26, నవంబర్ 2014, బుధవారం

భావోద్వేగాల స్థానే పర్యాలోచనకు పెద్దపీట

భావోద్వేగాలూ (emotions), పర్యాలోచనా (relaxed thought) – రెండూ మానవత్వంలో భాగాలే. ఒకటి మఱొకటిగా అవపాతం చెంది ఘనీభవిస్తుంది. కాబట్టి మనిషికి రెండూ అవసరమే. అయితే, కొన్ని కారణాల వల్ల మానవతావాదంలో భావోద్వేగాల కన్నా పర్యాలోచనకే అగ్రాసనం. పర్యాలోచన గడియారమైతే భావోద్వేగం అందులో భాగమైన అలారంలాంటిది. గడియారం నిరంతరాయంగా నడవడం ముఖ్యం. కానీ అలారం విషయంలో మటుకూ అలా కాదు. అది నిరంతరాయంగా మోగడం జబ్బులక్షణం. జీవితం ఓ పుస్తకమనుకుంటే అందులో మనం పొందే భావోద్వేగాలు- ఆసక్తికర అనుభవాలనే పంక్తుల కింద గీచి గుర్తుపెట్టిన ఎఱ్ఱసిరా గీతలు. అవి మనకు గతాన్నీ, భావి కర్తవ్యాన్నీ గుర్తుచేస్తాయి. అదే వాటి ఉద్దిష్ట ప్రయోజనం. అది మర్చిపోయి పుస్తకం మొత్తం ఎఱ్ఱసిరా గీతలతో నింపేయడం అభిలషణీయం కాదు. అప్పుడది చాలా ఎబ్బెట్టుగా అగుపిస్తుంది. 

భావోద్వేగాల్ని భావోద్వేగాలుగానే, పర్యాలోచనని పర్యాలోచనగానే చూడాలి. అలాగే వాటిని వేఱు వేఱుగానే అనుభవించాలి. రెండూ కలిపి కలగాపులగం చేయకూడదు. అలా చేస్తే మనకు తెలియకుండానే మనం మానవతాసూత్రాల ఉల్లంఘనకు ఒడిగడతాం. కానీ ఇందుకు విరుద్ధంగా లోకంలో రెండు విషయాలు తఱచుగా కానవస్తాయి. ఒకటి- తొలుత నిర్భరమైన భావోద్వేగాలకూ, సెంటిమెంట్లకూ లోనై ఆ తరువాత వాటిని సమర్థించుకోవడం కోసం పర్యాలోచనని ఆశ్రయించడం. రెండు- పర్యాలోచన ద్వారా కొన్నిలక్ష్యాల్ని ఏర్పఱచుకుని వాటిని సాధించడం కోసం తమ యొక్కా, ఇతరుల యొక్కా భావోద్వేగాల్నీ, సెంటిమెంట్లనీ వాడుకోవడం. ఈ రెండో పని ఎక్కువగా మగవారు చేస్తారు. కానీ రెండూ తప్పే.

భావోద్వేగాలు సున్నితత్వానికి సంబంధించినవి. దాని గుఱించి స్థలాంతరంలో ఇదివఱకు విపులంగా చెప్పే ఉన్నాను గనుక ఇప్పుడు సవిస్తరంగా ఆ ప్రస్తావన గుఱించి వ్రాయను. మన సమాజంలో ఆలోచనాత్మక, ఆలోచనాప్రేరక అభివ్యక్తి (thoughtful, thought-provoking expression) కన్నా కూడా భావోద్వేగపూరిత, భావోద్వేగకారక అభివ్యక్తి (emotional/ emotive expression) కి చాలా విలువిస్తారు. తార్కికంగా మాట్లాడే నాయకులకన్నా ఆవేశంగా మాట్లాడే నాయకులు మనకు బాగా నచ్చుతారు. శాంతరసాన్ని పోషించే రచయిత కన్నా ఉద్రేచక శైలితో ఒక ఊపు ఊపేసే రచయితని మనం ఎక్కువ అభిమానిస్తాం. అదే విధంగా ఏ ప్రస్తావన మీదైనా సరే, చర్చ అనేది మనం బొత్తిగా భరించలేం, మనం ఏదీ వినలేం. వినిపించుకోలేం. సమాధానం బైటికొచ్చే దాకా ఎదురుచూడలేం. దాని బదులు ఎవఱైనా అవతలివాళ్ళ నోరు బలవంతంగా నొక్కేసి చర్చకు భరతవాక్యం పలికితే మనకు చాలా ఆనందం కలుగుతుంది. చాలా ఉపశమనంగా, హాయిగా అనిపిస్తుంది. మనల్ని ఇలా మార్చినది భావోద్వేగాలకు మనమిచ్చే అనవసర ప్రాధాన్యమే. 

ఏదైనా ఆవేశంగా చెప్పకపోతే మనవారికి ఎక్కదు. మనది ఆలోచనాప్రధానమైన బౌద్ధిక సమాజం కాకపోవడం ఇందుకో ప్రధానకారణం. ఇలా భావోద్వేగాలకు మాత్రమే స్పందించడం అలవాటై మన మెదళ్ళు సాలోచన అభివ్యక్తులకి tune అవ్వడం మానేశాయి. భావోద్వేగాలు వినోద కార్యక్రమాల్లో నూ, కళల్లోనూ, ఆధ్యాత్మికతలోనూ పనికొస్తాయి. కానీ విద్యావిజ్ఞానాలకీ, పరిశోధనకీ, సత్యాసత్య నిర్ధారణకీ, తత్త్వీకరణలకీ అవి సుతరామూ పనికిరావు. కానీ మనం భావోద్వేగాలకి వేసే స్వర్ణసింహాసనం మూలాన వినోద-విజ్ఞానాల మధ్య ఉన్న అగాధాన్ని గమనించలేనివాళ్ళమయ్యాం. మనం వినోదాన్నే విజ్ఞానం అనుకుంటున్నాం. అందుకనే తెలుగులో 30–40 టీవీ వాహినులుంటే వాటిల్లో ఒక్కటీ విద్యావిజ్ఞానాలకు సంబంధించినది కాదు. అసలు అలాంటివి మనకు అవసరమే లేదు. అవి లేనందుకు ఇక్కడెవ్వఱూ బెంగపెట్టుకోరు. మన మేధానాణ్యత అంతవఱకే. అందుకే మనవన్నీ కాలక్షేప బ్బఠాణీలే. మనుషులకు మనమిచ్చే ప్రాధాన్యం కూడా అలాగే ఉంటుంది. ఒక నోబెల్ బహూకృతుడైన శాస్త్రవేత్తో, సాహిత్యవేత్తో చనిపోతే “ప్చ్ పోయాడు” అని నాలుగైదు పంక్తుల్లో సరిపెడతాయి మన పత్రికలు. వార్తావాహినులైతే ఒకపూట స్క్రోలింగుతో సరిపెడతాయి. ఆయన అంతిమ యాత్రకైతే ఎవఱూ వెళ్ళరు. అదే ఒక స్థానిక సినీనటుడో, క్రికెట్ ఆటగాడో అనుకోండి, అప్పుడు...? ఆలోచనకీ, దాని ద్వారా మన మెదళ్ళని పెంచిన వారికీ మనమిచ్చే శాశ్వతస్థానం అది - వెనక బెంచి. 

సమాజపు విలువల వ్యవస్థ యావత్తూ ఇలా భావోద్వేగాల చుట్టూ పరిభ్రమించడం వల్ల అందఱూ తమను తాము భావోద్వేగులుగా  తీర్చిదిద్దుకుంటున్నారు. ఆడవాళ్ళేమో అది తమ సున్నితత్వం, లేదా సాధికారత అనుకుంటున్నారు. మగవాళ్ళైతే తమ పౌరుషానికి సంకేతం అనుకుంటున్నారు. సంస్థలేమో అది తమ స్పందక తత్త్వానికి (responsiveness) నిదర్శనం అనుకుంటున్నాయి. కానీ దీని వల్ల టోకుగా జఱిగే నష్టం గుఱించి ఎక్కువమందికి అవగాహన లేదు. మొదటిది- మనకు ఎల్లప్పుడూ ఏదో ఒక ఉద్రేకాన్నిచ్చే విషయం కావాల్సి వస్తోంది. ఏదీ లేకపోతే ఊరికే వసపిట్టల్లా వాగడం. ఆఖరికి నిశ్శబ్దాన్ని భరించలేని, సహించలేని గోల-గగ్గోలు మనుషులుగా మనం అవతరించాం. 

రెండోది- మన భావోద్వేగాల పిచ్చిలో మన బౌద్ధిక నాణ్యత చిన్నప్పుడే దెబ్బతినడాన పరిశోధన మఱియు అభివృద్ధి (R&D) లాంటివాటికి పనికిరాని వ్యక్తులుగా పరిణమించాం. ఎందుకంటే మన సామూహిక మనస్తత్త్వానికి వాటి పట్ల అభిరుచే ఉదయించదు. మూడోది- మనకు భావోద్వేగాలే తప్ప ఆలోచనాశక్తి లేదని గమనించి మన ఈ మనస్తత్త్వాన్ని రాజకీయపక్షాలూ, నాయకులూ చక్కగా వాడుకుంటున్నారు. మాటిమాటికీ మన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి, మనల్ని అమానుషులుగా మార్చి వారు తమ పబ్బం గడుపుకుంటున్నారు. వ్యాపార సార్థవాహాలు (corporates) సైతం ఇటీవల ఇదే తరహా ప్రచారవ్యూహాన్ని అవలంబిస్తున్నాయి. మేధావులు దీనికి మేధాక్రీడ (mind game) అని పేరుపెట్టారు. ఆ రకంగా అర్థం పర్థం లేని వెఱ్ఱిమొఱ్ఱి సెంటిమెంట్లతోనూ, వాటి తాలూకు బాగా నలిగిన భాషాప్రయోగంతోనూ మన మేధస్సుని పనిచెయ్యకుండా చేసి మనమీద వశీకరణ శక్తిని ప్రయోగించే అవకాశాన్ని మనం ఎవఱికీ ఇవ్వకూడదు. 

భావోద్వేగాల పారవశ్యం విషయాల తాలూకు సూక్ష్మవివరాల మీద శీతకన్ను వేయిస్తుంది. సమస్యల మారుమూల కోణాలకేసి దృష్టి సారించనివ్వదు. భావోద్వేగాల్ని వ్యక్తీకరించనంత వఱకే అవి మన అదుపులో ఉండేది. ఒకసారంటూ వ్యక్తీకరించడం జఱిగాక మనమే వాటి అదుపులోకి వెళ్ళిపోతాం. తదుపరి పరిణామాలు మన చేతుల్లో లేకుండా పోతాయి.

21, నవంబర్ 2014, శుక్రవారం

మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు-2

ముందు కుటుంబాల్లో మొదలయ్యే ఈ కాలుష్యం అటుపిమ్మట సమాజాన్నంతా చుట్టబెడుతుంది. త్వరలోనే ప్రతి మానవసంబంధమూ ఒక అధికార సంబంధం (power relation) గా అవతారం తాలుస్తుంది. ఆ క్రమంలో భార్యాభర్తలూ, గురుశిష్యులూ మొదలైన అన్ని సామాజిక ద్వంద్వాల్లోనూ స్నేహధోరణి ఆవిరైపోయి, కేవలం శాసించేవారితోనూ, ఆ శాసనాలకి చచ్చినట్లు తలొగ్గి తీఱాల్సిన వారితోనూ నిండి మానవ సంబంధాలు మరామత్తుల కతీతంగా పాడైపోతాయి. పుట్టినప్పట్నుంచీ ఇలాంటి అధికార సంబంధాలే తప్ప మానవ సంబంధాలంటే ఏంటో ఎప్పుడూ రుచిచూసి ఎఱగని జనం, వారిలో ప్రతి ఒక్కఱూ ఏదో ఒక రకమైన చిన్నమెత్తు అధికారం కోసం ఒక విచిత్రమైన ఆకలితో ఆవురావురుమంటూ, తమ పరిధిలో తాము ఇతరుల మీద ధాష్టీకం చెలాయిస్తూ వికృతమైన మానసిక తృప్తినీ, వికటమైన ఆనందాన్నీ అనుభవించసాగుతారు. 

ఆ ప్రక్రియలో- మనకు అత్తలుండరు. ఆడబాసులే ఉంటారు. బాసులుండరు. యముళ్లే ఉంటారు. ఇంటి యజమానులుండరు. శాడిస్టులే ఉంటారు. మనకు వాహన చోదకులుండరు. రోడ్డుకింగులే ఉంటారు. మనకు కార్యదక్షులైన ఉద్యోగులు కాదు, చెయ్యాల్సిన పని వదిలేసి పదోన్నతుల (promotions) కోసం తపించేవాళ్లే ఉంటారు. చాలా సహజం. ఎందుకంటే ఒకప్పుడు ఎవఱో మనల్ని సబార్డినేట్ గా మన్నిస్తేనే మనలో కూడా ఎవఱికైనా సుపీరియర్లమైతే బావుంటుందనే కోరిక పొటమరిస్తుంది.

ఇలా అందఱూ కలిసి తమ తమ ఆత్మన్యూనతా భావాల (inferiority complex) కొద్దీ సృష్టించిన ఈ అమానవీయ వాతావరణం– మానవ సంబంధాలంటే అధికార సంబంధాలే తప్ప మఱేమీ కాదన్న మనోభ్రాంతిని సృష్టిస్తుంది. ఈ భ్రాంతి దృఢపడే కొద్దీ మన అధికార పిపాస మఱింతగా దుష్పూరమౌతుంది. మనుషుల మధ్య పరస్పర ప్రేమా, గౌరవమూ నశించిపోయాక పనిచేసే ప్రేరణ కూడా చచ్చిపోతుంది. దరిమిలా, వారిచేత పని చేయించడం కోసం పశువులకు మల్లే ఒక ములుగఱ్ఱతో ప్రతివారినీ, ప్రతిరోజూ పొడుస్తూనే ఉండాల్సి వస్తుంది. ఆ పొడవడం కూడా ఒక ప్రత్యేక ఫిలాసఫీగా అవతరిస్తుంది. మళ్ళీ దానికి విశ్వవిద్యాలయాల్లో కోర్సులూ, ప్రొఫెసర్లూ, డిగ్రీలూ. దురదృష్టవశాత్తూ, మన సమాజంలో ఈ ప్రక్రియ (process) మొత్తం ఇప్పటికే పూర్తయింది.

ప్రతివారికీ అప్రయత్న మనోరుగ్మతలా పట్టుకున్న ఈ అధికారదాహాన్నీ, ఈ వెకిలితనాన్నీ వదిలించి హుందాతనంతో కూడిన మానవ సంబంధాల మాధుర్యాన్ని పునరుద్ధరించాలంటే, మనం ముందు చేయాల్సింది- కొన్ని మానవ సంబంధాలు మాత్రమే దైవసమానమనీ, పవిత్రమనీ. మిగతావి కాదనీ అలవాటు చేయబడ్డ తరతరాల తప్పుడు భావజాలాన్ని వదిలించుకోవడం. వీటి మధ్య ఉన్న అంతరాలు కేవలం సందర్భానుసారమేననీ, పక్షాంతరంలో ఇవన్నీ సమానంగా ముఖ్యమేననే ఎఱుక పెంపొందించుకోవడం. మనంతట మనం గౌరవాన్ని వాచ్యంగా డిమాండు చేయకుండా, మనల్ని గౌరవించాలనే ప్రేరణ అవతలివారిలో స్వయంభువుగా కలిగే వఱకూ వేచి చూడడానికి సిద్ధపడడం.

మనుషులు అధికారాన్ని వదులుకోను ఇష్టపడకపోవడానికి కారణం- అది తప్పితే ప్రేమించబడడానికీ, గౌరవించబడడానికీ తమలో మఱి ఏ విశిష్ట లక్షణమూ లేకపోవడమే. ప్రేమ స్వయంగా తానొక విశిష్టలక్షణం గనుక దానికి అలాంటి భయాలుండవు. అధికారానికి ప్రేమ కూడా తోడైతే ఆ ఔదార్యానికి జనం కళ్ళు చెమ్మగిల్లుతాయి. తద్విపర్యాసంగా ప్రేమ మాలిన కేవల అధికార ప్రదర్శన కటువుగా శపించబడుతుంది. ప్రేమకు అధికారం లేకపోయినా తానే అధికార నిర్విశేషమై కూటస్థం (passive) గా శాసిస్తుంది. అందుచేత మనం నేర్చుకోవాల్సింది అధికారం చెలాయించడం కాదు, ప్రేమ చూపించడమే.

ప్రతి మానవసంబంధమూ అంతిమంగా పర్యవసించేదీ, పర్యవసించాల్సినదీ స్నేహశీలంలోనే. కొన్నిసార్లు కూఱిమి కన్నా చెలిమే గొప్పదీ, ఆత్మిక దివ్యత్వానికి నేదీయాంసమూ. లౌకికతలంలో ‘నిర్మల ప్రేమ’ అని పేర్కొనేటప్పుడు జన మనఃఫలకం మీద వాస్తవంగా స్ఫురించే వక్తవ్యార్థం స్నేహమే. మనుషులు “తాము అధికుల”మనే భేషజాల్ని కట్టిపెట్టి, ముందు తేలికపాటి హృదయంతో కూడిన నిరాడంబర స్నేహాన్ని అభ్యసిస్తే వారు మొదట మంచిమనుషులు కాగలుగుతారు. ఆ తరువాత మంచితండ్రులూ అవుతారు. మంచితల్లులూ అవుతారు. మంచిగురువులూ అవుతారు. మంచి పరిపాలకులు కూడా అవుతారు. మానవ సంబంధాల్లో లేని అధికార అనాసక్తిని ఆర్థిక వ్యవస్థలోనూ, రాజకీయవ్యవస్థలోనూ ఆశించడం కేవలం నిష్ప్రయోజనం. 

మంచి ఎవఱు చెప్పినా స్వీకరించడం 

తమ సిద్ధాంతాల మీదా సంప్రదాయాల మీదా ఉన్న వెఱ్ఱి అభిమానంతో వాటిని అవలంబించని మనుషుల్ని ద్వేషించడం, మనుషుల మీది ద్వేషంతో వారి దగ్గఱి మంచిని స్వీకరించకపోవడం- ఇవి ఈనాడు మానవాళికి సోకిన జమిలి తెగుళ్ళు. చరిత్రలో బాగా వెనక్కి వెళితే, అతిప్రాచీనకాలంలో నాగరికత ఈ మార్గంలో విస్తరించలేదని తెలుస్తుంది. పనికొచ్చే జ్ఞానం ఎక్కడున్నా వారు నిరభ్యంతరంగా స్వీకరించేవారు. కనుక ప్రతి మంచివిషయానికీ కులరంగో, మతరంగో, జాతిరంగో పులుము తున్నంత కాలం, అలా పులిమి ఎగతాళి చేస్తున్నంత కాలం మనం నాగరికులం కాలేం. ఎంతో కొంత మంచి అన్నిచోట్లా ఉందని గ్రహించాలి. అందఱిలోనూ ఉంది. కాబట్టి నచ్చిన మంచిని మెచ్చుకుని, స్వీకరించి నచ్చనివాటిని వదిలిపెట్టడమే మనం చెయ్యాల్సినది.    
 

17, నవంబర్ 2014, సోమవారం

మానవ సంబంధాలు అధికారం చెలాయించడం కోసం కాదు - 1

మానవజీవితం అనేక సంబంధాల్ని ప్రాపుగా చేసుకొని నడుస్తుంది. వాటిల్లో తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, అక్కాచెల్లెళ్ళూ, భార్యలూ, భర్త, పిల్లలూ, బంధువులూ, మిత్రులూ, గురువులూ, శిష్యులూ, యజమానులూ, సేవకులూ ఇలా చాలా తరహాల వారుంటారు. చెప్పిన వెంటనే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఈ మానవ సంబంధాల్లో ప్రాధాన్య క్రమమంటూ (order of priority) ఏమీ లేదు. మనిషికి అన్ని సంబంధాలూ సమానంగా ముఖ్యమే.  ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మనిషిజీవితం దుఃఖభాజనం అవుతుంది. ఎవఱు లేకపోయినా మనకు గడవదు. వాటిని పోగొట్టుకుంటే తప్ప అవి ఎంత పవిత్రమైనవో మనకర్థం కాదు. ఈ ప్రాధాన్యక్రమాలు ఏర్పడే పద్ధతిలో పెద్దగా బౌద్ధిక సంక్లిష్టతేమీ లేదు. అవి వాస్తవంగా ఏర్పడుతున్నది భౌతికసామీప్యం వల్ల. ఎందుకంటే ఒక మానవసంబంధం నుంచి భౌతికంగా/ భౌగోళికంగా దూరం జఱిగినవారు అనంతర దశలో వారిని తమ జాబితాలో కట్ట కడపటి స్థానానికి దించేయడం కానవస్తుంది.

ఈ విషయంలో మతోపదేశాల నుంచి మానవతావాదం విభేదిస్తుందని చెప్పుకోవచ్చు. మన దేశంలో పౌరాణికమతం సమాజంలో అన్నిరకాల ఎగుడుదిగుళ్ళనీ పనిగట్టుకు ప్రోత్సహించినట్లే మానవ సంబంధాల్ని కూడా రకరకాల లెక్కలతో, అంచనాలతో, పోలికలతో అది ఎక్కువ-తక్కువ చేస్తూ వచ్చింది. మళ్ళీ అందులో చాలా ప్రక్షిప్తాలు చోటు చేసుకున్నాయి. ఒక చోటనేమో తల్లిని మించిన దైవం లేదని వ్రాసి ఉంటుంది. మఱో చోటనేమో గురువుని మించిన దైవం లేడని వ్రాసి ఉంటుంది. అంటే ఆయా స్థానాలకు స్వతహాగా పూజ్యత లేదని మనం అనట్లేదు. కానీ చూడబోతే, ఆయా శ్లోకాల రచయితల వ్యక్తిగత జీవితాల్లో ఏ మానవ సంబంధమైతే ప్రముఖపాత్ర పోషించి ఉంటుందో దాన్నే ఆకాశానికెత్తుతూ, “మిగతా సంబంధాలన్నీ దాని ముందు దిగదుడుపు” అన్నట్లు శ్లోకాలు వ్రాసినట్లు గోచరిస్తుంది. మళ్ళీ ఇందులో నరకాలూ, శిక్షలూ, ఉపాలంభాలూ వగైరా.

ఏతావతా, వారివారి వ్యక్తిగత అనుభవాలతో నిమిత్తం లేకుండా అందఱూ తమలాగే భావించి తీఱాలనే ఒక రకం బౌద్ధిక నిరంకుశత్వం సదరు సుభాషితాల్లో దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా ఒక ప్రాథమిక జీవిత వాస్తవాన్ని వాటి రచయితలు విస్మరించినట్లు తోస్తుంది. అదేంటంటే- ఒకఱు మఱొకఱిని ప్రేమించేదీ, గౌరవించేదీ, కేవలం సంబంధీకులు కావడం మూలాన కాదు. వారి మధ్య ఉన్న పరస్పర మన్నింపుల తీరు మూలానే. శుష్కమైన వావి-వరుసలూ, వట్టిపిలుపులూ ఏమీ చెయ్యలేవు. వాటిని సార్థకం చేసేదీ, జవసత్త్వాలు సమకూర్చిపెట్టేదీ మనసున్న మనుషులు. ఎందుకంటే అందఱిలోనూ నైసర్గికంగా స్వార్థమూ, అహంకారమూ ఉంటాయి. అవి తృప్తిపడేలా ఎవఱు తమను మన్నిస్తారో వారే వారికి ప్రియతములూ, పూజనీయులూ అవుతారు. తద్భిన్నంగా తమను బాధించినవారు తల్లైనా, తండ్రైనా, గురువైనా, భర్తైనా వారిని మనుషులు గౌరవించరు. అంటే, ఎన్ని శ్లోకాలు వల్లించినా ఆచరణలో తమ అనుభూతే తమ వేదం, తమ సుభాషితం. మందులకున్నట్లే మానవ సంబంధాల క్కూడా తుది గడువులు (expiry dates) ఉంటాయి. అవి దగ్గఱపడితే, ఏ బంధమైనా తెగాల్సిందే.

కొన్ని మానవ సంబంధాల్ని మాత్రమే అతిశయోక్తులతో ఉద్ద్యోతించడం వల్ల జనం దృష్టిలో మిగతా వాటి ప్రాధాన్యం బాగా తగ్గిపోయింది. ఉదాహరణకి తల్లిని గొప్పదాన్ని చేయడం కోసం తండ్రిని తగ్గించి చూపారు. భార్యని కూడా తగ్గించారు. తల్లిదండ్రుల్ని గొప్పవాళ్ళని చేయడం కోసం గురువుల్ని తగ్గించి చూపారు. వీరందఱినీ గొప్పవాళ్ళని చేయడం కోసం దేవుణ్ణి తగ్గించి చూపారు. ఈ దృక్పథమంతా తప్పుల తడక అని వేఱే చెప్పనక్కఱలేదు. ఇదంతా బహుశా అర్వాచీన కాలంలో బయల్దేఱింది. ఎందుకంటే మన దేశపు మతం ప్రధానంగా ప్రాచీన ఉపనిషద్బోధల మీద ఆధారపడినదని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఉపనిషత్తుల్లో ప్రతి జీవినీ, శక్తినీ బ్రహ్మస్వరూపంగానే అభివర్ణించారు. ఏదో ఒక ప్రత్యేక మానవ సంబంధంలోనే దివ్యత్వం పుంజీభూతమైందనే అభిప్రాయం ఋషులకున్నట్లు తత్త్వశాస్త్రాధారం లేదు. పరబ్రహ్మ కంటే భిన్నంగా పురుషులంతా దేవుళ్ళని గానీ, లేదా స్త్రీలంతా దేవతలని గానీ ప్రాచీనులు భావించినట్లు అనిపించదు. వారు సృష్టిలో ప్రతిదాన్నీ భగవత్స్వరూపంగానే చూసినట్లు కనిపిస్తుంది.

లౌకిక జీవనతలంలో, కేవలం “ఒక సన్నిహిత మానవ సంబంధం” అన్న కారణాన, ఏ ప్రత్యేకతా లేని, ఆత్మజ్ఞానం మాలిన మామూలు మనుషుల్ని దేవుళ్ళుగా భావించడంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రమాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మానవ సంబంధాలు దైవసమానం అనడం చేత ఆ స్థానాల్ని అధిష్ఠించినవారిని చాలా అధికారమూ, తజ్జనితమైన మదమూ ఆవహిస్తాయి. ప్రేమా, వాత్సల్యమూ తొణికిసలాడాల్సిన చోట అధికార సంబంధాలు (power relations) ఊపిరి పోసుకుంటాయి. వ్యక్తుల మధ్య ఆ అధికారం తాలూకు రాజకీయాలూ, అలాంటి ప్రవర్తనా మొదలవుతాయి. పరస్పర పిలుపులు కూడా మారిపోతాయి. తమ లోపాలు బయటపడని విధంగా వ్యవహరిస్తే తప్ప తమనెవఱూ గౌరవించరనీ, అవతలివారి గౌరవాన్ని పొందితే తప్ప తాము వారిమీద పట్టు బిగించలేమనీ భావించడం మొదలుపెట్టాక మనుషులు మనసువిప్పి మాట్లాడ్డం కూడా మానేసి ప్రతీదీ గుంభనగా రహస్యంగా ఉంచడం నేర్చుకుంటారు. వారు నాలుగ్గోడల మధ్య ఒకలా, బయట ఇంకోలా, బొత్తిగా సంబంధం లేని ద్విపాత్రాభినయాలూ, త్రిపాత్రాభినయాలూ చేయడం ప్రారంభిస్తారు. తామొక ఉన్నతస్థాయి సంబంధీకులమనే భావన వల్ల తమకు ఎదురుండకూడదనే ఉద్దేశంతో మనుషులు తమ సన్నిహితుల పట్లనే చాలా అపచారాలకు ఒడిగడతారు. ఆ రకంగా మానవ సంబంధాల వాతావరణం యావత్తూ కలుషితమైపోతుంది.

12, నవంబర్ 2014, బుధవారం

శ్రమకు తగ్గ ప్రతిఫలం, మంచిచెడుల సాపేక్షత్వం (Relativity)

మనుషులు స్వయంగా చేసుకోలేని పనుల్ని ఇతరుల చేత చేయిస్తూంటారు. అప్పుడు వారు యజమానులవుతారు. ఆ ఇతరులు వారికి సేవకులో, ఉద్యోగులో అవుతారు. పరస్పర సహాయం చేసుకోవడం వల్లనే మనుషులు మనుషులయ్యారు. కనుక సేవ పేరిట గానీ, ఉద్యోగాల పేరిట గానీ ఇతరులు మనకు చేస్తున్నది వాస్తవంగా సహాయమేననీ, దానికి మనం తగువిధంగా కృతజ్ఞత చూపాలనీ అందఱూ గ్రహించే రోజు రావాలి. స్వచ్ఛంద సహాయానికీ, ఉద్యోగానికీ మధ్య భేదం మిక్కిలి సూక్ష్మమైనది. నిజానికి ఆచరణలో రెండూ ఒకటే. ఎందుకంటే ఒకఱికి ఇష్టం లేకుండా వారిచేత మనం ఏ పనీ చేయించలేం. ఆలాగే స్వచ్ఛంద  సహాయానిక్కూడా ఏదో ఒక రూపేణ పారితోషికం ముట్టజెప్పక పోతే ఆ ఋణంలోంచి విముక్తులం కాలేం. నెనరు గల నరులమనీ, పాములకన్నా ప్రాంశుతరులమనీ అనిపించుకోలేం. కనుక ఎలాగూ తప్పనిదాని విషయంలో ఇతరులకు అన్యాయం జఱక్కుండా జాగరూకత వహించాలి.

అయితే ప్రస్తుతం ఈ యజమానుడనే మాట చాలా అపార్థంలో వాడబడుతోంది, ఇటు యజమానుల్లోనూ, అటు వారి ఉద్యోగుల్లో కూడా! యజమానుడంటే ఉద్యోగి యొక్కా, అతని కుటుంబం యొక్కా యావత్తు జీవిత పరిధికీ బాధ్యత వహించాల్సినవాడన్నట్లు మాట్లాడడం కనిపిస్తోంది. అటువంటి ఆలోచనాధోరణిలో చేసిన చట్టాలు కూడా ఉన్నాయి. ఇది సరైన ఆలోచనావిధానం కాదు. యజమానుడు కూడా ఉద్యోగుల్లాంటి మనిషే. అతనేమీ సర్వశక్తిమంతుడైన భగవంతుడు కాడు. తనకు పనిచేసి పెడుతున్నంత కాలం, ఆ చేసిన పని వఱకూ మాత్రమే అతను ఉద్యోగికి తగు పారి తోషికమివ్వాలని ఆశించడం న్యాయం. అంతకు మించి అతనిమీద భారాలు మోపడం అంటే దూర భవిష్యత్తులో వ్యాపారాల్నీ, ఉద్యోగావకాశాల్నీ దెబ్బదీయడం అన్నమాట. శ్రమకీ, సంపదకీ అభేదం. ఎందుకంటే శ్రమలోంచే సంపద పుడుతోంది. సంపద అంటే రొక్కం, ఆస్తులూ, సొమ్మూ మాత్రమే కాదు. ఏ వస్తువైనా, పదార్థమైనా సంపదే. దాన్ని ఉచితంగా తీసుకోవడమంటే ఎవఱికో పరోఽక్షం గా అన్యాయం తలపెడుతున్నట్లే లెక్క. అదీ ఒక రకం దొంగతనం కిందికే వస్తుంది. మన దేశంలో ఉచితాల మోజు మెండు. అందులోనూ ప్రభుత్వ సొమ్మయితే ఇంకా విజృంభిస్తారు.

ప్రభుత్వమేమీ మన పూర్వపుణ్యాల నిధి కాదు, హక్కులా అనుభవించడానికి. అదీ ఓ వాణిజ్యబ్యాంకులాంటిదే. దానికీ కొన్ని లెక్కలున్నాయి. దానికి మాత్రం సంపద ఎక్కణ్ణుంచి వస్తుంది? ప్రజల నుంచి సేకరిస్తేనే కదా. అంటే అదీ ఒకఱి శ్రమఫలితమే. వాళ్ళు ఎవఱనేది మీకూ, నాకూ తెలియకపోవచ్చు. కానీ అసలంటూ వాళ్ళున్న మాటైతే నిజం. కాబట్టి ప్రభుత్వ సొమ్ముని తేరగా అనుభవించడమంటే మన కంటికి కనిపించని కొందఱు పన్నుల చెల్లింపుదారుల్ని దోచుకోవడమే. ఉదాహరణకి, ప్రభుత్వం దగ్గఱ ఆహార పదార్థాలు ఉచితంగా తీసుకుంటున్నామంటే రైతుల్ని దోచుకుంటున్నామన్నమాట. మనకు ఉచితంగా అందించడం కోసం ప్రభుత్వం తన అధికారబలంతో రైతుల దగ్గఱ కారుచౌకగా వాటిని కొనుగోలు చేస్తుంది. అందుకోసం ప్రత్యేక ఉత్తర్వులూ, చట్టాలూ ప్రయోగిస్తారు. అందుచేత నిజంగా మానవత్వం ఉన్నవారెవఱూ ఏదీ ఎవఱినుంచీ ఉచితంగా స్వీకరించరు. తక్కువ చెల్లించడమే తప్పంటూంటే ఏమీ చెల్లించకపోవడం ఇంకెంత తప్పో ఎవఱికి వారు యోచించుకోవాలి. 

ముందిది అర్థం చేసుకోవాలి అందఱూను. మనమేమీ ప్రకృతిలో జీవించడం లేదు. చాలా కృత్రిమమైన వాతావరణంలో జీవిస్తున్నాం. ఉచితాలనేవి ప్రకృతిబద్ధ జీవనంలోనే, అదీ, చాలా తక్కువ జనాభా గల సమాజాలకే సాధ్యం. మనలాంటివాళ్ళకి కాదు. ప్రకృతిలోంచి దేన్నయినా ఉచితంగా కోరుకోవడానికి మనం ప్రకృతికి చేస్తున్నది ఏముంది? ఉదాహరణకి, నీటిని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చెయ్యాలని డిమాండు చేసే ముందు, అసలు మనం నీటిని పట్టి నిలవ చేయడంలో ప్రభుత్వానికిస్తున్న బాసట ఏంటి ? మనం అన్నీ వాడుకుని అవతల పారేసేవాళ్ళమే తప్ప దేన్ని ఉత్పత్తి చేస్తున్నామని, “అది ఉచితంగా కావాలి, ఇది ఉచితంగా కావాలి” అని  డిమాండు చేయడానికి? మహా అయితే మన ఉద్యోగాలు మనం చేసుకుంటున్నామంతే! ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పిస్తే జనం ఆ పట్టాలు పుచ్చుకుని విదేశాలకి పారిపోతున్నారు. “అయ్యో! ఈ దేశపు సొమ్ముతో నేను చదువుకున్నాను. ఇలా పారిపోవడం నీతి కాదు” అని ఒక్కఱైనా ఆలోచిస్తున్నారా? ఉచితాల వ్యామోహాన్ని మఱిగిన దేశం ఇలాగే క్రమక్రమంగా పరమ స్వార్థపూరితంగా, పరస్పర దోపిడీ సమాజంగా, అనుత్పాదక జనాంగంగా అవతరిస్తుంది. 

మంచి-చెడుల సాపేక్షత్వం (Relativity) 

మంచి-చెడులు ఐకాంతిక, స్వయం-సంపూర్ణ విలువలు (absolute or self-contained values) అనే నమ్మకం మన సమాజంలో చాలా బలంగా, లోతుగా నాటుకుపోయి కనిపిస్తుంది. అంటే కొన్నివిషయాలు అన్నిచోట్లా, అన్నివేళలా, అందఱికీ మంచేననీ, మఱికొన్ని ఎప్పటికీ చెడేననీ నమ్మడం. నిజానికి ప్రపంచంలో అస్తిగోపన సమాజాలు పైకి వెయ్యి నమ్మకాల్ని ప్రవచిస్తున్నప్పటికీ వాటన్నింటికీ మూలమైన కేంద్ర బిందువు ఈ ఒక్క నమ్మకమే. వాటి ఛాందసాలూ, సంకుచితత్వాలూ, అమానుషత్వాలూ అన్నీ ఈ ఒక్క నమ్మకంలోంచే ప్రభవిస్తాయి. కానీ లోతుగా ఆలోచించినప్పుడు మంచీచెడులనే వాటికి స్వంత అస్తిత్వమంటూ ఏమీ లేదు. అవి ఆయా దేశ-కాల పరిస్థితులూ, వ్యక్తులూ, వారి స్థితిగతులూ, ఇష్టానిష్టాలూ, సమయ-సందర్భాల ఆధారంగా నిర్ణయించాల్సినవి. అంటే వాటి విషయంలో గొప్ప సమయస్ఫూర్తితో కూడిన తర్కం కూడా అవసరమే. అందుకు పూర్వాయత్త సూత్రా (readymade formulas) లంటూ ఏమీ లేవు. ఈ ముక్క బోధపడాలంటే కాస్త వైవిధ్య సమాచారమూ, చరిత్రపరిజ్ఞానమూ కూడా అపేక్షితమే.

మంచిచెడులనే గణితశాస్త్రంలో అస్తిగోపన సమాజాలన్నీ ఇలాంటి మొద్దబ్బాయిలే. ఎందుకంటే ప్లస్సులూ, మైనస్సులూ అనేవి వేఱువేఱుగా ఉండవనీ ఒక ప్లస్సులో వాస్తవానికి రెండు మైనస్సులు సమద్విఖండన చేసుకుంటాయనీ వారికి తెలీదు. శౌర్యోదాత్తమైన పులీ, భీరుహృదయి అయిన పిల్లీ- అలాగే విశ్వాసపాత్రమై ప్రేమభావ భాసితమైన జాగిలమూ, క్రూరమైన తోడేలూ, ఒకే జీవజాతులకి చెందిన జంతువులని వారికి తెలీదు. ఇంకా, విహాయసంలో విహరించే విహంగాలకీ, పాతాళంలో పాకే పాములకీ పూర్వీకుడు ఒకడేనని కూడా వారెఱుగరు. అదే విధంగా, ఒకే పురుషవ్యామోహం - దానిలోని స్థాయీభేదాల వల్ల ఒకామెని స్వైరిణిగానూ, మఱొకామెని సాధ్విగానూ చేయొచ్చునని వారు గుర్తించలేకపోయారు. ఐతే ఇవన్నీ ప్రాచీన మతగురువులకు తెలుసు. కానీ వారు అవి తమలోనే గుంభనగా దాచుకున్నారు తప్ప జనసామాన్యానికి చెప్పదల్చుకోలేదు.

వారు చెప్పకపోవడానికి ప్రాసంగికమైన (circumstancial) కారణాలుండొచ్చు. ముఖ్యంగా నాటి జనసామాన్యం నిరక్షరాస్యులూ, మూర్ఖులూను. లోతు గ్రహించలేనివారికి ఇదంతా చెప్పడం వల్ల ఆ రోజుల్లో చాలా ప్రమాదం ఉంది. కనుక మతగురువులు వారికి కొన్ని విధినిషేధాల్ని మాత్రమే బోధించి, “ఇలా ఉండండి. చాలు” అనేశారు. అంటే విలువల గుఱించి నిరంతర తర్కానికి దిగే అవసరం నుంచి వారు జనాన్ని తాత్కాలికంగా విమోచించారు. ఆ విధినిషేధాలు మాత్రం బాగా ఒంట బట్టేశాయి. వాటి స్ఫూర్తేమో ఆ గురువులతోనే అంతరించింది. వాటిని బోధించిన నాటికీ, అనంతర కాలఖండాలకూ మధ్య జీవనవిధానం మారకుండా ఉన్నంతకాలమూ అవి బానే పనిచేశాయి. అవే నిఖార్సైన మంచీ, నిఖార్సైన చెడు అనిపించుకున్నాయి. కానీ నాగరికత మారిపోయాక వాటి సాందర్భికత (relevance) గుఱించి ప్రశ్నలు తలెత్తసాగాయి. 

“ఆనాడు మతగురువులు చెప్పడానికి సాహసించనిది మనమీనాడు చెప్పడం అవసరమా?” అని అడిగితే, ఇప్పుడు అవసరమే. ఎందుకంటే సమకాలీనంగా చదువుసంధ్యలు ఎంత వ్యాపించినప్పటికీ మనుషుల మంచిచెడులు మాత్రం పాతవిలువల ప్రాతిపదికనే నిర్ధారించబడుతున్నాయి. ఆ పేరుతో  మన సమాజంలో పెద్దయెత్తున మూర్ఖత్వం, డంబాచారం (hypocrisy) వ్యాపించిపోయాయి. మనల్ని పరిపాలిస్తున్న రాజకీయవ్యవస్థ, మనం జీవిస్తున్న నాగరికత, నమ్ముతున్న పాత విలువలూ– ఒకదానికొకటి పొంతన లేకుండా పోయి, ఒకే రేడియోసెట్టులో యుగపత్తుగా వినవస్తున్న మూడు స్టేషన్లలా అసందర్భమై, అయోమయమై, కర్ణకఠోరమై కూర్చున్నాయి. వాటి ముద్రతో విలువల నిర్ణయాలూ (value judgments), వాటి ఆధారంగా పరహింస పెచ్చుమీఱాయి. కనుక ఈ విలువ లేవీ స్థిరమూ, శాశ్వతమూ కాదనీ, ఇవన్నీ సాపేక్షమనీ, వీటి ఆధారంగా ఎవఱి మీదా తీర్పుతీర్చి ద్వేషించాల్సిన అగత్యం లేదనీ మన జనానికి స్పష్టీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. పూర్వంలా కాకుండా, ఏతత్కాలీనులు విద్యావంతులు కనుక ఈ సాపేక్షత్వాన్ని సమీచీనంగా అర్థం చేసుకుని మారతారని ఆశించాల్సి ఉంది. 

7, నవంబర్ 2014, శుక్రవారం

వ్యవస్థల కతీతంగా మానవత్వాన్నే అవలంబించడం

మానవతావాదులు ప్రజాస్వామ్యవాదులు కూడా అయ్యుండాలని జనం ఆశించడం తఱచూ కనిపిస్తుంది. మానవతావాదుల్లో ప్రజాస్వామ్యవాదులున్నారు. కానీ అంతమాత్రాన వారంతా అదే అనుకోవడం సరికాదు. అదే విధంగా ప్రజాస్వామ్యవాదులంతా మానవతావాదులూ కారు. ప్రజాస్వామ్యం మన ముందున్న అనేక రాజకీయ-పరిపాలనా ఎంపికల్లో ఒకటి మాత్రమే. మానవతావాదుల అంకితభావం మానవత్వం పట్లే తప్ప ఏ ప్రత్యేక రాజకీయవ్యవస్థ పట్లా కాదు. అంటే మానవతావాదం యొక్క ఆద్య మఱియు అంతిమ శ్రద్ధాస్థానం విడివ్యక్తి మాత్రమే. వ్యవస్థలు దానికి సాందర్భికం కాదు. ఎందుకంటే  రాజకీయ వ్యవస్థలు అశాశ్వతం. మానవతావాదమే శాశ్వతమూ, సార్వజనీనమూను. ఒక దేశంలో ఈ రోజు రాజఱికం అమల్లో ఉండొచ్చు. ఱేపు సోషలిజం రావచ్చు. ఎల్లుండి ప్రజా స్వామ్యం నెలకొనవచ్చు. ఏ కాలపు వ్యవస్థ ఆ కాలపు మనుషులకు సర్వోత్తమంగా, మహోన్నతంగా దర్శనమిస్తుంది. ప్రజాస్వామ్యం ఉండడమో, లేకపోవడమో ఓ సమాజపు మానవతావాద లక్షణాల్ని పట్టివ్వదు. ఎటొచ్చీ మానవతావాద సూత్రాల్ని వ్యాప్తిచేయడం మిగతా వ్యవస్థల కన్నా ప్రజాస్వామ్యంలో ఓ పిసరంత ఎక్కువ సుకరం, అది నిజమైన ప్రజాస్వామ్యమే ఐతే.

ప్రాచీన రోమకరాజ్యం (Rome) ప్రజాస్వామికమే, శ్రేయోరాజ్యమే (welfare state). అయినా, బానిసల్ని బహిరంగంగా సింహాల కాహారంగా వేస్తే కేవుచీటీలు (tickets) కొనుక్కుని మఱీ ఆ సన్నివేశాన్ని కళ్ళారా వీక్షించి వినోదించడం పట్ల అప్పటి ప్రజల మనస్సాక్షి ఇసుమంతైనా సంచలించలేదు. బానిసలు తమ కంటే వేఱైన వర్గమనే వర్గదృష్టివల్ల వారి మానవతాదుకాణం అలా మూతపడింది.మన కాలంలోనూ వర్గాలున్నాయి. మనకీ వర్గదృష్టి ఎక్కువే. వారిలా సరిపడని వర్గాల వాళ్ళని మనం సింహాలకు ఆహారంగా వేయం (బహుశా మన కాలానికవి మఱీ ఎక్కువ లేవు గనక). కానీ దాన్తో సమానమైన ఇతరేతర అపకారాలకు ఒడిగడుతూనే ఉన్నాం. కాబట్టి వ్యవస్థ ఎలా ఉన్నా, దాన్ని నడిపే వ్యక్తుల్లో మానవత్వం గనక ఉంటే, దాని దుష్ప్రభావం ప్రజల జీవితాల మీద చాలా తక్కువగా పడుతుందని మానవతావాదులు నమ్ముతారు. ప్రజాస్వామ్యమైనా మానవతా సూత్రాల్ని సాకల్యంగా అస్థిగతం చేసుకుంటేనే  ప్రజాస్వామ్యంగా నిలవగలుగుతుంది. లేకపోతే ఓ పేద్ద డ్రామా ట్రూపుగా మిగిలిపోతుంది. 

కనుక ఇతర వ్యవస్థల్లాగానే ప్రజాస్వామ్యం కూడా మానవతావాదంలోని కొన్ని అంశాల్ని అరువు తీసుకుంది. అయితే అంతమాత్రాన అది మానవతావాదానికి పర్యాయపదం గానీ, ప్రత్యామ్నాయం గానీ కాజాలదు. వాస్తవానికి ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజాస్వామ్యాలన్నీ మానవతావాద సూత్రాలకు విరుద్ధంగా నడుస్తున్నవే. ఎందుకంటే ఒక వ్యవస్థలో ప్రజారోగ్యానికీ, వారి ఆర్థికతకూ సంబంధం లేకుండా ఎంత పెద్దసంఖ్యలో నిషేధ చట్టాలు పోగుపడతాయో అంతగా అది ప్రజాస్వామ్యం కాకుండా పోతుంది. అంతగా అది అమానవీయమవుతుంది. 

ప్రజాస్వామ్యాలన్నీ మెజారిటీ ఆధిపత్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటివి. కానీ మానవతావాదంలో మెజారిటీ, మైనారిటీ అంటూ ఏమీ లేవు. దాని దృష్టిలో అంతా మనుషులే. ఏ ఒక్కఱినీ అనాథగా వదిలేయొద్దని అది చెబుతుంది. సర్వే జనా స్సుఖినో భవన్తు అనేది మానవతానినాదం కాగా, బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది ప్రజాస్వామ్య నినాదం. ఇది గౌతమబుద్ధుడి కాలం నాటి  సిద్ధాంతం. ఆ ముక్క ఆ రోజుల్లో చెప్పిన సందర్భం వేఱు. దాన్ని నేటి సామాజిక-శ్రేయోరాజ్య అంశాల కన్వయించడం ఓ పెద్ద తప్పిదం. అదీ గాక ఈ లోపల మానవజాతి పరిభావనలు (concepts) చాలా పురోగమించాయి.

ఈ బహుళజనులు (అధిక సంఖ్యాకులు) ఎవఱో ఎవఱైనా వివరిస్తే బావుణ్ణు. ఒక జిల్లాలో ఒకానొక శ్రేణిజనం బహుళజనులైతే, వారే రాష్ట్రం మొత్తమ్మీదా లెక్కవేసినప్పుడు ఊనజనులు (అల్పసంఖ్యా కులు) అవుతారు. అదే విధంగా ఒకే ప్రదేశంలో మనుషులు తమ తమ అభిప్రాయాల్ని బట్టి కొన్నిసార్లు బహుళజనులూ, మఱికొన్నిసార్లు ఊనజనులూ అవుతారు. ఒక మానవసమూహం బహుళ జనులు అనిపించుకోవడానికి అది మొత్తం జనాభాలో 51 శాతంగా ఉండాలా? 60 శాతంగా ఉండాలా? 70 శాతంగా ఉండాలా? అది ఎవఱూ ఖచ్చితంగా చెప్పలేరు. మిగతా జనంలో ఒక్కొక్క వర్గమూ 5 -10 శాతం కంటే ఎక్కువ లేరనే కారణం చేత కేవలం 30–40 శాతమే ఉన్న వర్గాలు కూడా కొన్నిసార్లు బహుజనులుగా లెక్కవేయబడుతున్నారు. ఓ చిన్న కుగ్రామంలోనో, సభలోనో 99 శాతం మంది ఒక వైపూ, మిగతా ఒక్కశాతం మందీ ఇంకో వైపూ ఉంటే ఆ 99 శాతం మంది యొక్క పైచేయి మనకు పెద్ద అభ్యంతరకరంగా గానీ, హానికరంగా గానీ అగుపించదు. కానీ ఆ సూత్రాన్నే ఇంకా బృహత్తర స్వరూపాలకు అనువర్తిస్తే శక్తి-అసమతూకం మూలాన ఘోరాలూ, అన్యాయాలూ, అణచివేతలూ జఱిగిపోతాయి. ఉదాహరణకి, ఒక దేశంలోనో, రాష్ట్రంలోనో 1% అంటే ఆ జనాభా లక్షల్లోనూ, మిలియన్లలోనూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆ ఒక్క శాతమే కోట్లల్లో ఉంటారు.

“మైనారిటీలు ఏ శంకరగిరి మాన్యాలు పట్టిపోయినా ఫర్వాలేదు. మెజారిటీ బావుంటే చాలు” ననే వారు, తమ వాహనాల ఇంధనంలో 10% కల్తీ చేసినా ఫర్వాలేదనీ, తాము తినే అన్నంలో 1% విషం కలిసినా ఫర్వాలేదనీ అనరు కదా ! అనాథగా వదిలివేయబడ్డ ఒకఱి విషాదం కాలక్రమంలో పది మందికి అంటుకుంటుంది. మైనారిటీ అంటే ఇప్పుడు అపార్థం చేసుకోబడుతున్నట్లు మహ్మదీయులో క్రైస్తవులో కాదు. మన ఆదరణకు నోచుకోవడానికి ఓ వ్యక్తి మెజారిటీకో,  మైనారిటీకో చెందనక్ఖర్లేదు. అతనూ మనలాగే ఓ మనిషీ, మనం అనుకున్న పనికి పనికొచ్చేవాడూ అయితే చాలు. మెజారిటీలే తప్ప మైనారిటీలు మనుషులు కారన్నట్లూ, వారికి హక్కులే లేవన్నట్లూ ధ్వనించే ఈ రకమైన అశాస్త్రీయ మెజారిటీవాదంతో మైనారిటీజనాన్ని నిర్లక్ష్యం చేసినా, అణగద్రొక్కినా వారు జాతిగొలుసులో అత్యంత బలహీన లంకెలు (weakest links in the chain) గా మారతారు. మనకు భావిప్రమాదం ఖచ్చితంగా అక్కణ్ణుంచే పొంచి ఉంటుంది.

కాబట్టి ప్రతిఒక్కఱి ఇష్టానిష్టాలకూ– అవి మిగతా సమాజపు అభిరుచుల నుంచీ, అభిప్రాయాల నుంచీ ఎంతగా భేదించనివ్వండి- విలువివ్వాల్సిందే. సమాజంలో ఓ మూల స్థానం కల్పించాల్సిందే. అలాగే వారివారి వ్యక్తిగత జీవనవిధాన ఎంపికల్నీ ఆమోదించాల్సిందే. మనుషుల్ని నిర్జీవ గణాంకాలు (statistics) గా, శాతాలుగా చూసే ధోరణి పోయి సజీవులైన ఆత్మలుగా, వారి జీవితాల్ని జీవితాలుగా చూసే గంభీర దృష్టికోణం మనలో పెంపొందాల్సి ఉంది. తేలిగ్గా నిర్ణయాలు తీసుకునే ఉపాయంగా మొదట్లో అమల్లోకి వచ్చిన ఈ అంకెల గారడి- ఈ మెజారిటీవాదం నేడు విశ్వరూపాన్ని ధరించి, వేస్తున్న వెఱ్ఱితలల విషయం అంతా ఆకళింపు చేసుకునే శుభదినం రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కఱూ ఏదో ఒక విధమైన మైనారిటీవర్గం కిందికే వస్తారు.
 

3, నవంబర్ 2014, సోమవారం

జనామోదితమైన క్రమానుగత మార్పులు

మార్పును ఆహ్వానించడం ఎంత ముఖ్యమో, ఆ మార్పు క్రమానుగతం (gradual) అయి ఉండడం కూడా అంతే ముఖ్యం. జనం మీద హఠాన్ మార్పుల్ని రుద్దడం అసహజమే కాక, అమానవీయం కూడా! ఈ విషయంలో ప్రకృతి బాటే మనుషులకు అనుసరణీయం. హఠాన్ మార్పులు మనుషుల జీవితాల్లో సామూహిక దుఃఖాన్ని ప్రోదిచేస్తాయి. అందుచేత మార్పులనేవి జనామోదాన్ని పడసినవి కూడా అయ్యుండాలి. ప్రజలు కోరుకోని, వారు ఇష్టపడని మార్పులు విఫలమవుతాయి. మార్పుల్ని బలప్రయోగ పూర్వకంగా పైనుంచి జనం మీద రుద్దడమే మానవాళి చరిత్రలో ఇప్పటిదాకా జఱిగింది. ఈ పోకడ అంతరించాలి. సమాజానికి మార్పుల అవసరం నిజంగా ఉంటే వాటంతట అవే వస్తాయి. ఎవఱూ రుద్దాల్సిన పనిలేదు. సమాజమే వాటి కోసం ఆకలిగొని ఉంటుంది. ఇతరుల్ని మార్చదల్చు కున్నవారికి ఉండాల్సిన లక్షణాల్లో ప్రధామైనది భూదేవంత ఓర్పు. 
 

దేనికీ అంకితం కాకపోవడం
 

పురోగత బృహత్ సమాజాలకి ఉన్మాదులూ (fanatics) క్రూసేడర్లే తప్ప మామూలు మనుషులు అవసరం లేదు. వాటికి గౌతమబుద్ధుల కంటే హిట్లర్లతోనే ఎక్కువ అవసరం. అంకితం కావడం (అంకితభావం), విశేషిత నైపుణ్యాల (specialization/ specialized skills) పేరుతో సంస్థలూ, వ్యవస్థలూ అన్నీ, తమకి పనికొచ్చే ఏదో ఒక్క విషయం తప్ప జీవితంలో ఇహ దేని గుఱించీ ఆలోచించలేని ఏకోన్మాదుల (monomaniacs) కోసం ఆబగా స్వప్నిస్తాయి. సార్థవాహాల (companies) కేమో పని-ఉన్మాదులు (workaholics) కావాలి. విద్యాలయాలకి బోధనోన్మాదులూ, పఠనోన్మాదులూ కావాలి. ప్రభుత్వానికి దేశభక్త్యున్మాదులు కావాలి. కుటుంబాలకి సంపాదనోన్మాదులు కావాలి. వారిలోనే మఱికొందఱికి ప్రేమోన్మాదులు కావాలి. రాజకీయపక్షాలకేమో సకల సబ్బండు రకాల ఉన్మాదులూ కావాలి. ఇహపోతే కొన్నిసంస్థలకి లింగోన్మాదులూ, మఱికొన్నిటికి సిద్ధాంతోన్మాదులూ కావాలి. ఈ వాతావరణంలో వైవిధ్య అభిరుచులున్నవాడూ, ఏదో ఒక ఉన్మాదాన్ని ప్రదర్శించలేని వాడూ తప్పబుట్టినట్లే జమ. ఒకవేళ మనుషుల్లో ఉన్మాదస్థాయి తాము ఆశించినంతగా లేకపోతే దాన్ని పెంచడానికి అవసరమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టిస్తారు కూడాను.

ఈ కాలపు మనుషుల్లో మానవత్వం నశించిపోతూండడానికి specialization, అంకితభావం, ఉద్యమస్ఫూర్తి అంటూ నానా పేర్లతో చెలామణి అవుతున్న ఉన్మాదాలొక ప్రధానకారణం. తమ ఉన్మాదానికి ఉపకరించని అంశాల్ని అధికరించి ఏం చెప్పినా, విన్నా, “నాకు సంబంధం లేదు. నేను చేయగలిగిందేమీ లేదు. అది నా సబ్జెక్టు కాదు. నా డిపార్టుమెంటు కాదు” ఇదీ ధోరణి. ఇంతటితో ఆగిపోతే బావుణ్ణు. కానీ అలా జఱగదు. తమను తాము అంకితం చేసుకున్నవారు అది చాలా గొప్పదనీ, ప్రజలకి తప్పనిసరిగా మేలుచేస్తుందనీ గ్రుడ్డిగా నమ్ముతారు గనుక, దానితో ఏకీభవించనివారంతా వీరి దృష్టిలో రాక్షసులే, సర్వనాశనం చేయదగ్గవాళ్ళే. ఆ విధమైన మానసిక ధోరణిలో అవతలివారి పట్ల వీరు ఒడిగట్టని అపచారాలుండవు.

ఇలా అంకితం కావడం గుఱించి ప్రకృతిమాత అభిప్రాయమేంటి ? ఆవిడ దీన్ని ఆమోదిస్తోందా ?

ప్రకృతి ఏ వస్తువునీ ఒకే ఒక్క ప్రయోజనంతో, కేవలం దానికే అంకితం చేసి నిర్మించినట్లు కనిపించదు. ప్రపంచంలో ప్రతిదానికీ రెండుమూడు ప్రయోజనాలూ/ కర్తవ్యాలూ ఉన్నట్లు కనిపిస్తుంది. అన్నీ బహుళార్థక చేపట్టులే (muti-purpose projects). ఒకే నీరు బ్రతికిస్తుంది. పంటలు పండిస్తుంది. చల్లబఱుస్తుంది కూడా. ఒకే పురుషుడు ఒక స్త్రీని రక్షిస్తాడు, పోషిస్తాడు, సాహచర్యమిస్తాడు, సుఖపెడతాడు, సంతానాన్ని కలిగిస్తాడు. ఆ సంతానాన్ని మళ్లీ తానే పైకి తీసుకొస్తాడు. ఆ పనికొకఱూ, ఈ పనికొకఱూ అనే ఏర్పాటు లేదు. అదే విధంగా ఒకే స్త్రీ ఒక సమయంలో తల్లిలా, మఱో సమయంలో భార్యలా, వేఱే సందర్భంలో స్నేహితురాలిలా ఉంటుంది. మన శరీరాలనే తీసుకుంటే ప్రతి ఇంద్రియానికీ ఒక ఉద్యోగాన్నీ, ఒక వినోదాన్నీ కూడా ప్రకృతి ఏర్పఱచింది. కేవలం ఉద్యోగమో, వినోదమో కలిగిన ఇంద్రియం ఒక్కటీ లేదు. ఒక ఇంద్రియం చేసే ఉద్యోగం కూడా ఒకటి కాదు, రెండు-మూడున్నాయి. ముక్కుతో గాలిపీల్చుకుంటాం. వాసన కూడా చూస్తాం. నోటితో తింటాం, మాట్లాడతాం కూడా!

అంకితం కావడమనేది మన మనస్తత్త్వాల మీద సూక్ష్మంగా చూపే ప్రతీప ప్రభావం (negative impact) ఘోరమైనది. దైనందిన జీవితంలో అది పైకి కనిపించకపోవచ్చు. కానీ దాని పర్యవసానాలు మాత్రం బాధాకరంగా తేల్తాయి. ముఖ్యంగా, దేనికెంత ప్రాధాన్యం ఇవ్వాలనే విషయంలో అది మన తెలివితేటల్ని మబ్బుతో కప్పేస్తుంది. మనలో ఏకపార్శ్వ దృక్పథాన్ని (one-sided outlook) ని పెంపొందిస్తుంది. ఉదాహరణకి, మన దేశంలో అందఱూ కుటుంబానికి సర్వాత్మనా అంకితులు. పలువుఱికి కుటుంబం కంటే వేఱే జీవితం గానీ, ఆసక్తులు గానీ లేవు. ఫలితార్థంగా కుటుంబానికీ, దాని సభ్యులకీ సంబంధించిన ప్రతి విషయమూ ఇక్కడ హబుల్ టెలిస్కోపంత భూతద్దంలో చూడబడుతుంది. దానిగుఱించి ఇక్కడ హోరాహోరీ ప్రపంచయుద్ధాలైపోతూంటాయి. అవినీతి కూడా, గృహస్థులు తమ కుటుంబాల భవిష్యత్తు గుఱించి విపరీతంగా ఆందోళన చెందడం వల్ల జఱుగుతోంది. అందువల్ల కొన్ని విషయాల్ని “ఎలా జఱిగితే అలా జఱగనీ” అనుకునేటంత పరిపక్వత ఈ దేశస్థులకి ఎన్నాళ్ళు గడిచినా రావడం లేదు. మన అంకితభావాల్ని ఇతరులు ఉపయోగించుకుంటారు తప్ప దాని వల్ల మనకు కలగబోయే అదృశ్యనష్టాలకి ఎవఱూ పరిహారం చెల్లించరని జనం గ్రహించే రోజు రావాలి.