నాలుగువేల సంవత్సరాల క్రితం భారతదేశంలో సరస్వతి అనే నది ఒకటుండేదని చెబుతారు. అది
హిమాలయాల్లో పుట్టి ఈనాటి కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్
రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రంలోకి ప్రవహించేదట. విచిత్రమేంటంటే ఈనాడు హిందూధర్మానికంతటికీ
పూజనీయమైన గంగానది ప్రస్తావన వేదాల్లో క్వాచిత్కమే. కానీ సరస్వతీనది ప్రస్తావన మటుకూ
విస్తారం. అందుచేత వేదాల్ని రచించిన ఋషులెక్కువమంది ఆ నదీతీరవాసులేమో ననే అనుమానం
కూడా చరిత్రకారుల్లో లేకపోలేదు. కురుపాండవుల కాలానికి ముందు అది నేటి గోదావరిలా మంచి
ఉరవడితో సువిశాలంగా పరవళ్ళు త్రొక్కుతూ కొన్ని వందల కిలోమీటర్ల పొడవునా నిరంతర జీవధారగా
ప్రవహించేదని తెలుస్తోంది. అందుకే వేదవ్యాసుడు కూడా తన బదరికాశ్రమాన్ని ఆ నది
ఒడ్డునే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అక్కడే తనువు చాలించాడని కూడా చెబుతారు.
కురుపాండవయుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేక ఆ సమయంలో తీర్థయాత్రలకని చెప్పి
వెళ్ళిపోయిన బలరాముడు తిరిగొచ్చాక ఆయన్నెవఱో ఆ యాత్రావిశేషాల గుఱించి అడిగారట. ఆయన
అవన్నీ చెబుతూ మధ్యలో ఓ మాట అన్నాడు: “సరస్వతీనది ఇదివఱకట్లా అఖండంగా ప్రవహించడం
లేదు. అప్పుడప్పుడు అక్కడక్కడ ఎండిపోతోంది.” అని! ఈ కొద్దికొద్దిగా ఎండిపోయే
ప్రక్రియ బలరాముడి కాలం (క్రీ.పూ. 3100) నుంచి సుమారు వెయ్యీ-పదకొండొందల
ఏళ్ళ పాటు జఱుగుతూ జఱుగుతూ వచ్చి ఆఖరికి 3,900 ఏళ్ళ క్రితం పూర్తిగా ఎండిపోయిందనీ, అందుమూలాన సింధునాగరికత
అంతరించిపోయిందనీ, ఒకప్పటి నది స్థానంలో, అది ప్రవహించిన మార్గంలోని పల్లపు గుంటల్లో
పెద్దపెద్ద చెఱువులు ఏర్పడ్డాయనీ చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. చెఱువుని
సంస్కృతంలో సరస్ అంటారు. సరస్సులు కలిగినది సరస్వతి అన్నమాట.
మానవ సంస్కృతి కూడా నది లాంటిదే. దాన్ని అఖండంగా ప్రవహించనివ్వాలి. ఓ పొడవైన
జీవధారగా దానికున్న స్వరూపాన్నీ పేరుప్రతిష్ఠల్నీ చెడగొట్టేసి దాని విశాలత్వానికి
ఆనకట్టలు కట్టి ఓ ప్రాంతానికే పరిమితం చేయకూడదు. అలా చేస్తే అది సరస్వతీనది
విషయంలో జఱిగినట్లు సరసీకరణ (చెఱువులుగా మారడం) కి గుఱవుతుంది. అఖండ నదీమతల్లి కాస్తా
నామరూపాలు లేకుండా నశించిపోయి దాని స్థానంలో స్థానిక పేర్లతో సాంస్కృతిక కుంటలూ,
చెఱువులూ మిగుల్తాయి. అప్పుడు ఆ జాతీ, దాని సంస్కృతీ ఎక్కడున్నాయో, వాటి అసలు (ఒరిజినల్)
స్వరూపాలు ఏమిటై ఉంటాయో నని భావిచరిత్రకారులు సరస్వతీనది విషయంలో మాదిరే ప్రత్యేక
పరిశోధనలు చేయాల్సి వస్తుంది.
దేవుడే స్వయంగా అవతారం ధరించి వచ్చినా సరే, ఆయన కూడా ఏదో ఒక కులంలో, ఏదో ఒక మతంలో,
ఏదో ఒక ప్రాంతంలో పుట్టక తప్పదు. ఇహ మానవులం, మనం అనగా ఎంత? మనలో పుట్టిన మహనీయులూ,
రచయితలూ కూడా అంతే కదా! వారిని ఒక కులస్థులుగా, మతస్థులుగా, ప్రాంతీయులుగా
ముద్రవేసే ముందు, ముద్రవేసి బహిష్కరించే ముందు అసలు వారు తాము జీవించి ఉన్న కాలంలో
తమ గుఱించి తాము ఏమని భావించుకున్నారో, ఏ ప్రాంతానికి చెందామని భావించుకున్నారో
ఆలోచించాలి కదా? వారు రచనలు చేసేటప్పుడు ఎవఱిని ఉద్దేశించి చేశారు? అది కూడా
గమనించాలి కదా! మనకున్న రాజకీయ కార్యావళులు (political agendas) వారికున్నాయా? అది యోచించాలి కదా! ఎంతసేపూ మనం మన కాలమాన పరిస్థితుల్ని బట్టి వారిని
ఏ దృష్టితో చూస్తున్నామో అదొక్కటే ముఖ్యమా? పూర్వులైన వారి దృష్టికోణానికి ఏమీ
విలువ లేదా?
మేధావులు వాస్తవంగా ప్రజలకి చెందినవారు. వారు ప్రజల్లోంచి వచ్చారు. వారు ప్రభుత్వాలకి చెందినవారు కారు. ఎందుకంటే ప్రభుత్వాలకి మేధావులు అవసరం లేదు. వాటికి మరమనుషులు కావాలి. కీలుబొమ్మలు కావాలి. ఓ ప్రభుత్వం ఓ సంకుచిత ప్రాతిపదికని ఏర్పఱచుకుని దాని ఆధారంగా కొంతమంది దివంగత మేధావుల్ని తనవారుగానూ, మఱికొంతమంది దివంగతుల్ని పరాయివారుగానూ చిత్రీకరిస్తే అటువంటి నిర్ణయాలకి ప్రజలమైన మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏముంది? మనం అమెరికన్లని చదువుతాం. రష్యన్లని చదువుతాం. ఫ్రెంచివారినీ చదువుతాం. వాటిల్లో వేటిమీదా లేని ఆంక్షలు మనవారిని మనం చదవడం మీద విధిస్తూంటే దీన్ని సరసీకరణ అనక ఇంకేమనాలి?
మేధావులు వాస్తవంగా ప్రజలకి చెందినవారు. వారు ప్రజల్లోంచి వచ్చారు. వారు ప్రభుత్వాలకి చెందినవారు కారు. ఎందుకంటే ప్రభుత్వాలకి మేధావులు అవసరం లేదు. వాటికి మరమనుషులు కావాలి. కీలుబొమ్మలు కావాలి. ఓ ప్రభుత్వం ఓ సంకుచిత ప్రాతిపదికని ఏర్పఱచుకుని దాని ఆధారంగా కొంతమంది దివంగత మేధావుల్ని తనవారుగానూ, మఱికొంతమంది దివంగతుల్ని పరాయివారుగానూ చిత్రీకరిస్తే అటువంటి నిర్ణయాలకి ప్రజలమైన మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏముంది? మనం అమెరికన్లని చదువుతాం. రష్యన్లని చదువుతాం. ఫ్రెంచివారినీ చదువుతాం. వాటిల్లో వేటిమీదా లేని ఆంక్షలు మనవారిని మనం చదవడం మీద విధిస్తూంటే దీన్ని సరసీకరణ అనక ఇంకేమనాలి?
ప్రభుత్వాలకి మనం వోట్లు వేసినది – మన జీవితాల్ని బాగుచేయమని! అంతే తప్ప, మనం
ఏం చదవాలో, ఏం చదవకూడదో, మనం ఎవఱిని మనవారుగా భావించాలో, ఎవఱిని భావించకూడదో
శాసించడానిక్కాదు. ఇలాంటి పనుల్ని ఖండించడానికి కొంతమందికి ప్రాంతీయవాదం అడ్డొస్తే,
వాటిని సమర్థించడానికి నాబోటివారికి మానవతావాదం అడ్డొస్తుంది. ఈ చర్యల్ని
ఖండిస్తున్నవారు లేరని కాదు. ఉన్నారు. కానీ వారు తమ ప్రభుత్వం ఇలాంటి చర్యలకి
పాల్పడితే వెనకేసుకొస్తారు. ఇతర ప్రభుత్వాలు పాల్పడితే మాత్రం నిర్ద్వంద్వంగా
ఖండిస్తారు. ప్రస్తుతం అలాగే ఖండిస్తున్నారు కూడా!
నిజమే. వారి హృదయం ఎంత గాయపడి ఉంటుందో అర్థం చేసుకోవాలి. కానీ “అందఱమూ ఒకటే”
అనుకున్న రోజుల్లో- ఆ దృష్టి కలిగిన ప్రభుత్వం కూడా ఉన్నరోజుల్లో అనాధికారిక
వ్యక్తులైన వీరు ఆ సందేశాన్నిచ్చే పాటల్ని పాడనివ్వకుండా విజయవంతంగా అడ్డుపడగలిగారు.
“ఇతరులు/ బయటివారు” అని తాము తమ సైద్ధాంతిక చాదస్తాల కొద్దీ ఎవఱికైతే ముద్రవేశారో
ఆ పూజనీయుల విగ్రహాల్ని అమానుషంగా, నీచంగా, హీనంగా, చిల్లఱగా అవమానించడానికి
వెనుదీయలేదు. అలా చేస్తే తమ సిద్ధాంతానికి చెందని ఇతరులు ఎంత బాధపడతారనేది వీరు ఆనాడు
ఆలోచించలేదు. మనం స్వయంగా ఒకచోట ముట్టించిన కార్చిచ్చు ఈరోజు మన ఇంటిదాకా వస్తూంటే
“అయ్యో ఎవఱూ వచ్చి ఆర్పరేంటి?” అని ఆర్తనాదాలూ హాహాకారాలూ చేయడం అనవసరం.
ప్రభుత్వాలు పరిపాలనాసౌలభ్యం కోసం ఉన్నటువంటివి. అంతకు మించి వాటికి పెద్దగా
విలువేమీ లేదు. అవి ఏ సిద్ధాంతాల పేరు చెప్పుకుని బ్రతుకుతూంటాయో వాటితో సంబంధం
లేని మేధావులకి ప్రాంతీయ ముద్రలు వేసి అవమానించే హక్కు వాటికి లేదు. గొప్పగొప్ప వైజ్ఞానిక/
సాంకేతిక ఆవిష్కారాలూ, నవకల్పనలూ చేసిన శాస్త్రవేత్తల్లో నూటికి 99.99 శాతం మంది మన ప్రాంతీయులు కారు. కానీ వారు కనుక్కున్నవాటిని వాడుకోవడానికి మనకి
ప్రాంతీయ స్వాభిమానం అడ్డురావడం లేదు. క్లిష్టమైన శస్త్రచికిత్సల కోసమో, భారీ
చేపట్టుల (mega projects) కోసమో విదేశాల నుంచి
నిపుణుల్ని రప్పించుకునేటప్పుడు మనకి ప్రాంతీయ అస్తిత్వవాదాలు అడ్డురావడం లేదు.
ప్రపంచబ్యాంకు ముందు జోలిపట్టి అడుక్కునేటప్పుడు మనలోని రకరకాల “బిడ్డపౌరుషాలు”
ఏమవుతున్నాయో తెలీదు. కానీ ఒక కవిని, ఒక రచయితని, ఒక మేధావిని, ఒక సంస్కర్తని, ఒక
ఉద్యమకారుణ్ణి గౌరవించాలన్నప్పుడు మాత్రమే ఇవన్నీ హఠాత్తుగా ఎందుకు రంగప్రవేశం
చేస్తాయన్నదే నాకు అర్థం కాదు. అంటే శాస్త్రవేత్తలకీ, వైద్యులకీ, ఎంజినీర్లకీ మనం
ఇస్తున్న విలువలో 1% చేయరా కవులూ, రచయితలూ,
సామాజిక చింతనులూ?
సరే! ఇప్పుడు ఒకటి రెండయింది. ఱేపు ఈ రెండు కాస్తా మూడు కావచ్చు. అప్పుడు ఆ మూడోవారి ధోరణి కూడా అదే అయితే వీరంతా కలిసి ఒక మహానదిలాంటి సంస్కృతిని చంపేసి ప్రోగులు పెడతారు. వీరిని చూస్తే మీకు ఏమనిపిస్తోంది? నాకైతే 55 సంవత్సరాల నాడు వచ్చిన పరమానందయ్యశిష్యులు అనే చలనచిత్రంలో గురువుగారి కాళ్ళని తెగనరకబోయిన మూర్ఖశిష్య పరమాణువులు గుర్తుకొస్తున్నారు. ఆ సన్నివేశాన్ని ఇక్కడ వీక్షించండి.
రాజకీయాలతో సంబంధం లేని కవులకీ, మేధావులకీ ఈ ప్రాంతీయ ముద్రాంకన (regional branding) వేయడం ఇకనైనా మానుకుందాం. మనం నిజంగా మేధావులమైతే మేధావి అయిన ప్రతివాడూ మనవాడే.