29, అక్టోబర్ 2014, బుధవారం

కృతజ్ఞత చూపడం, వర్తమానంలో జీవించడం, మార్పుని అంగీకరించడం

కృతజ్ఞత చూపడం

నిజానికి ఇది మానవుల్లో తఱచూ కానవచ్చే లక్షణం కాదు. ప్రయత్నపూర్వకంగా అభ్యసించవలసినదే. అయినా ఇది మానవ సంబంధాల్ని మెఱుగుపఱుస్తుంది కాబట్టి మానవతాసూత్రాల్లో భాగమైతే బావుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ చేర్చడం జఱిగింది. తాము ఇతరులకు చేసిన మేలు గుర్తున్నంతగా వారు తమకు చేసిన మేలు మానవులకు గుర్తుండదు. అదే విధంగా, ఇతరులు తమకు చేసిన కీడు గుర్తున్నంతగా వారు చేసిన మేలు గుర్తుండదు. మానవులు ఈ దౌర్బల్యాల నుంచి విముక్తులై ఇతరులు చేసిన మేలును గుర్తుంచుకోవడమూ, వారు చేసిన కీడును మర్చిపోవడమూ నేర్చుకోవాలి.

మానవ సంబంధాలన్నీ ఇచ్చిపుచ్చుకునేవేనని ఉపయోగవాదులు (utilitarians) అంటారు. అంటే అవన్నీ వ్యాపారమేనని అన్యాపదేశంగా చెప్పడమన్నమాట. వ్యాపారమంటే ఇచ్చిపుచ్చుకోవడమైతే ఆ ఇచ్చిపుచ్చుకోవడంలో అవసరమే కాదు, కృతజ్ఞతాభావమూ, అవతలివాళ్ళని దోచుకోకూడదనే ఆత్మసాక్షీ ఇమిడి ఉన్నాయి. కనుక వ్యాపారానిక్కూడా మానవతావాదమే మూలం. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడమూ, పెద్దల పట్ల గౌరవం చూపడమూ, వారికి సేవచేయడంలాంటి ఆదర్శాలు కూడా మౌలికంగా కృతజ్జతాభావాన్నే ఆశ్రయించుకుని ఉన్నాయని మఱువరాదు.


వర్తమానంలో జీవించడం

దీనికీ క్షమాగుణానికీ కాస్త సంబంధం ఉంది. గమనిస్తే, మానవ సంబంధాలు విషమించడానికో ప్రధానకారణం- మనుషులు గతానుభవాల్ని  మఱవలేకపోవడం. గతం నుంచి పాఠాలు నేర్వాలి. నిజమే. మనిషి అనుభవాన్ని గడించాలి. అదీ నిజమే. కానీ గతాన్ని వర్తమానంలో ఓ అవిభాజ్య భాగంగా చేసుకోవడమూ, దాన్ని కృత్రిమంగా బ్రతికించడమూ, వర్తమానాన్ని ప్రభావితం చేసేందుకు దాన్ని అనుమతించడమూ, ఏనాడో జఱిగిపోయినది ఇప్పుడు కూడా కళ్ళెదుటే జఱుగుతున్నంత సంరంభంతో ఉద్విగ్నం కావడమూ- ఇదంతా శోభస్కరం కాదు. దురదృష్టవశాత్తూ మన దేశంలో ఈ ధోరణి చాలా ఎక్కువ. ఏనాడో శతాబ్దాల క్రితం జఱిగిన హత్యలకీ, మానభంగాలకీ, ఆస్తుల విధ్వంసానికీ ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనేవారున్నారు. ఏనాటిదో వెనకబాటుకు ఇప్పుడు ఇతర వర్గాల్ని ద్వేషించేవారు ఉన్నారు. రెండు-మూడేళ్ళనాటి మానభంగానికో, వేధింపులకో ఇప్పుడు కేసులు పెట్టేవారున్నారు.

ఇలాంటి తిక్కలన్నింటికీ మన వ్యవస్థ, సంస్కృతీ ఆనందంగా మద్దతు పలుకుతాయి. పౌరులంతా ఖచ్చితంగా గతంలోనే జీవించాలనేది ఇక్కడ ఓ చట్టంలాగా అమలవుతోంది. గతాన్ని మఱవలేని వాళ్ళు గొప్ప సెంటిమెంటల్ మనుషులన్నట్లూ, ఆ సెంటిమెంట్లు ఉన్నవాళ్ళే నిఖార్సైన మానవతావాదులన్నట్లూ ప్రచారమవుతోంది. దీనికో చీకటిపార్శ్వం కూడా ఉందనీ, ఇది చాలా అమానుషాలకు ఆస్పదం కాగల ధోరణి అనీ చెప్పడానికి విచారిస్తున్నాను. ఒకప్పుడు ఐరోపాలో జఱిగిన మిలియన్లాది యూదుల ఊచకోతకు అసలుకారణం పూర్తిగా హిట్లర్ కాదు. నిజానికి అటువంటి హిట్లర్ ని ఉత్పత్తి చేసినది గతంలో జీవించే ధోరణే. గతాన్ని మర్చిపోయి చూస్తే ఐరోపా యూదులు మిగతా అందఱు యూరోపియన్లలాంటివాళ్లే. ఏ వ్యత్యాసమూ లేదు.

కానీ ఎంత వద్దన్నా జనం గతంలోనే బ్రతుకుతూంటారు.  ప్రతివారూ తమ అసలు వయసుకన్నా పదేళ్ళో, పదిహేనేళ్ళో చిన్నగా ఆలోచిస్తూంటారు. ఉదాహరణకు 60 ఏళ్ళవాడు 45-50 ఏళ్ళవాడి మూడ్ లో ఉంటాడు. 2014 లో ఉన్న మనుషులు 2000 నాటివో 1990 నాటివో ఆలోచనలు చేస్తూంటారు. దేశాలేమో 70-80 ఏళ్ళనాటి మూడ్ లో ఉంటాయి. కులాలు వందలాది ఏళ్లనాటి మూడ్ లో ఉంటాయి. మతాలేమో వేలాది ఏళ్ళనాటి మూడ్ లో ఉంటాయి. ఇది గాక  మనుషులు ఇతరుల్ని కూడా రకరకాలుగా గతంలో ఉంచేస్తారు. పాఠ్యపుస్తకాల ద్వారా గతంలో ఉంచేస్తారు. చరిత్ర ద్వారా ఉంచేస్తారు. సంస్కృతి ద్వారా ఉంచేస్తారు. చట్టాల ద్వారా ఉంచేస్తారు. సైద్ధాంతిక భావజాలాల ద్వారా ఉంచేస్తారు. ఆచారాల ద్వారా ఉంచేస్తారు. సాహిత్యం ద్వారా ఉంచేస్తారు. ఏతావతా జనం తగినంత తాజాభవించకుండా (update కాకుండా) చూడ్డమే అన్ని వ్యవస్థల పరమార్థంలా కనిపిస్తుంది.

మన దేశంలో నాలుగైదు తరాలనాటి సంఘసంస్కరణనే సంస్కరణగా అదే తుదిపలుకుగా భావించే వారున్నారు. ఆ సంస్కర్తల పేర్లే తల్చుకుంటూ, ఆ ప్రస్తావనకు సంబంధించి నాటి పుస్తకాలే చదువుకుంటూ అద్భుత రసానందాన్ని పొందేవారున్నారు. ఇహ ఆ తరువాత ఏ సంస్కరణా అవసరం లేదనీ, చెయ్యాల్సినదంతా ఆ సంస్కర్తలే చేసేశారనీ వారి అప్రకటిత అంతర్భావన. కానీ ఈ వ్యాస పరంపర చదువుతున్నవారందఱికీ తెలుస్తుంది, అది నిజం కాదని ! ఆ సంస్కర్తలు తమ సమకాలీన సమస్యలకు స్పందించారు. అందువల్ల వారు గొప్పవారయ్యారు. మనం మన కాలపు సమస్యలకు స్పందించడం లేదు. స్పందించలేకపోతున్నాం. ఆ కాలపు సంఘసమస్యల దృష్టితోనే ఈ కాలాన్ని కూడా చూడడం వల్ల ఈ కాలానికే విలక్షణమైన సమస్యల్ని గుర్తుపట్టలేకపోతున్నాం, రోజూ అనుభవిస్తూ కూడా!

ఒకవేళ  స్పందించినా ప్రయోజనం లేని పరిస్థితి. ఎందుకంటే అన్నిరంగాలూ రాజకీయవాదుల హస్తగతమయ్యాయి. అన్ని ప్రస్తావనలూ (topics) మధ్యతరగతి మేధావుల పట్టుదప్పిపోయాయి. అన్ని వర్గాలూ రాజకీయపక్షాల ‘సెల్స్’గా, ‘మోర్చాలు’గా మారాయి. ప్రజాస్వామ్యం పేరుతో పార్టీల నిరంకుశత్వం అమల్లోకొచ్చింది. దేని గుఱించి మాట్లాడితే ఎవఱికి కోపం వస్తుందోనని నోరు మూసుకుని ఓ మూల కూర్చోవడం అలవాటు చేసుకున్నాం. అందుకే ఇప్పటికీ ఎన్నిసార్లు మాట్లాడినా, ఎంత మంది మాట్లాడినా ఆ కన్యాశుల్కమే. ఆ బాల్యవివాహాలే, ఆ వితంతు పునర్వివాహాలే, ఆ సతీ సహగమనమే. మన దగ్గఱ మాట్లాడుకోవడానికి ఇంకేమీ లేని పరిస్థితి.

గతం నుంచి పాఠాలు నేర్వడమన్నా, అనుభవాన్ని గడించడమన్నా అందులోని మంచిని స్వీకరించడమే తప్ప మఱింకేమీ కాదు. గతమూ, అనుభవాలూ ఎల్లవేళలా మనకి సత్యాన్నే ఆవిష్కరించి పెడతాయనే మూఢవిశ్వాసం నుంచి ప్రజలు ఇహనైనా బయటపడాల్సి ఉంది. అవి కొన్నిసార్లు తప్పుడు సందేశాల్ని కూడా మోసుకు రావచ్చునని మఱువరాదు. గతం నుంచి నేర్చుకుంటున్నామనే పేరుతో మనుషులు వాస్తవంగా చేసేది, ఎప్పుడో చచ్చిన పాముల్ని ఇంకా ఇంకా చంపుతూనే ఉండడం. ఇందుకసలైన కారణం, మనం నేర్చుకోవడానికి కాక రియాక్టవ్వడానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం.

మనుషులు ఒక వయసొచ్చాక ఎదగడం మానేస్తారు. ఇది ఎదగలేక కాదు, ఎదగడం ఇష్టం లేక! కానీ ఎంత ఇష్టం లేకపోయినా, తమకు తెలియకుండా ఎంతో కొంత ఎదుగుతూనే ఉంటారు, చనిపోయే దాకా! తమకు తెలిసినదే చాలనుకోవడం, అదనపు పరిజ్ఞానం తమకు అవసరం లేదనుకోవడం, జీవితంలో కేవలం ఒకటి-రెండు లక్ష్యాలే పెట్టుకుని వాటికే తమ తనువుల్నీ, మనసుల్నీ అంకితం చేసుకోవడం ఎదగలేకపోవడానికి గల కారణాలు. ఇది నిరంతరాయంగా గతంలో జీవించడానికి దారితీస్తుంది.


మార్పుని అంగీకరించడం

దీనికీ వర్తమానంలో జీవించడానికీ కాస్త సంబంధం ఉంది. మార్పుని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేకపోవడం మానసికంగా గతంలో జీవించడం వల్లనే. మానవుల గతాన్ని పురస్కరించుకొని వారు ప్రస్తుతం ఉండాల్సిన పద్ధతిని నిర్దేశించడం అశాస్త్రీయం. మానవుల స్థితులూ, పరిస్థితులూ, జ్ఞానమూ, దృక్కోణమూ, శక్తిసామర్థ్యాలూ అన్నీ మారిపోయాక వారు గతంలో మాదిరే వ్యవహరించడం సాధ్యం కాదు. వారిలాగే, వారితో ఇతరులు కూడా. కనుక మానవసంబంధాల్లో వచ్చే ఈ గుణాత్మకమైన వ్యవహరణ పరిణామానికి తలవంచి బ్రతకాలి.

24, అక్టోబర్ 2014, శుక్రవారం

మానవతావాదాని కనుగుణంగా చట్టాల రూపకల్పన-2

వ్యవస్థ మీద – నష్టపోయినవారికి న్యాయం చేసే బాధ్యత ఎంతైతే ఉందో, ఏ తప్పూ చేయనివారినీ, వారి పరువుప్రతిష్ఠల్నీ కడుపులో పెట్టుకుని కాసే బాధ్యత కూడా అంతే ఉంది. కానీ వర్తమాన సమాజం ఈ రెండో బాధ్యతని గాలికొదిలేసిన వైనం గోచరిస్తోంది. దురదృష్టవశాత్తూ ప్రస్తుతం - మానవతావాదమంటే ఏంటో బొత్తిగా తెలీని మనలాంటి దేశాలతో పాటు అది బాగా తెలిసిన పురోగత దేశాలతో సహా  ప్రపంచవ్యాప్తంగా ఆరోపకుల న్యాయమే (Accusors’ justice) అమల్లో ఉంది. అంటే ఆరోపించినవారి మాటల్నే పాటిగా తీసుకుని ఆరోపితుల (accused) ని అవమానించడం, బద్నాం చేయడం, వారి హక్కుల్ని హరించడం, ఏ అనుమానమొస్తే ఆ అనుమానం ప్రకారంగా కొత్తకొత్త సెక్షన్లు బనాయించి ఇఱికించడం, తప్పు చేయలేదని రుజువుచేసుకునే బాధ్యతని ఆరోపితుడి మీదే పెట్టడం, ఆరోపణల వెనక పకడ్బందీ కుట్రలుండొచ్చుననే గతానుభవ గుణపాఠాల్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆరోపకులు చెప్పినదల్లా నమ్మేసి, ఆ ప్రాతిపదికన విచారణ జఱపడం, ఆరోపకులకు సంపూర్ణ విశ్వసనీయత, వారికి రాజపూజ్యం- ఇవన్నీ ఈ Accusor’s justice లో భాగం.

దీన్ని పూర్వశతాబ్దాల పాలకులు కనిపెట్టగా, దాన్ని సరిదిద్దడం మానేసి, సమకాలీనులు సైతం, తమ తమ వ్యూహాల కొద్దీ యథాతథంగా కొనసాగిస్తున్నారు. ఫలితార్థంగా Accusor’s justice కి సంబంధించిన పలు అన్యాయపు టధికరణాలతో మన చట్టాలు పొంగిపొర్లుతున్నాయి. పూర్తి ఏకపక్ష ధోరణితో కూడిన ఈ ఆరోపకుల న్యాయం విక్రేతల విపణి (sellers’ market) కంటే ఎక్కువ ధర్మబద్ధమైనది కాదని అందఱూ గ్రహించే రోజు రావాలి.

ఇదే క్రమంలో – తమ అదుపులో ఉన్నవారి పట్ల క్రూరంగా ప్రవర్తించడాన్ని కూడా మానవతావాదం అంగీకరించదు. అదుపులో లేకపోయినా అనుమానితుల్ని హింసించడం, లేదా మనసులో ఇంకేదో పెట్టుకుని కేవలం అలా హింసించడం కోసమే మనుషుల్ని ఏదో ఒక వంకతో అదుపులోకి తీసుకోవడం– ఇవి కూడా మానవతావాదానికి విరుద్ధమే. హింసకు తాళలేక ఒకడు ఓ పనిని తన మీద వేసుకుంటే అది హింసకుల విజయం కాదు. అలా హింసించి ఒప్పించడమే కరెక్టంటే మనకో వ్యవస్థ అవసరమే లేదు. ఏ దారిన పోయే దానయ్యని అందుకు అనుమతించినా అతను కూడా చెయ్యగలడు. విచారకరమైన విషయమేంటంటే తమదాకా రానంతవఱకూ అందఱూ ఈ అలవాటుని సమర్థిస్తారు. పవిత్రులమనుకునేవారు అపవిత్ర పద్ధతుల్ని  సమర్థించకూడదు. న్యాయాన్ని అమలు జఱిపే పద్ధతి కూడా న్యాయంగానే ఉండాలి.

నేఱస్థులు కూడా మనుషులేనని మానవతావాదం పేర్కొంటుంది. నేఱం ఆరోపించక ముందటి క్షణం దాకా వారు మనతో పాటు పుట్టి, మనతో పెఱిగి మన మధ్య తిరిగినవారే. అలాంటివారిని హఠాత్తుగా అస్పృశ్యుల్నీ, హక్కురహితుల్నీ చేయడం తగదు. నేఱాలకు వాటిని చేసిన వ్యక్తుల్నే పూర్తి బాధ్యులు గా చిత్రించడం కూడా సరికాదు. నిజానికి అందుకు పరోఽక్ష కారణం సమాజమే. సమాజం వ్యాప్తి చేసే తప్పుడు భావజాలమూ, అది సృష్టించే పరిస్థితులూ మనుషుల్ని నేఱాలకు పురికొల్పుతున్నాయి. ఇవి గాక చట్టాల ద్వారా కృత్రిమంగా సృష్టించబడే నేఱాలు కొన్ని ! నేఱారోపణలు లేని వ్యక్తులకుండే అన్ని పౌర, మానవ హక్కులూ ఆరోపితులకీ, నేఱస్థులకీ సైతం ఉన్నాయి, ఉండాలి.


న్యాయమనేది ఈ కాలంలో కలవారికీ, లేనివారికీ సమానంగా అందని ద్రాక్షే. ఎందుకంటే దాన్ని ప్రభుత్వమూ, రాజకీయ పక్షాలూ, వాటి అనుబంధసంస్థలూ, అనుబంధ మీడియా శాసిస్తున్న ఘోర దుర్దశలోకి వచ్చిపడ్డాం. మన చట్టాలు కొన్ని సినిమా స్క్రిప్టుల్లాంటివి. వాటిల్లో ఒక హీరో, ఒక హీరోయినూ, ఒక విలనూ, ఒక కమెడియనూ అందఱూ ముందే నిర్ణయమైపోయి ఉంటారు. కనుక ఎవఱు ఎవఱిమీద వ్యాజ్యం వేస్తే ఎవఱు గెలుస్తారో పసిపిల్లవాడు కూడా చెప్పేయగలడు. అందుకోసం మనకో వకీలు అవసరం లేదు. వీటి స్థానంలో మానవతాదృక్పథంతోనూ, సర్వజన సమదృష్టితోనూ కూడి “కక్షిదారుల్లో మేము సూచిస్తున్న ఒకఱి పక్షాన నిలబడి తీఱాల్సిందే” నంటూ పోలీసుల్నీ, న్యాయమూర్తుల్నీ ఒత్తిడిచేయని, మనస్సాక్షి కనుగుణంగా నిర్వర్తించాల్సి ఉన్న వారి స్వచ్ఛంద వృత్తిధర్మంలో జోక్యం చేసుకోని, తటస్థ -నిష్పక్షపాత-ఉదారవాద చట్టాలొస్తే బావుంటుంది.

మనకు ఈ మానవనిర్మితమైన ప్రత్యక్ష నరకాల స్థానంలో పరివర్తనాలయాలు (Reformatories) కావాలి. సంపన్న కుబేర మీడియా, ప్రయోజన గుంపులూ, కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న సమకాలీన Street justice/ Rowdy justice స్థానంలో Professional justice కావాలి. నానా రకాల రాగద్వేషాల వల్లా, ప్రలోభాల వల్లా, పక్షపాతాల వల్లా ప్రచోదితులైనవారిచ్చే తప్పుడు సాక్ష్యాల / తీర్పుల స్థానంలో వాస్తవికమైన భౌతిక రుజువుల మీద ఆధారపడ్డ Scientific justice కావాలి. 


విదేశీయుల పట్ల కూడా దయనూ, ఆదరాన్నీ ప్రదర్శించడం

నేడు విదేశీయులంటే ప్రపంచవ్యాప్తంగా నిరసనభావమూ, ద్వేషమూ ఉన్నాయి. కొన్నిసార్లు తమ ప్రాంతానికి చెందినవారు కాకపోతే స్వదేశస్థుల్ని కూడా ద్వేషిస్తున్నారు. వట్టి ద్వేషించడంతో ఆగకుండా కొండొకచో దోపిడీకి, చట్టబద్ధ/ చట్టవిరుద్ధ హింసలకీ, కించపఱపులకీ పాల్పడుతున్నారు కూడాను. దీనికి మూడు కారణాలు: 

ఒకటి– తాము తమ దేశానికి/ ప్రాంతానికి వేలాది సంవత్సరాలుగా పాతకాపులమనే విశ్వాసం. అందువల్ల తమ ప్రాంతం తమ తరతరాల పిత్రార్జితమూ, గుత్తసొత్తూ అనే అభిప్రాయం. 

రెండోది– ఇదివఱకు సాయుధంగా వలసొచ్చిన కొందఱు విదేశీయులతో తమకు కలిగిన రాజకీయానుభవాల చేదు. 

మూడోది– విదేశీయులు/ పరప్రాంతీయులు తమకంటే తెలివైనవారో, బలవంతులో కావచ్చు గనుక, వారు తమ వనరుల్నీ, అవకాశాల్నీ దొఱకబుచ్చేసుకుని తమకు లేకుండా చేస్తారేమోనన్న భయం.

సుదూర చరిత్రని గమనంలో ఉంచుకున్నప్పుడు ఏ దేశమూ ఏ మానవ సమూహపు గుత్త సొత్తూ కాదని అర్థమవుతుంది. మానవసమూహాలు ఇప్పుడున్న దేశాల్లోనే ఐదువేలేళ్ళ క్రితం లేరు. ఇంకో ఐదు వేలేళ్ళ తరువాత వీరెక్కడికి వెళ్ళబోతారో తెలీదు. ప్రతి మానవ సమూహమూ ప్రస్తుతం తనదిగా భావిస్తున్న దేశానికి/ ప్రాంతానికి బైటినుంచి వచ్చినదే. దేశాలు జాతుల గుత్తసొత్తులనే అభిప్రాయం ప్రబలిపోవడానికి కారణం, క్రీ.శ. 14–15 శతాబ్దుల నుంచి వ్యాప్తిలోకొచ్చిన జాతీయవాదం. తత్కాలీనులకి అది ప్రగతివాదం, అభ్యుదయవాదం. ఆ యుగీన జీవితాలకి అదే ఓ పెద్ద మానవతావాదం కూడా. 

ఆ మనోవైఖరికి భౌతిక కారణాలున్నాయి. ఆ రోజుల్లో గుఱ్ఱాలు తప్ప వేఱే రవాణా సౌకర్యాలెఱగరు. రాజ్యాల భౌగోళిక అధికార పరిధి ఆ విధమైన రవాణాపరిమితుల చేత సీమితమై ఉండేది. వారి నెత్తిమీద సువిశాల సామ్రాజ్యాలు కూడా లేకపోలేదు. కానీ ఆ సమ్రాట్టులెవఱూ నేరుగా కాక జిల్లాస్థాయి రాజుల ద్వారానే పరిపాలించేవారు. ఈ చిన్నచిన్నరాజ్యాల మధ్య అడపా దడపా చాలా ఘర్షణలు చెలరేగుతూండేవి. అభివర్ధిత సమాజానికి ఓ దశలో ఈ చిన్నరాజ్యాల ఆర్థిక వ్యవస్థ కాలవిరోధం (anachronism) గా కూడా పరిణమించింది. అందుకని అప్పట్లో వారు ఆలోచించారు: “ఒకే భాష, ఒకే మతమూ, సంప్రదాయాలూ గల మనమంతా ఈ విభేదాలు మర్చిపోయి, మన జిల్లాలన్నింటినీ విలీనం చేసి ఒకే ఒక పెద్దరాజ్యంగా ఏర్పడితే బావుంటుందేమో కదా?” అని! ఫలితంగా యూరప్ ఖండంలో ఒకే భాషా, సంస్కృతీ గల పెద్దపెద్ద జాతీయరాజ్యాలు చాలా ఏర్పడ్డాయి. వాటి ఆవిర్భావంతో యూరప్ ఓ పెద్ద ముందడుగు వేసినట్లయింది.  ఎందుకంటే తరువాతి కాలంలో యూరోపియన్లు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యాలు స్థాపించడానికి మూలం, తొలుత తమ స్వఖండంలో జాతీయ రాజ్యాల్ని స్థాపించుకోవడమే.

జాతీయరాజ్యాల నేర్పఱచుకున్న రోజులకీ, నేటికీ మధ్య ప్రపంచం చాలా మారిపోయింది. ఈనాడు ఒక్కరోజులో సగటు మానవుడు ప్రయాణించగల దూరం 16,000 కిలోమీటర్లు. అటువంటప్పుడు 100 కిలోమీటర్ల వేగానికి ప్రతిస్పందనగా ఉప్పతిల్లిన 14 వ శతాబ్దపు జాతీయవాదం దగ్గఱే మనం మానసికంగా, బౌద్ధికంగా స్తంభించిపోవడంలోని ఔచిత్యం పునరాలోచనీయం. జాతీయవాదం కూడా అన్ని ఇతర వాదాల్లోనూ సర్వసామాన్యంగా దర్శనమిచ్చే తభావతుల కతీతం కాదు. కనుక ఇప్పుడు మన మానవప్రేమ జాతీయవాదస్థాయి నధిగమించాల్సిన అవసరముంది. నిజానికి కొంతమేఱకు అధిగమించాం కూడా. కారణమేదైనా కానివ్వండి. మనవారు లక్షలాదిగా వలసపోతూండడమే ఇందుకు నిదర్శనం. దరిమిలా నేడు జాతీయవాదం ప్రభుత్వాలకీ,  రాజకీయపక్షాలకీ పరిమితం.

మనం ఇతర దేశాలకి వలసపోవడమే కాదు, మన దేశానికి వలసొచ్చే విదేశీయుల పట్లా, పరప్రాంతీయుల పట్లా కూడా సహనంతోనూ, ఆదరంతోనూ వ్యవహరించాల్సి ఉంది. వారిని శత్రువుల్లా చూసే ధోరణి పోవాలి. సర్వస్వామ్యాలూ ప్రసాదించాలని ఎవఱూ అనరు. కనీసం వారి మానవహక్కుల నైనా హరించకుండా జాగ్రత్త వహించాలి. నానా కారణాల్ని పురస్కరించుకుని స్వదేశంలో వేధింపులకు గుఱయ్యేవారు విదేశాలకు శరణార్థులుగా వెళ్ళడం తఱచు. కానీ అలాంటివారికి ఆశ్రయమిచ్చే విషయంలో అన్ని దేశాలూ తటపటాయిస్తూంటాయి. వేధించేది చాలక ఇంటర్ పోల్ సహాయం తీసుకుని వారిని వేటాడేవారున్నారు. ఈ పరిస్థితి మారాలి. ఒకవేళ ఎవఱైనా నిజంగానే తప్పుచేసి విదేశాలకు పారిపోతే, అది వారు తమకు తాము విధించుకున్న దేశ బహిష్కార శిక్ష. అది వారి ఖర్మ. అందుకు సంతోషించాలే తప్ప వారిని వెంటాడి మఱీ స్వదేశానికి తెచ్చే పనేముంది ?
 

20, అక్టోబర్ 2014, సోమవారం

తన ధనాన్నీ, జ్ఞానాన్నీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులతో పంచుకోవడం

అంటే సాధ్యమైనంతవఱకూ ఇతరులకు సహాయం చేయడం. మానవజాతికి చరిత్రలో ఇప్పటిదాకా ఏదైనా మేలు జఱిగిందంటే దానిక్కారణం– కొందఱు వ్యక్తులు ప్రతిఫలాపేక్ష లేకుండా తమ సంపదనీ, జ్ఞానాన్నీ ఇతరులకు ఉచితంగా పంచిపెట్టడం వల్లనే. వట్ఠి ఉపయోగవాదాన్ని (utilitarianism) ఆశ్రయించినవారి వల్లా, ప్రతీదీ అమ్మజూపేవారి వల్లా మానవాళికి ఎన్నడూ ఏ మేలూ జఱగలేదు. ఇహ ముందూ జఱగబోవడం లేదు. నిజానికి ఈ తరువాతి రెండు తరహాల వ్యక్తులూ మొదటి తరహా వ్యక్తుల మూలాన బాగుపడ్డవాళ్ళే. మొదటితరహా వ్యక్తులు తమ జీవితాన్ని కూడా లెక్కచేయకుండా సాధించిన విషయాల్ని వీరు తరువాతి కాలంలో సొమ్ముచేసుకుంటారంతే. 

“చేపలు వండిపెట్టడం కన్నా చేపలు పట్టడం ఎలాగో నేర్పడం ఎక్కువ మేలుచేస్తుంది” అనే సూక్తి తఱచుగా వినపడుతుంది. వినడానికి ఈ వాదన చాలా బావుంటుంది. కానీ చేపలు పట్టడం నేర్పాలంటే ముందసలు అక్కడ చేపలంటూ ఉండాలి కదా. “పోనీలే” అని దయచూపి చంపకుండా కొంత కాలం పాటు వాటిని వాటి మానాన బ్రతకనిచ్చేవాళ్ళుండాలి కదా. కానీ జనం చేపపిల్లలతో సహా అన్నీ అమ్మేసుకుంటారు. 

సారాంశమేంటంటే– మానవజాతి చరిత్రలో ఏ వ్యాపారమూ వ్యాపారదృష్టితో మొదలుకాలేదు. ప్రతీదీ ముందు సన్నిహితులకు చేసిపెట్టిన ఉచిత సేవగా మొదలై తరువాతి దశల్లో వ్యాపార రూపాన్ని సంతరించుకుంది. ప్రతి వ్యాపారానికీ ముడిసరుకు ప్రకృతిసంపదే. మఱి ఆవిడకి వ్యాపారులు ఏం చెల్లిస్తున్నారు? ఏమీ లేదుగా? ప్రకృతే కాదు, జయప్రదమైన ప్రతి వ్యాపార పూనిక వెనకా ఎవఱిదో దయార్ద్ర హృదయం తప్పకుండా దాగుంటుంది.

తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డబేరము: మఱో విషయమేంటంటే- ఇతరులకు సేవా-సహాయాలందించడం కోసమో, లేదా వారికి భద్రత కల్పించడం కోసమో, లేదా వారికి హక్కులు ప్రసాదించడం కోసమో, వారిచేత మంచివాళ్ళు అనిపించుకోవడం కోసమో ఎవఱూ తమ హక్కుల్ని – వ్యక్తిగతంగా గానీ, సామూహికంగా గానీ - కోల్పోయి, ఒళ్ళు హూనం చేసుకుని, తమను తాము రెండో తరగతి పౌరులుగా మార్చేసుకుని మఱీ బ్రతకాల్సిన అవసరం లేదు, ఆ ఇతరులు స్వయానా తమ రక్తసంబంధీకులూ, కుటుంబసభ్యులే అయినా ఇతరుల జీవితానికీ, హక్కులకూ ఉన్న విలువే మన జీవితానికీ, హక్కులకీ కూడా ఉందని మఱువరాదు. ఒకఱు ఇతరులకు ఏదైనా ఇవ్వగలగాలంటే ముందు వారి దగ్గఱ ఏదైనా ఉండాలి. ఇవ్వాలనే స్వేచ్ఛామయమైన ఉదార సంకల్పాన్ని కలిగించే వాతావరణం ఉండాలి. ముందు తాము ఔదార్యాన్ని రుచిచూస్తేనే తరువాత ఇతరులకూ దాన్ని పంచగలుగుతారు. ఔదార్యం చూపి తీఱాలని బలవంతం చేస్తే అది ఔదార్యం కాకుండా పోతుంది.

మానవత్వపు ఉదార ప్రదర్శన కొన్నిసార్లు ఇతరుల్లోని మానవత్వాన్ని తట్టి లేపడానికి బదులు, వారిలో దోపిడీ సంకల్పాల్నీ, అమానుషత్వాన్నీ పెంపొందించవచ్చు. ఒకసారి అలా అలవాటు చేశాక ఒక పక్షంవారేమో అన్నీ వదిలేసుకోవాల్సి రావడమూ, మఱో పక్షంవారేమో అన్నీ తేరగా కైవసం చేసేసుకోవడమూ మాననీయమైన సామాజిక సంప్రదాయాలుగా మారిపోతాయి. మనుషుల్లో మొదట్నుంచీ ఉన్న బలహీనత ఏంటంటే – ఒక పక్క ఉచితంగా లభ్యమవుతున్న ఇతరుల మంచితనం మీద పడి బ్రతుకుతూ మఱోపక్క అది తమ గొప్పతనమనీ, దైవదత్తమైన హక్కనీ పిడివాదానికి దిగడం. అటువంటప్పుడు తాత్కాలికంగా, లేదా పరిమితంగా మానవతావాద సూత్రాల్ని క్రియారహితం చేయడంలో తప్పులేదు. అయితే వారిని ద్వేషించకుండా వారూ కాలక్రమంలో మారతారనే ఆశాభావంతో ఎదురుచూడాలి. ఆ దిశలో మన వంతు కృషి మనం సలుపుతూనే ఉండాలి.

చట్టాలకూ, వ్యవస్థలకూ మానవతావాదాన్ని మార్గదర్శకంగా స్వీకరించి రూపొందించుకోవడం

చట్టాల్లో ఒక గణనీయశాతం, శస్త్రచికిత్స చేసి కడుపులో కత్తెర మర్చిపోవడం వంటివి. కనుక వాటితో మనుషులు మంచిగా మారతారని మానవతావాదులు విశ్వసించరు. కానీ జనాన్ని చెడగొట్టడానికైతే ఇతోఽధిక అవకాశముంది. ఉదాహరణకి, తప్పుడు ఫిర్యాదులిచ్చేవారిని శిక్షించాలనే నియమం లేకపోవడంతో కేవలం పరపీడన-స్వలాభాల నిమిత్తం ఫిర్యాదులిచ్చేవారి సంఖ్య పెఱిగిపోతోంది. అదే నిష్పత్తిలో అమాయకులు బలైపోవడం కూడా హెచ్చుతోంది. కాబట్టి నమోదు చేయడానికి ఒక ఫిర్యాదు అర్హమో, కాదో లోతుగా చర్చించి నిర్ధారించడానికి మానవతావాదులతో కూడిన ముందస్తు వడపోత మండళ్ళ (screening committees) ని ఆధికారికంగా ఏర్పఱిస్తే దురుద్దేశ పూరితమైన ఆషామాషీ కేసుల మోతను  నివారించడానికి చాలా వఱకూ అవకాశం ఉంటుంది.

సమాజాన్ని బాగుచేయకపోయినా ఫర్వాలేదు కానీ ప్రశాంతమైన యథాస్థితి (status quo) ని పాడుచేసేలా మానవతాసూత్రాలకు విరుద్ధమైన చట్టాలు చేసుకుంటూ వెళ్ళొద్దని మానవతావాదులు సలహా ఇస్తారు. చట్టాలనేవి, సంకుచితులూ, సిద్ధాంతోన్మాదులూ అయిన కొన్ని ప్రయోజనగుంపుల (interest groups) యొక్క ఇష్టానిష్టాలకో, లేదా క్షణానికో చిత్తంగా మారిపోయే పరిపాలకుల తలతిక్కలకో అనుగుణంగా కాక అంతర్జాతీయామోదం పొందిన మానవహక్కుల చార్టర్ కి అనుగుణంగా రూపొందించాలని వారు కోరతారు.

ఐతే ప్రస్తుతం అమల్లో ఉన్న మానవహక్కుల చార్టర్ అసమగ్రమని గమనించాలి. ఉదాహరణకు, అందులో మాతృభాషాహక్కులకు ఏ విధమైన రక్షణా ఇవ్వబడలేదు. అదే కాక అనేక ఇతరాంశాల్ని సైతం జోడించి మానవహక్కుల్ని పునఃక్రోడీకరించాల్సి ఉంది. ఈ విషయానికి అంతర్జాతీయ స్థాయిలో ఆమోదాన్ని సంపాదించడం వెంటనే సాధ్యపడకపోవచ్చు గనుక ప్రస్తుతానికి ప్రాంతీయస్థాయి లో మనమే దాన్ని తిరగవ్రాసుకోవడం గుఱించి యోచన చేయాలి.

సామాజిక అవసరాల్నీ, అనివార్యతల్నీ చట్టాలుగా రూపుదిద్దడం కొంతవఱకూ ఆమోదయోగ్యం. ఆదర్శాలూ, ఆశింపులూ అనివార్యం కాదు. అవి అవసరాల శ్రేణిలోకి రావు. ఓ వర్గానికి అనుకూలంగా ఓ చట్టాన్ని తేక తప్పని పరిస్థితి ఉంటే, అదే సమయంలో, ఇతర వర్గాలక్కూడా అనుకూలంగా అలాంటిదే మఱో సమాంతర చట్టాన్ని తేవాలి. ఆ విధంగా ఎవఱి మానవహక్కులకూ భంగం కలగకుండా సమతూకాన్ని పాటించాలి.

ఈ సందర్భంగా ఒక విషయం. మానవతావాదులు సమానత్వంలాంటి సిద్ధాంతాల మీద ఊనిక (emphasis) పెట్టరు. దానర్థం, వారు అసమానత్వాన్ని సమర్థిస్తారని కాదు. చరిత్రగతిలోనూ, ప్రకృతిమూలకంగానూ వచ్చిపడ్డ అసమానత్వాల సన్నిధానంలో మనం నిస్సహాయులం. మనం వాటిని సరిదిద్దలేం. అలాగే, వ్యక్తుల జీవితాల్లో వారివారి ప్రతిభా-వ్యుత్పత్తులూ, కృషి, అదృష్టం ఇత్యాదుల మూలాన ఏర్పడ్డ అసమానత్వాల్నీ మనం సరిదిద్దలేం. కానీ సమాన ప్రతిభ గల వ్యక్తులకు సమానావకాశాల్ని కల్పించడం వఱకూ చేయగలం. అదే విధంగా, మన సమష్టిచర్యలలోని తెలివితక్కువ తనం కారణంగా సరికొత్త అసమానత్వాలు సృష్టికాకుండా జాగరూకత వహించగలం. ఉదాహరణకి సమాజంలో కొన్ని వర్గాలకి మూకుమ్మడిగా చట్టపరంగా ఎక్కువ వెసులుబాట్లూ, ఎక్కువ ఆమోదయోగ్యతా (acceptability), ఎక్కువ రక్షణా ఇవ్వడం వల్ల ఆ మేఱకు వాటిలో మిగతా వర్గాలకు కోతపెట్టినట్లే అవుతుంది. అందుచేత ఇలాంటి అసమతూకం సమాజంలో తీవ్ర అసంతృప్తికీ, అశాంతికీ దారితీస్తుంది. పర్యవసానంగా చట్టరక్షిత వర్గాలకూ, అలాంటి రక్షణేదీ లేని వర్గాలకూ మధ్య శత్రుత్వమూ, పరస్పర పీడనా హెచ్చుతాయి. ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇలాంటి సంభావ్యతల్ని నివారించాలన్నా, చట్టాల రూపకల్పనలో మానవతాసూత్రాల స్ఫూర్తికి స్థానం కల్పించడం తప్పనిసరి.

15, అక్టోబర్ 2014, బుధవారం

క్షమాగుణం

ప్రపంచం సర్వానవద్యం (all perfect) గా సృష్టించబడలేదు. మనం ప్రకృతిలోని పదార్థాల్ని సంస్కరించుకొని, మార్పు చేసుకుని వాడుకుంటున్నాం. వాటి మీద నిందారోపణలు చేసి దూషించడం లేదు. మనుషులనైనా అంతే చేయాలి. మానవులూ పూర్తిసౌష్ఠవంగా సృష్టించబడలేదు. దీనికి ఎవఱూ మినహాయింపు కాదు. ఈ సత్యాన్ని మనసా-వాచా-కర్మణా అంగీకరించి, సకల సౌష్ఠవాశంసల్నీ (all expectations of perfection) పక్కన బెట్టి మనుషుల్ని ఉన్నవాళ్ళని ఉన్నట్లుగా, వారి యొక్క యావత్తు సల్లక్షణాలతోనూ, విలక్షణాలతోనూ, అవలక్షణాలతోనూ సమగ్రంగా అంగీకరించి ప్రేమించడం, మనసారా క్షమించడం నేర్చుకోవడమే మానవతావాదం. “నాకేం అవసరం?” అనడం అతార్కికం. తోటిమానవుల ప్రేమసానుభూతులు ప్రతిమనిషికీ అవసరమే. ఎంతటి బలవంతుడికైనా అవసరమే. మనమిప్పుడు ఇతరుల్ని క్షమిస్తే భవిష్యత్తులో క్షమాపణ కోరేందుకు మనకీ, మనవాళ్ళకీ అర్హత సిద్ధిస్తుంది. మనుషులు పరిస్థితుల్ని బట్టి మాత్రమే మంచిగానో, చెడుగానో ముద్రపడతారు తప్ప వాస్తవానికి వారు అదీ కాదు, ఇదీ కాదు. తమ పరిస్థితులు అనుకూలిస్తే వారూ మంచిగానే ముద్రపడతారు. ఉదాహరణకి- మన దేశంలో ఒకప్పుడు ప్రేమలో పడ్డ స్త్రీ బరితెగించినదానికిందే జమ. “ప్రేమే నేఱమౌనా?”అని విషాదగీతాలు పాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కాదు.

ప్రపంచం- తప్పుచేసేవారూ, చేయనివారూ అని ఖరాఖండిగా సమవిభక్తమై లేదు. ఇతరులకు తెలిసేలా తప్పుచేసేవారూ, రహస్యంగా చేసేవారూ అని మాత్రమే విభక్తమై ఉంది. ఆ అపరాధాల తీవ్రత ఎంత? అనేది తరువాతి విషయం. తమకే అవసరమూ, అవకాశమూ, శక్తీ ఉంటే అందఱూ తప్పు చేస్తారు. కొందఱు కొన్ని విషయాల్లో చేస్తే మఱికొందఱు మఱికొన్ని విషయాల్లో చేస్తారు. ఒకఱు చేసే తప్పే ఇంకొకఱు కూడా చేయాలని ఏమీ లేదు. కొన్ని తప్పులకు శిక్షలు వ్రాసిపెట్టారు. కొన్నిటికి వ్రాయలేదు. అంతే తేడా. మినహాయింపులు ఉండొచ్చు. కాదనట్లేదు. కానీ అవి మినహాయింపులు మాత్రమే. కనుక పరిశుద్ధులెవఱూ లేని ఈ మర్త్యలోకంలో మానవులు ఒకఱినొకఱు క్షమించుకోవడమే సమంజసం.

మనం ఇతరుల్ని క్షమించలేకపోవడానికి అసలైన కారణం ఇదే, మనమేదో మహాపవిత్రులమనీ, అవతలివాడు మాత్రమే కళంకితుడనీ మనలో మనకు తెలియకుండానే నాటుకుపోయిన ప్రగాఢమైన మూఢవిశ్వాసం. వాస్తవమేంటంటే, జాగ్రత్తగా గమనించినప్పుడు నీతీ, న్యాయం అనేవి సమకాలీన సమాజంలో ఎవఱికీ అవసరం లేదు, వాటి గుఱించి మూరెడు, బారెడు ఉపన్యాసాలిచ్చేవాళ్ళతో సహా ! అందఱికీ నూటికి నూఱుశాతం కావాల్సినదీ, అంతా అహర్నిశం తాపత్రయపడిపోతున్నదీ బ్రతకడం కోసం. ఎలాగైనా సరే, బ్రతకడం కోసం. ఏం చేశైనా సరే, సమాజంలో ఓ సభ్యుడుగా, దానికి అనుగుణంగా ఒదిగిపోయి, అందఱిలోనూ తానొక విచిత్రవ్యక్తి అనిపించుకోకుండా మనగల్గడం (survival) కోసం. ఈ క్రమంలో నీతీ, న్యాయం అనేవాటిని గోడచాటుకు తీసుకెళ్ళి లోపాయికారీగా క్షమాపణలు చెబుతూ, “ఏమీ అనుకోవద్దయ్యా ధర్మదేవా! మా శక్తి ఇంతే” అని వీడుకోలు పలకడానికి ఎవఱికీ అభ్యంతరం లేదు. అంతా ఇంతే అయినప్పుడు, ఇలాంటి వాతావరణం లో ఎవఱిని క్షమించడానికైనా మనకెందుకు అభ్యంతరం ఉండాలి? మిగతావాళ్ళందఱినీ బేషరతుగా భరించడం లేదూ?

ఒక పని చెడ్డది కావచ్చు. కానీ దాన్ని చేసిన మనిషి దాన్ని చేసినంతవఱకే చెడ్డవాడు. అది చేయడం మానేసినా, లేదా అతను అందుకు క్షమాపణ చెప్పినా, లేదా తన పనికి అతను తగువిధంగా పరిహారం చెల్లించినా అతనూ మంచివాడే అవుతాడని మానవతావాదం చెబుతుంది. “అతను ఆ ఒక్క సంఘటన విషయంలో సరిగా ప్రవర్తించలేదు. అతను ఆ సమయంలో కాస్త నిగ్రహం పాటించి ఉంటే బావుండేది” అనడం వఱకే మానవతావాదులు పరిమితమవుతారు. కనుక ఇప్పుడు సామాజికులు చేస్తున్నట్లుగా ఒక పనిని– ఒకే ఒక్క పనిని పురస్కరించుకొని మానవుడి మొత్తం స్వభావాన్నీ జడ్జ్ చేసిపారేయడం, జీవితాంతమూ అతన్ని గాయపఱచడం, అతని గుఱించి తమకు తెలీనివి మాట్లాడడం, లేనివి అంటగట్టడం, కళ్ళకి కనిపించనివి ఊహించడం- ఇదంతా పూర్తి అశాస్త్రీయం, అభ్యంతరకరం. కనుక నేఱస్థులు కూడా మానవులేననీ, వారు కూడా కాలక్రమంలో మారడానికి అవకాశముందనీ మనం మర్చిపోయేలా చేస్తూ, “కీచకుడు, రావణుడు” అంటూ పౌరాణిక విలన్ల నామాలతో వారికి లేని వ్యక్తిత్వాల్ని ఆపాదించడం. వారిని కృత్రిమంగా బూచాళ్ళుగా మార్చడం. ఆ విధమైన ఊకదంపుడుతో జనసామాన్యానికి దుర్నిగ్రహమైన భావోద్వేగాల్ని కలిగించి పిచ్చెక్కించడం. సంపన్న కుబేర మీడియా పాల్పడే ఈ రకమైన అమానవీయ కార్యకలాపాల్ని మానవతావాదులు ఎట్టి పరిస్థితుల్లోనూ హర్షించరు.

ఎంత వయసొచ్చినా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా. నేఱస్థులతో సహా అందఱివీ ప్రక్రియ (process) లో ఉన్న వ్యక్తిత్వాలే. పూర్ణ పురుషులంటూ ఇక్కడ ఎవఱూ లేరు. 120 ఏళ్ల ఆయుర్దాయమున్నవాడి క్కూడా జీవితం మొత్తం ఓ అభ్యసన ప్రక్రియే. అందఱమూ జీవితాంతం నేర్చుకునేవాళ్ళమే. కాబట్టి ఒక వ్యక్తి ఏదో ఒక బలహీన భావోద్వేగ క్షణంలో పట్టుతప్పి ఏదో చేస్తే, “అతను అదే” అని శాశ్వతంగా ముద్ర వేసేయడం సరికాదు. కాబట్టి సమాజంలో తొలి తప్పిదాల్ని క్షమించే వెసులుబాటు ఉండాలి. అదే విధంగా మనుషులు అంతకు ముందు సమాజానికి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని క్షమించే వెసులుబాటు కూడా ఉండాలి. ఎందుకంటే క్రిమినల్ చట్టాలన్నీ సాధారణంగా మహా బలశాలుల్నీ, కిరాతకుల్నీ ఉద్దేశించి వ్రాయబడతాయి. కానీ దరిమిలా, అవి అంతకంటే చాలా తక్కువ తీవ్రత గల తప్పులకీ, ముందస్తు నేఱచరిత్రేదీ లేని అత్యంత సాధారణ బలహీన పౌరులకీ అనువర్తించబడతాయి.

ఏదైనా పొఱపాటు చేసినవారు క్షమాపణ చెప్పే సంస్కృతీ, అది చెప్పినప్పుడు అలా చెప్పినవారిని క్షమించే సంస్కారమూ పెంపొందాలి. సహృదయులైన రెండు పక్షాలవారి మధ్య చోటుచేసుకున్న  నిజాయితీతో కూడిన క్షమాపణలు వారి యొక్క దెబ్బదిన్న మానవ సంబంధాల్నీ, సంఘంలో శాంతి నీ అత్యద్భుతంగా పునరుద్ధరిస్తాయి. కానీ ఈ రోజుల్లో క్షమాపణల్ని అవతలివారిని క్షమించడానికి కాకుండా, వారు తప్పుచేశారనడానికి తిరుగులేని ఆధారంలాగా వాడుకోవడం గమనించవచ్చు. అంతేగాక మన దేశంలో క్షమాపణలకు వ్యవస్థాగతమైన విలువ లేకపోవడం మూలాన క్షమాపణ చెప్పడం కూడా ఓ పెద్దబెడద (risk) గా తయారై, ఆ సహృదయ సంస్కృతే క్రమంగా మఱుగున పడి అంతరించిపోతోంది. సౌదీ అరేబియాలో బాధితులు బాధకుల్ని క్షమిస్తే అభియోగం (case) ఉండదట. మంచి వివేకవంతమైన (sensible) ఏర్పాటు. కందకు లేని దుఱద కత్తిపీటకెందుకు ? 

క్షమాపణ చెప్పడం జనం అనుకుంటున్నంత సులభమైన పని కాదు. దానికి చాలా సంస్కారం కావాలి. అలాగే క్షమాపణ స్వీకరించడానిక్కూడా చాలా సహృదయం కావాలి. కక్షతో అహర్నిశం రగిలిపోతున్నవారికీ, కక్ష తీర్చుకునే అవకాశాలు పుష్కలంగా లభ్యమౌతున్నవారికీ, శత్రుత్వాల్ని పెంచుకోవడంలోనూ, బలప్రదర్శన చేయడంలోనూ అమందానందాన్ని అనుభవించేవారికీ, ఆత్మ న్యూనతాభావం (inferiority complex) తో పొద్దస్తమానం బాధపడేవారికీ క్షమాపణల్ని స్వీకరించేటంత హృదయగత సంస్కారం ఉండదు. కాబట్టి క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా, వారు ఎదిరి మనుషులమీద కక్ష తీర్చుకుని తీఱతారు.

క్షమాపణలతో సంతృప్తి చెందుతామని చెప్పుకునేవారు కూడా అవతలివారు తమ కాళ్ళ మీద పడాలన్నట్లు డిమాండ్లు చేస్తారు. “బేషరతు క్షమాపణలు” ఆ రకమైన ఆశింపులో ఓ భాగం. “నువ్వు నీలా ఉండకుండా మేము డిమాండ్ చేస్తున్న విధంగా మారిపోవాలి, మారినట్లు కనిపించాలి” అనడమే ఈ “బేషరతు”కు అంతరార్థం. ఒకఱు అలాగే బాహ్యంగా క్షమాపణ చెబుతారు. కానీ ఆంతరికంగా మారరు. అప్పుడేం చెయ్యాలి ? ఎవఱినైనా సరే, కాళ్ళబేరానికి తెచ్చి అవమానించడం ద్వారా, వారి అహాన్ని దెబ్బదీయడం ద్వారా మార్చలేం, వారు మారాలని మనం నిజంగా ఆకాంక్షిస్తే ! తప్పు చేసినవారు తమ తప్పును తాము తెలుసుకుని తాముగా క్షమాపణ చెబితే ఆ విలువే వేఱు.

ఏ తప్పూ చేయకపోయినా క్షమాపణ చెప్పాల్సిరావడం విచారకరమైన పరిస్థితి. ఇది పలుసందర్భాల్లో- ఒకఱి అవగాహనాస్థాయి వేఱొకఱి అవగాహనాస్థాయికంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉండడం వల్లా, ఇతరులు తనని అర్థం చేసుకోవడానికి తిరస్కరించడం వల్లా, వర్గీయ రాజకీయాల వల్లా, అనవసరమైన దుష్ప్రచారం వల్లా ఉత్పన్నం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో అవతలివారి కంటే తనకెక్కువ తెలిసిన పాపానికీ, అజ్ఞానుల పశుబలానికీ వ్యక్తి మూల్యం చెల్లించాల్సి వస్తుంది.

మనుషులు ఒక విధమైన స్వభావాన్ని కలిగి ఉండడానికి కొన్ని కారణాలుంటాయి. ఓ నేపథ్యం ఉంటుంది. ఆలోచనలూ, అనుభవాలూ, వాటినుంచి మనిషి తీసుకున్న పిండితార్థాలూ (conclusions), తత్త్వీకరణలూ (philosophizations) ఇత్యాది. అవి మారకుండా ఊరికే కాళ్ళమీద పడ్డంతమాత్రం చేత ఆ స్వభావం మారదు. తెలిసిన అనుభవాల కన్నా భిన్నమైన అనుభవాలు వాటంతట అవి కలగాలి. మార్చగల సత్తా ఉన్నది వాటికే. అందుచేత ఒక మనిషి ఎంత జ్ఞాని అయినా, అధికారవంతుడైనా క్షమాపణ చెప్పించడం ద్వారా  మఱో మనిషిని మార్చగలగడం నూటికి నూఱుశాతం అసంభవమైన విషయం. దానివల్ల తాత్కాలికంగా పని గడవొచ్చు. అంతకన్నా ఎక్కువ ప్రయోజనాన్ని ఆశించకూడదు. కనుక బలవంతపు క్షమాపణలనేవి, ఆ చెప్పించుకునేవాళ్ళకి ఓటమే తప్ప గెలుపు కాదు. కొట్టి నమస్కారం పెట్టించుకోవడం లాంటిదది. ఇతరుల్ని బాధపెట్టినవారు క్షమించమని అడగనంతకాలం తప్పు వారిది. క్షమించమన్న తరువాత కూడా క్షమించకపోతే ఆ తప్పు క్షమించనివారిదవుతుంది. అదీగాక క్షమాపణ అనేది ఆత్మగౌరవం గల వ్యక్తులనుంచి స్వచ్ఛందంగా, సహజంగా, వారిదైన శైలిలోనే రావాలి.
 

10, అక్టోబర్ 2014, శుక్రవారం

ప్రతిహింసా వ్యతిరేకత

హింసను వ్యతిరేకించడమంటే ప్రతిహింసను కూడా వ్యతిరేకించడమే. ఎందుకంటే ప్రతిహింస భవిష్యత్తులో మఱింత హింస ద్వారా జవాబివ్వబడుతుంది. అదో గొలుసుకట్టు పరంపర. కాబట్టి కక్ష తీర్చుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానవతావాదం సమర్థించదు. అదే విధంగా హింసాపూరితంగా చర్యలు తీసుకోవడాన్ని కూడా సమర్థించదు. అంటే వెలివేత, యావజ్జీవాలూ, ప్రాణం తీయడం, అవయవచ్ఛేదం, దెబ్బల్లాంటివాటితో అది ఏకీభవించదు. విచారణలోనో, అంతిమనిర్ణయంలోనో పొఱపాటు జఱిగి ఒకఱు పైన పేర్కొన్న అమానుషాలకు బలయ్యాడనుకోండి. తరువాతెప్పుడో అతను మంచివాడని తేలినా కూడా అతనికీ, అతని కుటుంబానికీ జఱిగిపోయిన నష్టాన్ని ఏ వ్యవస్థా పూడ్చజాలదు. పై పెచ్చు ఇందులో శక్తి-అసమతూకం (power imbalance) కూడా ఉంది. ఎందుకంటే వ్యవస్థలతో పోలిస్తే విడివ్యక్తి దుర్బలుడని ఒప్పుకుంటే, మనం వాస్తవంగా నిలబడాల్సింది ఎవఱి పక్షాన ? 
 

మరణశిక్షలూ, అవయవచ్ఛేదాలూ అమల్లోకి తెచ్చి లోకాన్ని అమాంతం బాగుచేసిపారెయ్యాలని ఉబలాటపడేవారు గుర్తించని విషయం ఏంటంటే – ఒకసారి అలాంటివాటిని ఆమోదయోగ్యం చేశాక ప్రతి ఒక్కఱూ వాటిల్లో తమ స్వకీయ సృజనాత్మకతని ప్రవేశపెట్టి, మనుషుల్ని హింసించడంలోనూ, చంపేయడంలోనూ విపరీతమైన వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ స్వీయకళాచాతుర్యాన్ని వెలార్చసాగుతారు. గతంలో జఱిగింది అదే. నిజాం రాజ్యంలో అవినీతిపరుల్ని ఫిరంగులతో పేల్చి చంపేవారు. మధ్య యుగాలనాటి యూరప్ లో పరుగెత్తుతున్న గుఱ్ఱానికి మనిషిని కట్టి ఈడ్పించి చంపేవారు. బ్రతికుండగానే తల మీద ఉన్న చర్మమంతా కోసేసి తీసి పై-కపాలాన్ని మిగిల్చేవారు. నీళ్ళల్లో ముంచి చంపేవారు. మఱుగుతున్న నూనెలోకి తోసేవారు. కాళ్ళూ చేతులూ నఱికి ఆరుబయట అలా వదిలేసేవారు. ఒక చిన్నగదిలో 20 మందిని బంధించి తిండిపెట్టకుండా మాడ్చి చంపేవారు. ఈరోజుల్లో చాలా చిన్నతప్పులని భావించబడేవాటి క్కూడా ఆ రోజుల్లో ఇలాంటివి అమలు జఱిపారని తెలుసుకుంటే మనసు బాధతో మూలుగుతుంది.

అంతమాత్రాన ఆ కాలపు జనం క్రూరులూ, అనాగరికులూ అనడం సరికాదు. ఇక్కడ అసలుప్రశ్న దయాగుణం గుఱించో, క్రూరత్వం గుఱించో, నాగరికత గుఱించో కాదని గమనించాలి. మూడు భావనల్లో వారీ పనులు చేశారు.

ఒకటి -  తప్పొప్పులు నిర్ణయించే తెలివితేటలు తమకు ఉన్నాయనుకోవడం.
రెండు –  దేనికెంత శిక్షో నిర్ణయించే శక్తి కూడా తమకు ఉందనుకోవడం.
మూడు –  తోటి మనిషిని శిక్షించే అధికారం తమకు ఉందనుకోవడం.


ఆత్మపరిశీలన చేసుకుంటే ఈ భావనలు ఈ రోజు మనలో కూడా ఉన్నాయని అర్థమౌతుంది. కనుక అవకాశమివ్వాలే గానీ మనమూ తప్పకుండా ఆ పనులు చేస్తాం. మరణశిక్షలూ, అవయవచ్ఛేదాలూ సమాజంలో విస్తృతామోదాన్ని పొందితే ఆ అవకాశమొస్తుంది.

ఎంత నేఱం చేస్తే అంత స్థాయిలో నేఱస్థుల్ని హింసించే సావకాశం మనుషులకుందా? ఇది ఆలోచనీయం. ఎంత శిక్ష విధిస్తే పాపం పరిహారమవుతుందో ఖచ్చితంగా ఎవఱైనా చెప్పగలిగితే బావుంటుంది. ఉదాహరణకు, ఒకఱిని చంపితే మరణశిక్ష వేయాలన్నప్పుడు పదిమందిని చంపినవాడికి పది మరణశిక్షల్ని అమలుజఱపడం సాధ్యమేనా ? ఎందుకంటే ఒకసారి ఉరితీస్తేనే అతను చనిపోతాడు. మిగతా తొమ్మిది హత్యలకూ వేయాల్సిన శిక్షల సంగతేంటి ? కనుక “దేనికి ఏది శిక్ష ? లేదా దేనికెంత శిక్ష ?” అనేది మనుషుల చేతుల్లో బొత్తిగా లేదనీ, వారికి తెలీదని స్పష్టమవుతోంది. కనుక ఎంత పెద్దతప్పుకైనా 16 - 18 సంవత్సరాల కఠిన కారావాసం కంటే ఎక్కువ శిక్ష అవసరం లేదు. మనుషులు మారి సత్ప్రవర్తన అలవఱచుకుంటే ఇంకా ముందే విడుదల చేయడం బావుంటుంది.

ఒకఱికి శిక్ష వేసి/ హింసించి తద్ద్వారా (ఆ దృష్టాంతం ద్వారా) అతన్ని కాక, ఇతరుల్ని మార్చాలనుకునే ధోరణి ఒక తెలివితక్కువతనం. అది నిజానికి లోకల్ గూండాల మెథడాలజీ. ఒకఱిని చూసి ఇంకొకఱు బాగుపడతారనీ, లేదా చెడిపోతారనే అభిప్రాయాలు కేవలం అభిప్రాయాలే. ఎవఱూ ఎవఱిని చూసీ ఏమీ నేర్చుకోరు, డబ్బు సంపాదించడం తప్ప!  మిగతా విషయాల్లోఎవఱి సొంత బుఱ్ఱలు వారికున్నాయి. తాము చేసేది నేఱమనీ, దానికి శిక్ష ఉందనీ తెలియక కాదు నేఱస్థులు నేఱాలు చేసేది. ఎవఱు దొఱికినా తాము మాత్రం “దొఱకం” అనుకుని ఆ భరోసాలో చేస్తారు. అందుచేత అంతకుముందు అదే నేఱానికి ఎంతమంది ఏ విధంగా శిక్షించబడ్డారనే గణాంకాలు (statistics) ముందేసుకుని విశ్లేషిస్తూ వారు కూర్చోరు.

మన దగ్గఱ డబ్బు పుచ్చుకున్నవాళ్ళు మన పట్ల కృతజ్ఞులై ఉండడమూ, కఠిన శిక్షలతో ప్రపంచం భూతల స్వర్గం కావడమూ– రెండూ బహుశా ఒకేసారి జఱుగుతాయి. కఠిన శిక్షలతో ప్రపంచం అమాంతం బాగుపడిపోయే మాటైతే వాటిని శతాబ్దాల తరబడి ఎందుకు అమలు జఱిపాల్సి వచ్చిం దో, అలా చేసినప్పటికీ నేఱాలు యథాపూర్వంగా ఎందుకు కొనసాగాయో సమాధానాన్ని అన్వేషించాల్సి ఉంది. హేయమైన నేఱాలకు మనుషులు పాల్పడడానికి గల కారణాల్లో ఒకటి కఠిన హృదయం. వ్యక్తుల హృదయాలు అలా బండబాఱిపోవడానికి గల కారణాల్లో ఒకటి, వారు పుట్టకముందే కుటుంబాల్లోనూ, సమాజంలో నెలకొన్న క్రూర వాతావరణం. కఠినశిక్షల్ని ప్రభుత్వం విధించడం, జనం వాటిని కనులారా తిలకించడం అటువంటి క్రూరవాతావరణాన్ని మఱింతగా సమాజం మీద విధిస్తాయే తప్ప దాన్ని క్షీణింపజేయలేవు. ఎందుకంటే మనం రోజూ ఏదైతే చూస్తామో అంతిమంగా అదే మనమౌతాం. కనుక ముందు చేయాల్సింది, కఠిన శిక్షల పేరిట మఱింత క్రూరత్వాన్నీ, ప్రతీకార ధోరణుల్నీ ప్రమోట్ చేయడం కాదు. అవగాహననీ, సున్నితత్వాల (sensibilities) నీ పెంపొందించడం. శిక్షానంతరం సైతం మనిషికో భవిష్యత్తుంటుంది. జీవితముంటుంది. కుటుంబముంటుంది. ఉండాలి కూడా! ఈ వాస్తవాల్ని ఎవఱూ విస్మరించకూడదు.

మనుషుల్లో ప్రతీప స్పందనల్ని (negative reflexes) రెచ్చగొట్టడం ద్వారా వారిని మార్చడమూ లోకాన్ని సుజీవం (better place to live) చేయడమూ సాధ్యం కావు. భయమూ, ఆశపోతుతనమూ ఇలాంటి ప్రతీపస్పందనలే. అందుచేత భయపెట్టడం ద్వారానో, ఫలానా లబ్ధి చేకూఱుస్తామని ప్రలోభపెట్టడం ద్వారానో వారిచేత ఒక చెడ్డపని శాశ్వతంగా మానిపించడం గానీ, లేకపోతే మంచి పనులకు మప్పడం గానీ అసంభవం. అలా చేస్తే భయపెట్టేవారు కనుమఱుగయ్యీ కాగానే మళ్ళీ పాతపనులకే దిగుతారు. లేదా మంచిపనుల వల్ల లబ్ధి ఏమీ కలగదనిపిస్తే అవి చేయడం మానుకుంటారు. అందుచేత శిక్షల వల్ల సమాజం బాగుపడేది కల్ల.

మనుషులు తప్పుచేసినట్లు సందేహాల కతీతంగా రుజువుకాకముందే, ఎవఱో ఏదో అన్నారనీ, లేదా తప్పు జఱిగినట్లు అనుమానం ఉందనే ఆషామాషీ కారణాల్ని పురస్కరించుకొని వారిని వైయక్తిక స్థాయిలో గానీ, సంఘస్థాయిలో గానీ వ్యవస్థాగతంగా గానీ బాధించడమనే అశాస్త్రీయ కార్యకలాపానికి మానవతావాదుల మద్దతు ఎప్పటికీ ఉండదు. కానీ సమకాలీనంగా వారినీ వారి కుటుంబాల్నీ సంపన్న కుబేర మీడియా ద్వారా రోజువారీ ప్రాతిపదికన భారీయెత్తున బద్నామ్ చేస్తున్న ధోరణి వాడుకలో ఉంది. ఇది ఓ 50 మంది లారీలో వెళ్ళి ఒకణ్ణి పొడిచేసి రావడంలాంటిది. దీని లోతు గమనిస్తే ఇది చాలా అమానుషంగా, మానవతావిరుద్ధంగా గోచరిస్తుంది. ఇది నాగరిక సమాజంలో అభ్యంతరాల నెదుర్కోకుండా ఎలా అప్రతిహతంగా చెల్లుబాటవుతోందో మనకింకా అర్థం కావాల్సి ఉంది.

సంపన్న కుబేర మీడియా ఆ విధంగా ఒకసారి ఒకఱి పరువు తీసేశాక, అనంతర కాలంలో ఏనాటికో వారు నిర్దోషులని రుజువైనా, అప్పటికే జఱిగిపోయిన పరువునష్టాన్నుంచి ఆ ఆరోపితులూ, వారి కుటుంబసభ్యులూ జీవితాంతం కోలుకోలేరు. బలవంతులూ, గొప్ప ధైర్యమూ ఆత్మవిశ్వాసమూ గల వారూ అలాంటి సమాచార దాడులకి తట్టుకుని నిలబడతారు. వారెక్కడో అరుదుగా ఉంటారు. ఒక వేళ ఆ ఆరోపితులు కాస్త సున్నిత మనస్కులై, సంపన్న కుబేర మీడియా చేష్టలకు తట్టుకోలేక, కోలుకోలేని విధంగా జబ్బుపడితే, లేదా ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే ఆ బాధ్యత ఎవఱిది ?

సంపన్న కుబేర మీడియాకీ, అది బుఱదజల్లే వ్యక్తులకూ మధ్య బ్రహ్మాండమైన శక్తి-అసమతూకం (power imbalance) ఉందని కూడా గమనించాలి. ఏదో ఒక ఆరోపణను పురస్కరించుకొని వారు తమమీద చేస్తున్న దుష్ప్రచార దాడిని ఎదుర్కునే శక్తి మన సమాజంలో ఎవఱికీ లేదు. ఎంత ఆరోపితులైనప్పటికీ వారు సాపేక్షంగా బలహీనులు కనుక ఈ రోజుల్లో జర్నలిజమ్ పేరుతో చెలామణీ అవుతున్న ఈ రకమైన విచక్షణారహితమైన వాచా దాడుల నుంచీ, వార్తారూప హింసాకాండ నుంచీ, లిఖితరూప దౌర్జన్యకాండ నుంచీ ప్రభుత్వమే మానవతాదృష్టితో రక్షణ కల్పించాల్సి ఉంది. 


గట్టి పౌర గోప్యతా చట్టాల (citizen privacy laws) ను తేవడం ఇందుకో మార్గం. ఉదాహరణకి విడిపౌరుల/ వ్యక్తుల లిఖితపూర్వక అనుమతి లేకుండా వారి గురించి మంచిగా గానీ, చెడుగా గానీ తటస్థంగా గానీ మీడియాలో ప్రచురించడాన్ని కఠినంగా నిషేధించే ప్రతిపాదనని పరిశీలించాలి. అదే సమయంలో సంఘమూ, వ్యవస్థా కూడా ఆరోపకుల (ఫిర్యాదీల) పట్లా, ఆరోపితుల పట్లా సమదృష్టిని అవలంబించాల్సి ఉంది. ఏ ఒక్కఱి పక్షమూ వహించే పని లేదు. ఎవఱినీ పూర్తిగా నమ్మాల్సిన అగత్యం లేదు. “అది ప్రాథమికంగా మన గొడవ కాదు, వారి మధ్య గొడవ” అని గమనించాలి. అయితే ఉభయ పక్షాలూ మనవారే అవుతారు. కాకపోతే వాళ్ళూ మనకేమీ కారు. వీళ్ళూ మనకేమీ కారు.

6, అక్టోబర్ 2014, సోమవారం

మానవ వ్యక్తుల పట్ల అహింస

ఆధిపత్య ధోరణులు నశిస్తే మనుషుల్లో అహింసాప్రకృతి దానంతట అదే వెల్లి విఱుస్తుంది. ప్రపంచంలో అన్ని గొడవలకూ కారణం ఆధిపత్య ధోరణితో గొంతుపెంచడం. ప్రేమకు బదులు ఆధిపత్యం కావాలనే తలపు అంకురించగానే దాని కోసం ప్రత్యేక ప్రయత్నాలు చేయాలనీ, ఇతరుల్ని లొంగదీసుకుందామనీ, లొంగకపోతే వాళ్ళపై కక్షసాధిద్దామనీ రకరకాల సంకల్పాలు తలెత్తుతాయి. హింసకు మూలం ద్వేషం. ద్వేషానికి మూలం అజ్ఞానం. ఇతరుల్ని సక్రమంగా అర్థం చేసుకోలేని అశక్తత. లోకాన్ని గుఱించీ, మనుషుల గుఱించీ మన అవగాహన ఎంతెంతగా విశాలతరమౌతుందో అంతంతగా మనం ద్వేషభావాల నుంచి విముక్తమవుతాం. మన వ్యక్తిగత శత్రువుల విషయంలో కూడా మనం వారి నెంతెంతగా అర్థం చేసుకుంటామో అంతంతగా వారు మనకి శత్రువులుగా అగుపించడం మానేస్తారు. అర్థం చేసుకోవడమంటే ఇతరుల్లో మనల్నీ, మనలో ఇతరుల్నీ చూసుకోవడమే.

లోకంలో అన్ని తప్పుల మాదిరే హింస కూడా- ఏం చేయాలో, అవతలివారిని ఎలా ఒప్పించాలో అర్థం కాని నిస్సహాయతలోంచి, కింకర్తవ్యతా విమూఢతలోంచి, అయోమయంలోంచి పుడుతుంది. ఇది ప్రాథమికంగా భావప్రకటన సామర్థ్యలోపానికి సంబంధించినది కూడా. హింస ద్వారా వ్యక్తమయ్యేది బలం కాదు, బలహీనతే. ఆ బలహీనత పేరు అజ్ఞానం. పూర్వం పిచ్చికుదిర్చే పేరుతో పిచ్చివాళ్ళకి సంకెళ్ళు వేసి నేఱస్థుల్ని కొట్టినట్లు కొట్టేవారు. మానసిక వైద్యాన్ని ఎఱగని అజ్ఞానం వల్ల జఱిగిన హింస అది. నిజానికి అన్నిహింసలూ అలాంటివే. కనుక అన్ని సమస్యలకూ చర్చలే పరిష్కారం. చర్చలు వద్దనుకుని పోరాటానికి దిగేవారు అది ముగిశాకైనా చర్చలకు రాకతప్పదు. అంటే అంతవఱకూ చేసిన  పోరాటమంతా వృథాయేనని అర్థం. ఆ తెలివేదో ముందే ఉంటే చాలా నష్టాన్ని తప్పించగలుగుతాం. 


ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తుల్ని, వారు ఎలాంటివారైనా సరే, హింసించకపోవడం సమాజం తనకు తాను చేసుకుంటున్న సేవే. ఎందుకంటే హింసించబడ్డ ప్రతివారూ ఆ హింసని మౌనంగా భరించి మర్చిపోరు. వారలా మర్చిపోవాలనీ, తాను చెప్పినట్లు గుణపాఠాల్ని మాత్రమే గ్రహించి ఊరుకోవాలనీ వ్యవస్థ ఆశించడం తఱచు. కానీ దురదృష్టవశాత్తూ అలా జఱగదు. ఎక్కువమంది రాటుదేల్తారు. వారి హృదయం బండబాఱుతుంది. వారంతకు ముందటికంటే పెద్దతప్పులు చేయగల చొఱవనీ, ధైర్యాన్నీ సంపాదించుకుంటారు. చేతులారా వారినలా తయారుచేసి ఆ తరువాత వారిని దూషించడం, ముద్రలు వేయడం సమంజసం కాదేమో. మనిషి మనసు కూడా కలనయంత్రం (computer) లాంటిదే. మీరందులో ఏ మృదుసామాను (software) చొప్పిస్తే దాన్నే అది ప్రదర్శిస్తుంది. మనం మనుషుల గుఱించి ఏదనుకుంటే వారదే అవుతారు. వారిని ఎలా చూస్తే వారు అలాగే తయారవుతారు.

కనుక  సమాజం/వ్యవస్థ చేతుల్లో బాధలుపడ్డవారిలో ఒక కొత్త అహంకారం ఉద్బుద్ధమౌతుంది. ఒక నవ్య ప్రతీకారతత్త్వం జాగృతమవుతుంది. తాజా తెలివితేటలు పెంపొందుతాయి. “దొఱక్కుండా తప్పు చేద్దాం. ఏం చేస్తారో చూద్దాం” అనే మొండిపట్టుదల ప్రవేశిస్తుంది. ఇదంతా ఇలా జఱక్కుండా చూసుకోవడం నాగరిక సమాజాల బాధ్యత. కానీ సమకాలీన వ్యవస్థ ఇలాంటివారిని వేలాది సంఖ్యలో తయారుచేసే పనిలో పరోఽక్షంగా వ్యాపృతమై ఉంది. ఒక పిల్లవాణ్ణి చావగొట్టి అతన్ని పండితుడుగా ఎలాగైతే చేయలేమో ఎదిగిన వయోజనుల విషయంలోనైనా అంతే! ఎందుకంటే ప్రతివారూ కోరుకునేది– తమను తామెలా అర్థం చేసుకుంటున్నారో, ఇతరులు కూడా అలాగే అర్థం చేసుకోవాలనీ,  తమను ప్రేమగా, గౌరవంగా, అభిమానంగా చూసుకోవాలనీ! ఇతరులు తమను అపార్థం చేసుకోవడాన్ని ఎవఱూ భరించలేరు, ఆ అపార్థ సృష్టిలో తమకూ కొంత పాత్ర ఉన్నా! ఏ గొడవా లేనప్పుడు అందఱూ దేవతలే, మహర్షులే. సంక్షోభ సమయాలొచ్చినప్పుడే మనలో సౌహార్ద కారుణ్యాలు వెల్లివిఱియాలి. అలా చేయకుండా ఓ వ్యక్తిలో ఆ సెంటిమెంటుకు విఘాతం కలిగించాక ఇహ అతని నుంచి పూర్వసౌజన్యాన్నే ఆశించడం కష్టం.

(ఇ) వ్యక్తుల్లో హింసాధోరణుల్ని పై విధంగా పనిగట్టుకుని రెచ్చగొట్టకపోతే కుటుంబాలు హింస నుంచి విముక్తమౌతాయి. కుటుంబాల్లో హింస తగ్గిపోతే వ్యవస్థలో కూడా హింసాధోరణులు అదుపులోకొస్తాయి. మన కుటుంబాల్లో మగపిల్లల్ని కొట్టడం సర్వసాధారణం. అలా చేయడం వారికి హింస నేర్పడమే అవుతుంది. అదే విధంగా ప్రతీ విషయంలోనూ ఎవఱినో సంతృప్తిపఱచడం కోసం అడుగడుగునా మనసు చంపుకోవడానికి ఈ దేశపు జనం బాగా అలవాటుపడిపోయారు. దీని వల్ల మనం స్వీకరించే ఏ బాధ్యత విషయంలోనూ నిజాయితీ చూపలేని సామూహిక మనస్తత్త్వం సంప్రాప్తమైంది. ఇక్కడ ఏ పనినీ ఇష్టపడి చేసేవారు మనకు కనిపించరు. ఈ విధమైన ఆత్మహింస పరిహరణీయం.

(ఈ) దురదృష్టవశాత్తూ ఇతరుల్ని హింసించగలగడాన్ని ఒక గొప్ప ఆరాధనీయ పురుష లక్షణంగా చూసే ధోరణి మన సమాజంలో తరతరాలుగా వ్యాపించిపోయింది. ఆ ధోరణి స్త్రీలలోనూ, పురుషుల్లోనూ సమానంగా గూడుకట్టుకుని ఉంది. అనవసరంగా దానికో గొప్ప ధర్మరక్షణ తత్త్వాన్ని ఆపాదిస్తున్నారు. హీరోయిజమ్ పేరుతో ఈ మూర్ఖత్వం ప్రతి చలనచిత్రం ద్వారా  ప్రమోట్ చేయబడుతోంది కూడా. అదో కర్తవ్యం, విధ్యుక్తధర్మం అన్నట్లుగా కూడా చూపుతున్నారు. మగతనంలో తర్కంతో కూడిన బహిర్ముఖ యోచనే (extrovert logical thought) ప్రధానాంగం. హింస్రత గౌణమే.

(ఉ) పిల్లలతో పాటు గర్భస్థ శిశువులు కూడా మానవులే. వారు పూర్తిగా పెద్దల మీదే ఆధారపడ్డ నిస్సహాయ మానవజీవులు. వారిని హింసించడాన్ని కూడా మానవతావాదం ప్రాథమికంగా ఆమోదించదు.                          

(ఊ) యుద్ధాలన్నీ ప్రాథమికంగా మానవుల్ని మహాజనస్థాయిలో హింసించడం (mass torture) ద్వారా తమ స్వంత ఇష్టానిష్టాల్ని వారి నెత్తిమీద బలవంతంగా రుద్దడానికి ఉద్దేశించినవే గనుక ప్రతిఘటనార్థం కాని ఏ యుద్ధాన్నీ మానవతావాదులు సమర్థించరు.

(ఎ) ఆత్మహత్యల గుఱించి ఇతరత్రా వ్రాసే ఉన్నాను. కనుక సవిస్తరంగా ఆ జోలికి పోను. కానీ ఆత్మహత్యలు కూడా ఆత్మహింస అనబడే ఒక విధమైన హింస కిందకే వస్తాయి. మానవతావాదం ఆత్మహత్యల్ని ప్రాథమికంగా ప్రోత్సహించదు, సమర్థించదు. ఐతే ప్రాణాంతకంగా జబ్బుపడ్డ (terminally ill) వారూ, శారీరికంగా నరకయాతన అనుభవిస్తున్నవారూ,  ఆయుర్దాయాన్ని పొడిగించడం వల్ల ఇంకా నరకయాతనే తప్ప యత్కించిత్ ఉపశాంతినీ పొందలేనివారూ లోకంలో కొందఱున్నారు. అటువంటివారు స్వచ్ఛందంగా చనిపోయినా, లేదా వారియందలి కనికరంతో, వారి అనుమతి గైకొని వారి జీవితానికి ఇతరులు కృత్రిమంగా ముగింపు పలికినా తప్పులేదని చెప్పే మాన వతావాదుల శ్రేణి సైతం ప్రపంచంలో లేకపోలేదు. ఈ ప్రక్రియని కారుణ్య సమాపనం (Euthanasia or mercy-killing) అని పిలుస్తున్నారు. దీన్ని ఓ ఖచ్చితమైన సర్వసామాన్యసూత్రం (common rule) తో నిబంధించడం కష్టసాధ్యం. ఆయా సందర్భాల్ని బట్టి వివేకవంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వాంఛనీయం. ఎటొచ్చీ ఇలాంటివాటికి చట్టం ఇచ్చే వెసులుబాట్లు ఆ పేరిట లోపాయికారీ హత్యలకూ, అనావశ్యకమైన ఆత్మహత్యలకూ దారితీయవనే హామీ లేదు.