ప గెలుపు కాదు. కొట్టి నమస్కారం పెట్టించుకోవడం లాంటిదది. ఇతరుల్ని బాధపెట్టినవారు క్షమించమని అడగనంతకాలం తప్పు వారిది. క్షమించమన్న తరువాత కూడా క్షమించకపోతే ఆ తప్పు క్షమించనివారిదవుతుంది. అదీగాక క్షమాపణ అనేది ఆత్మగౌరవం గల వ్యక్తులనుంచి స్వచ్ఛందంగా, సహజంగా, వారిదైన శైలిలోనే రావాలి.
 

10, అక్టోబర్ 2014, శుక్రవారం

ప్రతిహింసా వ్యతిరేకత

హింసను వ్యతిరేకించడమంటే ప్రతిహింసను కూడా వ్యతిరేకించడమే. ఎందుకంటే ప్రతిహింస భవిష్యత్తులో మఱింత హింస ద్వారా జవాబివ్వబడుతుంది. అదో గొలుసుకట్టు పరంపర. కాబట్టి కక్ష తీర్చుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవతావాదం సమర్థించదు. అదే విధంగా హింసాపూరితంగా చర్యలు తీసుకోవడాన్ని కూడా సమర్థించదు. అంటే వెలివేత, యావజ్జీవాలూ, ప్రాణం తీయడం, అవయవచ్ఛేదం, దెబ్బల్లాంటివాటితో అది ఏకీభవించదు. విచారణలోనో, అంతిమనిర్ణయంలోనో పొఱపాటు జఱిగి ఒకఱు పైన పేర్కొన్న అమానుషాలకు బలయ్యాడనుకోండి. తరువాతెప్పుడో అతను మంచివాడని తేలినా కూడా అతనికీ, అతని కుటుంబానికీ జఱిగిపోయిన నష్టాన్ని ఏ వ్యవస్థా పూడ్చజాలదు. పై పెచ్చు ఇందులో శక్తి-అసమతూకం (power imbalance) కూడా ఉంది. ఎందుకంటే వ్యవస్థలతో పోలిస్తే విడివ్యక్తి దుర్బలుడని ఒప్పుకుంటే, మనం వాస్తవంగా నిలబడాల్సింది ఎవఱి పక్షాన ? 
 

మరణశిక్షలూ, అవయవచ్ఛేదాలూ అమల్లోకి తెచ్చి లోకాన్ని అమాంతం బాగుచేసిపారెయ్యాలని ఉబలాటపడేవారు గుర్తించని విషయం ఏంటంటే – ఒకసారి అలాంటివాటిని ఆమోదయోగ్యం చేశాక ప్రతి ఒక్కఱూ వాటిల్లో తమ స్వకీయ సృజనాత్మకతని ప్రవేశపెట్టి, మనుషుల్ని హింసించడంలోనూ, చంపేయడంలోనూ విపరీతమైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ స్వీయకళాచాతుర్యాన్ని వెలార్చసాగుతారు. గతంలో జఱిగింది అదే. నిజాం రాజ్యంలో అవినీతిపరుల్ని ఫిరంగులతో పేల్చి చంపేవారు. మధ్య యుగాలనాటి యూరప్ లో పరుగెత్తుతున్న గుఱ్ఱానికి మనిషిని కట్టి ఈడ్పించి చంపేవారు. బ్రతికుండగానే తల మీద ఉన్న చర్మమంతా కోసేసి తీసి పై-కపాలాన్ని మిగిల్చేవారు. నీళ్ళల్లో ముంచి చంపేవారు. మఱుగుతున్న నూనెలోకి తోసేవారు. కాళ్ళూ చేతులూ నఱికి ఆరుబయట అలా వదిలేసేవారు. ఒక చిన్నగదిలో 20 మందిని బంధించి తిండిపెట్టకుండా మాడ్చి చంపేవారు. ఈరోజుల్లో చాలా చిన్నతప్పులని భావించబడేవాటి క్కూడా ఆ రోజుల్లో ఇలాంటివి అమలు జఱిపారని తెలుసుకుంటే మనసు బాధతో మూలుగుతుంది.

అంతమాత్రాన ఆ కాలపు జనం క్రూరులూ, అనాగరికులూ అనడం సరికాదు. ఇక్కడ అసలుప్రశ్న దయాగుణం గుఱించో, క్రూరత్వం గుఱించో, నాగరికత గుఱించో కాదని గమనించాలి. మూడు భావనల్లో వారీ పనులు చేశారు.

ఒకటి -  తప్పొప్పులు నిర్ణయించే తెలివితేటలు తమకు ఉన్నాయనుకోవడం.
రెండు –  దేనికెంత శిక్షో నిర్ణయించే శక్తి కూడా తమకు ఉందనుకోవడం.
మూడు –  తోటి మనిషిని శిక్షించే అధికారం తమకు ఉందనుకోవడం.


ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ భావనలు ఈ రోజు మనలో కూడా ఉన్నాయని అర్థమౌతుంది. కనుక అవకాశమివ్వాలే గానీ మనమూ తప్పకుండా ఆ పనులు చేస్తాం. మరణశిక్షలూ, అవయవచ్ఛేదాలూ సమాజంలో విస్తృతామోదాన్ని పొందితే ఆ అవకాశమొస్తుంది.

ఎంత నేఱం చేస్తే అంత స్థాయిలో నేఱస్థుల్ని హింసించే సావకాశం మనుషులకుందా? ఇది ఆలోచనీయం. ఎంత శిక్ష విధిస్తే పాపం పరిహారమవుతుందో ఖచ్చితంగా ఎవఱైనా చెప్పగలిగితే బావుంటుంది. ఉదాహరణకు, ఒకఱిని చంపితే మరణశిక్ష వేయాలన్నప్పుడు పదిమందిని చంపినవాడికి పది మరణశిక్షల్ని అమలుజఱపడం సాధ్యమేనా ? ఎందుకంటే ఒకసారి ఉరితీస్తేనే అతను చనిపోతాడు. మిగతా తొమ్మిది హత్యలకూ వేయాల్సిన శిక్షల సంగతేంటి ? కనుక “దేనికి ఏది శిక్ష ? లేదా దేనికెంత శిక్ష ?” అనేది మనుషుల చేతుల్లో బొత్తిగా లేదనీ, వారికి తెలీదని స్పష్టమవుతోంది. కనుక ఎంత పెద్దతప్పుకైనా 16 - 18 సంవత్సరాల కఠిన కారావాసం కంటే ఎక్కువ శిక్ష అవసరం లేదు. మనుషులు మారి సత్ప్రవర్తన అలవఱచుకుంటే ఇంకా ముందే విడుదల చేయడం బావుంటుంది.

ఒకఱికి శిక్ష వేసి/ హింసించి తద్ద్వారా (ఆ దృష్టాంతం ద్వారా) అతన్ని కాక, ఇతరుల్ని మార్చాలనుకునే ధోరణి ఒక తెలివితక్కువతనం. అది నిజానికి లోకల్ గూండాల మెథడాలజీ. ఒకఱిని చూసి ఇంకొకఱు బాగుపడతారనీ, లేదా చెడిపోతారనే అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలే. ఎవఱూ ఎవఱిని చూసీ ఏమీ నేర్చుకోరు, డబ్బు సంపాదించడం తప్ప!  మిగతా విషయాల్లోఎవఱి సొంత బుఱ్ఱలు వారికున్నాయి. తాము చేసేది నేఱమనీ, దానికి శిక్ష ఉందనీ తెలియక కాదు నేఱస్థులు నేఱాలు చేసేది. ఎవఱు దొఱికినా తాము మాత్రం “దొఱకం” అనుకుని ఆ భరోసాలో చేస్తారు. అందుచేత అంతకుముందు అదే నేఱానికి ఎంతమంది ఏ విధంగా శిక్షించబడ్డారనే గణాంకాలు (statistics) ముందేసుకుని విశ్లేషిస్తూ వారు కూర్చోరు.

మన దగ్గఱ డబ్బు పుచ్చుకున్నవాళ్ళు మన పట్ల కృతజ్ఞులై ఉండడమూ, కఠిన శిక్షలతో ప్రపంచం భూతల స్వర్గం కావడమూ– రెండూ బహుశా ఒకేసారి జఱుగుతాయి. కఠిన శిక్షలతో ప్రపంచం అమాంతం బాగుపడిపోయే మాటైతే వాటిని శతాబ్దాల తరబడి ఎందుకు అమలు జఱిపాల్సి వచ్చిం దో, అలా చేసినప్పటికీ నేఱాలు యథాపూర్వంగా ఎందుకు కొనసాగాయో సమాధానాన్ని అన్వేషించాల్సి ఉంది. హేయమైన నేఱాలకు మనుషులు పాల్పడడానికి గల కారణాల్లో ఒకటి కఠిన హృదయం. వ్యక్తుల హృదయాలు అలా బండబాఱిపోవడానికి గల కారణాల్లో ఒకటి, వారు పుట్టకముందే కుటుంబాల్లోనూ, సమాజంలో నెలకొన్న క్రూర వాతావరణం. కఠినశిక్షల్ని ప్రభుత్వం విధించడం, జనం వాటిని కనులారా తిలకించడం అటువంటి క్రూరవాతావరణాన్ని మఱింతగా సమాజం మీద విధిస్తాయే తప్ప దాన్ని క్షీణింపజేయలేవు. ఎందుకంటే మనం రోజూ ఏదైతే చూస్తామో అంతిమంగా అదే మనమౌతాం. కనుక ముందు చేయాల్సింది, కఠిన శిక్షల పేరిట మఱింత క్రూరత్వాన్నీ, ప్రతీకార ధోరణుల్నీ ప్రమోట్ చేయడం కాదు. అవగాహననీ, సున్నితత్వాల (sensibilities) నీ పెంపొందించడం. శిక్షానంతరం సైతం మనిషికో భవిష్యత్తుంటుంది. జీవితముంటుంది. కుటుంబముంటుంది. ఉండాలి కూడా! ఈ వాస్తవాల్ని ఎవఱూ విస్మరించకూడదు.

మనుషుల్లో ప్రతీప స్పందనల్ని (negative reflexes) రెచ్చగొట్టడం ద్వారా వారిని మార్చడమూ లోకాన్ని సుజీవం (better place to live) చేయడమూ సాధ్యం కావు. భయమూ, ఆశపోతుతనమూ ఇలాంటి ప్రతీపస్పందనలే. అందుచేత భయపెట్టడం ద్వారానో, ఫలానా లబ్ధి చేకూఱుస్తామని ప్రలోభపెట్టడం ద్వారానో వారిచేత ఒక చెడ్డపని శాశ్వతంగా మానిపించడం గానీ, లేకపోతే మంచి పనులకు మప్పడం గానీ అసంభవం. అలా చేస్తే భయపెట్టేవారు కనుమఱుగయ్యీ కాగానే మళ్ళీ పాతపనులకే దిగుతారు. లేదా మంచిపనుల వల్ల లబ్ధి ఏమీ కలగదనిపిస్తే అవి చేయడం మానుకుంటారు. అందుచేత శిక్షల వల్ల సమాజం బాగుపడేది కల్ల.

మనుషులు తప్పుచేసినట్లు సందేహాల కతీతంగా రుజువుకాకముందే, ఎవఱో ఏదో అన్నారనీ, లేదా తప్పు జఱిగినట్లు అనుమానం ఉందనే ఆషామాషీ కారణాల్ని పురస్కరించుకొని వారిని వైయక్తిక స్థాయిలో గానీ, సంఘస్థాయిలో గానీ వ్యవస్థాగతంగా గానీ బాధించడమనే అశాస్త్రీయ కార్యకలాపానికి మానవతావాదుల మద్దతు ఎప్పటికీ ఉండదు. కానీ సమకాలీనంగా వారినీ వారి కుటుంబాల్నీ సంపన్న కుబేర మీడియా ద్వారా రోజువారీ ప్రాతిపదికన భారీయెత్తున బద్నామ్ చేస్తున్న ధోరణి వాడుకలో ఉంది. ఇది ఓ 50 మంది లారీలో వెళ్ళి ఒకణ్ణి పొడిచేసి రావడంలాంటిది. దీని లోతు గమనిస్తే ఇది చాలా అమానుషంగా, మానవతావిరుద్ధంగా గోచరిస్తుంది. ఇది నాగరిక సమాజంలో అభ్యంతరాల నెదుర్కోకుండా ఎలా అప్రతిహతంగా చెల్లుబాటవుతోందో మనకింకా అర్థం కావాల్సి ఉంది.

సంపన్న కుబేర మీడియా ఆ విధంగా ఒకసారి ఒకఱి పరువు తీసేశాక, అనంతర కాలంలో ఏనాటికో వారు నిర్దోషులని రుజువైనా, అప్పటికే జఱిగిపోయిన పరువునష్టాన్నుంచి ఆ ఆరోపితులూ, వారి కుటుంబసభ్యులూ జీవితాంతం కోలుకోలేరు. బలవంతులూ, గొప్ప ధైర్యమూ ఆత్మవిశ్వాసమూ గల వారూ అలాంటి సమాచార దాడులకి తట్టుకుని నిలబడతారు. వారెక్కడో అరుదుగా ఉంటారు. ఒక వేళ ఆ ఆరోపితులు కాస్త సున్నిత మనస్కులై, సంపన్న కుబేర మీడియా చేష్టలకు తట్టుకోలేక, కోలుకోలేని విధంగా జబ్బుపడితే, లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ బాధ్యత ఎవఱిది ?

సంపన్న కుబేర మీడియాకీ, అది బుఱదజల్లే వ్యక్తులకూ మధ్య బ్రహ్మాండమైన శక్తి-అసమతూకం (power imbalance) ఉందని కూడా గమనించాలి. ఏదో ఒక ఆరోపణను పురస్కరించుకొని వారు తమమీద చేస్తున్న దుష్ప్రచార దాడిని ఎదుర్కునే శక్తి మన సమాజంలో ఎవఱికీ లేదు. ఎంత ఆరోపితులైనప్పటికీ వారు సాపేక్షంగా బలహీనులు కనుక ఈ రోజుల్లో జర్నలిజమ్ పేరుతో చెలామణీ అవుతున్న ఈ రకమైన విచక్షణారహితమైన వాచా దాడుల నుంచీ, వార్తారూప హింసాకాండ నుంచీ, లిఖితరూప దౌర్జన్యకాండ నుంచీ ప్రభుత్వమే మానవతాదృష్టితో రక్షణ కల్పించాల్సి ఉంది. 


గట్టి పౌర గోప్యతా చట్టాల (citizen privacy laws) ను తేవడం ఇందుకో మార్గం. ఉదాహరణకి విడిపౌరుల/ వ్యక్తుల లిఖితపూర్వక అనుమతి లేకుండా వారి గురించి మంచిగా గానీ, చెడుగా గానీ తటస్థంగా గానీ మీడియాలో ప్రచురించడాన్ని కఠినంగా నిషేధించే ప్రతిపాదనని పరిశీలించాలి. అదే సమయంలో సంఘమూ, వ్యవస్థా కూడా ఆరోపకుల (ఫిర్యాదీల) పట్లా, ఆరోపితుల పట్లా సమదృష్టిని అవలంబించాల్సి ఉంది. ఏ ఒక్కఱి పక్షమూ వహించే పని లేదు. ఎవఱినీ పూర్తిగా నమ్మాల్సిన అగత్యం లేదు. “అది ప్రాథమికంగా మన గొడవ కాదు, వారి మధ్య గొడవ” అని గమనించాలి. అయితే ఉభయ పక్షాలూ మనవారే అవుతారు. కాకపోతే వాళ్ళూ మనకేమీ కారు. వీళ్ళూ మనకేమీ కారు.