30, సెప్టెంబర్ 2014, మంగళవారం

వాక్స్వాతంత్ర్యం-2

కాబట్టి ప్రతీదీ మనసువిప్పి మాట్లాడడాన్ని స్నేహసానుభూతులతో ప్రోత్సహించాలి. నిజాయితీతో కూడిన భావవ్యక్తీకరణను ఓ సిగ్గుపడాల్సిన అంశంగా, అతివాగుడుగా, ధిక్కారంగా, ప్రమాదకరంగా భావించే పాతకాలపు అస్తిగోపన వాతావరణం పోవాలి. అలా పోవాలంటే దాని మీదున్న అన్ని నిషేధాల్నీ ఎత్తివేయాలి. ముఖ్యంగా వ్యవస్థాగతమైన వర్గీయమైన కట్టళ్ళకీ, పక్షపాతాలకీ స్వస్తి పలకాలి.

సామాజిక అంశాలక్కూడా ఇదే వర్తిస్తుంది. బాలవితంతువులకు పునర్వివాహావకాశం లేకపోవడం చేత యువత పెడదారి పడుతోందని పేర్కొంటూ బ్రహ్మశ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారు సంస్కరణోద్యమాన్ని ప్రారంభించారు. కన్యాశుల్కంలో కూడా అటువంటి ఒక పాత్రను గురజాడ చొప్పించారు. ఆ రోజుల్లో సుమారుగా ప్రతి ఇంట్లోనూ ఓ బాలవితంతువు ఉండేది. “ఠాఠ్ ! దుర్మార్గుడా ! స్త్రీద్వేషీ ! అంత మాటంటావా మా అమ్మాయిల్ని? నీకు తల్లీ చెల్లీ లేరా?” అని ఎవఱూ ఆ రోజుల్లో గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుని ఆయన్ని దూషించలేదు. అరెస్టు చేయించలేదు. కాబట్టే మన సంఘం సంస్కరించబడింది. ఒకవేళ అటువంటి మర్యాదేదైనా ఆయనకి జఱిగితే ఆయన సంస్కర్త కాకుండా ఇంకేదో అయ్యుండేవాడు. 

ఎందుకంటే సామాజిక విషయాల గుఱించీ, సమస్యల గుఱించీ మాట్లాడితే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం (ఖచ్చితంగా నువ్వు నన్నే అన్నావ్) కూడా ఎదగని సమాజపు ధోరణే. ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని ఎవఱైనా అంటే– “నీకు నాన్న లేడా? అన్నయ్య లేడా? వాళ్లు ఉద్యోగాలు చేయలేదా? వాళ్ళూ అవినీతిపరులేనా?” అంటూ ఒక సామాజిక సమస్యలోకి చర్చాకారుల కుటుంబాల్ని అసందర్భంగా లాగడం విద్యాత్మక చర్చకీ, వస్త్వాశ్రయ విశ్లేషణ (objective analysis) కీ అవరోధం. 

కాబట్టి వాక్స్వాతంత్ర్యం అంటూ ఉంటే అది సంపూర్ణం (absolute) గా ఉండాలి. ఒకసారి వాక్స్వాతంత్ర్యమనే పరిభావన (concept) ని అంగీకరించాక మళ్ళీ అందులో “పాండవులంటే మంచం కోళ్ళలా ముగ్గుఱు” అని రెండువేళ్లే చూపించిన విధంగా “మనోభావాలు, సెంటిమెంట్లూ, అశ్లీలాలు, ఉచితానుచితాలు, కించపఱచడాలు, సమాజం మీద ప్రభావం, పిల్లల మీద ప్రభావం, శాంతి భద్రతలు” అంటూ వంద మినహాయింపుల్ని చొప్పించకూడదు. అది, ఒక చేత్తో ఇస్తూ మఱో చేత్తో వెనక్కి తీసేసుకోవడమే అవుతుంది. ఈ మినహాయింపులకొక నిర్వచనమంటూ ఏమీ లేదు. ఒకసారి అలాంటివాటికి చోటిస్తే ప్రతి ఒక్కఱూ తమ తమ ఆత్మాశ్రిత దృక్కోణాలతో వాటికి భాష్యం చెబుతారు. ఒకవేళ వాక్స్వాతంత్ర్యం ద్వారా అబద్ధాలు ప్రచారమవుతాయనీ, తద్ద్వారా సమాజం నష్టపోతుందనే భయం గనక ఉంటే, అలాంటి భావాల్ని మళ్ళీ వాక్స్వాతంత్ర్యం ద్వారానే, ఎదురు ప్రచారం ద్వారానే అడ్డుకోవడానికి తప్పకుండా అవకాశముంటుంది. ఆ అవకాశం లభ్యమౌతున్నప్పుడు ఏ అభివ్యక్తినైనా సరే, నిషేధించాల్సిన అవసరం గానీ, శిక్షించాల్సిన అవసరం గానీ ఎందుకొస్తుంది?

ఒకఱు ఒక తరహా అభివ్యక్తి (expression) మీద నిషేధాన్ని కోరితే ప్రతిఒక్కఱూ తలో రకం అభివ్యక్తి మీదా నిషేధాలు విధించాలంటూ డిమాండ్లు తీసుకొస్తారు. అంటే ఒకఱి వాక్స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట వేయవలసిందంటూ మఱొకఱు రచ్చకెక్కుతారు. అలా అందఱూ కలిసి అందఱి వాక్స్వాతంత్ర్యాన్నీ ఏకమొత్తంగా రద్దుచేయించేస్తారు. ప్రస్తుతం మన దగ్గఱ జఱుగుతున్నది అదే. పైవాళ్ళకి ఇంతకన్నా ఆనందదాయకమైన విషయమేదీ బహుశా లేదు. ఆ రకంగా వాక్స్వాతంత్ర్యం లేని, లేదా అది పరిమితంగా ఉన్న, లేదా అది కొన్ని వర్గాలకే సీమితమైన దేశంలో మానవహక్కుల గుఱించి పూర్తిగా మర్చిపోవడం మంచిది. అదే విధంగా ఒకఱికి ప్రసాదించాల్సిన సహజన్యాయాన్నీ, వారి సహజ మానవహక్కుల్నీ మఱొకఱు తమ హక్కుల ఉల్లంఘనగా భ్రాంతిచెందుతూ అలా చిత్రించే వాతావరణంలో కూడాను. 

ప్రతి పౌరుడూ రాజకీయనాయకుడు కాడు. ప్రతివారూ ఎన్నికల్లో పోటీ చేయబోవడమూ లేదు. కనుక ప్రతివారూ రాజకీయంగా సాధువులైన ఉద్ఘాటనలే (politically correct statements) చేయాలనీ, రాజకీయ పక్షాల కార్యావళి (agenda) కి విరుద్ధంగా ఎవఱూ ఏమీ మాట్లాడకూడదనీ నిర్బంధించడం ప్రజాస్వామ్యంలో సరికాదు. నిజమైన వాక్స్వాతంత్ర్యంలో సకలజన సమ్మతమైన మాటలకే కాక ఎక్కువమందికి అసమ్మతమైన మాటలక్కూడా సహజంగా స్థానం ఉంటుంది.

ఈనాడు రాజకీయంగా సాధువైన మాటలే సరిగ్గా వందేళ్ల క్రితం ఎవఱికీ ఆమోదయోగ్యం కాక అసాధువులుగా ఉండేవని గమనించాలి. “ఫలానా మాట నాకు నచ్చలేదు కనుక అదన్నవాణ్ణి ఏదో చెయ్యాలి” అని వాదిస్తే ఎవఱికి ఏ మాట నచ్చుతుందో ముందే ఎలా తెలుస్తుంది? ఒకడు నచ్చని వాళ్ళున్నట్లే అతను నచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మఱి ఈ ఇద్దఱిలో ఎవఱి మాట మీద ఆధారపడి ఆ వ్యక్తితో వ్యవహరించాలి? నచ్చడం, నచ్చకపోవడంలాంటి పెళుసు ప్రాతిపదికల మీద వ్యక్తుల్ని జడ్జ్ చేస్తూ పోతే అందఱూ దుర్మార్గులే అవుతారు. కనుక నచ్చినా, నచ్చకపోయినా మాటలకు మాటలతోనూ, చర్చలకు చర్చలతోనూ, తర్కానికి తర్కంతోనూ సమాధానమివ్వడమే నాగరికత. అదే మానవీయత. ఏ అభివ్యక్తి బావుందో, ఏది బాలేదో ప్రజలే నిర్ణయించుకుంటారు. ఒకఱు చెప్పాల్సిన పనిలేదు. విద్యావంతులైనంత మాత్రాన సమాజంలో ప్రతి ఒక్కఱూ స్వాభిప్రాయప్రకటనకళలో చేయి తిరిగిన మహా రచయితలూ, వక్తలూ కారు. ఏదో చెప్పబోతే అది ఇంకేదో విధంగా ధ్వనించడం తఱచు. కనుక ఏ అభివ్యక్తి ఆధారంగానైనా ఎవఱినీ తప్పుపట్టే అవకాశాన్ని వ్యవస్థ ఇవ్వకూడదు. 

చర్చ అన్నాక చాలా విషయాలు ప్రస్తావనకొస్తాయి. ఎవఱినీ ఏమీ అనకుండా, ఒక్కఱిని కూడా బాధ పెట్టకుండా సామాజికశాస్త్రాల (humanities) కీ, సమాజానికీ సంబంధించి చర్చించడం సాధ్యం కాదు. శుద్ధవిజ్ఞానాల (pure sciences) లో రెండో అభిప్రాయానికి తావుండదు.  సామాజిక శాస్త్రాలు అలా కాదు. నాగరికత పెద్దగా ఎఱగని మనలాంటి దేశాల్లో - ఒకవేళ అవతలివారి వాదా నికి ఇవతలివారి మేధస్ తూణీరంలో సమాధాన బాణం ఒక్కటి కూడా లేకుండా నిశ్శేషంగా ఖాళీ అయిందనుకోండి. ఇహ భౌతిక చర్యలకూ, పాశవిక బలప్రయోగానికీ (brute force) దిగాలనే ప్రేరణ కలుగుతుంది. 

ఇదో రకం బౌద్ధిక దివాలా (intellectual bankruptcy). తమ దగ్గఱ సబ్జెక్టు లేదని బహిరంగంగా, నేరుగా ఒప్పేసుకోవడమన్నమాట. ఆఖరికి, ఇక్కడ చర్చించడం అంటే ’అనవసరంగా గొడవలు పడడం’ అనే అర్థం సిద్ధమైంది. అయితే ఈ తరహా పాశవిక బలాన్ని ప్రదర్శించగల వారంటేనే మన జనంలో ఆరాధనాభావం మెండు. పాశవికులు మొదట్లో గెల్చినట్లు కనిపిస్తారు. కానీ “వినాశకాలే విపరీత బుద్ధిః”అన్నట్లు మేధాశక్తి బదులు ఇలా brute force ప్రదర్శించాలనే సంకల్పం కలగడం వారి భవిష్యానికే ఓ దుశ్శకునం. 

ఆలోచించేవారూ, అలా చెయ్యమని చెప్పేవారూ మన సమాజానికి ప్రధానమైన శత్రువులు. ఆలోచించకుండా బ్రతికెయ్యడానికి ఎన్ని పలాయన మార్గాలు (escapes) ఉన్నాయో అన్నీ వెతుక్కుని మఱీ ఆ బాధ్యత నుంచి విముక్తులవుతూంటారు. ఎల్లప్పుడూ సంగీతాన్ని ఆస్వాదించడం, తాగుడు, హాస్య ప్రధానమైన చలనచిత్రాలు వీక్షించడం – ఇవన్నీ అలాంటి తప్పుకోళ్ళలో ఓ భాగం.

మనవారెక్కువమంది లౌక్యంలోనూ, ముఱికి రాజకీయాల్లోనూ తప్ప ఇహ దేనిలోనూ పండితులు కారు. ఫలితార్థంగా మన దేశంలో ఏ సబ్జెక్టు గుఱించైనా చర్చించేందుకు మనుషులే దొఱకరు. అథవా దొఱికినా, కొద్దిపాటి అభిప్రాయభేదమేదో ఉన్నట్లు వెల్లడైతే  సబ్జెక్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు మొదలవుతాయి. తరువాత అసహ్యంగా తిట్టడం. (ఆ విధంగా రెచ్చగొట్టడానికి ప్రయత్నించడం) అదీ సాధ్యం కాకపోతే మీదపడి కొట్టడం. లేదా మనుషుల్ని పంపి కొట్టించడం. లేదా తమలాంటి కుసంస్కారులు కొంతమందిని పోగేసి అభూతకల్పనలతో, అభాండాలతో దుష్ప్రచారానికి పూనుకోవడం. లేదా తప్పుడుకేసులు పెట్టించి అరెస్టు చేయించడం. ఇదీ మన దేశంలో అన్ని చర్చలకూ పట్టే అంతిమ దుర్గతి. 

మన దేశంలో ఏ విషయం మీదైనా నిజాయితీగా ఒక ప్రశ్నవేసిన ప్రతివాణ్ణీ లేదా నిజం మాట్లాడిన ప్రతివాణ్ణీ బజారుకీడవడం, కేసులు పెట్టడం చేస్తున్నారు. నిజం మాట్లాడిన ప్రతివాడూ అలా మాట్లాడినందుకు విధిగా  పశ్చాత్తాప పడాల్సిన, క్షమాపణ చెప్పాల్సిన వాతావరణాన్ని సృష్టించారు. సమాధానం చెప్పడం చేతకాక అవతలివాళ్ళని ఆ విధంగా బహిరంగంగా అవమానించడం ద్వారా వాళ్లు చెప్పదల్చుకున్న నిజాలు బయటికి రాకుండా, హేతుబద్ధమైన చర్చలకు అవకాశం లేని విధంగా తొక్కేస్తున్నారు. మాటలకి మాటలతోనే సమాధానం చెప్పగల చతురతా, నాగరికతా, sense of humour మనలో రోజురోజుకీ లోపిస్తున్నాయి. ఇది గుంపుల గూండాయిజమ్ అవుతుందే knowledge society లక్షణం కాదని అందరూ గుర్తించే క్షణం రావాలి.  
  

24, సెప్టెంబర్ 2014, బుధవారం

వాక్స్వాతంత్ర్యం : మానవుల సహజస్వేచ్ఛలో అత్యంత ప్రధానాంగం

వాక్స్వాతంత్ర్యం  (మాట ముత్యం – మౌనం మట్టి)

మానవీయస్వేచ్ఛలో వాక్స్వాతంత్ర్యమూ అంతర్భవిస్తుంది. ఇక్కడ అన్నిరకాల అభివ్యక్తుల్నీ ‘వాక్కు’ అనే వ్యవహరిస్తున్నాం. Knowledge society ని నిర్మించడం గుఱించి ఈమధ్య చాలామంది ప్రసంగించడం వినిపిస్తుంది. Knowledge అంటే విదేశాల నుంచి అరువు దెచ్చుకునేది మాత్రమే కాదు. ఓ దేశం knowledge ని అరువు దెచ్చుకోగలదేమో గానీ దాన్తో పాటు knowledge society ని మాత్రం దిగుమతి చేసుకోలేదు. Knowledge ని మాత్రమే అరువు దెచ్చుకోవడం, దాన్ని భట్టీయం పట్టడం వల్ల ఆ knowledge పుస్తకాలకీ, విద్యాలయాలకీ, కార్యాలయాలకీ పరిమితమవుతుంది. అదొక విశ్వవిద్యాలయ పట్టా సంపాదించడానికీ, మహా అయితే ఎక్కడైనా నాలుగు జీతం ఱాళ్ళు వెనకేసుకోవడానికీ తప్ప మనుషుల్ని నాగరికులుగా తీర్చిదిద్దడానికి మాత్రం పనికిరాదు. బైట మన సామాజిక బర్బరత యథాపూర్వంగా కొనసాగుతుంది. ప్రస్తుతం జఱుగుతున్నది సరిగ్గా అదే. కాబట్టి నిజంగా నిజాయితీగా knowledge society ని నిర్మించాలంటే తొలుత చేయాల్సింది ఆ knowledge కి మూలమై, దాన్ని స్వకీయం (original) గా సృజించే సత్తానీ, ప్రతిభనీ ప్రసాదించగల సామాజిక లక్షణాల్ని అలవఱచుకోవడం. అటువంటి వాతావరణానికి హార్దిక స్వాగతం పలకడం. భావస్వేచ్ఛా, వాక్స్వాతంత్ర్యమూ అలాంటి అభ్యుదయకర సామాజిక లక్షణాలు.

మనకు knowledge ని అరువివ్వగలుగుతున్న దేశాలు తమ తమ సమాజాల్లో వాక్స్వాతంత్ర్యంతో పాటు అనేక రకాల స్వేచ్ఛల్ని సెంటిమెంట్ల పేరుతో ఎవఱికీ ఎలాంటి మినహాయింపులూ లేకుండా, ఏ విధమైన మెలికలూ, మడతపేచీలూ పెట్టకుండా బేషరతుగా అంగీకరించాయి గనుకనే మనకవి ప్రతిరంగంలోనూ బోధించగల స్థాయిలోకొచ్చాయి. మన ఆరాధనాభావానికి పాత్రం కాగలిగాయి. ఏది మాట్లాడినా పెద్దపెద్ద గొడవలు జఱిగిపోతాయనీ, అరెస్టులు చేస్తారనీ, శిక్షిస్తారనీ, ఖైదు చేస్తారనీ, పరువు తీస్తారనే భయం లేని  దేశాల్లో స్వేచ్ఛగా పరిశోధనలూ, పరిశీలనలూ జఱుగుతున్నాయి. అనేక ప్రస్తావనల (topics) మీద జనం స్వేచ్ఛగా తమ మెదళ్ళకు పదునుపెట్టి ఊహాపోహలకు దిగ గలుగుతున్నారు. (అవి నిజం కావచ్చు, కాకపోవచ్చు. అది వేఱే విషయం) అక్కడ నానా సబ్జెక్టుల మీద నిర్మొహమాటమైన చర్చలు నడుస్తున్నాయి. వాటన్నిటి ఫలితంగా అక్కడ knowledge పుడుతోంది. అవి తిరుగులేని knowledge societies గా అవతరించాయి. 

అంటే మేధావులూ, పరిశోధకులూ knowledge ని సృష్టించాలన్నా ముందు రోజువారీ సమాజంలో అందఱికీ స్వేచ్ఛ ఉండాలి. అప్పుడు అందఱికీ ఉన్న స్వేచ్ఛనే మేధావులు కూడా వాడుకుని సమాజాన్ని ఉద్ధరించగలుగుతారు. సామాన్యజనానికి లేని స్వేచ్ఛ మేధావుల క్కూడా ఇవ్వబడదని గమనించాలి.అంటే ఒక సమాజం knowledge society గా అవతరించాలంటే ముందది సకల శృంఖలా విముక్తమైన తెఱుపుడు సమాజం (open society) గా మారాల్సి ఉంటుంది. ఆ తెఱుపుడుతనాన్ని కొన్ని వర్గాలకే కాక అందఱికీ సమానంగా అనుమతించాల్సి ఉంటుంది. అంతే కాక, knowledge society ఏర్పడాలంటే, ముందు చర్చాత్మకమైన బౌద్ధిక వాతావరణం ఏర్పడాల్సి ఉంది. కానీ భావోద్వేగాలకీ, సెంటిమెంట్లకీ బౌద్ధిక వాతావరణాన్ని ఏర్పఱిచే సత్తా ఉండదు. అవి అన్నిరకాల చర్చల్లోంచీ హుందాతనాన్ని బహిష్కరించి తన్నులాటల దాకా తీసుకెళతాయి. పైపెచ్చు మనుషులు ఇతరుల స్వేచ్ఛని హరించే నిమిత్తం భావోద్వేగాల్నీ, సెంటిమెంట్లనీ తఱచుగా వాడుకోవడాన్ని ప్రజాజీవితంలో గమనించవచ్చు. 

విమానాన్ని తప్పసరిగా తయారుచేస్తామని ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చినందుకు రైట్ సోదరులు యూరోపులోనూ, అమెరికాలోనూ ఒకప్పుడు పెద్ద మోసగాళ్ళుగా పరిగణించబడ్డారు. ఎందుకంటే విమానాన్ని కనుగొనడంలో వారు మొదట్లో అనూహ్యంగా మళ్ళీ మళ్ళీ విఫలమయ్యారు. అయితే అందుకు వారిపై నేఱాభియోగాలు మోపి చెఱసాలలో వేసిన వాళ్ళెవఱూ లేరు. అలా చేస్తే మనకీ రోజున విమానాలు ఉండేవి కావు. మనుషులు నిర్భయంగా ప్రయత్న-పొఱపాట్లు (trial and  error) చేయవచ్చుననీ, చేసి దిద్దుకోవచ్చుననీ అంగీకరించే సమాజాలు విధంగా ముందుకు దూసుకెళతాయి. కానీ మన దేశంలోనో? ఒక రకం చెట్టు నుంచి తీసిన నూనె వాహనాలకు ఇంధనంగా పనికొస్తుందని చెప్పిన రామర్ పిళ్ళై అనే పేద పరిశోధకుణ్ణి 2003 లో అరెస్టు చేసి మూసేశారు. అతని మీద వంచనాభియోగాలు బనాయించారు. అతను ఏమయ్యాడో ఈ రోజుకీ తెలీదు.

పరిశోధన దశలో/ చర్చావస్థలో/ ప్రతిపాదనస్థితిలో ఉన్న ప్రస్తావనలు (topics) మాతృగర్భస్థ పిండం లాంటివి. వాటిల్లో మనకు నచ్చని, లేదా ఉపయోగపడని అంశాలు దొర్లినందుకు మనుషుల్ని శిక్షిస్తూ పోతే ఆ జ్ఞానశిశువు పూర్తిగా రూపుదిద్దుకోకుండానే గర్భస్రావమై మరణిస్తుంది. పురుష వీర్యంలో లక్షలాది వీర్యకణాలుంటే వాటిల్లో ఒకటి మాత్రమే అండంతో కలిసి ఫలదీకరణ చెంది శిశువుగా పరిణమిస్తుంది. అలాగే మనుషులు కూర్చుని వెయ్యిమాటలు మాట్లాడితే వాటిల్లో అయిదో పదో పనికొచ్చే మాటలు వెలువడతాయి. అత్యంత ఉపయోగకరమైన ఆ 5–10 మాటలు పుట్టాలంటే తతిమ్మా 990–995 మాటలు కూడా మాట్లాడుకోవడం తప్పనిసరి. 990 నిరుపయోగమైన మాటలున్నాయనే కారణం చేత అసలు మాట్లాడుకోవడాన్నే శిక్షార్హం చేసేస్తే ఇహ సమాజంలో జ్ఞానశిశువు పుట్టేదెలా ? అసలు మాట్లాడుకోని సమాజం, అది మానవ సమాజమెలా అవుతుంది? ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాని ప్రపంచమిది. ఇటువంటిచోట ఒక్కసారి కూడా నోరెత్తనివ్వని వ్యవస్థల్ని నిర్మిస్తే….?  

చూడబోతే, మనదొక Shut up సంస్కృతి, Shut up సమాజం. ఇంట్లో Shut up. బయట Shut up. కళాశాలలో Shut up. కార్యాలయంలో Shut up. న్యాయస్థానంలో Shut up. పోలీస్ స్టేషన్ లో Shut up. సమావేశాల్లో Shut up. శాసనసభలో Shut up. మీడియాలో Shut up. అంతర్జాలంలో Shut up. ఆ రకంగా ఎవఱూ ఎవఱినీ మాట్లాడకుండా చేసే వాతావరణమిది. ఇక్కడ ప్రతి ఒక్కఱూ తమ తమ పరిధిలో ఈ Shut up సంస్కృతిని ఎనలేని అంకిత భావంతో అమలుజఱుపుతూంటారు. ఇహ ఇది ఎప్పటికి knowledge society అవ్వాలి? దేన్నీ వ్యక్తీకరించే ధైర్యం చేయలేక ప్రతి ఒక్కఱూ ఇలాగే నోళ్ళు మూసుకునీ, మూసుకునీ ఆఖరికి మన భాషలో కొత్తపదాలు పుట్టే ప్రక్రియ కూడా నిలిచిపోయింది. 

వ్యక్తిని మాట్లాడనివ్వని వాతావరణంలో ప్రజలకు న్యాయం మాత్రం ఎలా జఱుగుతుంది ? మన న్యాయస్థానాల్లో కక్షిదారుని మాట్లాడనివ్వరు. అతను ఏం చెప్పాలన్నా తన వకీలు ద్వారానే చెప్పాలి. వకీలు చెప్పబోతే, “ఏ సెక్షన్ కింద చెబుతున్నావ్?” అని గదమాయిస్తారు. సెక్షన్లతో సంబంధం లేని కష్టసుఖాలుంటాయి మనుషులకి. అవి ఆ కక్షిదారు స్వయంగా చెప్పుకుంటేనే తెలుస్తాయి. మనుషులు ఎక్కువ సందర్భాల్లో అబద్ధాలాడేది – అసలువిషయం చెబితే తమను అవతలివారు సరిగా అర్థం చేసుకోరేమోననే అపనమ్మకం మూలాన! ఆ అపనమ్మకాన్నీ, ఆ భయాన్నీ వ్యవస్థలు తమ దయాదాక్షిణ్యరహిత వైఖరితో ఒకపక్క మఱింతగా పెంచుతూ మఱోపక్క వ్యక్తులు స్వాభావికంగా మోసగాళ్ళనీ, అబద్ధాల కోర్లనీ ఆరోపిస్తూంటాయి. ఏమి న్యాయం ?

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

పోరాటదూరత్వమూ, సర్వతోముఖ స్వేచ్ఛ

6. పోరాట దూరత్వం

ఏ మార్పు గుఱించైనా సరే, వ్యక్తిగతంగా గానీ, గుంపులుగా గానీ, శాంతియుతంగా గానీ, సాయుధంగా గానీ పోరాడడాన్ని మానవతావాదులు ఆమోదించరు. వారు ఏ అంశంలోనైనా చర్చ, అవగాహన, సలహా అనే మూడు కార్యక్రమాలకే పరిమితమవుతారు. ఇతరుల్లోని హేతువాదాంశని అందుకోగలిగితే, అందుకోసం కాస్త సమయాన్నీ, మేధాశక్తినీ వెచ్చించడానికి సిద్ధపడితే ఘర్షణలకు అవకాశం తగ్గుతుంది. ఈ సందర్భంగా మన ప్రజలు ఓ కఠోర సత్యాన్ని గ్రహించే శుభదినం రావాలి. అదేంటంటే- ఈ రోజుల్లో రోడ్డెక్కేవాళ్ళెవ్వఱూ అమాయకులూ కారు. నిస్సహాయులూ కారు. మంచివాళ్ళు అంతకంటే కారు. మిగతా జనంమీద వాళ్ళది చాలా పైచేయి కాబట్టే, లేదా వారి వెనక ఎవఱో శక్తిమంతులు ఉన్నారు కాబట్టే రోడ్డెక్కగలుగుతున్నారు. ఈ తరహా పోరాటాల క్రమంలో తప్పిదాలు అనూహ్యంగా ఎటువైపునుంచైనా జఱగొచ్చు. ప్రతిపోరాటమూ అంతిమంగా అహంకార ప్రదర్శనలకూ, తన్మూలకమైన క్రూరత్వానికీ, పరస్పర అపకారాలకీ, తన్నిమిత్తమైన కపట వ్యూహాలకూ దారితీస్తుంది.

ఏం చేసైనా మొత్తమ్మీద ఇతరుల మీద తమ సిద్ధాంతాల్ని బలవంతంగా అత్యంత శీఘ్రమార్గంలో రుద్దడమూ, రాజకీయంగా, చట్టపరంగా అందఱిమీదా పైచేయి సాధించడమూ, పట్టుబిగించడమూ, ఎవఱూ నోరెత్తకుండా చేయడమూ- ఇవే అన్ని పోరాటాలకూ అంతిమ లక్ష్యాలు. పోరాటయోధులకు ఈ రకమైన ఆధిపత్యభాష తప్ప మానవతావాద భాష అర్థం కాదు. ఈ విధమైన లక్ష్యాల్లో నిర్జీవమైన సిద్ధాంత విధేయతలే మినహా ఏ విధమైన సజీవ మానవప్రేమకూ తావులేదు. ఈ పోరాట ధోరణిలో అవతలివారంతా చెడ్డవారూ, వధ్యులూను. తమవారంతా దేవుళ్ళు. లోకమంతా నలుపూ, తెలుపూ మాత్రమే. వేఱే రంగుకు తావు లేదు.

“శాంతియుతం, ధర్మయుద్ధం” అని చెప్పబడే పోరాటాలు కూడా ఇతరుల మీద దుష్ప్రచారానికీ, కుతర్కాలకీ, వక్రభాష్యాలకీ దిగే దాకా, తప్పో ఒప్పో అభియోగాలు బనాయించి ప్రతివాదకుల్ని వ్యాజ్యాల్లో ఇఱికించే దాకా వెళతాయి. మొదట్లో శాంతియుతంగానే ఉన్న పోరాటాలు దరిమిలా హింస్రంగా పరిణమించిన చారిత్రిక దృష్టాంతాలనేకం ఉన్నాయి. నేడు శాంతియుత పోరాటాలని చెప్పబడేవాటిలో హెచ్చుభాగం మీడియా ద్వారా ప్రచారయుద్ధ విధానాన్ని ఆశ్రయించుకున్నటువంటివి. నిజానికి ఉగ్రవాదం కూడా మీడియావారి సావధానాన్నీ, సంచలనాల్నీ లక్షించి చేస్తున్నదే. 

ప్రచార కార్యక్రమాలన్నీ మతమార్పుల (religious conversions) లా ఒక తరహా రాజకీయాలే. అవన్నీ మానవతాసూత్రాలకు విరుద్ధమైన అనృజువర్తన కిందికే వస్తాయి. ఎందుకంటే, మామూలు యుద్ధాల్లో మనుషుల్ని భౌతికంగా నిర్మూలిస్తే ప్రచారయుద్ధాల్లో పాల్గొనేవారు ప్రతివాదకుల్ని శీల హననం (character assassination) కావిస్తారు. ఆ క్రమంలో వారు అన్ని తర్క-చర్చానియమాల్నీ, నైతికసూత్రాల్నీ గాలికొదిలేస్తారు. ప్రచారాలకూ, వాస్తవాలకూ మధ్య మహాసముద్రాలూ, కొండలూ, గుట్టలూ అడవులూ, అఖాతాలూ ఎన్నో ఉంటాయి. విషయాల సూక్ష్మాన్నీ, మనుషుల లోతునీ అవి గ్రహించనివ్వవు. వృత్తినిపుణులైన ప్రచారకర్తలు (professional campaigners) వ్యూహాత్మకంగా మంచిశైలినీ, భాషనీ గుప్పించి తమ అధీనంలోని బృహత్తర మీడియా సంపర్క జాలాల ద్వారా చేసే విస్తృత ప్రచారాల ఫలితంగా మనం ముక్కూమొహం తెలీనివాళ్ళనీ, మనకు ఏ ఉపకారమూ చేయనివాళ్ళనీ అమాయకంగా ప్రేమించేస్తాం. అలాగే ముక్కూమొహం తెలీనివాళ్ళనీ, మనకు ఏ అపకారమూ చేయనివాళ్ళనీ నిష్కారణంగా ద్వేషిస్తాం కూడా.

ఈ ప్రచార పోరాటాలన్నింటికీ పెద్దపెద్ద గుంపులు కావాలి. వాటితో పాటు అక్రమంగానో సక్రమంగానో సంపాదించిన భారీ డబ్బుమొత్తాలు కావాలి. కానీ మానవతావాదమో, విడివ్యక్తినే కేంద్ర బిందువుగా చేసుకున్నటువంటిది. గుంపుల్ని పోగేయడమంటే, ఆ గుంపులకు చెందని విడివ్యక్తుల్ని వాటి ముందు అశక్తుల్ని చేయడం. వారి నిస్సహాయతని వారికి గుర్తుచేసి బెదిఱించడం. వ్యక్తికీ-గుంపుకూ మధ్య శక్తి-అసమతూకాన్ని (power imbalance) సృష్టించడం. అటువంటి బలప్రదర్శన ద్వారా విడివ్యక్తుల హక్కుల్ని హరించడం.

పోరాడ్డం నేర్చుకున్నవారంతా తెఱుపుడు మనసు (open mind) నీ, సరళ స్వభావాన్నీ, చిన్ననాటి సున్నితత్వాల్నీ, అనుభూతుల్నీ శాశ్వతంగా పోగొట్టుకుంటారు. ఆరోగ్యకరమైన ప్రేమభావనలకు దూరమైన వీరు, కామసుఖం కఱువైన జాగిలాల వలె నిరంతర ఉగ్రవైఖరిని ప్రదర్శిస్తూంటారు. వీరంతా కలిసి సమాజంలో ఒక అనాగరిక, మొఱటు వాతావరణానికి నాంది పలుకుతారు. ఇదొక విషవలయం. ఈ మార్గంలో సాధించే విజయాలు ఆయా సిద్ధాంతవాదులకు తాత్కాలికంగా చవకబారు తృప్తినీ, పైశాచిక ఆనందాన్నీ, స్వోత్కర్షనూ కలిగిస్తాయే తప్ప అవి వాస్తవంగా డొల్ల. ప్రతీకార భావనల కాలకూట మిశ్రమంతో కలుషితం కాని పోరాటాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కాబట్టి మానవుల మీద పోరాడ్డమంటే వారిని ద్వేషించడమే. మతం కోసమో, సిద్ధాంతం కోసమో పోరాడుతున్నామని చెప్పుకునేవారు కూడా ఆచరణలో మతాల్నీ కాదు, సిద్ధాంతాల్నీ కాదు. మనుషుల్నే ద్వేషిస్తారు. వారిమీదే దాడులు చేస్తారు. 

7. సర్వతోముఖమైన స్వేచ్ఛ

మానవులు నిర్ణిబంధస్వేచ్ఛ ననుభవించడం ద్వారానే పరిపూర్ణ మానసిక వికాసాన్ని పొందగలరని మానవతావాదం చెబుతుంది. ఎందుకంటే ప్రతిమనిషిలోనూ అనంతమైన శక్తులూ, ప్రతిభలూ నిక్షిప్తమై ఉన్నాయి. అవి వ్యక్తమయ్యేందుకూ, తన్ను తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకునేందుకూ ప్రతివ్యక్తికీ తోడ్పాటు నివ్వాలి. అనుకూల పరిస్థితులు కల్పించాలి. ఆ తోడ్పాట్లలో అత్యంత ముఖ్యమైనదే స్వేచ్ఛ. అది లేకపోతే జంతువులు సైతం వేటకళను మర్చిపోతాయి. కానీ స్వేచ్ఛ గల మానవులు తమకూ, ఇతరులకూ కూడా ఉపయోగపడతారు. ఆ విధంగా ఎక్కువమంది యొక్క స్వేచ్ఛాపూరిత ఆలోచనల ద్వారా మానవాళి ఏదో ఒకరోజున సమష్టిగా లాభం పొందుతుంది. ఇప్పుడు నాగరికతారూపంలో మనం అనుభవిస్తున్న వన్నీ– ఒకప్పుడు కొందఱు మనుషులు స్వేచ్ఛగా ప్రయత్న-పొఱపాట్లూ (trial and error), ప్రయోగాలూ చేయగా, వాటి గుఱించి ఎన్నో వాదోపవాదాలకు దిగి మనశ్శాంతిని పోగొట్టుకోగా మనకు అందుబాటులోకొచ్చినవే. 

అస్తిగోపన (conservative) సమాజాల్లో వ్యక్తిస్వేచ్ఛని లిఖితపూర్వకంగా గుర్తించినా దాన్ని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుకానివ్వరు. దాన్ని అమలుజఱిపే బాధ్యత ఉన్న అధికారులు కూడా ఆ సంగతి విస్మరించి తాము జీవిస్తున్న సమాజంలో నెలకొన్న అస్తిగోపనభావాలకు లోనై స్వేచ్ఛాపరుల్ని శిక్షించడానికే పూనుకుంటారు. కారణం- నిజానికి ఏ సమాజంలో నైనా ఉదారవాద స్వభావులే అధికంగా ఉంటారు. కానీ సమాజం కొద్దిమంది అస్తిగోపనుల ఆధిపత్యం కింద ఉండడానా, ఉదారవాదుల కంటే వారి స్వరమే తారం (loud) కావడానా వారి అభిప్రాయాలే యావత్తు సమాజపు టభిప్రాయాలుగా చెలామణి అవుతూండడం కద్దు. “స్వేచ్ఛ సమానత్వం, భావప్రకటనా స్వేచ్ఛ” అని ఆర్భటించే వర్గాలు కూడా ఆచరణలో ఇతరులకు తమ వాదాన్ని వినిపించే అవకాశం ఇవ్వకపోవడం, వారు మాట్లాడితే ప్రచురించకపోవడం అస్తిగోపన సమాజాల్లో చాలా తఱచుగా కనిపిస్తుంది. కనుక, “స్వేచ్ఛ ఉంది” అని ఊరికే కాయితం మీద వ్రాయడం కాదు, ముందు మనుషుల ధోరణిలో మార్పు రావాలి అని అవగతమౌతోంది.

స్వేచ్ఛారహిత సమాజాల్లో కొద్దిమంది కూర్చుని మిగిలిన కోట్లాదిమందీ ఏం ఆలోచించాలో, ఏం మాట్లాడాలో, ఏం చెయ్యాలో శాసిస్తూంటారు. ఇతరులు కొత్తశైలిలో ఏ కొత్త విషయాలూ మాట్లాడడానికి వీల్లేదంటూ వారు విడ్డూరపు చట్టాల్ని రచిస్తారు. అందుచేత ఆ సమాజాలు కొత్త ఆలోచనలు చేయడానికీ, ప్రయోగాలకు దిగడానికీ సైతం భయపడిపోతాయి. అందుచేత ఆ సమాజాల్లో ఒక విధమైన, ఏదో తెలియని భీతావహ వాతావరణం రాజ్యమేలుతూంటుంది. కనుక అవి పైవాళ్ళు నేర్పే చిలక పలుకులే పలుకుతూ స్వకీయత (originality) లోపించి కాలక్రమేణ వెనకబడిపోతాయి. దరిమిలా అవి వినూత్నస్ఫురణల నిమిత్తం విదేశాలకేసి దృష్టి సారించాల్సిన అగత్యానికి లోనవుతాయి. ఈ విధమైన మనోదాస్యం కాలక్రమంలో భౌతిక బానిసత్వానికి సైతం దారితీయొచ్చు.

మనుషులు ముందు తప్పుచేస్తేనే ఆ తరువాత ఒప్పేదో తెలుసుకోగలుగుతారు. ఐతే ఒకఱికి తప్పని ముందే తెలిసినది మఱొకఱికి ఇప్పటిదాకా తెలియకపోవచ్చు. ఎందుకంటే మానవులందఱి మానసిక పురోగతిస్థాయీ ఒకేలా లేదు. అదే విధంగా ఒకఱి అనుభవం మఱొకఱికి చెందదు. కనుక ఆ సంగతి తెలుసుకోవడానికి వారు కొత్తగా తప్పుచేయాల్సి రావచ్చు. ఆ ప్రక్రియకి, లేదా ప్రయత్నానికి వారిని ద్వేషించడం, దండించడం అసమంజసం. కాబట్టి తప్పొప్పుల పేరుతో వివిధ ప్రామాణిక సంస్థలు వ్యక్తుల మీద విధించిన అన్ని నిషేధాలూ పోవాలని మానవతావాదం కోరుతుంది. ఎందుకంటే ఒక ఆచరణ సహజమైతే దానిమీద నిషేధం కృత్రిమమవుతుంది. అప్పుడా నిషేధం విఫలమవుతుంది. ఒకవేళ ఆ ఆచరణ కృత్రిమమైతే దానంతట అదే వాడుకలోంచి తొలగిపోతుంది. నిషేధంతో అవసరమే లేదు.

స్వేచ్ఛ అంటూ ఉంటే దాన్ని ఎలా వాడుకోవాలో జనం ప్రయత్న-పొఱపాట్ల (trial and error) ద్వారా కాలక్రమేణ తెలుసుకుంటారు. తమ స్వేచ్ఛపై పరిసరస్థుల అభిప్రాయాల్నీ, ప్రతిస్పందనల్నీ గ్రహించి  ఆ తదుపరి దాన్ని పరోపతాపనం కాని విధంగా తీర్చిదిద్దుకుంటారు. అసలు స్వేచ్చే లేకపోతే ఎలా తెలుసుకుంటారు? స్వేచ్ఛని అదుపుచేయాలని చెప్పేవారు కూడా, “దానికున్న పరిమితులివి” అని తామెలా తెలుసుకున్నారు? మఱి ఆ తెలుసుకునే అవకాశం తమకే కాక అందఱికీ ఉండాలి కదా !    
 

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

ప్రేమ-గౌరవాలూ, నిరీక్షణతత్త్వమూ

4. ప్రేమ-గౌరవాలతో జమిలి సంభావన 

మనం లోకంలో మెలగే వ్యక్తుల్లో సాధారణంగా రెండు రకాలవారు ఉంటారు. ఒకటి - మనం ప్రేమించేవారు. రెండోది, మనం గౌరవించేవారు. ఈ తెఱగు మన్నింపు (treatment) లోని లోపమేంటంటే, మనం ఎవఱినైతే ప్రేమిస్తామో వారిని గౌరవించం. అలాగే, ఎవఱిని గౌరవిస్తామో వారిని ప్రేమించం. ఈ పద్ధతి పోవాలి. ప్రేమించబడే ప్రతివ్యక్తికీ గౌరవాన్ని కూడా ఇవ్వాలి. అలాగే, గౌరవించబడే ప్రతి వ్యక్తికీ ప్రేమని కూడా అందించాలి. రెండూ మనిషికి అవసరమే. అయినా కొన్నిసార్లు గౌరవం కంటే ప్రేమదే అగ్రాసనం. ఎందుకంటే గౌరవం శిరసావహించగా, ప్రేమ అర్థం చేసుకుంటుంది. గౌరవాలన్నీ సాధారణంగా ప్రశంసాభావం (admiration) లోంచి ఉద్భవిస్తాయి. కానీ దురదృష్టవశాత్తూ ప్రశంసాభావం అనేదొక క్షణిక భావోద్వేగమే తప్ప ఇంకేమీ కాదు. తమకు ఎవఱైతే గౌరవనీయులో వారిని ప్రేమతో అర్థం చేసుకోను యత్నించనివారు ఏ చిన్న కారణం/ సంఘటన మూలంగానైనా ఆ ప్రశంసాభావాన్నీ, దాన్తో పాటే ఏర్పడ్డ గౌరవాన్ని కోల్పోవచ్చు. కానీ అటువంటి సందర్భాల్లో సైతం ప్రేమవంతులు గౌరవనీయుల పట్ల తమ గౌరవాన్ని అక్షతంగా నిలబెట్టుకుంటారు.

మనుషులు సాధారణంగా అవతలివారి అభిప్రాయాల్ని బట్టి వారిని ప్రేమించడమో ద్వేషించడమో చేస్తూంటారు. అంటే, వారి అభిప్రాయాలు తమవాటితో సంవదిస్తే ప్రేమించడం, లేకపోతే ద్వేషించడం- ఇదీ ధోరణి. ఈ ధోరణిని జనసామాన్యం చాలా సహజమన్నట్లు చాలా మామూలుగా తీసుకుంటుంది. కానీ మానవతావాదులు అలా చూడరు. మనిషికీ, మనిషికీ మధ్య ఉన్న సంబంధం వారి అభిప్రాయాల కంటే పవిత్రమైనది. మనుషులు తమ అభిప్రాయాల కంటే గొప్పవాళ్ళు. అభిప్రాయాలనేవి- అవి లిఖితపూర్వకం కావచ్చు, కాకపోవచ్చు. అవి మనసులో పెట్టుకున్నవి కావచ్చు. ఆంతరంగిక మిత్రులకు వెల్లడించినవి కావచ్చు. లేదా ఓ బహిరంగసభలోనో, మీడియా ద్వారానో వ్యక్తీకరించినవీ కావచ్చు. ఎలా అయినా గానీ, అవన్నీ క్షణికమే. పరిస్థితుల్ని బట్టి మారిపోయేవే. వాటిని బట్టి మనుషుల్ని ప్రేమించడమో, ద్వేషించడమో చేయడం చాలా తప్పు. ఈ తప్పుని రాజకీయ పక్షాలూ, మీడియా బాహాటంగా ప్రోత్సహిస్తున్నాయి సాక్షాత్తూ ప్రభుత్వాలే స్వయంగా దీనికి పాల్పడుతున్నాయి. దీనివల్ల చాలా అన్యాయాలు జఱుగుతున్నాయి. కుటుంబాలు కూలిపోతున్నాయి. మారణహోమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉన్మాదాలు ప్రబలుతున్నాయి. ఇవన్నీ కళ్ళారా చూసీ, తనువారా అనుభవించిన తరువాత కూడా ఈ తప్పునే మానవాళి మళ్ళీ మళ్ళీ ఏ మార్పూ లేకుండా సర్వేసర్వత్రా పునరావృత్తం కావిస్తోంది.

అభిప్రాయాల్ని అభిప్రాయాలుగా, వ్యక్తుల్ని వ్యక్తులుగా చూసే మేధానాణ్యత మనలో పెంపొందాల్సి ఉంది. వ్యక్తుల్ని మూర్తీభవించిన అభిప్రాయాలుగా చూడడం, ఆ భ్రాంతిలో అభిప్రాయాల మీద అభిప్రాయాలతో కాకుండా, వ్యక్తుల మీద వ్యక్తిగతంగా దాడిచేయడం, చేయించడం, ఆ రకంగా శాశ్వతంగా మానవ సంబంధాల్ని దెబ్బదీసుకోవడం– ఇలాంటి కుసంస్కారాలు పోవాలి. ఇద్దఱు వ్యక్తులకు ఒక విషయం గుఱించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు ఉండొచ్చు. అదే సమయంలో వారు మంచిమిత్రులుగా కూడా ఉండొచ్చు. ఆ మాటకొస్తే అన్ని విషయాల మీదా అచ్చుమచ్చు ఒకే విధమైన అభిప్రాయాలు గల ఇద్దఱు వ్యక్తులు ప్రపంచంలో మనకెక్కడా తారసపడరు. ఒకవేళ అటువంటివారెవఱైనా ఉంటే వారిలో ఒకఱు అనవసరం. శత్రువుల సంగతలా ఉంచి, మన మిత్రులతో, ఆఖరికి జీవిత భాగస్వామితో కూడా అన్ని విషయాల్లోనూ ఏకీభావం కుదఱదు. మఱి వీళ్ళందఱినీ అనునిత్యం భరిస్తూనే ఉన్నాం గదా? అలా భరించడానికీ, ప్రేమించడానికీ గల అసలు కారణం వీరిని మనం జడ్జ్ చేయకపోవడమే. అదే ధోరణి అన్ని సందర్భాల్లోనూ పెంపొందాల్సి ఉంది. 

మనుషులు పుట్టినప్పుడు ప్రేమస్వరూపులుగానే పుడతారు. శైశవంలో తమ చుట్టూ ఉన్న ప్రతిదాన్నీ ప్రేమిస్తారు. కానీ పెఱిగి పెద్దవుతున్న క్రమంలో ఆ ప్రేమ స్థానంలో కారణం తెలీని ద్వేషమొచ్చి కూర్చుంటుంది. దేన్ని/ఎవఱిని ద్వేషిద్దామా? అని చూస్తూంటారు. ద్వేషించడానికి ఏమీ లేకపోయినా అందుకు కారణాలు వెతుక్కుంటూ ఉంటారు.  మనిషికీ, మనిషికీ మధ్య సహజంగా ఉండే తేడాలు అలాంటి వెతుకులాటకు అక్కఱకొస్తాయి. కానీ మనుషుల మధ్య బైటికి కొట్టొచ్చినట్టు కనిపించే తేడాలన్నీ కేవలం ఉపరితలీనమూ (superficial), బలహీనమూను. చూడగలిగితే, వారందఱిలోనూ అంతర్గతంగా ఉన్న పోలికలే అత్యంత బలీయం. అందఱూ బాహ్యభేదాల్నే ఎత్తిచూపుతారు. ఉన్నవి కొన్నే అయినా, పోలికల్ని ఉద్ద్యోతించడం (highlighting) నేర్చుకుంటే ఈ ద్వేషలోకం కాస్తయినా ప్రేమలోకంగా మారడానికి అవకాశముంటుంది.

ప్రేమించే స్వభావం కొందఱిలో స్వతహాగానే ఉంటుంది. అది చాలా ప్రశంసనీయం. కానీ అలాంటి వారు కూడా చాలా తఱచుగా ఒక పొఱపాటు చేస్తారు. అదేంటంటే- తాము ఇతరుల్ని ఎలా ప్రేమిస్తున్నారో వారు కూడా తమను అలాగే ప్రేమిస్తారని భావించడం. లేదా అలా ప్రేమించాలని ఆశించడం. ఇది నెఱవేఱే ఆశంస కాదని చెప్పడానికి విచారిస్తున్నాను. మనం ఇతరుల్ని ప్రేమించేది వారి ప్రేమని మళ్ళీ అంత స్థాయిలో పొందడానిక్కాదు. ప్రేమించడమే మన అపరస్వభావం కాబట్టి ప్రేమించాలి, అంతే ! తిరిగి ప్రేమని పొందలేకపోయినా అదో పెద్ద విషయం కాదు. ఎందుకంటే, ఆదాన-ప్రదానాత్మక ప్రేమ వాణిజ్య నిర్విశేషమే. నిఃస్వార్థంగా ప్రేమించడం ద్వారానే మనస్సు పరిశుద్ధమవుతుంది. ఎంతగా పరిశుద్ధమైతే అంతగా ఆనందం కలుగుతుంది. మనకు వాస్తవంగా కావల్సింది అదే. 

5. నిరీక్షణ తత్త్వం

దీనికీ పోరాటదూరత్వానికీ సంబంధం ఉంది. మానవతావాదులు వ్యక్తులలో గానీ సంఘంలో గానీ తాము కోరుకుంటున్న ఏ మార్పుకోసమూ తొందఱపడరు. ఆ మార్పును బలవంతంగా రప్పించే పరిస్థితుల్ని కల్పించను యత్నించరు. మనం చేఱుకున్న మైలుఱాయినే ప్రతిమానవుడూ ఏదో ఒకరోజు చేఱుకుంటాడు. దాని కోసం మనం ఆతురత చెందాల్సిందేమీ లేదు. కానీ సోదర మానవులు కోరితే వారికి మన వంతు బాసట ఇవ్వొచ్చు.   
 

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

వ్యక్తివాదం-6

౧౦. బలమైన వ్యవస్థల స్థానంలో బలమైన వ్యక్తిత్వాలు రూపొందడానికి దోహదం చేయడం : మానవ నాగరికతకి వ్యక్తీ, వ్యవస్థా, ఇద్దఱూ అవసరమే. కానీ వ్యవస్థ అవసరమైనదాని కన్నా చాలా చాలా ఎక్కువ బలోపేతమై కూర్చోవడమే మన కాలపు సమస్య. వ్యవస్థకీ, వ్యక్తికీ మధ్య అగాధమైన శక్తి-అసమతూకం (power imbalance) ఏర్పడింది. దీనివల్ల వ్యవస్థ చేతుల్లో వ్యక్తుల జీవితాలు అన్యాయమైపోతున్నాయి. మనం మళ్లీ పాతకాలపు రాజఱికాల్లోకి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతోంది. మూలాల్లోకి తొంగిచూసినప్పుడు వ్యవస్థలు కేవలం ఊహాజనితాలు. ఎందుకంటే అవి ఉన్నాయని అందఱూ అనుకుంటే అవి ఉన్నట్లు. లేకపోతే లేనట్లే. వాటిల్లో పని చేసేవారిక్కూడా అవి ఉన్నాయో లేవో తెలీదు. కానీ ఉన్నాయనుకునే పనిచేస్తూంటారు, జీతాలు అందుతున్నంతకాలం! 

ఉదాహరణకి, ఓ బ్యాంకులో వేలాదికోట్ల డబ్బు మూలుగుతోందని జనం అనుకుంటారు. చిట్టాపుస్తకాల ప్రకారం అది నిజమే అయినా ఆ బ్యాంకువారు చాలామందికి ఇల్లడదార్ల (depositors) డబ్బుతో అప్పులివ్వడం వల్ల అక్కడ కొన్నివందల కోట్లకంటే ఎక్కువ ఉండదు. హఠాత్తుగా ఎవఱైనా ఆ బ్యాంకులో డబ్బులేదని ఓ తప్పుడు వదంతి పుట్టిస్తే ఇహ ఇల్లడదార్లంతా “మా డబ్బు, మా డబ్బు” అని ఆ బ్యాంకు మీదికి ఎగబడతారు. అందఱూ ఒకేసారి అలా ఎగబడితే బ్యాంకు నిజంగానే వారి ఇల్లడాల్ని (deposits) తిరిగి చెల్లించజాలదు కనుక బ్యాంకు దివాలా తీసిన మాట వాస్తవమేనని సమాజం నమ్ముతుంది. ప్రభుత్వంతో సహా మనం ఏర్పఱచుకున్న వ్యవస్థలన్నీ ఇలాంటి బ్యాంకులే. ఏతద్విపర్యాసంగా, వ్యక్తి ఊహాజనితం కాదని గమనించాలి. అతని ఉనికి ఒక ఖరాఖండీ వాస్తవం. వ్యవస్థలు బలంగా ఉండాలని ఆకాంక్షించడం అంటే వాటి గుఱించిన ఊహలూ, నమ్మకాలూ బలంగా ఉండాలని కోరుకోవడమే. విడివ్యక్తి ఇంకా బలహీనుడూ, నిస్సహాయుడూ అవ్వాలని శపించడమే. వ్యవస్థను గుఱించిన ఊహలూ, నమ్మకాలూ బలోపేతం కావాలన్నా మళ్లీ వాటిని విడివ్యక్తుల్లో ఒక్కొక్కఱికీ వేఱువేఱుగా నూఱిపోయాల్సిందే. ఎందుకంటే వ్యవస్థ అనేది వాళ్ళద్వారా నిలబడాల్సినది. ఇదో ద్రావిడప్రాణాయామం. దీని బదులు నేరుగా వ్యక్తుల్నే బలోపేతం చేయడం సులభతరం.

ఎక్కువమంది పెట్టుకున్న ప్రత్యయానికి (conviction) భిన్నంగా "బలమైన వ్యవస్థలుండడం అనేది సౌష్ఠవ (perfect) సమాజానికి భరోసా కా”దని చెప్పడానికి విచారిస్తున్నాను. చాలామందికి తెలియని విషయం. ‘వ్యవస్థలు పటిష్ఠంగా నడవడం’ అనేదాని వెనక పైకి చెప్పని కర్కశత్వం చాలా ఉంటుంది. ఎందఱో బలైపోయిన వ్యక్తులూ, కుటుంబాలూ ఉంటారు. తెఱచాటు చీకటి వ్యవహారాలుంటాయి. "బలమైన వ్యవస్థల కోసం ఇంత ప్రతీపత (negativity) తో మూల్యం చెల్లించాలా? ఇదంతా అవసరమా?" అనిపిస్తుంది. "ఒకవేళ అవసరమైతే ఎవఱికి అవసరం?" అని కూడా అనిపిస్తుంది. వ్యవస్థ కోసం ఇంత ప్రతీపతని అంగీకరించాలన్నప్పుడు దీనివల్ల లాభపడేవారు కనీసం ఒక్కఱన్నా ఉండాలి. ఒక రాజో, నియంతో ఉంటే వారు బహుశా దీనివల్ల లాభపడొచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ఎవఱికి మాత్రం ఏం లాభం? ఇక్కడ ఎవఱూ ఏ పదవిలోనూ ఎల్లకాలం ఉండబోవట్లేదు కదా? ఎందుకంటే, బలహీన వ్యవస్థలో ఏ నష్టాలైతే జఱుగుతాయని నాయకులూ, మేధావులూ ఉద్ఘోషిస్తున్నారో వాటిని స్వయంగా తాము బలమైన వ్యవస్థలోనే మనకు రుచి చూపిస్తున్నారు. ఉదాహరణకి, దేశం ముక్కలు కాకూడదనేవారే స్వహస్తాలతో దాన్ని ముక్కలు (చిన్నచిన్న రాష్ట్రాలుగా) చేస్తున్నారు. మఱి మనం దేని గుఱించి బెంగపెట్టుకుని చిక్కిపోవాలి? కొన్నిసార్లు క్రూర వ్యవస్థల కంటే అసమర్థ వ్యవస్థలే సాపేక్షంగా మేల్తరం. ఎందుకంటే అవి సమాజాన్ని ఉద్ధరించలేకపోయినా విడివ్యక్తులకు అపకారం చెయ్యవు.

అయినా మామూలు పౌరులతో సహా అంతా బలమైన వ్యవస్థలు కావాలని ఈ రోజుల్లో డిమాండు చేయడం వెనకున్నది అమాయకత్వమూ, అజ్ఞానమే తప్ప తదన్యం కాదు. దోపిడిదార్లూ, కాపలాదార్లూ విడివిడిగా ఉంటారనుకునే బాల్యావస్థని అధిగమించలేక చేసే డిమాండ్లివి. 

స్థూలంగా వ్యక్తివాదం చెప్పేదిది. 

 3. వైవిధ్యాన్ని గౌరవించడం

మానవుల మధ్య విజనుష్షు, జాతి, కులం, రంగు, మతం, శాఖ, భాష, లిపి, మాండలికం, విద్య, వృత్తి, ఆర్థికవర్గం, ప్రాంతం, వయసు, ఆరోగ్యం, అలవాట్లూ, అభిరుచులూ, రాజకీయ-సాంఘికాది అభిప్రాయాలూ ఇత్యాది ప్రత్యేకతల్ని ఆశ్రయించుకొని వేలాది వ్యత్యాసాలున్నాయి. కనుక మానవులంతా సమానమని గానీ, సదృశం (ఒకే లాంటివారు) అని గానీ మానవతావాదం చెప్పదు. లేదా వారు అలా తయారవ్వాలని కూడా బోధించదు. మానవజాతిలోని ఈ అనంత వైవిధ్యానికి అది సవినయంగా శిరసు వంచుతుంది. దాన్ని యథాతథంగా అంగీకరిస్తుంది. గౌరవిస్తుంది. ఆ భేదాల్ని పాటిస్తున్నందుకూ, కొనసాగిస్తున్నందుకూ, వాటిని పైకి వ్యక్తీకరిస్తున్నందుకూ అది ఎవ్వఱినీ తప్పు పట్టదు. ఐతే వాటిని పట్టించుకోకుండా మానవులందఱి ఎడలా ఒకేలాంటి సౌహార్దాన్ని చూపించాలని మానవతావాదం చెబుతుంది. ఒకఱు మఱొకఱిని ఏ ప్రాతిపదికనైనా, చెడ్డగా మన్నించడం, అణచి వేయడం, వారికన్యాయం చేయడంలాంటివాటికి మానవతావాదుల మద్దతుండదు. అదే సమయంలో- అలా చేసేవారి పట్ల కూడా సాధ్యమైనంత మానవీయంగా, మర్యాదగానే వ్యవహరించాలని వారు కోరతారు. వారి దుష్ప్రవర్తన గుఱించి మన సత్ప్రవృత్తిని విడనాడడం సరికాదనేది ఇందులో ఇమిడున్న సూత్రం.

“మనుషులు ఒకఱిలా మఱొకఱు ఉండనక్ఖర్లేదు అన్నప్పుడు, మఱి అందఱికీ వర్తించే మానవత్వానికి అర్థమేంటి? అది ఎక్కడుంది?” అన్న ప్రశ్న తలెత్తుతుంది. మనుషులు ఒకే భాషకున్న వేఱువేఱు ప్రాంతీయ మాండలికాల వంటివారు. ఒక మాండలికంలోని మొత్తం పదాలూ ఇంకో మాండలికంలో ఉండవు. అయితే ప్రతిమాండలికానికీ ప్రతిఒక్క ఇతర మాండలికంతోనూ కొన్ని పోలికలు ఉండనే ఉంటాయి. అందువల్లనే అవన్నీ పరస్పర సంబంధం కలిగినవనీ, ఒకే భాష అనీ గుర్తించగలుగుతున్నాం. అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే మనుషులు ఒకఱినుంచి ఒకఱు ఎంత భేదించినా వారందఱికీ కలిపి కొన్ని ఉమ్మడి అవసరాలూ, ఆశలూ ఉంటాయి. వాటి నాశ్రయించుకుని కొన్ని ఉమ్మడిబలాలూ, బలహీనతలూ కూడా ఉంటాయి. మానవత్వమంటే ఈ అన్ని లక్షణాల సమాహారమే. వాటిని అర్థం చేసుకుని ఆ విధమైన అవగాహన ప్రకారంగా మానవులతో వ్యవహరించడమే మానవతావాదం. 
 

8, సెప్టెంబర్ 2014, సోమవారం

వ్యక్తివాదం-5

౯. ప్రేమ-కామంలాంటి వ్యక్తిగతవిషయాల్లో అజోక్యదారీ వైఖరి: స్త్రీపురుషుల మధ్య పరస్పర ప్రేమే కుటుంబవ్యవస్థకి ప్రాణం. అది లేనప్పుడు వివాహమైనా కానట్లే. కుటుంబం ఉన్నా లేనట్లే. ప్రేమ మొదట్లో ఎంతో కొంత మోహం లేకుండా ఏర్పడదు. పెళ్ళి కాకపోయినా ఆ ప్రేమాతిశయం వల్లనే స్త్రీలు పతివ్రతలవుతారనే విషయాన్ని మన పురాణాలు సైతం పలుచోట్ల సూచిస్తున్నాయి. ఇంద్రాది దేవతలు స్వయంవర సభలో తన ప్రియుడైన నలుడి రూపాన్ని ధరించి అతని పక్కనే ఆసీనులైతే “వారిలో అసలైన నలుడెవ”ఱనేది దమయంతి తన పాతివ్రత్య ప్రభావం వల్లనే కనుక్కుని వరించిందట. వివాహం కావడమే పవిత్రతకి ముఖ్యమనుకుంటే, మఱి పెళ్ళికాని దమయంతికి ఆ పాతివ్రత్య మహిమ ఉండకూడదు కదా? 

కనుక ఒకఱినొకఱు ఇష్టపడ్డ ఆడా-మగా ఎవఱైనా కావచ్చు. ఏ వయోవర్గానికైనా చెంది ఉండొచ్చు. పెళ్ళయి ఉండొచ్చు. కాకపోవచ్చు. ఎవఱు నాలుగ్గోడల మధ్య ఏం చేసుకుంటారనేది వారి ఆంతరంగిక విషయం. దాని గుఱించి మనం గగ్గోలుపెట్టడం, వివాదపడడం అనావశ్యకం. తమ జీవితంలో ముఖ్యమైన మూడో పక్షం (a very significant third party) ఎవఱైనా ఉంటే, వారికి ద్రోహం చేయనంతవఱకూ ప్రేమిక జంటలు ఏమైనా చేసుకోవచ్చు. అది వారి వ్యక్తిస్వేచ్ఛలో ఒక భాగం. స్త్రీకి పురుషసాన్నిధ్యమూ, అలాగే పురుషుడికి స్త్రీసాన్నిధ్యమూ తప్పనిసరి అవసరాలు. అందుచేత ఎవఱో ఒక ఇద్దఱు పెళ్ళిచేసుకున్నా చేసుకోకపోయినా, కలిసున్నా, కలిసి తిరిగినా, ఆఖరికి గర్భధారణే చేసినా అది మనకి సంబంధించిన విషయం కాదు. వారు ఏదో ఒక రకంగా కలిసుంటే కాదు, మిగతా సమాజానికి ముప్పు ముంచుకొచ్చేది. అలా ఉండకపోతేనే. 

ఈ రోజుల్లో సహజీవనాన్ని (live-in relationship) కొందఱు మెచ్చుకోవడం, మఱికొందఱు తెగనాడడం కనిపిస్తుంది. చాలామంది అనుకుంటున్నట్లు  పెళ్ళి అనేది ప్రాథమికంగా ఒక సాంఘిక వ్యవస్థ కాదు. మతవ్యవస్థ మాత్రమే. లైంగిక సంబంధానికి పెళ్ళిని తప్పనిసరి చేసినది మతమే. మతాలన్నీ నాగరికతా పరిణామక్రమంలో ఎదగబాఱుతూ వచ్చినవే. కనుక పెళ్ళి కూడా అలాంటిదే. పరిమితి, నిగ్రహాల కోసమే పెళ్ళి. నిగ్రహం ఆధ్యాత్మిక జీవితానికే ఉపయుక్తం తప్ప లౌకిక జీవితంలో దాని ప్రయోజనం పరిమితం. కనుక ఎవఱైనా మతోద్దిష్ట జీవనశైలి తమకవసరం లేదని భావించినప్పుడు అది విధించిన చట్రంలో వారి ఇష్టానికి భంగకరంగా వారిని నిర్బంధించడం సరికాదు. పెళ్ళి ఒక గొప్ప సౌలభ్యమే. కాదనకూడదు. కానీ ఆ సౌలభ్యం తమకవసరం లేదనేవారికి బలవంతంగా మెడలు వంచి మఱీ దాన్ని సమకూర్చాల్సిన అగత్యమేముంది ? 

పెళ్ళికి గుర్తింపు నిస్తుందని చెప్పబడుతున్న రాజ్యం (State) కూడా నిజానికి కుటుంబాల ద్వారా ఏర్పడినదే. అంటే కుటుంబాలన్నీ కలిసి రాజ్యాన్ని సృష్టించాయే తప్ప రాజ్యం కుటుంబాల్ని సృష్టించలేదు. కుటుంబవ్యవస్థే లేనప్పుడు కులాలూ లేవు, గోత్రాలూ లేవు. మతాలూ లేవు, రాజ్యాలూ లేవు. దేశాలూ లేవు, జాతీయతలూ లేవు. కుటుంబాల ద్వారానే ఇవన్నీ ఏర్పడుతున్నాయి. కుటుంబాల ద్వారానే తెలుసుకోబడుతున్నాయి. వాటిద్వారానే నిలబెట్టబడుతున్నాయి. ఆ కుటుంబాలు అన్యోఽన్యాకృష్టులైన స్త్రీపురుషయుగ్మాలద్వారా ఏర్పడుతున్నాయి. కనుక పెళ్ళి జఱిగినా, జఱక్కపోయినా కుటుంబాలేర్పడతాయి. కాబట్టి మనం అన్నిటికంటే ముందు కాపాడాల్సినది ఆ స్త్రీపురుష మిథునాల ప్రయోజనాల్నే. మనం వాస్తవంగా సమర్థించాల్సింది వారి మధ్య మోహాన్నీ, ఆకర్షణనే. “మోహం ప్రేమ కాదు గదా!” అని ఆక్షేపణ లేవదీస్తే, ఇక్కడ అసలు విషయం చెప్పాల్సొస్తుంది. యత్కించిత్ స్వార్థస్పర్శనీ ఎఱగని పరాప్రేమ లౌకిక, మానుషతలంలో అలభ్యం. ఈ రోజుల్లో అన్నిరకాల ప్రేమలూ ఏదో ఒక స్వార్థమూ, అహంకారమే ఆలంబనగా కలిగినవి. ఆస్తుల మీదా, ఆదాయాల మీదా వ్యామోహం కన్నా శుద్ధశృంగారపరమైన మోహమే బహుశా ఎక్కువ అమలినం.

స్త్రీపురుషులలో పరస్పరవాంఛలు సహజం. అది మానవలక్షణం. ఈ వాస్తవాన్ని నిర్ణిబంధంగా అంగీకరించే విషయంలో మన సమాజానికి ఇప్పటికే చాలా ఆలస్యమై పోయింది. దాన్ని చాలా ఘోరమైన తప్పుగా, కళంకంగా భావించడాన, కామం గల పురుషులంతా కీచకులుగానూ, అటువంటి స్త్రీలంతా విలాసవతులుగానూ సద్యఃస్ఫురణ చేసుకోబడుతున్నారు. అయితే సాధారణ పురుషుల్లో లేని విచిత్రవస్తువేదీ కీచకుడిలో కూడా లేదు. అలాగే సంసారస్త్రీలలో లేని అపూర్వలక్షణమేదీ విలాసవతిలోనూ లేదు. ఒకఱినేమో సంసారిగానూ, మఱొకఱిని విలాసవతిగానూ రూపుకట్టిస్తున్నవి వారివారి పరిస్థితులే. కానీ పైన చెప్పిన భావనల మూలాన, తమలో  కామం లేనట్లు బహిరంగ భంగిమలివ్వడానికే అందఱూ ఉత్సుకత చూపుతారు. ఆ భంగిమలు గొప్ప మర్యాదస్థుల లక్షణంగా, సభ్యతగా ప్రచారంలోకొస్తాయి. అందుచేత కామం అనేది ఎక్కడో అరుదుగా నేఱాలకు పాల్పడేవారిలోనే ఉన్నట్లూ, మిగతా సామాజికులంతా జితేంద్రియులైన ఋషులూ, ఋషికలూ అయినట్లూ భంగిమలిస్తున్నారు. కొండొకచో సదరు భంగిమలు (poses) శ్రుతిమించి వివాహబంధ బాహ్యంగా కలిగిన బిడ్డల్ని సిబ్బితితో, సంఘభీతితో కడతేఱుస్తున్నారు. లేదా అనాథలుగా వదిలేస్తున్నారు. అంటే తాము ఏదైతే తప్పనుకుంటున్నారో ఏకంగా దాని తాతల్లాంటి తప్పులే చేస్తున్నారన్నమాట. అలా అన్యాపదేశంగా ప్రోత్సహిస్తున్నది సమాజమే. పునాదుల్లాంటి మానవతావాద సూత్రాలు మఱుగున పడి ఇం కేవేవో భావనలు మనుషుల నెత్తిమీద తాండవించసాగితే ఉప్పతిల్లే పరిణామాలు ఇలాగే ఉంటాయని అర్థం చేసుకోవాలి. 

ఆ భంగిమలు సరికావు. స్త్రీపురుషులంతా స్వభావసిద్ధంగా కామవంతులే. నిర్భరమైన ప్రేమ కొన్నిసార్లు దుర్భరమైన కామంలో పర్యవసించేందుకు ఆస్కారం లేకపోలేదు. అంతమాత్రాన అది ప్రేమ కాకుండా పోదు. అదే విధంగా దుర్భరమైన కామం కూడా నిర్భరమైన ప్రేమలో పర్యవసించవచ్చు. ఈ క్రమం ఖచ్చితంగా ఇలాగే జఱుగుతుందని మునువల్కడం ఎవఱికీ సాధ్యం కాదు. ఈ సత్యాన్ని గ్రహించి తదనుగుణంగా మన వ్యక్తిగత కౌటుంబిక, సామాజిక దృక్పథాల్ని సమూలంగా మార్చుకోవాల్సి ఉంది. కామమనే వాస్తవాన్ని బేషరతుగా అంగీకరించి, ఆమోదించాల్సి ఉంది. అది ఇతరుల్లో ఉన్నప్పుడు, దాన్ని వారు వారికిష్టమైన పద్ధతిలో తృప్తిపఱచుకుంటున్నప్పుడు వారిని సహించి, క్షమించి స్నేహదృష్టితో అర్థం చేసుకోవాల్సి ఉంది. 

ఇష్టానిష్టాలనేవి వ్యక్తులకే ఉంటాయి. గుంపులకు కాదు. ఆమోదాలూ, తిరస్కరణలూ కూడా వ్యక్తులే చేయగలరు. కనుక కామానికి గుంపుల ఆమోదం అనేది ఒక అర్థం లేని విషయం. ఎందుకంటే గుంపుమధ్య ఉన్నప్పుడు ఎవఱూ కామాన్ని ప్రదర్శించరు. అందుచేత పురుషులు తమకు తగిన అవివాహిత స్త్రీల కోసం, అలాగే అవివాహిత స్త్రీలు తమకు తగిన పురుషుల కోసం ప్రయత్నించడం (courtship) లో కూడా తప్పులేదు. అది ప్రకృతి సహజం. దాన్ని విలాసినీత్వంగానో, ప్రేమోన్మాదంగానో, మానభంగ ప్రయత్నంగానో చిత్రించే ధోరణి ఇటీవల మన సమాజంలో పెచ్చుమీఱిపోయింది. దురదృష్టవశాత్తూ, ఈ పని చేస్తున్నవారిలో హెచ్చుశాతం బాగా వయసు మళ్ళిన పెద్దలే. వారి వయసూ, లోకదర్శనమూ వారి శేముషీవైభవానికి ఏ మేలూ చేయకపోవడం విచారకరం. 

సమకాలీనంగా, ఒకఱిని ఇష్టపడ్డందుకూ, ఆ ఇష్టాన్ని తెలియజేసినందుకూ కేసులుపెట్టి అరెస్టులు చేస్తున్నారు. అమాయక కౌమార ప్రేమికుల్లో కఱుడుగట్టిన నేఱస్థుల్ని అభిదర్శిస్తున్నారు. ఇతరేతర కారణాలు చూపించి ఉభయసమ్మత శృంగార (consensual sex) కార్యకలాపాల్ని కూడా నేఱాలుగా నమోదుచేసే ధోరణి కూడా పెచ్చఱిల్లుతోంది. మీడియా సైతం అసలువిషయాల్ని కప్పిపుచ్చి ఈ చర్యల్ని సమర్థిస్తోంది. ఇదో రకం అనాలోచితత్వం, అనాగరికత. అసలు ఏ రకమైన స్త్రీపురుష ఆకర్షణనైనా మహాపాపంగా, ఉరితీయదగ్గ నేఱంగా భావించే స్థితికి మనవారు ఇలా దిగ జాఱిపోవడమూ, శాస్త్రీయంగా ఆలోచించడం మానేసి రోజురోజుకీ మఱింత అస్తిగోపనవాదం (conservatism) లో కూరుకు పోవడానికే నిశ్చయించుకోవడమూ మిక్కిలి విచారకరం. మానవత్వాన్నీ, మానవతావాద సూత్రాలనూ గుఱించిన ప్రాథమిక అవగాహన మన సమాజంలో పూర్తిగా లోపించిందనడానికి ఇదంతా ఒక సూచిక. 
 

4, సెప్టెంబర్ 2014, గురువారం

వ్యక్తివాదం-4

౫. వ్యక్తి స్వార్జితైక జీవనం :- చట్టాలకు లోబడి గానీ, వాటికి బాహ్యంగా గానీ ఇతరుల జేబుల్లో చేతులుపెట్టే తత్త్వాల్ని మానవతావాదం ప్రోత్సహించదు. స్వార్జితం కాని, ఇతరులు తమంత తాము ఇష్టపూర్వకంగా ఇవ్వని ప్రతిపైసా అపవిత్రమే. మానవ సంబంధాల్ని ఉద్దేశపూర్వకంగా సొమ్ముచేసుకోవడం అమానుషమని అందఱూ గ్రహించే రోజు రావాలి. ఎవఱికైనా సహాయాన్ని అర్థించే అవకాశం మాత్రమే ఉంది. డిమాండు చేసే హక్కు లేదు. శక్తి గలిగిన ప్రతి వయోజనవ్యక్తీ తన కష్టార్జితం మీదే ఆధారపడి బ్రతకడానికి ప్రయత్నించాలి. అతను/ఆమె ఎవఱి ఆస్తి కోసమూ, ఆదాయం కోసమూ ఆశించకూడదు– వారు తనకెంత సన్నిహితులైనా! వారు తనను పోషిస్తూంటే వారికి హృదయపూర్వకంగా నెనర్లు చెప్పాలే తప్ప, “అలా పోషించడం వారి బాధ్యత. పోషించబడడం నా హక్కు” అని వితండగా వాదించకూడదు. వ్యక్తుల ఆస్తులపై ప్రభుత్వం కూడా చేయివేయకూడదు.

౬. భావోద్వేగాలకు వ్యక్తిబాధ్యత : ఎవఱి భావాలూ, భావోద్వేగాలూ (feelings and emotions) వారిలోనే పుడతాయి. అవి పుట్టడానికి ఆయా వ్యక్తులు తమ మనసుల్ని అనుమతించడం చేత అవి పుడతాయి. ఆ భావాల కనుగుణంగా చర్య తీసుకోవడానికీ, ప్రతిస్పందించడానికీ వారు తమ మనసులకీ, శరీరాలకీ స్వేచ్ఛనివ్వడం చేతనే వారు వాటికనుగుణంగా ప్రవర్తించడం జఱుగుతుంది. అంటే ప్రతి ఒక్కఱూ తమ భావాలకి తామే బాధ్యత తీసుకోవాలి తప్ప, “నాకు ఫలానా భావం కలగడానికి వేఱెవఱో కారణ”మంటూ నెపాన్ని ఇతరుల మీద వేయజూడడం అసమంజసం.

తమక్కూడా ‘తాగాలి’ అనిపించడం చేత జనం తాగుతున్నారు. తమకే ‘చనిపోవాలి’ అనిపించడం చేత కొందఱు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.‘చదవాలి’ అనిపించకపోవడం చేత జాఱుకోలరులు (drop-outs) చదువు మానుకుంటున్నారు. “ఎవఱినో చూసి జనం తాగుతున్నారు. ఎవఱో వారిని ప్రోత్సహిస్తున్నారు.” అనడం, లేదా “ఒకఱి ఆత్మహత్యకి ఇంకెవఱో ప్రోద్బలమయ్యారు” అనడం –ఇలాంటివి పూర్తితార్కికం కాదు. పరిస్థితులకి మనుషులు ఎలా ప్రతిస్పందిస్తారనేది ఆ మనుషుల చేతుల్లోనే తప్ప ఇంకెవఱి చేతుల్లోనూ ఉండదు. ఒకే పరిస్థితికి ఒక్కొక్కఱూ ఒక్కోలా ప్రతిస్పందిస్తారు. ఆ ప్రతిస్పందనలన్నీ వారివే. ఇతరులవి కావు. “ప్రతిస్పందించడానికి ఇంకా మంచిపద్ధతులు అందుబాట్లో ఉన్నప్పుడు అపసవ్య పద్ధతుల్లోనే ప్రతిస్పందించాలని ఎందుకు నిర్ణయించుకున్నారు?” అని ప్రశ్నించడాన్ని జనానికి నేర్పకుండా, ఒకఱి నష్టానికి వేఱొకఱిని నిష్కారణంగా నిందించే అలవాటుని మన వాతావరణం ప్రోత్సహిస్తోంది. 

ఒకవేళ ఒకఱి దురదృష్టంలో ఇతరులకు పైకి స్పష్టంగా కనిపించని పరోఽక్ష బాధ్యత ఏదైనా ఉన్నా, అది నిర్ణయించాల్సింది అలౌకికమైన ఆధ్యాత్మిక తలంలోనే తప్ప లౌకిక జీవనరంగంలో మాత్రం కాదు. ఎందుకంటే ఇంద్రియాలకు అగోచరమైన ఆధ్యాత్మిక తలం లౌకికవ్యవస్థ యొక్క అధికార పరిధి కిందికి రాదు. ప్రత్యక్ష బాధ్యతల్ని మాత్రమే లౌకికవ్యవస్థ విచారించగలదు. ఎలాగైతే ఒకఱి అదృష్టానికి వారికే ఘనత ఆపాదించి మనం ప్రశంసిస్తున్నామో, ఎలాగైతే అందుకు ఇతరుల్ని బాధ్యుల్ని చేసి భాగమివ్వడం లేదో, అలాగే వారి దురదృష్టానికి కూడా వారినే నిందించాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు చేస్తున్నట్లుగా ఇతరుల్ని అందుకు బాధ్యులుగా చేసి దుష్ప్రచారాలు చేయడం, వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం మానవతావాద దృష్ట్యా ఆమోదయోగ్యం కావు.  

౭. వ్యక్తిగత సమస్యలకు వ్యక్తిగత పరిష్కారాలు : మానవజాతి వేలాది సంవత్సరాలుగా పోగేసుకున్న అనుభవ భాండాగారం మూలాన అనండి. లేదా ఒక మనిషిని చూసి ఇంకో మనిషి అనుకరించాలనే ఆశంస (expectation) వల్ల అనండి. మొత్తమ్మీద సమాజంలో ప్రతి ఒక్క జీవితసమస్యకీ ఒక పూర్వాయత్త పరిష్కారం (readymade solution) లభిస్తూంటుంది. చాలా సందర్భాల్లో అవి వ్యక్తులక్కూడా పనికొస్తాయనడంలో సందేహం లేదు. ఎందుకంటే వ్యక్తుల బదులు సంఘమే వాటిని వారికోసం వారికన్నా ముందే ఆలోచించి పెట్టేసింది. కానీ ఆ సర్వ సామాన్య పరిష్కారాలు ఎవఱో ఒక్కశాతం మంది విషయంలో నప్పకపోవచ్చు. “ఎందుకు నప్పవు ?” అనేది పదిమందిని సమావేశపఱిచి వివరించేది కాకపోవచ్చు. ఎందుకంటే అది ఎవఱిది వారికే తెలుస్తుంది. ఇతరులకు చెప్పినా పెక్కుసందర్భాల్లో వారు అర్థం చేసుకోలేరు. వ్యక్తిగత సమస్యలకు సమాజం చూపే పరిష్కారాలు ఒక లారీలో యాభైమందితో కలిసి చేసే ప్రయాణంలాంటివి. ఎవఱికి వారు చూసుకునే ఉపాయాలు సొంత ఏ.సి. కారులాంటివి. ”మేమంతా లారీలో ఎక్కుతూంటే నువ్వేంటి కారులో వస్తానంటావ్?” అని గద్దిస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో వ్యక్తిగత మార్గాంతరాలు వెతుక్కున్న వాళ్ళని తప్పుపట్టడం కూడా అలాగే ఉంటుంది. 

కాబట్టి వ్యవస్థ తనను అర్థం చేసుకోవట్లేదనీ, తనకు న్యాయం చెయ్యట్లేదనీ వ్యక్తి భావించినప్పుడు తనకు నచ్చిన పరిష్కారం తాను చూసుకోవడంలో తప్పులేదు.        
 

౮. వ్యక్తిగత పరిమితుల్ని బట్టి నియమ నిబంధనల్ని సడలుబాటు (flexibility) తో అనువర్తించడం : చట్టాలూ, నియమ నిబంధనలూ మన సౌలభ్యం నిమిత్తం మనమే ఏర్పఱచుకున్నవి. లేదా మన సుఖానికి అంతరాయం కలిగించే కారకాల్ని ఎదుర్కునే నిమిత్తం రూపొందించుకున్నవి. అయితే మనకి సుఖమైనది అందఱికీ సుఖం కాకపోవచ్చు. అలాగే మనం అంతరాయం అనుకున్నది అందఱికీ అంతరాయం కాకపోవచ్చు. వారా ముక్క వాచ్యంగా వెల్లడి చేస్తున్నప్పుడు కనీసం వారి వఱకైనా ఆ నియమ నిబంధనల్ని సడలించడం అభిలషణీయం. నియమ నిబంధనల వెనక వాటి రూపకర్తల స్ఫూర్తి (spirit) ని సమీచీనంగా అర్థం చేసుకుని అమలుజఱపాలి తప్ప కేవలం శుష్క పదప్రయోగాలతోనూ, వాటి బాహ్యార్థాలతోనూ కుస్తీపట్టడం పరమానందయ్య శిష్యులు చేసే పని. అది చదువుకున్న మూర్ఖత్వం. నిబంధనల్ని తు.చ. తప్పకుండా అమలుజఱిపే నెపంతో వాటిని గ్రుడ్డిగా ఎవఱిమీద పడితే వారి మీద ప్రయోగించడం కూడా వ్యవస్థాగత హింసే.

అదే విధంగా, కోట్లాది జనాభా, బహుసాంస్కృతిక (cosmopolitan) జీవనశైలులూ గల ఆధునిక సమాజాల్లో కేవలం కొద్దిమంది అభిమతాని కనుగుణంగా అందఱికీ వర్తించే ఏకచ్ఛత్త్ర చట్టాలు (blanket rules) చేయడం తీవ్ర అసంతృప్తికీ, అశాంతికీ దారితీస్తోంది. ఒకనాటి చిన్న ఏక సాంస్కృతిక సమాజాల బాటలోనే ఇప్పుడు కూడా ఏకచ్ఛత్త్ర చట్టాలతోనే వ్యవహారాలు నిర్వహించడం సౌలభ్యం కాదు. కనుక ఒక్కో రంగానికీ సంబంధించి, వివిధ వర్గాల అవసరాల కనుగుణంగా మూణ్ణాలుగు రకాల సమాంతర/ప్రత్యామ్నాయ చట్టఎంపికలుండడంలో తప్పులేదు. ఎవఱికిష్టమైన చట్టం కింద వారు నమోదవుతారు. ఇతరులకు నష్టమేముంది? వాస్తవానికి ఇది కొత్త ప్రతిపాదనేమీ కాదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, అలాంటి చట్టవైవిధ్యం ఇప్పటికే కొంత లేకపోలేదు. మచ్చుకు మన దేశంలో హిందూ-ముస్లిమ్-క్రైస్తవ జనాంగాలకు వేఱువేఱు పౌరచట్టాలున్నాయి. అలాగే ప్రాంతాల వారీగా వేఱువేఱు భూచట్టాలు కూడా ఉన్నాయి. అదే విధంగా కొన్ని సెలవులు కొన్ని వర్గాలకు తప్పనిసరి కాగా, మఱికొన్ని వర్గాలకు అవి ఐచ్ఛికాలు (optional) మాత్రమే.

దీని అవసరం అర్థం కావాలంటే, ముందు మనుషుల్ని మూకుమ్మడి వర్గాలుగా, గుంపులుగా కాక, వ్యక్తులుగానే చూసే సంస్కృతి పెంపొందాలి. ఉదాహరణకి, నేఱస్థుల్ని సైతం వారివారి వైయక్తిక కుటుంబనేపథ్యానికీ, సంస్కృతికీ అనుగుణంగా బంధించడం మానవీయమవుతుంది. అంతే తప్ప, ఇప్పుడు చేస్తున్నట్లు, ఒక పాత్రికేయుణ్ణి తీసుకెళ్ళి దొంగల మధ్య కూర్చోబెట్టడం, లేదా ఒక ప్రజోద్యమ నాయకుణ్ణి తీసుకెళ్ళి ఉగ్రవాదులతో సహపంక్తి చేయడం– ఇదంతా పాతచింతకాయపచ్చడి. కాబట్టి ఉన్నతవిద్యావంతులూ, సుప్రసిద్ధులూ, సంఘసేవకులూ, ప్రజోద్యమాల నాయకులూ, ఇతరు లెందఱికో ఉపజీవ్యులూ ఆశ్రయభూతులూ అయిన వ్యక్తులూ, ఇప్పుడో ఇదివఱకో ఉన్నత పదస్థులూ అయినవారికోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన చెఱసాలల్ని విడిగా ఏర్పఱచడం వాంఛనీయం. నిజానికి చట్టాలూ మానవ కల్పితాలే. చెఱసాలలూ మానవ కల్పితాలే. ప్రకృతిలో అవి లేవు. మన మధ్య ఉన్న అలాంటి సవాలక్ష మానవ కల్పితాల్లో ఈ ప్రత్యేక సౌకర్యాలూ ఒకటనుకుందాం. తప్పేముంది ?

ఎక్కడో లక్షకో పదిలక్షలకో ఒకటి చొప్పున అరుదుగా జఱిగేవాటిని, అసలు జఱుగుతున్నట్లు కూడా సమాచారం లేనివాటిని నిషేధించే ధోరణి మన సమాజంలో ఉంది. ఒకానొక పోకడ (trend) గణనీయశాతం జనాభాలో ఉండి, దానివల్ల సమాజానికి విస్తారమైన నష్టం జఱుగుతున్నట్లు గమనించిన సందర్భాల్లో అటువంటివాటిని నిషేధించడంలో అర్థం ఉంది. అలా కానప్పుడది వ్యక్తుల స్వేచ్ఛలోనూ, ఆంతరంగిక ఎంపికల్లోనూ అనవసరంగా జోక్యం కలిగించుకోవడమే అవుతుంది. సకృత్తుగా జఱిగేవాటిని చూసీ చూడనట్లు పోవడమే ఇంగితజ్ఞానం (commonsense). నిషేధాలనేవి వాస్తవంగా చేసే పని, ఒక పని జఱక్కుండా చేయడం కాదు. జఱిగేవి బయటికి రాకుండా చేయడం.   
 

1, సెప్టెంబర్ 2014, సోమవారం

వ్యక్తివాదం-3

3. వైయక్తిక సంబంధాల ఐకాంతికత్వం : ఇద్దఱు లేదా అంతకంటే ఎక్కువమంది మనుషులు ఇష్టపూర్వకంగా ఏర్పఱచుకున్న సంబంధాలు – అవి స్నేహపూర్వకం కావచ్చు, కామపూరితం కావచ్చు, లేదా ఉభయపక్షాలవారూ తమలో తాము అవగాహన చేసుకున్న ఇంకేదైనా ప్రయోజన నిమిత్తమూ కావచ్చు – అవన్నీ కూడా వ్యక్తిగత వ్యవహారాల కిందికే వస్తాయి. సమాజానికి గానీ, ప్రభుత్వానికి గానీ వాటితో సంబంధం లేదు. వారిని అడిగి, వారి అభిప్రాయం కనుక్కుని, వారి దగ్గఱ అనుమతి సంపాదించి ఎవఱూ మానవ సంబంధాల్ని ఏర్పఱచుకోరు. వ్యక్తిగత సంబంధాల మంచిచెడ్డలు సమాజాన్ని గానీ, ప్రభుత్వాన్ని గానీ ఏ విధంగానూ ప్రభావితం చేయవు. ఎవఱి బ్రతుకు వారిది. కనుక వాటికి సంబంధించిన సమస్యల్లో ఇతరులు తలదూర్చడం అసందర్భం, అమానవీయం. అంతే కాదు, మానవ సంబంధాల్ని ఆధికారికంగా గుర్తిస్తున్నామనే వంకబెట్టి వాటిని బయటపడను వీల్లేని కత్తుల బోనులుగా మార్చడం, తద్ద్వారా ఇష్టంలేని లావాదేవీల్లో మనుషుల్ని జీవితకాలం పాటు బంధించాలని చూడడం అవగాహనాలేమి. అదే విధంగా వ్యక్తుల మధ్య చోటు చేసుకునే ఆంతరంగిక వ్యవహారాలకు వ్యవస్థాగతమైన దూరాన్వయాలు తీయడం, భాష్యాలు చెప్పడం, వాటి ఆధారంగా బాధితహీన నేఱాల్ని (victimless crimes) సృష్టించడం ఇదంతా మానవతా విరుద్ధమే కాక అతార్కికం కూడా.

మానవసంబంధాలు మానవసంబంధాలే. అవి లాభార్జనకి హామీ ఇవ్వని స్వచ్ఛందకార్యకలాపాలు. అవి ప్రేమ, వాత్సల్యం, దయ అనే ఇంధనాలతో నడవాల్సినవి. అవి వెలకట్టదగ్గ ఉద్యోగాలో వ్యాపారాలో, పదవులో కానే కావు. అవి మనిషి తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడానికీ, దాన్ని పరిపూర్ణం చేసుకోవడానికీ, ఆంతరంగికమైన ఆనందాల్ని మనసారా పంచుకోవడానికీ దాచుకున్న ఆనందమయ కోశాలు. వాటికి వ్యవస్థలతో పనిలేదు. వ్యవస్థలు లేని కాలం నుంచే అవి ఉనికిలో ఉంటూ వచ్చాయి. అవి ఏ వ్యవస్థకీ లోబడనటువంటి స్వీయమైన గతినియమాలతో పనిచేసేటువంటివి.  వాటికవే ఓ ప్రయోజనం తప్ప ఏ ఇతర ప్రయోజనానికీ అవి ఉపాయాలు గానీ, ఉపకరణాలు గానీ కావు. ఆ క్రమంలో తండ్రి ఒక మానవ సంబంధం. భార్య ఇంకో మానవ సంబంధం. మిత్రుడు మఱో మానవ సంబంధం.


ఇద్దఱు వయోజనులు తమ మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పుకునేటప్పుడు వారందులో ఎవఱి బలవంతమూ లేకుండా దానిలో ఇమిడి ఉన్న సాధక బాధకాలన్నీ సమీచీనంగా అర్థం చేసుకున్నాకే స్వచ్ఛందంగా కోరుకుని మఱీ దాన్ని నెలకొల్పుకున్నారని భావించాల్సి ఉంటుంది. అంతే కాక సమానస్థాయిలో ఆలోచించి, తమ తమ స్వంత బాధ్యతల మీద, అన్నిటికీ సిద్ధపడే నెలకొల్పుకున్నా రని కూడా భావించాల్సి ఉంటుంది. ఏదో ఒక ప్రయోజన ప్రలోభం లేకుండా ఏ ఇద్దఱూ ఒక మానవ సంబంధంలో ప్రవేశించరు. ఆ ఆశించిన ప్రయోజనం నెఱవేఱుతున్నంతకాలం వారి సంబంధం సాఫీగానే సాగిపోతుంది. కానీ ఏదో ఒక దశలో వారిలో ఒకఱికి “ఆ సంబంధం ఇహ నిష్ప్రయోజనం” అని తోచి అందునుండి విరమించుకుంటే అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదు.  ఆస్వాదించినంతకాలం ఉభయులూ ఆ సంబంధాన్ని స్వచ్ఛందంగా ఇష్టపూర్వకంగా ఆస్వాదించారు కనుక అందులో ఒకఱి కొకఱు ఋణపడేదేమీ లేదు. ఒకఱినొకఱు దోచుకునేదీ ఏమీ లేదు.

కాబట్టి  ఇద్దఱు సంబంధీకుల మధ్య వ్యవహారాల్ని ఆ ఇద్దఱే మాట్లాడుకోవాలి. చూసుకోవాలి. ఒక వేళ వారిద్దఱూ కలిసి మూడో పక్షపు జోక్యాన్ని తాముగా అర్థిస్తేనే వారి విషయంలో ఇతరులు జోక్యం చేసుకోవాలి తప్ప ఎవఱో ఒకఱు మాత్రమే పిలిస్తే మిగతా జనమంతా వెళ్ళి వేలుపెట్టేసి రెండోవారికి హాని చేయడం అమానవీయం, బర్బరత. ఒకఱికి మాత్రమే ఆ ఇతరుల బలగం తోడు కావడం మూలాన ఉభయుల మధ్యా కృత్రిమమైన శక్తి-అసమతూకం (power imbalance) నెలకొంటుంది. ఆ ఇతరులు బంధుమిత్రులు కావచ్చు. సమాజం కావచ్చు. ప్రభుత్వసంస్థలు కావచ్చు. ఇంకెవఱైనా కావచ్చు.

మనుషులు వ్యక్తిగతంగా ఏర్పఱచుకొని స్వేచ్ఛగా పెంచుకోవాల్సిన, లేదా స్వచ్ఛందంగా త్రెంచుకోవాల్సిన మానవసంబంధాల్ని అధికారపూర్వకంగా నిబంధించడం ఒక పాతకాలపు ధోరణి. విద్యా విజ్ఞానాలు విస్తరించిన మన కాలంలో అది ఇమడదు. అదే సమయంలో- మానవ సంబంధాలనేవి పూర్తిగా ఇష్టానిష్టాలమీద ఆధారపడేటటువంటివనీ, అవి కాంట్రాక్టులో ఒప్పందాలో కావనీ, ఏ ఒక్కఱికి ఇష్టం తగ్గిపోయినా అవి స్వయంతంత్రంగా రద్దవుతాయనీ, ఇష్టం లేనప్పుడు దూరం కావడమే ఉభయులకూ శ్రేయస్కరమనీ, ఇష్టం నశించాక కూడా కాలగర్భంలో కలిసిపోయిన గతస్నేహాన్ని పురస్కరించుకొని అవతలివారి నుంచి ఏదో లాభాన్ని దండుకోవాలనుకోవడం అనుచితమనీ అంతా గ్రహించే రోజు రావాలి.


౪. వైయక్తికాలోచనలు చేయడంలో తప్పులేదు : వ్యక్తులు సమాజం కంటే భిన్నమైన స్వకీయ ఆలోచనల్ని కలిగి ఉండడంలోనూ, వాటిని యథాతథంగా వ్యక్తీకరించడంలోనూ, తమ వ్యక్తిగత జీవితస్థాయిలో వాటిని అమలుజఱుపుకోవడంలోనూ మానవతావాద దృష్ట్యా తప్పు లేదు. నిజానికి వ్యక్తుల స్వతంత్ర వ్యష్ట్యాలోచనల వల్లనే సమష్టినాగరికత పురోగమించింది. నిజానికి సంఘదృష్టి, చట్టదృష్టి, శాస్త్రదృష్టి అనేవి కూడా మొదట్లో అందఱికీ చెందినవి కావు. అవి, ఒకనాటి సమాజంలో శక్తిమంతులైన కొద్దిమందికి చెందిన వ్యక్తిగత దృష్టులేనని మఱువరాదు. అవి వారికి సమకాలీనంగా ఉన్న పరపతిప్రాబల్యంతో అందఱికీ అన్వయించబడి అందఱికీ చెందినవిగా భావించబడ్డాయి. అయితే శక్తిమంతులకే కాదు, శక్తిహీనులక్కూడా ప్రతి అంశాన్ని గుఱించి తమ తమ వ్యక్తిగత దృష్టి కోణాలు ఉండడంలోనూ, వాటిని వ్యక్తీకరించడంలోనూ తప్పులేదని మానవతావాదం భావిస్తుంది. వారికి అలాంటి వైవిధ్యాలోచనలు ఉన్నప్పుడు, అవి ఉన్నందుకు వారిని శిక్షించకుండా, పరిహాసాలకు దిగకుండా వాటిని గుఱించి కూలంకషంగా చర్చించడానికి సిద్ధపడాలి. మెచ్చుకుని ప్రోత్సహించాలి.

ప్రజాస్వామ్యాల్లో ఆలోచనాస్వేచ్ఛ అనేది నేతిబీఱకాయలో నెయ్యిలాంటిదే. ప్రజాస్వామ్యాల్లో ప్రతి జీవనరంగాన్నీ రాజకీయ రంగమే శాసిస్తుంది. కానీ అంత ప్రముఖపాత్ర పోషిస్తున్న రాజకీయాల గుఱించి పైకి మాట్లాడితే సామాన్య పౌరులకు ప్రాథమిక భద్రతే కఱువవుతుంది. వారికోసం రహస్య బ్యాలట్ ఉందని చెబుతారు. నిజంగా మనిషి తన రాజకీయ అభిప్రాయాల్ని వ్యక్తీకరించే స్వేచ్ఛే గనక వ్యవస్థలో ఉంటే ఆ రహస్యం దేనికి? వాస్తవమేంటంటే- ప్రజాస్వామ్యంలో విడిపౌరులకే కాదు, నాయకులక్కూడా సొంత అభిప్రాయాలుండడం చాలా తప్పుగా పరిగణింపబడుతుంది. ప్రజలంతా ఏమనుకుంటున్నారో గమనించి నాయకుడు కూడా ఆ ప్రకారంగానే మాట్లాడాలి. మఱి లక్షలాది మైళ్ళూ, కోట్లాది జనాభాలతో వ్యాపించిన రాజ్యాల్లో ఈ ప్రజాభిప్రాయం ఏంటో, ఎక్కణ్ణుంచి తయారవుతోందో తెలీదు. కానీ ఖచ్చితంగా ఎవఱో ఒకఱుండి తయారు చేయకుండా అది తయారవ్వదు.